
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ రివర్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. బుధవారం హైదరాబాద్లో తొలి స్టోర్ను ప్రారంభించగా మార్చి నాటికి వైజాగ్, విజయవాడ, గుంటూరులో కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి స్టోర్స్ సంఖ్యను 50కి పెంచుకోనున్నట్లు సంస్థ సీఈవో అరవింద్ మణి తెలిపారు.
ప్రస్తుతం ఇండీ పేరిట స్కూటర్లు విక్రయిస్తున్నామని, 2026 నాటికి ఏటా 1,00,000 వాహన విక్రయాల లక్ష్యం సాధించాక రెండో మోడల్ను కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. యమహా మోటర్ కార్పొరేషన్, టయోటా వెంచర్స్ తదితర దిగ్గజాల నుంచి ఇప్పటివరకు రూ. 550 కోట్లు సమీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకు సుమారు 500 యూనిట్లుగా ఉన్న అమ్మకాలను వచ్చే మార్చి నాటికి 3,000కి పెంచుకోనున్నట్లు వివరించారు. హైదరాబాద్లో ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ రోడ్ ధర రూ. 1,45,000గా ఉంటుందని, ఒకసారి చార్జింగ్తో 120 కి.మీ. వరకు రేంజి ఉంటుందని మణి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment