
ముంబై: కోవిడ్–19 సమస్య సమసిపోయిన అనంతరం భారత్లో అవకాశాల సృష్టికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దశాబ్ద కాలంపాటు వార్షికంగా 8 నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి సాధన జరగాల్సిన అవసరం ఉందని మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. భారీ వృద్ధిరేటులేని పరిస్థితిలో దేశంలో ఆదాయాల స్తబ్దత నెలకొంటుందని, జీవన నాణ్యత లోపిస్తుందని విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో భారీ వృద్ధికి తక్షణ చర్యలు అవసరమని తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
►దేశంలో ఉత్పాదకత పెరగాలి. ఉపాధి సృష్టి జరగాలి. ఇందుకు రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో పలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
►2013 నుంచి 2018 మధ్య భారత్ వార్షికంగా సగటున 40 లక్షల వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు సృష్టించింది. తాజా పరిస్థితుల ప్రకారం పట్టణీకరణ పెరుగుతోంది. జనాభా పెరుగుదల కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి వార్షికంగా 1.2 కోట్ల వ్యవసాయేతర ఉపాధి అవకాశాల సృష్టి జరగాలి.
►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) భారత్ జీడీపీ 5% వరకూ క్షీణించే అవకాశం ఉంది. అయితే కోవిడ్ అనంతరం తాజా అవకాశాల సృష్టికి వచ్చే దశాబ్ద కాలంలో భారత్ 8 నుంచి 8.5% వృద్ధి సాధించాల్సిందే. లేదంటే రానున్న దశాబ్ద కాలంలో తీవ్ర సవాళ్లు తప్పవు.
►తయారీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ పరిశ్రమసహా కార్మిక, భూ వ్యవహారాల్లో సంస్కరణలు తక్షణం జరగాలి. అలాగే తక్కువ టారిఫ్లతో వినియోగదారులకు విద్యుత్ సౌకర్యాలను అందించడానికి తగిన ప్రయత్నాలు జరగాలి.
►ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు, ద్రవ్యలోటు కట్టడి, తగిన సరళతర వడ్డీరేట్ల విధానంతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు.
►మొండిబకాయిల పరిష్కార దిశలో ‘బ్యాడ్బ్యాంక్’ ఏర్పాటు జరగాలి.
►సంస్కరణల పరంగా చూస్తే, 60 శాతం రాష్ట్రాల వైపు నుంచి జరగాల్సి ఉండగా, 40 శాతం కేంద్రం చేపట్టాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment