అంతర్జిల్లాల దొంగలు అరెస్టు
మేదరమెట్ల: పలు చైన్ స్నాచింగ్లకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కొరిశపాడు మండలం మేదరమెట్ల వై.జంక్షన్ వద్ద శనివారం మేదరమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ ఎస్డీ మొయిన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల ఒకటో తేదీ సాయంత్రం వరుసగా రెండు చైన్స్నాచింగ్ సంఘటనలు మేదరమెట్ల పోలీస్టేషన్ పరిధిలో జరిగాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల, కొరిశపాడు, పంగులూరు ఎస్ఐలు షేక్ మహ్మద్ రఫీ, వై.సురేష్, బీ.వినోద్బాబులు టీంగా ఏర్పడి సీసీ కెమెరాల ఆధారంగా ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ దొంగల కోసం ఆధారాలు సేకరించారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన దర్శనాల ఏడుకొండలు మరో ముద్దాయి అదే గ్రామానికి చెందిన షేక్ ఆషిద్లను మేదరమెట్ల వై.జంక్షన్ వద్ద మోటారు బైకుపై ఉన్నారన్న సమాచారం రావడంతో మేదరమెట్ల పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు వారి వద్ద నుంచి 126 గ్రాముల బంగారు చైన్లు రెండు మోటారు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఏడుకొండలుపై గతంలో చీమకుర్తి స్టేషన్లో మూడు, టంగుటూరు స్టేషన్పరిధిలో ఒక కేసు నమోదై ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండో ముద్దాయి షేక్ ఆషిద్పై కొత్తపట్నం పొలీసుస్టేషన్ పరిధిలో ఒకటి, ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు దొంగతనాల కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరిద్దరూ ముప్పవరం, పంగులూరు, కొరిశపాడు సమీప గ్రామాల్లో చైన్స్నాచింగ్లకు రెక్కీలు నిర్వహించినట్లు తెలిసింది. వేసవికాలం కావడంతో దొంగతనాలు పెరిగే అవకాశం ఉందని ఒంటరిగా ఉండే మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. అంతర్జిల్లాల దొంగలను పట్టుకున్న సందర్భంగా సీఐ, ఎస్ఐలతోపాటు నాయబ్రసూల్, తిరుపాల్రెడ్డి, జీ.సురేష్, ఎన్.రమేష్లను రివార్డులతో అభినందించారు.
పది లక్షల విలువైన బంగారం,
రెండు బైకులు స్వాధీనం
పోలీసులకు రివార్డులు
అందజేసిన డీఎస్పీ
అంతర్జిల్లాల దొంగలు అరెస్టు


