
వీధి కుక్కలతో ప్రమాదం
నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం
పెంపుడు కుక్కలు కాటు వేసినా రేబిస్
జిల్లాలో మూడు నెలల్లో
5,023 కుక్కకాటు కేసులు నమోదు
ప్రథమ చికిత్స కూడా కీలకం
పాల్వంచరూరల్: రోజురోజుకూ వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధికుక్కలతోపాటు పెంపుడు కుక్కల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే రేబిస్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఇటీవల జిల్లాలోని పినపాకలో పెంపుడు కుక్కు కరవడంతో రేబిస్ వ్యాధికి గురై ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లాలో వీధి కుక్కలు అధికసంఖ్యలో సంచరిస్తున్నాయి. కుక్కకాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
సంతానోత్పత్తి నియంత్రణేది..?
ఎనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వీధి కుక్కలను తరలించి సంతానోత్పత్తి కలగకుండా శస్త్రచికిత్స చేస్తామని అధికారులు గతంలో పేర్కొన్నారు. అనంతరం పట్టుకొచ్చిన ప్రాంతంలోనే వదిలేస్తామని చెప్పారు. కానీ జిల్లాలో ఎక్కడా కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
పశువులకు కూడా..
కుక్కలు, కోతులు, ఎలుకల కాటుతో మనుషులకు, పశువులకు కూడా రేబిస్ సోకుతుంది. కుక్క సొంగ పుండ్ల మీదపడ్డ వ్యాధి సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కుక్క కరిచినప్పుడు చిన్న గాయమైతే పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. గాయం తీవ్రంగా ఉంటే పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీధి కుక్కలను పట్టుకుని, ఎనిమల్ కేర్ సెంటర్కు తరలించారని, ఇప్పుడు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు అవగాహన లేక నాటు వైద్యం చేయించుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అడవి జంతువులు కోతులు, పందులు, దుప్పులు, ఎలుగుబంట్లు వంటివి దాడిచేసి గాయపరిచినా కుక్క కాటు వ్యాక్సిన్ వేస్తున్నారు.
మూడు నెలల్లో 5,023 మందికి..
జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు 5,023మంది కుక్కకాటుకు గురైనట్లు డీఎంహెచ్ఓ జయలక్ష్మి తెలిపారు. జూన్లో 1,723, జూలైలో 1,869, ఆగస్టు 1,421 మంది ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో వ్యా క్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
రేబిస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త లూయి పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
కుక్కకాటు బాధితులు నాటుమందు వాడొద్దు. కుక్క కరిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క కాటుకు గురైనప్పుడు ప్రథమ చికిత్స కూడా కీలకం. కాటువేసిన ప్రాంతంలో ఉన్న రేబిస్ వైరస్ను మంచినీటితో, స్నానం సబ్బుతో కడగడం ద్వారా నిర్మూలించవచ్చు. ఆదివారం పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తాం. చుంచుపల్లి, విద్యానగర్ ఏరియా, మణుగూరులో ఈ కార్యక్రమం చేపట్టాం.
–డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్యాధికారి

వీధి కుక్కలతో ప్రమాదం