హెల్త్ యూనివర్సిటీ టాపర్గా గుంటూరు వైద్యుడు
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ పప్పిరెడ్డి కార్తిక్రెడ్డి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించిన పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాల్లో టాపర్గా నిలిచాడు. డీఎం న్యూరాలజీ పరీక్ష ఫలితాల్లో 800 మార్కులకు గాను 649 సాధించి హెల్త్ యూనివర్సిటీలో ప్రథమ స్థానం సాధించాడు. ద్వితీయ, తృతీయ స్థానం కూడా గుంటూరు జీజీహెచ్ వైద్యులే సాధించి రికార్డు సృష్టించారు. డాక్టర్ అజ్మ హెల్త్ యూనివర్సిటీ సెకండ్ టాపర్గా, డాక్టర్ కాంతిమాల థర్డ్ టాపర్గా నిలిచి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో మారుమోగేలా చేశారు.
స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ ప్రదానం
యూనివర్సిటీ టాపర్గా నిలిచిన డాక్టర్ కార్తిక్రెడ్డికి హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం రోజు గోల్డ్మెడల్ అందిస్తారు. కాగా, హెల్త్ యూనివర్సిటీ పరీక్షా ఫలితాల్లో డీఎం న్యూరాలజీలో వరుసగా మూడు సార్లు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్యులే టాపర్లుగా నిలిచి చరిత్ర సృష్టించారు. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఉన్నాయి. పరీక్ష రాసిన నలుగురిలో ముగ్గురు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు యూనివర్సిటీ స్థాయిలో సాధించి రికార్డు సృష్టించారు. గుంటూరు జీజీహెచ్లో న్యూరాలజీ అభ్యసించిన డాక్టర్ లలిత, డాక్టర్ గొట్టిపాటి బిందునర్మద హెల్త్ యూనివర్సిటీ టాపర్లుగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, మూడో సారి డాక్టర్ పి.కార్తిక్రెడ్డి గోల్డ్ మెడల్ అందుకోనున్నారు. కడపకు చెందిన డాక్టర్ పప్పిరెడ్డి కార్తిక్రెడ్డి కర్నూలులో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యనభ్యసించి సూపర్స్పెషాలిటీ పీజీ న్యూరాలజీ గుంటూరులో చేరాడు. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన డాక్టర్ కార్తిక్రెడ్డిని, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన డాక్టర్ అజ్మా, డాక్టర్ కాంతిమాలను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అభినందించారు. ఆయన గైడెన్స్ వల్లే తాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించగలిగానని డాక్టర్ కార్తిక్రెడ్డి తెలిపారు.


