ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
రొంపిచర్ల: మండలంలోని సుబ్బయ్యపాలెం అడ్డరోడ్డు సమీపంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సు వెనుక భాగం ధ్వంసం అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును అదే మార్గంలో వెనుకగా వస్తున్న లారీ ఢీకొట్టింది. బస్సు వెనుక భాగంలో ఇంజిన్ ఉండటం వల్ల లారీ ఢీకొట్టినా ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగటానికి గల కారణాలపై ఆరా తీశారు. రాత్రిళ్లు రహదారిపై వాహనాలు ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెంట పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.
బంగారం చోరీ కేసులో మరో నిందితుడి అరెస్టు
మంగళగిరి: ఆత్మకూరు అండర్ బైపాస్ వద్ద ఫిబ్రవరి 5న జరిగిన ఐదు కేజీల బంగారం కేసులో మరో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చోరీలో ఐదవ నిందితుడు ఖాజావలి కోర్టులో లొంగిపోయేందుకు రాగా, నిఘా ఉంచిన అధికారులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. నిందితులందరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
●ప్రయాణికులంతా క్షేమం
●సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment