
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్లోనూ బంగారం ధరలు దిగివచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరమే ఉద్దీపన ప్యాకేజ్పై స్పష్టత వస్తుందనే సంకేతాలతో డాలర్ బలపడటంతో పసిడికి డిమాండ్ తగ్గింది. ఇక ఎంసీఎక్స్లో బుధవారం పదిగ్రాముల బంగారం 257 రూపాయలు పతనమై 50,704 రూపాయలకు దిగిరాగా, కిలో వెండి 781 రూపాయలు తగ్గి 61,500 రూపాయలు పలికింది. చదవండి : వ్యాపారుల కోసం భారత్పే డిజిటల్ గోల్డ్
అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్పై అస్పష్టతతో డాలర్, ఈక్విటీ మార్కెట్లకు దిశ కొరవడటంతో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని కొటాక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్ధితులు కొనసాగే పరిస్ధితుల నేపథ్యంలో దీర్ఘకాలంలో బంగారం స్ధిరంగా పెరుగుతుందని, పసిడి ధరలు పడిపోయిన సందర్భాల్లో కొనుగోలు చేస్తే మెరుగైన రిటన్స్ సాదించవచ్చని పేర్కొంది. ఇక ఆల్టైమ్ హై నుంచి బంగారం ఇటీవల 5500 రూపాయలు దిగిరావడంతో కొనుగోలుదారులు పసిడి కొనుగోలుపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు.