ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలి

Sep 15 2024 1:28 AM | Updated on Sep 15 2024 1:28 AM

ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలి

ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలి

భద్రాచలంఅర్బన్‌/భద్రాచలంటౌన్‌ : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల వాహనాలతో భద్రాచలంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలని ఎస్పీ రోహిత్‌రాజ్‌ అధికారులకు సూచించారు. గోదావరి ఒడ్డున వినాయక నిమజ్జన ప్రదేశాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అంతకుముందు కుటుంబ సమేతంగా శ్రీసీతారామచంద్ర స్వామి, లక్ష్మీ తాయారమ్మ వారిని దర్శించుకోగా అర్చకులు, ఈఓ రమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. గోదావరి తీరంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, భక్తులను గోదావరిలోకి అనుమతించవద్దని సూచించారు. రెస్క్యూ టీం సభ్యులు అందుబాటులో ఉండాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌ సభ్యులు కూడా ఘాట్‌ వద్ద సిద్ధంగా ఉంటారని చెప్పారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో ప్రతి ఒక్కరూ లైఫ్‌ జాకెట్లు వేసుకోవాలని, ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. ఆ తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌ బృందాలతో కలిసి గోదావరి నదిలో ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అంకిత్‌కుమార్‌, జిల్లా షీ టీమ్‌ సీఐ నాగరాజు రెడ్డి, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు, ఆర్‌ఐ నరసింహరావు, ఎస్‌ఐలు మధుప్రసాద్‌, పీవీఎన్‌ రావు, విజయలక్ష్మి, ఇరిగేషన్‌ జేఈ వెంకటేశ్‌, దేవస్థానం ఈఈ రవీదర్‌, సేవ్‌ భద్రాద్రి వ్యవస్థాపకుడు పాకాల దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా శనివారం ఉదయం భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు కూడా నిమజ్జన ఘాట్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

కొత్తగూడెంటౌన్‌ : సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్‌రాజ్‌ అన్నారు. చుంచుపల్లి పోలీసుస్టేషన్‌ పైఅంతస్తులో నిర్మించిన డిస్ట్రిక్‌ సైబర్‌ క్రైమ్స్‌ కో– ఆర్డినేటర్‌ సెంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో సైబర్‌ నేరాల బారిన పడినవారికి అండగా ఉంటూ బాధితులు కోల్పోయిన నగదును తిరిగి ఇప్పించేలా ఈ సెంటర్‌ సిబ్బంది సహకరిస్తారని తెలిపారు. జిల్లాలో 28 పోలీసుస్టేషన్‌ల పరిధిలో సైబర్‌ వారియర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సైబర్‌ నేరాలకు సంబంధించి జిల్లాలో ఇప్పటివర కు 265 కేసులు నమోదు చేశామని, రూ.2,61,62,175 బాధితలకు అందజేశామని వివరించారు. అనంతరం పోలీసుస్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎస్పీ (ఆపరేషన్స్‌)పరితోష్‌ పంకజ్‌, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్‌ రెహమాన్‌, సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్‌, రమేష్‌కుమార్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌లు నాగరాజు, శ్రీని వాస్‌, క్రైం సీఐ జితేందర్‌, ఆర్‌ఐలు సుధాకర్‌, రవి, లాల్‌బాబు, కృష్ణారావు, షీటీం ఇంచార్జ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజురెడ్డి, ఆర్‌ఎస్‌ఐ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ రోహిత్‌రాజ్‌

Advertisement
 
Advertisement
Advertisement