నేడు భట్టిప్రోలు కో–ఆప్టెడ్‌ మెంబర్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

నేడు భట్టిప్రోలు కో–ఆప్టెడ్‌ మెంబర్‌ ఎంపిక

Mar 27 2025 1:47 AM | Updated on Mar 27 2025 1:46 AM

భట్టిప్రోలు: స్థానిక మండల ప్రజా పరిషత్‌ కో–ఆప్టెడ్‌ మెంబర్‌ స్థానానికి గురువారం పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎస్‌. వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రత్యేక అధికారి బి. వేణుగోపాల్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కో–ఆప్టెడ్‌ మెంబర్‌ మహ్మద్‌ ఫిరోజ్‌ ఎలియాస్‌ సలీం గత ఏడాది నవంబర్‌ 13న డిస్‌ క్వాలిఫై అయినట్లు జెడ్పీ సీఈవో జ్యోతిబసు ఉత్తర్వులు జారీ చేశారు. సలీం వరుసగా మూడు సమావేశాలకు హాజరు కానందున ఖాళీ స్థానం భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నిక ఉంటుందని తెలిపారు. సమావేశంలో సభ్యులు చేతులు ఎత్తి ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారని ఆయన వివరించారు.

రేపు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ రద్దు

బాపట్ల: ఎస్టీలు, దివ్యాంగుల కోసం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ను అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా శుక్రవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు ఫిర్యాదుదారులు కలెక్టరేట్‌కి రావద్దని ఆయన సూచించారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎస్టీలు, దివ్యాంగులు గమనించాలని ఆయన కోరారు.

ఏప్రిల్‌ నుంచి

రబీ ధాన్యం కొనుగోలు

నరసరావుపేట: రబీ 2024–25కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గనోరే సూరజ్‌ ధనుంజయ పేర్కొన్నారు. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ జిల్లాలో అధిక భాగం పూర్తయిందని, ఈనెల 29 నాటికి పూర్తి చేస్తామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 115 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందులో 73 రైతు భరోసా కేంద్రాల ద్వారా 1947 మంది రైతుల వద్ద నుంచి 13,737 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

పీఎం యోగా అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

నరసరావుపేట ఈస్ట్‌: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యోగా అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు, లేదా సంస్థలకు అందించే ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన వారు ఆన్‌లైన్‌లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం తెలిపారు.అర్హులైన వారు దరఖాస్తులను https:// innovateindia.mygov.in/pm-yoga-awards-2025 వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

తెనాలిలో సదరం క్యాంప్‌

పునఃప్రారంభం

తెనాలి అర్బన్‌: దివ్యాంగుల ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్‌ను నిర్వహించారు. ఆర్థో, ఈఎన్‌టీ, సైక్రాటిక్‌ విభాగాలకు చెందిన దివ్యాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం ఆర్థ్ధో–90, ఈఎన్‌టీ–42, సైక్రాటిక్‌–45 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సౌభాగ్యవాణి తెలిపారు. గురు, శుక్రవారాలలో కూడ క్యాంప్‌ జరుగుతుందని చెప్పారు.

నృసింహస్వామి ఆలయ హుండీల లెక్కింపు నేడు

మంగళగిరి టౌన్‌: మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను గురువారం లెక్కిస్తామని ఈఓ రామకోటిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్‌రోడ్‌లో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను గురువారం ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్టు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement