తుఫాన్ పరిహారం అందించండి
బాపట్ల: మోంథా తుపానుకు నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని తక్షణమే పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. పరిహారం పంపిణీపై బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన 9,956 మంది బాధితులకు నగదు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా 13,074 మంది మత్స్యకారులకు, 8,260 మంది చేనేత కార్మికులకు పరిహారాన్ని 24 గంటల్లో పంపిణీ చేయాలని పేర్కొన్నారు. పంట నష్టం అంచనాల వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో 18, 486 మంది రైతుల భూములు సర్వే చేసినట్లు వివరించారు. 36,818 ఎకరాలలో పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. 12,888 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయని ధ్రువీకరిస్తూ అధికారులు నివేదించారన్నారు. మిగిలిన ప్రాంతాలలో అంచనా ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గతేడాది పొగాకు సాగు చేసిన వారి పంట పొలంలోనే ఉండి తడిచిపోతే ప్రత్యేకంగా నమోదు చేయాలన్నారు. పొగాకు పంటపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.
ఈ–క్రాప్లో పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఈ– క్రాప్ లో నమోదైన పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. నమోదైన పంటను కంకటపాలెం గ్రామంలో బుధవారం ఆయన సూపర్ చెక్ చేశారు. ఈ సందర్భంగా వరి పైరును ఆయన పరిశీలించారు. రైతుకు ఫోన్ చేసి పంట వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని గ్రామ సర్పంచ్కు తెలిపారు.
సూర్యలంక బీచ్ను తీర్చిదిద్దాలి
దేశంలోనే సూర్యలంక బీచ్ మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బీచ్ పరిసర ప్రాంతాలను ఆయన బుధవారం పరిశీలించారు. ఇటీవల తుఫాన్ కారణంగా బీచ్లో గుంతలు పడటం, లోతు ఎక్కువగా ఉన్నందున పర్యాటకుల సందర్శనకు నిషేధించిన విషయాన్ని గుర్తుచేశారు. తుపాను షెల్టర్ను పునరుద్ధరించి ఉపయోగంలోకి తీసుకురావాలని తెలిపారు. కలెక్టరేట్లో జరుగుతున్న మరమ్మతులను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రాంగణమంతా ఆయన పర్యటించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
పీజీఆర్ఎస్
కేంద్రం
తనిఖీ
కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లబ్ధిదారులకు నేరుగా ఫోన్ చేసి, వారు సమర్పించిన అర్జీల పరిష్కార స్థితి గురించి ఆరా తీశారు. ఒక అర్జీదారుడి సమస్యపై వేటపాలెం మండల తహసీల్దార్తో మాట్లాడి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎన్హెచ్ పనులు పూర్తి చేయాలి
జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెనన్స్ హాల్ నుంచి ఓడరేవు నుంచి చిలకలూరిపేట ఎన్ హెచ్ 167ఏ, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు మరియు ఇంటిగ్రేటెడ్ ఆక్వా ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి సంబంధించి ఎన్హెచ్ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


