growth rate
-
ఈఎంఐలు ఇక దిగొస్తాయ్!
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్లుగా దాదాపు ఐదేళ్ల తర్వాత రుణ గ్రహీతలకు ఆర్బీఐ నుంచి చల్లని కబురు అందింది. కీలక రెపో రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు ఇక దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పెరగడమే కానీ, తగ్గడమంటే ఏంటో తెలియని గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ముంబై: రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించేలా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును పావు శాతం తగ్గించింది. దీంతో ఈ ప్రామాణిక వడ్డీ రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగి రానుంది. గవర్నర్ సారథ్యంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో కేంద్రం మధ్య తరగతి వర్గాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించిన వెంటనే ఆర్బీఐ కూడా తీపి కబురు అందించడం విశేషం. కాగా, ప్రస్తుత పాలసీ విషయంలో ప్రస్తుత తటస్థ (న్యూట్రల్) విధానాన్నే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. వృద్ధి రేటు ఇలా...: వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. మరోపక్క, ద్రవ్యోల్బణం కూడా 4.2 శాతానికి (ఈ ఆర్థిక సంవత్సరం అంచనా 4.8 శాతం) దిగొస్తుందని లెక్కగట్టింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4 శాతానికి (నాలుగేళ్ల కనిష్టం) తగ్గిపోవచ్చని, ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేయడం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతం గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత నెమ్మదిగా శాంతిస్తూ.. నవంబర్లో 5.48 శాతానికి, డిసెంబర్లో 5.22 శాతానికి దిగొచ్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి వెంటాడుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం భయాలతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇచ్చింది. ఈ పరిణామాలతో రూపాయి ఘోరంగా పడిపోతోంది. తాజాగా డాలరు మారకంలో సరికొత్త ఆల్టైమ్ కనిష్ట స్థాయి 87.60కి క్రాష్ అవ్వడం తెలిసిందే. ఈ తరుణంలో ఆర్బీఐ రేట్ల కోత దేశీయంగానూ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తుందని, రూపాయి పతనంతో విదేశీ నిధులు మరింత తరలిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.రెపో రేటు అంటే.. బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటునే రెపో (రీపర్చేజ్) రేటుగా వ్యవహరిస్తారు. రెపో అధికంగా ఉంటే బ్యాంకులకు నిధుల సమీకరణ వ్యయం పెరుగుతుంది, దీంతో రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతాయి. రెపో రేటు తగ్గడం వల్ల బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయిస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత కార్పొరేట్ లోన్లపైనా వడ్డీ భారం తగ్గుతుంది. అయితే, రెపో రేటు తగ్గడం వల్ల డిపాజిట్ రేట్లతో పాటు ఇతర పొదుపు సాధనాలపై కూడా తక్కువ వడ్డీ లభిస్తుంది.ఇతర ముఖ్యాంశాలు... → సైబర్ మోసాలకు అడ్డకట్ట వేసి, భద్రతను కట్టుదిట్టం చేయడం కోసం ప్రత్యేకంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటర్నెట్ డొమైన్ను డాట్ ఇన్ (.in)కు మార్చుకోవాలి. అంటే బ్యాంకులు ‘bank.in’, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ‘fin.in’ ఉపయోగించాలి. బ్యాంకు డొమైన్ మార్పు 2025 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుండగా.. నాన్–బ్యాంకులకు రాబోయే రోజుల్లో అమలు చేయనున్నారు.→ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీలో రిజిస్టర్ అయిన బ్యాంకింగేతర బ్రోకరేజ్ సంస్థలు తమ క్లయింట్ల తరఫున... ప్రభుత్వ సెక్యూరిటీల్లో సెకండరీ మార్కెట్ లావాదేవీల కోసం ఇక నేరుగా నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్–ఆర్డర్ మ్యాచింగ్ (ఎన్డీఎస్–ఓఎం) ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నియంత్రిత సంస్థలకు, బ్యాంకులు, ప్రత్యేక ప్రైమరీ డీలర్ల తరఫున క్లయింట్లకే అందుబాటులో ఉంది. → తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 7–9 తేదీల్లో జరుగుతుంది.గృహ రుణంపై ఊరట ఎంతంటే..? ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 9 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ. 25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,493 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.75 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.22093కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.400 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ. 96 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.5ఏళ్లలో తొలిసారి.. 2020 తర్వాత తొలి సారి రెపో రేటు ను తగ్గించగా.. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ కీలక రేట్లలో మార్పులు చేయడం విశేషం. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ రెపో రేటును ఏకధాటిగా 4% నుంచి 6.5 శాతానికి, అంటే 2.5% పెంచేసింది. ఆ తర్వాత రేట్లలో మార్పు లేకుండా యథాతథ పాలసీని కొనసాగిస్తూ వస్తోంది. ఇక గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఆల్టైమ్ కనిష్టాన్ని (దాదాపు 6%) తాకిన తర్వాత కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం 9–9.5% రేంజ్లో తీవ్ర భారంగా మారాయి. అధిక వడ్డీ రేట్లకు తోడు పన్నుల భారం ధరల పెరుగుదల డెబ్బతో గత రెండేళ్లుగా ఇల్లు కొనాలంటే బెదిరిపోయే పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణ గ్రహీతలకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.సానుకూల పరిస్థితులతోనే... గడిచిన కొన్ని పాలసీ చర్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలున్నాయి. 2025–26లో ద్రవ్యోల్బణం మరింత శాంతించి ఆర్బీఐ టార్గెట్ (4%) స్థాయికి చేరుతుందని భావిస్తున్నాం. ఈ సానుకూల పరిస్థితుల కారణంగానే మందగమనంలో ఉన్న వృద్ధికి తోడ్పాటు అందించేలా ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటు కోతకు మొగ్గు చూపింది. 2024–25 రెండో త్రైమాసికంలో వృద్ధి 5.4 శాతానికి (రెండేళ్ల కనిష్టం) తగ్గిన తర్వాత మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఈ వృద్ధి–ద్రవ్యోల్బణం లెక్కలను భేరీజు వేసుకునే నిర్ణయం ప్రకటించాం. స్థూల ఆర్థిక అంచనాల మేరకు భవిష్యత్తు సమావేశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఫైనాన్షియల్ వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) ఉండేలా అవసరమైన చర్యలన్నీ చేపడతాం. భారత్ మళ్లీ కచ్చితంగా 7 శాతానికి మించి వృద్ధి రేటు సాధిస్తుంది. బడ్జెట్లో ఆదాయపు పన్ను ఊరట వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు, నిజానికి ఇది వృద్ధికి చేదోడుగా నిలుస్తుంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, డాలరుతో దేశీ మారకం విలువ ’నిర్దిష్ట స్థాయి లేదా శ్రేణి’లో ఉండాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోలేదు. – సంజయ్ మల్హోత్రా, ఆర్బీఐ గవర్నర్సమయానుకూల నిర్ణయం.. ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయం సరైన సమయంలో వెలువడింది. నియంత్రణపరంగా చేపట్టిన చర్యలను కూడా స్వాగతిస్తున్నాం. – సి.ఎస్. శెట్టి, ఎస్బీఐ చైర్మన్ ఇది సరిపోదు... ఆర్బీఐ పావు శాతం రేట్ల తగ్గింపు వల రియల్ ఎస్టేట్ పరిశ్రమపై ప్రత్యక్ష ప్రభావం పరిమితంగానే ఉంటుంది. మొత్తం డిమాండ్ను పెంచి, ఇళ్ల విక్రయాలు జోరందుకోవాలంటే (ముఖ్యంగా అందుబాటు ధరల విభాగంలో) మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని ఆశిస్తున్నాం. – బొమన్ ఇరానీ, క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడుహౌసింగ్కు బూస్ట్... ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేపో తగ్గింపు వల్ల గృహ రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. దీంతో మళ్లీ ఇళ్ల కొనుగోళ్లు పుంజుకునేందుకు దోహదం చేస్తుంది. – జి. హరిబాబు, నరెడ్కో జాతీయ అధ్యక్షుడు -
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
వృద్ధి తిరిగి ట్రాక్లోకి వస్తుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో అనిశి్చతులు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తిరిగి గాడిన పడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో విధాన నిర్ణయాలు, వృద్ధికి సంబంధించి చర్యలు, మౌలిక వసతులపై ఖర్చు చేయడం సహజంగానే తగ్గుతాయి. ప్రస్తుత త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో పండుగల వ్యయాలకుతోడు, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి పుంజుకోవడం, మౌలిక వసతులపై వ్యయాలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. వచ్చే మార్చి చివరికి తిరిగి ట్రాక్లోకి వస్తాం’’అని టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన సదస్సులో భాగంగా మంత్రి గోయల్ చెప్పారు. తయారీ, మైనింగ్ రంగాల్లో బలహీన పనితీరుతో సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ట స్థాయి 5.4 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు గోయల్పై విధంగా బదులిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో వృద్ధి 8.1 శాతంగా ఉండడం గమనించొచ్చు. చివరిగా 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో జీడీపీ 4.3 శాతం కనిష్ట వృద్ధి రేటును నమోదు చేసింది. అయినా వేగవంతమే.. ఇప్పటికీ ప్రపంచంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గోయల్ చెప్పారు. ఆధునిక టెక్నాలజీలు, ఆవిష్కరణలు దేశ వృద్ధి రేటును నడిపిస్తాయన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.6 శాతమే కావడం గమనార్హం. ప్రతిపక్ష పారీ్టలు చేస్తున్న తప్పుడు, ప్రతికూల ప్రచారం దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోలేవన్నారు. ‘‘వక్ఫ్ బిల్లు లేదా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల ఆమోదానికి కట్టుబడి ఉన్నాం. ఇవి నిర్మాణాత్మక మార్పులు. దేశానికి మంచి చేసే వీటి విషయంలో చిత్తశుద్ధితో ఉన్నాం’’అని చెప్పారు. -
పరిశ్రమలు రివర్స్గేర్!
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు నెలలో ప్రతికూలానికి పడిపోయింది. మైనస్ 0.1 శాతంగా నమోదైంది. పరిశ్రమల ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) వృద్ధి జూలై నెలకు 4.7 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్టు నెలలోనూ ఐఐపీ 10.9 వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా మైనింగ్, విద్యుదుత్పత్తి రంగంలో క్షీణత ఐఐపీ పడిపోవడంలో కీలకంగా పనిచేసింది. అదే సమయంలో తయారీ రంగంలోనూ ఉత్పాదకత పుంజుకోలేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు (ఐదు నెలల్లో) ఐఐపీ వృద్ధి 4.2 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 6.2 శాతం కంటే తక్కువ. వృద్ధి రేటు మైనింగ్ రంగంలో మైనస్ 4.3 శాతానికి పడిపోయింది. విద్యుదుత్పత్తి రంగంలో మైనస్ 3.7 శాతంగా నమోదైంది. తయారీలో 0.1 శాతంగా ఉంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు మైనింగ్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణమని ఎన్ఎస్వో తెలిపింది. చివరిగా 2022 అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం. -
వృద్ధి బాటలో అదానీ ఎనర్జీ
న్యూఢిల్లీ: విద్యుత్ ప్రసార కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 18.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,54,660 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువను సాధించినట్లు బ్రోకరేజీ కాంటర్ ఫిట్జ్గెరాల్డ్ పేర్కొంది. పటిష్ట వృద్ధిలోనున్న బిజినెస్ కారణంగా కంపెనీ ఆదాయం, పన్నుకుముందు లాభాల్లో భారీ పురోగతికి వీలున్నట్లు అంచనా వేసింది. రానున్న మూడేళ్లలో ఆదాయం వార్షిక ప్రాతిపదికన 20 శాతం, పన్నుకుముందు లాభాలు 29 శాతం చొప్పున పుంజుకోగలవని అభిప్రాయపడింది. కంపెనీ విద్యుత్ ప్రసారం, పంపిణీ ఆస్తులతోపాటు.. స్మార్ట్ మీటరింగ్ బిజినెస్లను కలిగి ఉంది. మూడేళ్ల(2024 నుంచి 2027) కాలంలో వార్షిక ప్రాతిపదికన ఆదాయం 20 శాతం, నిర్వహణ లాభం(ఇబిటా) 29 శాతం చొప్పున పురోగమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్ అంచనా వేసింది. -
అభివృద్ధికి చిరునామా వైఎస్ జగన్ పరిపాలన
-
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
ఎకానమీ జోరుకు బ్రేకులు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతంగా నమోదయ్యింది. గడచిన 15 నెలల కాలంలో ఇంత తక్కువ వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. 2023 జనవరి–మార్చి త్రైమాసికంలో ఎకానమీ 6.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. వ్యవసాయం, సేవా రంగాల పేలవ పనితీరు తాజా లెక్కలపై ప్రభావం చూపినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతం. తాజా సమీక్షా కాలానికి ముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రేటు 7.8 శాతం. 6.7 శాతం వృద్ధి ఎలా అంటే.. 2024–25 తొలి త్రైమాసికంలో 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని మదింపుచేసే జీడీపీ విలువ రూ.43.64 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఇది రూ.40.91 లక్షల కోట్లు. అంటే వృద్ధి రేటు 6.7 శాతమన్నమాట. ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికకాకుండా, ప్రస్తుత ధరల ప్రకారం పరిశీలిస్తే, 2023 ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ విలువ 9.7 శాతం వృద్ధితో రూ.70.50 లక్షల కోట్ల నుంచి రూ.77.31 లక్షల కోట్లకు ఎగసింది. ‘వృద్ధి వేగంలో టాప్’ ట్యాగ్ యథాతథం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 4.7 శాతంగా నమోదయ్యింది. ఈ కాలంలో ప్రపంచంలోనే మరేదేశమూ 6.7 శాతం వృద్ధి రేటును అందుకోలేకపోవడంతో, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటు విషయంలో భారత్ తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నట్లయ్యింది. జీవీఏ వృద్ధి 6.8 శాతం ఉత్పత్తికి సంబంధించిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి రేటు 2023–24 చివరి త్రైమాసికంలో 6.3 శాతంగా నమోదయితే, 2024–25 మొదటి త్రైమాసికంలో అరశాతం పెరిగి 6.8 శాతంగా నమోదయ్యింది. వార్షికంగా చూస్తే జీవీఏ విలువ రూ.38.12 లక్షల కోట్ల నుంచి రూ.40.73 లక్షల కోట్లకు ఎగసింది. ఇది 6.8 శాతం వృద్ధి రేటుకాగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.3 శాతం. వివిధ రంగాల వృద్ధి తీరును స్థూలంగా జీవీఏ ప్రాతిపదికన పరిశీలిస్తారు. -
ఇళ్ల ధరల జోరులో ముంబై నంబర్ 2
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్ఫ్రాంక్ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం. ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది. టాప్–10లో ఇవే.. లాస్ ఏంజెలెస్లో 8.9 శాతం (4వ ర్యాంక్), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్ క్వార్టర్లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి. -
భారత్, చైనా భేష్
వాషింగ్టన్: భారత్, చైనా, యూరప్ ఆర్థిక వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన అంచనాలను మెరుగుపరిచింది. అదే సమయంలో యూఎస్, జపాన్కు సంబంధించిన అంచనాలను కొంత తగ్గించింది. భారత్ 2024లో 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ అంచనా 6.8 శాతాన్ని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను ఎగువకు సవరించింది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల నిదానించినట్టు తెలిపింది. 2024లో ప్రపంచ వృద్ధి 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఏప్రిల్లో వేసిన అంచనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంతో పోల్చి చూస్తే 0.1 శాతం తగ్గనున్నట్టు ఐఎంఎఫ్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో సగం చైనా, భారత్ నుంచే ఉంటుందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్తికవేత్త ఒలివర్ గౌరించాస్ బ్లాగ్పోస్ట్లో పేర్కొన్నారు. చైనా 5 శాతం 2024 ఆరంభంలో చైనా ఎగుమతులు పెరగడంతో ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను గతంలో వేసిన 4.6 శాతం నుంచి 5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. అయిన కానీ 2023లో నమోదైన 5.2 శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఒకప్పుడు రెండంకెల వృద్ధి సాధించిన చైనా పెద్ద ఎత్తున సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు, ముఖ్యంగా అక్కడ ఇళ్ల మార్కెట్ కుదేలైనట్టు ఐఎంఎఫ్ తెలిపింది. వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరత నేపథ్యంలో 2029 నాటికి చైనా వృద్ధి రేటు 3.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. యూరప్ 0.9 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. అక్కడ సేవల రంగం మెరుగుపడుతుండడాన్ని ప్రస్తావించింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఈ ఏడాది 2.6 శాతం వృద్ధి రేటుకు పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. ఏప్రిల్లో 2.7 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక 2024 సంవత్సరానికి జపాన్ వృద్ధి రేటును 0.9 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధరల మంట (ద్రవ్యోల్బణం) 2023లో ఉన్న 6.7 శాతం నుంచి 2024లో 5.9 శాతానికి దిగొస్తుందని తెలిపింది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన దిశగా ఐఎంఎఫ్ కృషి చేస్తుంటుంది. -
Arvind Virmani: 2024–25లో 7 శాతం వృద్ధి సాధిస్తాం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి అంచనా వ్యక్తం చేశారు. ఈ రేటు 0.5 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చన్నారు. అంతేకాదు, రానున్న కొన్నేళ్లపాటు ఇదే తరహా వృద్ధి రేటు నమోదవుతుందన్నారు. దేశం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందంటూ.. వాటిని పరిష్కరించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీ 7.2 శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్బీఐ సైతం ఇటీవలే అంచనా వేయడం గమనార్హం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు వినియోగం వ్యయాలు క్షీణించడంపై ఎదురైన ప్రశ్నకు విర్మాణి స్పందిస్తూ.. కరోనా విపత్తు ప్రభావంతో గృహ పొదుపు తగ్గిపోయిందని.. అంతకుముందు ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉందన్నారు. రెట్టింపు కరువు పరిస్థితిగా దీన్ని అభివర్ణించారు. గతేడాది ఎల్నినో పరిస్థితిని చూసినట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపులను మళ్లీ పోగు చేసుకోవాల్సి ఉన్నందున, అది వినియోగంపై ప్రభావం చూపించినట్టు వివరించారు. ‘‘బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే వారు, చిన్న బ్రాండ్లు లేదా సాధారణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకుంటున్నారు’’అని వివరించారు. చారిత్రకంగా చూస్తే ప్రాంతీయ భాగస్వామి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ నిదానించినట్టుగా తెలుస్తోందని.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేపట్టకపోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. వడ్డీ రేట్ల కోతతో పెట్టుబడుల ప్రవాహం..వర్ధమాన దేశాలతో పోలిస్తే రిస్క్ లేని రాడులు యూఎస్లో, అభివృద్ధి చెందిన మార్కెట్లో వస్తుండడమే, మన దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తక్కువగా ఉండడానికి కారణంగా విర్మాణి చెప్పారు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం మొదలైన తర్వాత మన దగ్గరకు పెట్టుబడుల ప్రవాహం మొదలవుతుందని అంచనా వేశారు. -
ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్
ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేస్తుంది. -
RBI Governor Shaktikanta Das: ఆర్థికాభివృద్ధి.. ధరల కట్టడే లక్ష్యం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు బ్యాంకుల అసెట్ మేనేజ్మెంట్ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు. యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్లకు ఆటోలోడ్ సదుపాయం.. చిన్న మొత్తాలను డిజిటల్గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్డేట్ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు మించరాదు.బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు.. చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు. -
భళా.. భారత్
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ అన్ని వర్గాల అంచనాలకు మించి మంచి ఫలితాన్ని సాధించింది. మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో ఈ పురోగతి 7.8 శాతంగా రికార్డు అయ్యింది. నాలుగో త్రైమాసికంలో 6.1–6.7 శాతం పరిధిలో వృద్ధి చెందుతుందని పలువురు ఆర్థికవేత్తలు అంచనావేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.6–7.8 శాతం శ్రేణిలో ఉంటుందన్నది వారి అభిప్రాయం. ఆర్బీఐ వృద్ధి అంచనాసైతం 7 శాతంగా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరినాటి తన రెండవ అడ్వాన్స్ అంచనాల్లో 2023–24 వృద్ధి రేటును 7.7 శాతంగా పేర్కొంది. ఈ అంచనాలు, విశ్లేషణలు అన్నింటికీ మించి తాజా ఫలితం వెలువడ్డం గమనార్హం. క్యూ4లో అంచనాలకు మించి (7.8 శాతం) భారీ ఫలితం రావడం మొత్తం ఎకానమీ వృద్ధి (8.2 శాతం) పురోగతికి కారణం. ఎన్ఎస్ఓ శుక్రవారం ఈ మేరకు తాజా గణాంకాలను వెలువరించింది. 5 ట్రిలియన్ డాలర్ల దిశగా అడుగులుభారత ఆర్థిక వ్యవస్థ 2023–24 జూన్ త్రైమాసికంలో 8.2 శాతం, సెపె్టంబర్ త్రైమాసికంలో 8.1 శాతం, డిసెంబర్ త్రైమాసికంలో 8.6 శాతం పురోగతి సాధించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంకాగా, అదే ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఎకానమీ 2024 మొదటి మూడు నెలల్లో 5.3 శాతం పురోగమించడం గమనార్హం. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఎకానమీ ముందుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనితోపాటు భారత్ ఎకానమీ 3.5 ట్రిలియన్ డాలర్ల జోన్లో స్థిరపడగా, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనకు ముందడుగు పడింది. మార్చిలో మౌలిక రంగం 6.2 శాతం వృద్ధి ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ మార్చిలో 6.2 శాతం పురోగమించింది. సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు దోహదపడింది. బొగ్గు, క్రూడ్ ఆయిల్, ఎరువులు, స్టీల్, సిమెంట్ రంగాలు కూడా కలిగిన ఈ గ్రూప్ 2024 మార్చితో 6 శాతం పురోగమించగా, 2023 ఏప్రిల్లో 4.6 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ 40.27 శాతం. 2024లో వృద్ధి 6.8%: మూడీస్ భారత్ 2024లో 6.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని రేటింగ్ దిగ్గజం మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2025లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2022లో ఎకానమీ 6.5 శాతం పురోగమిస్తే,,, 2023లో 7.7 శాతానికి ఎగసిందని తెలిపింది.ద్రవ్యలోటు కట్టడిఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలకు మించి పురోగమించిన నేపథ్యంలో ఎకానమీకి మరో సానుకూల అంశం... ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు పరిస్థితి మెరుగుపడ్డం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా (జీడీపీ విలువలతో పోల్చి) ద్రవ్యలోటు ఉండాలని కేంద్ర బడ్జెట్ నిర్దేశిస్తుండగా, ఈ అంకెలు మరింత మెరుగ్గా 5.63 శాతంగా నమోదయ్యాయి. విలువల్లో రూ.17.34 లక్షల కోట్లుగా ఫిబ్రవరి 1 బడ్జెట్ అంచనావేస్తే, మరింత మెరుగ్గా రూ.16.53 లక్షల కోట్లుగా ఇది నమోదయినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజా గణాంకాలు వెల్లడించాయి.8.2% వృద్ధి ఎలా... 2011–12ను బేస్ ఇయర్గా తీసుకుంటూ.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకు ని స్థిర ధరల వద్ద 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్లు. 2023–24లో ఈ విలువ 173.82 లక్షల కోట్లకు ఎగసింది. అంటే ఇక్కడ వృద్ధి రేటు 8.2 శాతం. ఇక ద్రవ్యోల్బణాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా స్థిర ధరల వద్ద వృద్ధి రేటును చూస్తే... ఇది 9.6 శాతం పురోగమించి రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.295.36 లక్షల కోట్లకు చేరింది. 7.8% పరుగు ఇలా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని క్యూ4లో (2023 క్యూ4తో పోల్చి) ఎకానమీ విలువ రూ.43.84 లక్షల కోట్ల నుంచి రూ.47.24 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతమన్నమాట. స్థిర ధరల వద్ద ఈ రేటు 9.9 శాతం పెరిగి రూ.71.23 లక్షల కోట్ల నుంచి రూ.78.28 లక్షల కోట్లకు ఎగసింది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ వృద్ధి వేగం కొనసాగుతుంది ప్రపంచంలోని దిగ్గజ ఎకానమీలో భారత్ జీడీపీ వృద్ధి తీరు విశేషమైనది. మోదీ ప్రభుత్వం 3.0లోనూ ఇదే వృద్ధి వేగం కొనగుతుంది. 2023–24లో తయారీ రంగం 9.9 శాతం పురోగమించడం ప్రత్యేకమైన అంశం. 2014కి పూర్వం యూపీఏ ప్రభుత్వం హయాంలో అవినీతితో మొండి బకాయిల కుప్పగా మారిన బ్యాంకింగ్ రంగాన్ని వివిధ సంస్కరణలతో మోదీ ప్రభుత్వం టర్నెరౌండ్ చేసి, వృద్ధి బాటలో పరుగులు తీయిస్తోంది. 2014–23 మధ్య బ్యాంకులు రూ. 10 లక్షల కోట్ల మేర మొండిబాకీల రికవరీ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 1,105 బ్యాంక్ ఫ్రాడ్ కేసులను దర్యాప్తు చేసి రూ. 64,920 కోట్ల మొత్తాన్ని అటాచ్ చేసింది. – మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో నిర్మలా సీతారామన్ -
Duvvuri Subbarao: వృద్ధి, వడ్డీ రేటు మార్పులకు ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు. సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్బీఐ చీర్లీడరుగా ఉండాలన్న డిమాండ్కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు. చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. -
2003-07 నాటి వృద్ధిరేటు దిశగా భారత జీడీపీ
దేశ ఎకానమీ వృద్ధి రేటుపై మోర్గాన్స్టాన్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత ఎకానమీ 2003–2007 కాలంలో ఎలా అయితే వృద్ధి చెందిందో ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదేమాదిరి వృద్ధి కనబరుస్తోందని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో తెలిపింది. భారత జీడీపీ 2003-07 కాలంలో ఏడాదికి సగటున 8.6 శాతం చొప్పున వృద్ధి కనబరిచింది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని నిదేదిక ద్వారా తెలిసింది. భారీగా పెట్టుబడులు వస్తుండడంతో దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. కానీ పెట్టుబడులు పెరగడంతో ఎకానమీ వృద్ధి చెందుతోందని ఈ రిపోర్ట్ పేర్కొంది. వినియోగం తగ్గినా, దేశంలోకి వస్తున్న పెట్టుబడులు జీడీపీ గ్రోత్ను ముందుండి నడుపుతున్నాయని తెలిపింది. నివేదిక ప్రకారం.. ప్రభుత్వం చేసే మూలధన వ్యయం తగ్గినప్పటికీ ప్రైవేట్ కంపెనీలు చేసే క్యాపెక్స్ పుంజుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం తగ్గినా, పట్టణాల్లో వినియోగం ఊపందుకుంది. గ్లోబల్ ఎగుమతుల్లో ఇండియా వాటా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. జీడీపీ వృద్ధి 2003–2007 సమయంలో 27 శాతం నుంచి 39 శాతానికి చేరుకుంది. ఇదే గరిష్ట వృద్ధిగా నమోదైంది. ఇదీ చదవండి: ఎన్నికల నేపథ్యంలో వస్తువులకు అసాధారణ గిరాకీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం 2011–21 మధ్య పెట్టుబడులు తగ్గినా ప్రస్తుతం జీడీపీ 34 శాతం దగ్గర ఉందని వివరించింది. భవిష్యత్తులో ఇది 36 శాతానికి చేరుతుందని అంచనా. 2003–2007 లో ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైనట్లు నివేదిక తెలిపింది. -
2031 నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతంగా క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అలాగే 2031 నాటికి దేశం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థాయికి రెట్టింపై దాదాపు 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని.. తద్వారా ఎగువ మధ్య–ఆదాయ దేశంగా మారుతుందని క్రిసిల్ ఇండియా అవుట్లుక్ నివేదిక పేర్కొంది. నిర్మాణాత్మక సంస్కరణలు తదితర సానుకూల ఆర్థిక నిర్ణయాల వల్ల దేశ ఎకానమీ 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపింది. రానున్న ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2024–25 నుంచి 2030–31) భారత్ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని దాటి 7 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. ఈ కాలంలో ఎకానమీ సగటును 6.7 శాతం పురోగమిస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎనానమీగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్లను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.6 ట్రిలియన్ డాలర్లు. 4,500 డాలర్లకు తలసరి ఆదాయం.. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరుగుతుంది. దీనితో దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకా రం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డా లర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పే ర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. తయారీ, సేవల రంగాల్లో మంచి అవకాశాలు... దేశీయ, ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా తయారీ– సేవల రంగాలు రెండింటికీ పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. 2025–2031 ఆర్థిక సంవత్సరాల మధ్య తయారీ– సేవల రంగాలు వరుసగా 9.1 శాతం, 6.9 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని మేము అంచనా వేస్తున్నాము. తయారీ రంగం ద్వారా కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, సేవా రంగం భారతదేశ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తుంది. – ధర్మకీర్తి జోషి, క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ -
కొనసాగిన బుల్ రికార్డులు
ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్ అప్గ్రేడ్ రేటింగ్తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు. ► డిజిట్ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ► డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్బక్ వినియోగించుకోనుంది. బ్లాక్బక్ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్లో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
హోటల్ పరిశ్రమలో కొనసాగనున్న జోరు
కోల్కతా: దేశ హోటల్ పరిశ్రమ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మంచి వృద్ధిని చూడనుంది. 2024–25లో హోటల్ పరిశ్రమ ఆదాయం మొత్తం మీద 7–9 శాతం మధ్య పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీయ విహార పర్యటనలు కొనసాగుతుండడం, సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలనుకు (ఎంఐసీఈ) డిమాండ్ ఉండడం వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని ఇక్రా తెలిపింది. సాధారణ ఎన్నికల ప్రభావం స్వల్పకాలమేనని పేర్కొంది. హోటల్ పరిశ్రమ డిమాండ్లో ఆధాత్మిక పర్యాటకం, టైర్–2 సిటీలు కీలక చోదకంగా నిలుస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హోటళ్లలో గదుల భర్తీ రేటు (ఆక్యుపెన్సీ) దశాబ్ద గరిష్టమైన 70–72 శాతానికి చేరుకుందని, 2022–23లో ఇది 68–70 శాతమే ఉన్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా హోటల్ గదుల రేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.7,200–7,400 మధ్య ఉండొచ్చని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,800–8,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశ ఆతిథ్య రంగంపై సానుకూల అవుట్లుక్ను ప్రకటించింది. -
జీడీపీ.. టాప్గేర్!
న్యూఢిల్లీ: ఆర్థిక మూలాలు బలోపేతం అవుతున్నందున భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) 6.9–7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిడ్ ఇండియా తెలిపింది. త్రైమాసిక వారీ అవుట్లుక్ను విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా మంచి పురోగతి నెలకొందని, స్థూల ఆర్థిక గణాంకాలు దీన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2022–23లో 1.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గుతుందని డెలాయిట్ ఇండియా తెలిపింది. అలాగే విదేశీ మారకం నిల్వలు 568 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇవి 10 నెలల దిగుమతి అవసరాలకు సమానమని పేర్కొంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయిలో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధి కంటే ఎగువన ఉన్నట్టు వివరించింది. కానీ, దశాబ్ద కాలం క్రితం నాటి ద్రవ్యోల్బణంతో పోలిస్తే చాలా తక్కువలోనే ఉన్నట్టు గుర్తు చేసింది. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన తొలి ముందస్తు జాతీయ ఆదాయం గణాంకాల ప్రకారం చూసినా.. దేశ జీడీపీ 2023–24లో 7.3 శాతం వృద్ధిని నమోదు చేయనుంది. 2022–23 సంవత్సరంలో ఉన్న 7.2 శాతం కంటే స్వల్ప వృద్ధి కావడం గమనార్హం. మైనింగ్, క్వారీయింగ్, తయారీ, సేవలకు సంబంధించి కొన్ని రంగాల బలమైన పనితీరు ఇందుకు దోహదం చేయనుందని జాతీయ గణాంక కార్యాలయం అంచనాగా ఉంది. 2024–25లో 6.4 శాతం.. ‘‘ఆర్థిక మూలాలు మెరుగుపడుతుండడం మా అంచనాలకు మద్దతుగా నిలిచింది. మా ప్రాథమిక అంచనాల ప్రకారం 2023–24లో భారత్ 6.9–7.2 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది 6.4 శాతం, 6.7 శాతంగా ఉండొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక చిత్రం మోస్తరుగానే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుంది. అయినప్పటికీ, మిగిలిన ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అనిశ్చితులను మెరుగ్గా అధిగమించగలదు’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి ముజుందార్ తెలిపారు. ద్రవ్యోల్బణం తిరిగి 5.4 శాతానికి ఇటీవల పెరగడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ద్రవ్యోల్బణం 2023–24 ద్వితీయ ఆరు నెలల్లోనూ కొనసాగుతుందని అంచనా వేస్తున్నామని.. అధిక ఆహార ధరలు, అస్థిరతలతో కూడిన చమురు ధరలు ఆ తర్వాతి కాలంలో స్థిరపడతాయని వెల్లడించారు. గడిచిన పదేళ్ల కాలంలో భారత్ సాధించిన వృద్ధి ప్రయాణాన్ని డెలాయిట్ ప్రస్తావించింది. ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడంతోపాటు, విలువ ఆధారిత ఉత్పత్తుల వైపు మళ్లినట్టు తెలిపింది. ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటా పెరిగినట్టు వెల్లడించింది. ఎగుమతుల్లో పోటీతత్వాన్ని కూడా పెంచుకున్నట్టు పేర్కొంది. అయితే మరింత పోటీతత్వాన్ని అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడింది. -
ఆర్బీఐ అండతో మళ్లీ రికార్డుల మోత
ముంబై: ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి మెప్పించడంతో స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 –24) వృద్ధి రేటు అంచనాలు పెంచడం, వరుసగా అయిదోసారి కీలక వడ్డీ రేట్ల జోలికెళ్లకపోవడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా వడ్డీ రేట్ల ఆధారిత బ్యాంకులు, ఫైనాన్స్ సరీ్వసులు, రియల్టీ షేర్లకు భారీ డిమాండ్ లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపులోనూ కొత్త రికార్డులు నమోదు నమోదు చేశాయి. సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826 వద్ద వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు పెరిగి 20,969 వద్ద స్థిరపడ్డాయి. ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమీక్షా సమావేశ నిర్ణయాలు వెల్లడి(ఉదయం 10 గంటలు) తర్వాత కొనుగోళ్లు మరింత పెరిగాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 372 పాయింట్లు బలపడి 69,894 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి తొలిసారి 21 వేల స్థాయిపై 21,006 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ► బ్లాక్ డీల్ ద్వారా 75.81 కోట్ల షేర్లు చేతులు మారినట్లు డేటా వెల్లడి కావడంతో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ షేరు 12% లాభపడి రూ.69 వద్ద ముగిసింది. -
2023లో వృద్ధి 6.7 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: 2023లో భారత్ 6.7 శాతం వృద్ధి రేటును సాధిస్తుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన గ్లోబల్ మాక్రో ఎకనామిక్ అవుట్లుక్ 2024–25లో పేర్కొంది. దేశీయ డిమాండ్ పటిష్టత దీనికి ప్రధాన కారణమని తెలిపింది. 2024లో 6.1 శాతం, 2026లో 6.3 శాతం భారత్ పురోగమిస్తున్న అభిప్రాయాన్ని మూడీస్ వ్యక్తం చేసింది. కాగా, జీ–20 ఎమర్జింగ్ మార్కెట్ల వృద్ధి 2023లో 4.4 శాతం, 2024లో 3.7 శాతం, 2025లో 3.8 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనావేసింది. అధిక వడ్డీరేట్ల కారణంగా 2024లో ప్రపంచ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ అనిశ్చితి ప్రభావం భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించింది. కాగా, ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ వృద్ధి రేటును మూడీస్ 6.1 శాతంగా అంచనావేస్తున్న సంగతి తెలిసిందే. పటిష్టంగా ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు, పెరుగుతున్న ఆటో విక్రయాలు, వినియోగదారుల ఆశావాదం, రెండంకెల క్రెడిట్ వృద్ధి ఎకానమీకి సానుకూల అంశాలుగా పేర్కొంది. -
2023–2027 మధ్య భారత్ వృద్ధి జూమ్
న్యూఢిల్లీ: భారత్ మధ్య కాలిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 5.5 శాతం నుంచి 6.2 శాతానికి చేరింది. 2023 నుండి 2027 వరకు మధ్యకాలంగా ఫిచ్ నిర్వచించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం, పని చేసే వయస్సులో ఉన్న జనాభా అంచనాలో స్వల్ప పెరుగుదల తమ తాజా అప్గ్రేడ్కు కారణమని పేర్కొంది. ఫిచ్ తాజా అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► కరోనా కాలంలో భారత్లో భారీగా పడిపోయిన ఉపాధి అవకాశాలు దేశంలో వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపింది. మహమ్మారి నాటి కాలంలో పోల్చితే కారి్మక సరఫరా వృద్ధి రేటు పెరిగినప్పటికీ, 2019 స్థాయి నాటికన్నా తక్కువగానే ఉంది. 2000 సంవత్సరం ప్రారంభంలో నమోదయిన స్థాయిలకంటే కూడా తక్కువే. ముఖ్యంగా మహిళల్లో ఉపాధి అవకాశాల రేటురేటు చాలా తక్కువగా ఉంది. ► భారత్లో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేíÙయా, పోలాండ్, టర్కీ వృద్ధి రేట్ల అంచనా పెరిగింది.అయితే భారత్ కన్నా తక్కువగా 0.2 శాతం మాత్రమే బ్రెజిల్ టర్కీ, ఇండోనేషియా వృద్ధి రేటు అంచనాలకు ఎగశాయి. ► 10 వర్థమాన ఆర్థిక వ్యవస్థల మధ్యకాలిక వృద్ధిని 4 శాతంగా అంచనా వేసింది. ఇది మునుపటి అంచనా కంటే 30 బేసిస్ పాయింట్లు (ఇంతక్రితం అంచనా 4.3 శాతం) తక్కువ. చైనా వృద్ధి అంచనాలో 0.7 శాతం పాయింట్ల కోత వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది. దీనితో చైనా ఎకానమీ సగటు వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. ఇటీవలి సంవత్సరాలలో చైనా వృద్ధి బాగా మందగించింది. రియల్టీ రంగంలో క్షీణత మొత్తం పెట్టుబడుల అవుట్లుక్కు దెబ్బతీసింది. ► రష్యా వృద్ధి రేటును ఈ కాలంలో చైనా 80 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఆ దేశం వృద్ధి రేటు మధ్య కాలికంగా 80 బేసిస్ పాయింట్లుగానే (ఒక శాతం కన్నా తక్కువ) ఉంటుంది. 2023–24లో 6.3 శాతం కాగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతమన్న తన అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ పునరుద్ఘాటించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు వృద్ధి స్పీడ్కు బ్రేకులు వేస్తాయని ఫిచ్ అభిప్రాయపడింది. 2024–25లో వృద్ధి రేటు 6.5 శాతమని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ఎల్నినో ప్రభావంతో ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
మౌలిక రంగం భేష్
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించింది. మౌలిక రంగం సమీక్షా నెల్లో 12.1 శాతం వృద్ధిని (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 14 నెలల్లో (2022 జూన్లో వృద్ధి రేటు 13.2 శాతం) ఈ స్థాయి భారీ వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. సిమెంట్ (18.9 శాతం), బొగ్గు (17.9 శాతం), విద్యుత్ (14.9 శాతం), స్టీల్ (10.9 శాతం), సహజ వాయువు (10 శాతం) రంగాలు రెండంకెల్లో వృద్ధి సాధించగా, రిఫైనరీ ప్రొడక్టులు 9.5 (శాతం), క్రూడ్ ఆయిల్ (2.1 శాతం), ఎరువుల (1.8 శాతం) రంగాల్లో వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్ నుంచి ఆగస్టు ఎనిమిది రంగాల వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. మ్తొతం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. -
వృద్ధి 6.5 శాతం: అరవింద్ విర్మాణి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి వ్యక్తం చేశారు. క్రూడ్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లోనూ ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటకు ఢోకా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక వృద్ధిని అతిగా అంచనా వేస్తోందని అమెరికాకు చెందిన కొంతమంది ఆర్థికవేత్తల వాదనపై ఆయన మాట్లాడుతూ, కొంతమంది మాజీ అధికారులకు భారత్ జీడీపీ మదింపుపై ఎటువంటి అవగాహనా లేదని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల సమస్య మళ్లీ తెరపైకి వచి్చందని, వాతావరణ మార్పుల కారణంగా అనిశ్చితి పెరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారు రుణం వేగంగా పెరుగుతున్నందున నికర హౌస్హోల్డ్ పొదుపు నిష్పత్తి (జీడీపీలో) తగ్గుతోందని, అయితే స్థూలంగా చూస్తే, నిలకడగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక హౌస్హౌల్డ్ సెక్టార్ రుణం కూడా జీడీపీ నిష్పత్తిలో చూస్తే, తీవ్ర స్థాయిలో లేని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ధరలే దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమని వివరించారు. -
5.5 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్ ఇయర్ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్లుక్ (ఆగస్టు అప్డేట్)లో తెలిపింది. కాగా 2023 హై బేస్ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో ఎల్నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జీ20 వృద్ధి తీరు ఇది... జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్కు మూడీస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం. -
పరిశ్రమలకు వరాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని, అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న గొప్ప విజన్ ఉండటమే కాకుండా దాన్ని అక్షరాల చేతల్లో చూపించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన రూపొందించిన పారిశ్రామిక విధానాలు పరిశ్రమలకు వరాలే అయ్యాయి. అందుకే ఉమ్మడి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో పెట్టుబడులు ఏటా సగటున 54 శాతం వృద్ధి చెందాయి. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 7వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ స్థాయి వృద్థి రేటును అంతకుముందు సీఎంలు, వైఎస్ తర్వాత సీఎంలు ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఆయన మరణించి పదేళ్లు అయినా వైఎస్సార్ హయాం పారిశ్రామిక రంగానికి స్వర్ణయుగం. అందుకే ఇప్పటికీ పారిశ్రామికవేత్తలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ సీఎం కాకముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ముఖ్యమంత్రులందరూ అభివృద్ధినంతా హైదరాబాద్కే పరిమితం చేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధిని తన దార్శినికతతో అన్ని ప్రాంతాలకు విస్తరించారు. వైఎస్సార్ అభివృద్ధి చేసిన శ్రీ సిటీ, అపాచీ, బ్రాండిక్స్, రాంకీ ఫార్మా వంటి భారీ ప్రత్యేక ఆర్థిక మండళ్లకు తోడు విశాఖ, విజయవాడ, కాకినాడల్లో ఏర్పాటు చేసిన ఐటీ సెజ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిపోర్టు, పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు , టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే నెలకొల్పారు. ఇవే కాకుండా వాడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బ్రాహ్మణీ స్టీల్స్ వంటి అనేక కలల ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి రూ. 11,659 కోట్ల విలువైన పెట్టుబడులు మాత్రమే అమల్లోకి వస్తే.. వైఎస్సార్ ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ. 43,117 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. వైఎస్సార్ హయాంలో ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ బాటనే అనుసరిస్తున్నారు. అభివృద్ధి కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మూడు రాజధానులతో పాటు పారిశ్రామికంగా అదే బాటను అనుసరిస్తున్నారు. -
వృద్ధి వేగంలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2023–24, ఏప్రిల్–జూన్) 7.8 శాతంగా నమోదయ్యింది. వ్యవసాయం, ఫైనాన్షియల్ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. జూన్ త్రైమాసికంలో ప్రపంచంలో మరే దేశమూ ఈ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోలేదు. దీనితో వృద్ధి వేగంలో భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లయ్యింది. 6.3 శాతం వృద్ధి రేటుతో భారత్ తర్వాత చైనా వృద్ధి వేగంలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే క్యూ1లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తాజా లెక్క తక్కువగా ఉండడం గమనార్హం. ఈ నెల రెండవ వారంలో జరిగిన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా అంచనా వేసింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనాకు వచి్చంది. 7.8 శాతం వృద్ధి అంటే... 2011–12ని బేస్ ఇయర్గా తీసుకుని ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ లెక్కిస్తే, 2022–23 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.37.44 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.37 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతం పెరిగిందన్నమాట. కాగా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని (ప్రస్తుత ధరల ప్రాతిపదిక) జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. విలువల్లో రూ.65.42 లక్షల కోట్ల నుంచి రూ.70.67 లక్షల కోట్లకు పెరిగింది. ► 2022–23 క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 13.1 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్ ఎఫెక్ట్ ఒక కారణం. అంటే కరోనా కష్టకాలం 2021–22 ఇదే కాలంలో చేటుచేసుకున్న అతి తక్కువ గణాంకాలు 2022–23 క్యూ1లో అధిక రేటు (శాతాల్లో) నమోదుకు దోహదపడ్డాయి. ► తాజా గణాంకాలకు ముందు త్రైమాసికం అంటే జనవరి–మార్చి మధ్య జీడీపీ విలువ 6.1% కాగా, అంతక్రితం త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్)ఈ రేటు 4.5%. అంటే సమీక్షా కాలంసహా అంతక్రితం గత 3 త్రైమాసికాల్లో వృద్ధి రేటు పెరుగుతూ వచి్చందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– స్థూల విలువ జోడింపు అనేది ఆర్థిక వ్యవస్థలోని పరిశ్రమ, రంగం, తయారీదారు, ప్రాంతం లేదా ప్రాంతం ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఉత్పత్తి వ్యయాలను ఇందులో చేర్చరు) ప్రకారం వివిధ రంగాల వృద్ధి తీరును పరిశీలిస్తే.. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5% వృద్ధి సాధించే సత్తా భారత్కు ఉంది. ధరల కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల ద్రవ్యోల్బణం భయాలు అక్కర్లేదు. – వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్గార్ మేళాలో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్టాప్లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు. -
ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు
ముంబై: ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ జోరుగా సాగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8–10 శాతం అధిక అమ్మకాలు ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ రంగంపై క్రిసిల్ ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. గృహ రుణాలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ, ఇళ్ల ధరలు పెరిగినా కానీ అమ్మకాల్లో వృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది. మధ్యస్థాయి, ప్రీమి యం విభాగాలు, విలాసవంత ఇళ్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోందని, వీటి కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇళ్ల అమ్మకాలు బలంగా నమోదైనట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనికితోడు వసూళ్లు బలంగా ఉండడం, రుణ భారం తక్కువగా ఉండడంతో డెవలపర్ల రుణ పరపతి మెరుగుపడినట్టు పేర్కొంది. 11 పెద్ద లిస్టెడ్ సంస్థలు, 76 చిన్న, మధ్య స్థాయి నివాస గృహాల డెవలపర్ల గణాంకాల ఆధారంగా క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదిక రూపొందించింది. ‘‘నివాస రియల్ ఎస్టేట్ విభాగంలో డిమాండ్ పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి ఆరోగ్యంగా ఉండడంతోపాటు కార్యాలయాలు ఇప్పటికీ హైబ్రిడ్ నమూనాలో పనిచేస్తున్నాయి. దీంతో ప్రీమియం, పెద్ద ఇళ్ల కు ఇస్తున్న ప్రాముఖ్యం డిమాండ్కు మద్దతిస్తోంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) పెద్ద సంస్థల మార్కెట్ బలోపేతం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11 ప్రముఖ రియల్ ఎస్టేట్ (లిస్టెడ్) కంపెనీలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విక్రయాల్లో విలువ పరంగా 50 శాతం, స్థల విస్తీర్ణం పరంగా 20 శాతం వృద్ధిని చూపించినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. పెద్ద సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, 2020 నాటికి 16–17 శాతంగా ఉన్న వీటి వాటా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. పేరున్న సంస్థలు అయితే బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా రావడంతోపాటు, విశ్వసనీయ బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం వాటి మార్కెట్ వాటాను పెంచుతుందని తెలిపింది. హైదరాబాద్తోపాటు కోల్కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గణాంకాలను క్రిసిల్ తీసుకుంది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపరీ్టస్, కోల్టే పాటిల్ డెవలపర్స్, మాక్రోటెక్ డెవలపర్స్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్, ఒబెరాయ్ రియలీ్ట, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పురవంకర, శోభ, సన్టెక్ రియాలిటీ సంస్థలను పెద్ద సంస్థలుగా పేర్కొంది. (రిలయన్స్ గ్రూప్లో కీలక పరిణామం: ప్రెసిడెంట్గా పారుల్ శర్మ) -
మే నెలలో నియామకాలు ఓకే
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) మే నెలలో 2,849గా ఉన్నాయి. 2023 ఏప్రిల్ నెల నియామకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, 2022 మే నెలలో నియామకాలు 2,863తో పోల్చినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్గా నియామకాలు ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో నియామకాల ధోరణలు భిన్నంగా ఉన్నట్టు పేర్కొంది. ఆయిల్ అండ్ గ్యాస్తోపాటు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఈ ఏడాది మే నెలలో నియామకాల్లో వృద్ధిని ముందుండి నడిపించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఏకంగా 31 శాతం పెరిగాయి. అదే ఐటీ రంగంలో నియామకాలు 2022 మే నెలతో పోల్చినప్పుడు 23 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యం పెరగడం, రిఫైనరీల విస్తరతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అధిక నియామకాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలల్లో ఈ రంగంలో నియామకాల్లో వృద్ధి 10–20 శాతం మించకపోవడం గమనార్హం. ► రియల్ ఎస్టేట్లో 22 శాతం, బ్యాంకింగ్లో 14 శాతం అధికంగా నియామకాలు నమోదయ్యాయి. రియల్టీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్, సైట్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు.. బ్యాంకింగ్లో రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్లకు డిమాండ్ నెలకొంది. ► ప్రొడక్షన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్వాలిటీ ఆడిటర్లకు డిమాండ్ ఏర్పడింది. ► హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ► నియామకాలకు నాన్ మెట్రోలు కొత్త కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. అహ్మదాబాద్లో 26 శాతం, వదోదరలో 22 శాతం, జైపూర్లో 17 శాతం చొప్పున అధిక నియామకాలు (క్రితం ఏడాది మే నెలతో పోల్చినప్పుడు) జరిగాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు వృద్ధికి మద్దతుగా నిలిచాయి. ► పెద్ద మెట్రోల్లో నియామకాల పరంగా ఫ్లాట్ లేదా క్షీణత నమోదైంది. పెద్ద మెట్రోల్లో ముంబై, ఢిల్లీలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది. రియల్ ఎస్టేట్, టెలికం, హెల్త్కేర్, ఆటోమొబైల్ ఇక్కడ వృద్దికి దోహదపడ్డాయి. ► సీనియర్లకు అధిక డిమాండ్ నెలకొంది. 13–16 ఏళ్లు, అంతకుమించి సర్వీసు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ► ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సీనియర్లకు నియామకాల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఇన్సూరెన్స్, హెల్త్కేర్ ఫ్రెషర్లకు అవకాశాలు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్లకు నియామకాల్లో 7 శాతం క్షీణత నమోదైంది. -
ఈ ఏడాది వృద్ధి 6 శాతానికిపైనే
భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి 7.2 శాతం వృద్ధి రేటును సాధించడం, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం,అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాల నేపథ్యంలో ఎకానమీపై తాజా అంచనాలను పరిశీలిస్తే.. 2023–24లో వృద్ధి అంచనాలు అప్ అంతర్జాతీయ వృద్ధి అవుట్లుక్ బాగుంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖంగా పయనిస్తున్నాయి. సేవల ఎగుమతులు మెరుగుపడుతున్నాయి. 2022–23 క్యూ4లో భారత్ వృద్ధి అంచనాలకు మించి మెరుగ్గా 6.1 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో భారత్ ఎకానమీ ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నాం. వెరసి 2023–24లో వృద్ధి 6.2 శాతంగా ఉండవచ్చు. ఇక భారత్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే 2023–24లో క్రితం అంచనాలు 5.3 శాతంకన్నా తక్కువగా 5.1 శాతంగా సగటు నమోదుకావచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలను ఇప్పటికే 50 బేసిస్ పాయింట్లు పెంచి 2.6 శాతానికి పెంచడం జరిగింది. చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా నుంచి వెలువడుతున్న గణాంకాల సానుకూలత దీనికి కారణం. క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో ఉన్న అనిశ్చితి పరిస్థితి ఇప్పుడు కనిపించడంలేదు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. – యూబీఎస్, స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఈ సారీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో జూన్ 8వ తేదీ సమీక్షా సమావేశంలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటులో ఎటువంటి మార్పూ చేయకపోవచ్చు. మార్చిలో 5.7 శాతం వద్ద ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 18 నెలల కనిష్ట స్థాయి 4.7 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. 2023లో సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 5.3 శాతంగా నమోదుకావచ్చు. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం కన్నా ఇది తక్కువ. ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో మే 2022 నుంచి ఆరు దఫాలుగా రెపో రేటును ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ పెంచుతూ వచ్చింది. ఈ కాలంలో రేటు 4 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్ పాలసీ సమీక్షా సమావేశంలో అందరి అంచనాలకూ భిన్నంగా రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయించింది. అయితే భవిష్యత్ నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడిపై ఆధారపడి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. – గోల్డ్మన్ శాక్స్, వాల్స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ 2023–24లో 6.7% వరకూ.. దేశీయంగా పటిష్టంగా ఉన్న ఆర్థిక ఫండమెంటల్స్, ప్రభుత్వం భారీ మూలధన పెట్టుబడుల మద్దతుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6.5–6.7 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. 2022–31 దశాబ్ద కాలంలో భారత్ సగటున అంతక్రితం దశాబ్దంతో పోల్చితే (6.6 శాతం) భారీగా 7.8 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణాత్మక చర్యలు భారత్ను చక్కటి వృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగుతుందని మేము విశ్వసిస్తున్నాం. భారతదేశం జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టిన దృష్ట్యా, ఈ సంవత్సరం దేశానికి చాలా ముఖ్యమైనది. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దీని నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలు మనకు ముఖ్యమైనవి. ద్రవ్యోల్బణం పూర్తి కట్టడిలో ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. భారత్ వృద్ధికి దోహదపడే అంశం ఇది. – ఆర్ దినేష్, కొత్తగా ఎన్నికైన సీఐఐ ప్రెసిడెంట్ -
భారత్ జీడీపీ జూమ్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 6.1 శాతంగా నమోదయ్యింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ఫిబ్రవరిలో విడుదల చేసిన రెండవ అడ్వాన్స్ అంచనాలు 7 శాతం కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగాలు చక్కటి పనితీరును ప్రదర్శించినట్టు బుధవారం విడుదలైన గణాంకాలు వెల్లడించాయి. చైనా వృద్ధి రేటు చివరి త్రైమాసికంలో 4.5 శాతంగా నమోదయ్యింది. దీనితోపాటు ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను పోల్చితే భారత్ ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. తాజా గణాంకాలతో గణనీయమైన పురోగతితో వార్షికంగా 3.3 ట్రిలియన్ డాలర్లకు ఎగసిన ఎకానమీ విలువ వచ్చే కొద్ది సంవత్సరాల్లో 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జీడీపీ లెక్కలు ఇలా.. 2011–12 స్థిర ధరల వద్ద (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసి) 2021–22 జనవరి–మార్చి త్రైమాసికంలో జీడీపీ విలువ రూ.41.12 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో (2022–23 జనవరి–మార్చి) ఈ విలువ రూ.43.62 లక్షల కోట్లు. వెరసి నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.1 శాతమన్నమాట. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరంలో చూస్తే... ఈ విలువలు 2021–22తో పోల్చిచూస్తే 2022–23లో రూ.149.26 లక్షల కోట్ల నుంచి రూ.160.06 లక్షల కోట్లకు పెరిగాయి. వెరసి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. 2021–22లో వృద్ధి రేటు 9.1 శాతం అయినప్పటికీ, బేస్ తక్కువగా ఉండడం (2020–21లో కరోనా కష్టకాలంలో వృద్ధిరేటు భారీగా పడిపోవడం) దీనికి ప్రధాన కారణం. అయితే 2021–22 చివరి త్రైమాసికం 4 శాతంతో పోల్చితే తాజా లెక్కలు మెరుగ్గా ఉండడం గమనార్హం. జీవీఏ లెక్క ఇదీ... కేవలం వివిధ రంగాల ఉత్పత్తి విలువకు సంబంధించిన– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి రేటు 2022–23లో 7%గా ఉంది. 2021–22లో రేటు 8.8 శాతం. జీవీఏ ప్రకారం మార్చి త్రైమాసికం వృద్ధి రేటు పరిశీలిస్తే... ► తయారీ రంగం పురోగతి 2021–22 మార్చి త్రైమాసికంలో 0.6% ఉంటే, 2022–23 మార్చి త్రైమాసికంలో 4.5%గా నమోదయ్యింది. ► మైనింగ్ ఉత్పత్తి వృద్ధి ఇదే కాలంలో 2.3 శాతం నుంచి 4.3 శాతానికి ఎగసింది. ► నిర్మాణ రంగం విషయంలో భారీగా 4.9 శాతం నుంచి 10.4 శాతానికి చేరింది. ► వ్యవసాయ రంగం పురోగతి 4.1 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది. 2022–23 వృద్ధి (%) క్యూ1 13.1 క్యూ2 6.2 క్యూ3 4.5 క్యూ4 6.1 సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది ప్రపంచ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్ 7.2 శాతం వార్షిక వృద్ధిని నమోదుచేసుకోవడం హర్షణీయ పరిణామం. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని, సూచీల దృఢమైన పనితీరును, ఆశాజనక పరిస్థితిని గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. – ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలకు మించి.. తాజా ఆర్థిక పురోగతిని పరిశీలిస్తే, ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీ తొలి 6.5% అంచనాలను మించి వృద్ధి సాధించే అవకాశా లు కనిపిస్తున్నాయి. వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనాలను మించి 2022–23 ఎకానమీ గణాంకాలు నమోదుకావడం భారత్ సవాళ్లను ఎదుర్కొనగలిగిన పరిస్థితికి అద్దం పడుతోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ -
ఎల్ఐసీ ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 17 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. 2021–22 సంవత్సరానికి ప్రీమియం ఆదాయం రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం వసూలు పరంగా చూస్తే జీవిత బీమా మార్కెట్లో 2023 మార్చి నాటికి 62.58 మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. లిస్టెడ్ జీవిత బీమా కంపెనీల్లో ప్రీమియం వృద్ధి పరంగా ఎల్ఐసీ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 18.83 శాతం మేర ప్రీమియం ఆదాయంలో వృద్ధిని చూపించి మొదటి స్థానంలో ఉంటే, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 16.22 శాతం పెరిగి మూడో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం ఆదాయం 12.55 శాతం మేర పెరిగింది. ఎల్ఐసీకి సంబంధించి ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల ప్రీమియం ఆదాయం 3.30 శాతం పెరగ్గా, ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 10 శాతం, గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం 21.76 శాతం, చొప్పున పెరిగాయి. -
భారత్ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్) సమావేశాలకు ముందు వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా) హన్స్ టిమ్మర్ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ♦ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్గ్రేడ్కు ప్రధాన కారణం. ♦ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే. ♦ భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 20 శాతం కంటే తక్కువకు పడిపోయింది. అసంఘటిత రంగం ఉత్పాదకత పెరుగుతోందన్న దాఖలాలు లేవు. అలాగని ఫలితాలూ మరీ అధ్వానంగానూ లేవు. ఆయా అంశాలను పరిశీలిస్తే అన్ని వర్గాల భాగస్వామ్యంతో వృద్ధిని మరింత పెంచడానికి భారత్ ముందు భారీ నిర్మాణాత్మక ఎజెండా ఉందని భావిస్తున్నాం. ♦ విదేశాల నుండి ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాలి. ముఖ్యంగా సేవల రంగాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఇందుకుగాను సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఉద్గారాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. దక్షిణాసియా దేశాలపై ఇలా.. స్వల్పకాలికంగా చూస్తే, భారత్ దక్షిణాసియాలో ఇతర దేశాలకంటే పటిష్ట ఎకానమీని కలిగి ఉంది. భూటాన్ మినహా ఈ ప్రాంతంలోని అన్ని దేశాలు తమ వృద్ధి అంచనాలను కుదించుకుంటున్నాయి. గత ఏడాది విపత్తు వరదల ప్రభావంతో పాకిస్తాన్ ఇంకా సతమతమవుతూనే ఉంది. సరఫరాల వ్యవస్థకు తీవ్ర అంతరాయాలు ఎదురవుతున్నాయి. పెట్టుబడిదారుల విశ్వాసం దిగజారుతోంది. అధిక రుణ, మూలధన వ్యయాలు భారమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ వృద్ధి ఈ ఏడాది 0.4 శాతానికి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక రుణ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఎకానమీలో వృద్ధి లేకపోగా, ఇది ఈ ఏడాది 4.3% క్షీణిస్తుందన్నది అంచనా. పర్యాటకం ఊపందుకోవడం మాల్దీవులు, నేపాల్కు సానుకూల అంశాలైనా, అంతకుమించి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావాలు ఈ దేశాలు ఎదుర్కొననున్నాయి. దక్షిణాసియాలో 2023లో 8.9 శాతం ద్రవ్యోల్బణం అంచనాలు ఉన్నాయి. 2024లో ఇది 7% లోపునకు తగ్గవచ్చు. అయితే బలహీన కరెన్సీలు పెద్ద సమస్యగా ఉంది. ద్రవ్యోల్బణం భయాలను పెంచే అంశమిది. వృద్ధి 6.4 శాతం: ఏడీబీ ఇదిలాఉండగా, 2023–24లో భారత్ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అవుట్లుక్ ఒకటి పేర్కొంది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసిన ఏడీబీ, 2023–24లో ఈ రేటు తగ్గడానికి కఠిన ద్రవ్య పరిస్థితులు, చమురు ధరలు పెరగడాన్ని కారణంగా చూపింది. కాగా, 2024–25లో వృద్ధి రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఏడీబీ అంచనావేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు పెరగడం దీనికి కారణంగా చూపింది. రవాణా రంగం పురోగతికి, వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఫలితాలు ఇస్తాయని ఏడీబీ వివరించింది. అంతర్జాతీయంగా పలు దేశాలు మాంద్యం ముంగిట నుంచున్నప్పటికీ, భారత్ ఎకానమీ తన సహచర దేశాల ఎకానమీలతో పోల్చితే పటిష్టంగా ఉందని ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కినీషీ పేర్కొన్నారు. -
ఎనిమిది పరిశ్రమల గ్రూప్.. అక్కడక్కడే!
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు ఫిబ్రవరిలో దాదాపు నిశ్చలంగా 6 శాతంగా నమోదయ్యింది. 2022 ఇదే నెల్లో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.9 శాతం. 2023 జనవరిలో వృద్ధి రేటు భారీగా 8.9 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల్లో క్రూడ్ ఆయిల్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లో (బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్) ఉత్పత్తి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి మాత్రం 4.9 క్షీణించింది (2022 ఫిబ్రవరితో పోల్చి). కాగా, మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య గ్రూప్ వృద్ధి రేటు 7.8 శాతంకాగా, 2021–22 ఇదే కాలంలో ఈ రేటు 11.1 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 40.27 శాతం. ఏప్రిల్ రెండవ వారం ప్రారంభంలో ఫిబ్రవరి ఐఐపీ గణాంకాలు వెలువడతాయి. ఎకానమీ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో మౌలిక రంగం పురోగతి రానున్న కాలంలో కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. కీలక రంగాలకు ప్యాకేజీ అవసరమని కూడా సూచిస్తున్నారు. మున్ముందు ఈ రంగాల గణాంకాలపై ‘బేస్ ఎఫెక్ట్’ ప్రభావం ప్రధానంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ వృద్ధికి సంస్కరణల ఊతం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. 2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే, ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ‘దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు తిరోగమనం–పోకడలు, అంచనాలు–విధానాల’ పేరుతో విడుదలైన నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు. ► భారత్ తోటి దేశాల కంటే వేగవంతమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ, సంస్కరణ ఎజెండాను ముఖ్యంగా తయారీ, మౌలిక రంగంలో వేగవంతంగా అమలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగంలో ఒత్తిడులను తొలగించాల్సి ఉంది. ఈ విభాగంలో సవాళ్లు దేశ పురోగతికి బ్రేకులు వేస్తున్నాయి. ► 2000–10లో భారత్ పెట్టుబడుల సగటు వార్షిక వృద్ధి 10.5 శాతం అయితే, 2011–21లో ఈ రేటు 5.7 శాతానికి పడిపోయింది. ► విద్యుత్, రోడ్డు, రైలు నెట్వర్క్, వ్యాపారాలకు ఎదురవుతున్న అవరోధాలు, బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల వంటి బలహీనతలు వంటి అంశాలు భారత్ ఎకానమీకి అవరోధాలుగా ఉన్నాయి. ► కోవిడ్–19తో ఎదురవుతున్న పరిణామాలు ప్రపంచ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ► భౌగోళిక ఉద్రిక్తతలూ ప్రపంచ వృద్ధి తిరోగమనానికి దారితీస్తున్నాయి. ► పెట్టుబడుల్లో వృద్ధి క్షీణిస్తోంది. ప్రపంచ శ్రామిక శక్తి మందకొడిగా పెరుగుతోంది. కరోనావైరస్ మహమ్మారి వల్ల మానవ వనరుల నైపుణ్య కొరత ఎదురవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వృద్ధి.. జీడీపీ పురోగతికి తగిన విధంగా సరిపోవడం లేదు. -
రాష్ట్రంలో అత్యధిక వృద్ధి రేటు
సాక్షి, అమరావతి : గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు. 2021–22లో ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 18.47 శాతం మేర వృద్ధి సాధించినట్లు కాగ్ వెల్లడించింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా తెలిపింది. 2020–21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు తగ్గడానికి కోవిడ్ మహమ్మారివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే ప్రధాన కారణమని పేర్కొంది. అయితే, దేశ జీడీపీతో పోలిస్తే ఆ ఏడాది రాష్ట్రంలో జీఎస్డీపీ 5 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించింది. అలాగే, ఆ ఏడాది దేశ జీడీపీ వృద్ధి రేటు 1.36 శాతం క్షీణించిందని కాగ్ తెలిపింది. ఈ రంగాల్లో అత్యధిక వృద్ధి.. ఇక 2021–22 విషయానికొస్తే.. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగంలో అత్యధిక వృద్ధి నమోదైనట్లు కాగ్ పేర్కొంది. ♦ అంతకుముందు ఏడాదితో పోలిస్తే అత్యధికంగా పారిశ్రామిక రంగంలో 25.58 శాతం వృద్ధిని సాధించినట్లు కాగ్ తెలిపింది. అలాగే.. ♦ కోవిడ్ తర్వాత నిర్మాణ రంగం, తయారీ రంగం కోలుకున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగం 27%, తయారీ రంగం 25 శాతం పెరిగింది. ♦ వ్యవసాయ రంగంలో ప్రధానంగా చేపలు, ఆక్వాకల్చర్, పంటలు, పశు సంపద కార్యకలాపాలు పెరగడంతో వ్యవసాయ రంగం వృద్ధి సాధించింది. ♦ చేపల పెంపకం, ఆక్వాకల్చర్ 26%, పంటలు, పశుసంపదలో 11 శాతం పెరుగుదల ఉంది. ♦ ప్రధానంగా వాణిజ్యం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 23 శాతం, రవాణా, నిల్వల, ప్రసార, సమాచార సేవలు 21 శాతం, స్థిరాస్తి రంగం 15 శాతం పెరగడంతో సేవలం రంగంలో భారీ వృద్ధి నమోదైంది. -
భారత్ ఎకానమీపై భరోసా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7 శాతంగా నమోదవుతుందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) జనవరిలో 25 నెలల కనిష్ట స్థాయి తరహాలోనే రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతా తగ్గుతుందని అంచనావేసింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు కట్టడిలో ఉండడం ఈ అంచనాలకు కారణమని తెలిపింది. ప్రస్తుత, రానున్న ఆర్థిక సంవత్సరాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6% దిగువ కు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనావేస్తున్నాట్లు పేర్కొంది. ఈ మేరకు విడుదలైన నెల వారీ ఆర్థిక సమీక్షలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► అధిక సేవల ఎగుమతుల నుంచి పొందుతున్న లాభాలు, చమురు ధరలు అదుపులో ఉండడం, దిగుమతి ఆధారిత వినియోగ డిమాండ్లో ఇటీవలి తగ్గుదల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందని భావించడం జరుగుతోంది. ఈ పరిస్థితి రూపాయి అనిశ్చితి పరిస్థితి కట్టడికి దోహదపడుతుంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాడ్ కట్టడిలో ఉండడం భారత్కు కలిసి వచ్చే అవకాశం. ఈ పరిస్థితుల్లో ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ పరిణామాలు భారత్పై తీవ్ర ప్రభావం చూపబోవు. ► భారత్ సేవల రంగం ఎగుమతుల విషయంలో పురోగతి దేశానికి ఉన్న మరో బలం. కరోనా సవాళ్లు తొలగిన నేపథ్యంలో ఐటీ, నాన్–ఐటీ సేవల విషయంలో అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా పెరుగుతోంది. అంతర్జాతీయ కమోడిటీ ధరల తగ్గుదల నేపథ్యంలో దిగుమతుల బిల్లు కూడా దేశానికి కలిసి వస్తోంది. ► తైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో ఎకానమీ స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేయడం జరుగుతోంది. జనవరి, ఫిబ్రవరి హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా యి. 2023లో వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ తరహా భారీ వసూళ్లు వరుసగా 12వ నెల. ► భారతదేశ కార్పొరేట్ రంగం రుణ–జీడీపీ నిష్ప త్తి చారిత్రక రేటు కంటే తక్కువగా ఉంది. ఇది కార్పొరేట్ రంగానికి మరింత రుణం తీసుకోవడానికి తగిన వెసులుబాటును కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని కొనసాగించడంలో కార్పొరేట్ల రుణ ప్రొఫైల్ కీలక పాత్ర పోషిస్తుంది. -
జోరుగా పేటీఎం లావాదేవీలు.. 8.9 కోట్లకు చేరిన యూజర్ల సంఖ్య!
న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తన వృద్ధిని జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ కొనసాగించింది. ఈ రెండు నెలల్లో నెలవారీ లావాదేవీలు నిర్వహించిన సగటు యూజర్ల సంఖ్య 8.9 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా మర్చంట్ల వద్ద పేటీఎం సౌండ్బాక్స్ డివైజ్ల సంఖ్య 64 లక్షలకు చేరుకుంది. వీరు నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించే చందాదారులు. ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేసిన డివైజ్ల సంఖ్య 3 లక్షలుగా నమోదైంది. వర్తకుల వద్ద చెల్లింపుల లావాదేవీలు కూడా పెరిగాయి. స్థూల మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ) జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి రూ.2.34 లక్షల కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే 41 శాతం వృద్ధి కనిపించింది. రుణ వితరణ వ్యాపారం కూడా తన జోరును కొనసాగించింది. తన ప్లాట్ఫామ్తో ఒప్పందం చేసుకున్న రుణదాతల ద్వారా రెండు నెలల్లో రూ.8,086 కోట్లను మంజూరు చేసింది. వార్షికంగా ఇది 286 శాతం వృద్ధి కావడం గమనించొచ్చు. రెండు నెలల్లో జారీ చేసిన రుణాల సంఖ్య 79 లక్షలుగా ఉంది. చదవండి👉 పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
ఏడు శాతం కంటే తక్కువే.. మరింత తగ్గే అవకాశం
ముంబై: జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా అంచనా 7 శాతం కంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వృద్ధి రేటు మరింత తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ తన తాజా అంచనాల్లో పేర్కొంది. చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) వృద్ధి రేటు దాదాపు 4 శాతంగా ఉంటుందని కూడా పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13.2 శాతంగా నమోదుకాగా, రెండవ త్రైమాసికంలో 6.3 శాతంగా ఉంది. మూడవ తైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ఈ రేటు అంచనాలకన్నా తగ్గి 4.4 శాతంగా నమోదయ్యింది. అయితే మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం నమోదవుతుందని రెండవ ముందస్తు అంచనాల్లో ఎన్ఎస్ఓ పేర్కొంది. ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావాలంటే నాల్గవ త్రైమాసికంలో కనీసం 4.1 శాతం వృద్ధి రేటు నమోదుకావాల్సి ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2022–23లో వృద్ధి రేటు 6.8 శాతంగానే అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్ విశ్లేషకులు పరాస్ జస్రాయ్ చేసిన విశ్లేషణల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► వృద్ధి పురోగతికి పలు అవరోధాలు ఉన్నాయి. డిమాండ్ ఊపందుకోవడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎగుమతుల్లో పురోగతి లేదు. రుణ వృద్ధి కఠిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ► ఇక ఉత్తరాదిలో వేసవి ఫిబ్రవరిలోనే తీవ్రంగా ఉంది. ఇది గోధుమ ఉత్పత్తిపై ఆందోళనలను సృష్టిస్తోంది. మార్చి– మే మధ్య వేసవి తీవ్రత మరింత ఉండే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం కూడా ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ► నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు కనీసం 4.3 శాతం నమోదవుతుందన్న అంచనాలను వేసవి తీవ్రత విఘాతం కలిగించవచ్చు. ► ఇక ద్రవ్యోల్బణం తీవ్రత గ్రామీణ వినియోగ డిమాండ్పై ప్రభావితం చూపే వీలుంది. మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పడిపోయిన డిమాండ్ ఇంకా నత్తనడకనే సాగుతోంది. ► మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగుల్లో ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ లిక్విడిటీ తగ్గుతుండడం మరో ఆందోళకరమైన అంశం. జనవరిలో బలమైన క్రెడిట్ డిమాండ్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నాలుగు నెలల కనిష్టం 0.43 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్లో ఇది 0.53 శాతంగా ఉంది. -
విధాన లోపం వ్యవస్థకు శాపం
2023 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి రేటును మాత్రమే సాధించగలిగింది. ప్రజల కొనుగోలు శక్తి దిగజారిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ జీడీపీ పతనం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమితమైంది. ఈ దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉండడం. ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ప్రభుత్వ విధానాలు మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర కాలానికి సంబం ధించి డిసెంబర్ 2022తో ముగిసిన మూడవ త్రైమాసికానికి భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 4.4 శాతం స్థూల జాతీయ వృద్ధి (జీడీపీ) రేటును మాత్రమే సాధించగలిగింది. అంతకు ముందరి త్రైమాసిక వృద్ధి రేటు 6.3 శాతం కంటే ఇది గణనీయమైన పతనం. 2022 ఆర్థిక సంవత్సరం తాలూకూ మూడవ త్రైమాసికంలోని 5.2 శాతం కంటే కూడా ఇది తక్కువ. ఈ జీడీపీ దిగజారుడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొంటున్న అనేక సమస్యలకు ప్రతిబింబం. వృద్ధి రేటును లెక్కించేందుకు పరిగణనలోకి తీసుకునే అంశా లుగా వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ వినియోగం లేదా వ్యయాలు, పెట్టుబడులు, నికర ఎగుమతులు ఉంటాయి. వీటిలో వ్యక్తిగత విని యోగానిది అతిపెద్ద వాటా. అది దేశీయ జీడీపీలో 55 నుంచి 60 శాతం మేరకు వాటాని కలిగి ఉంటుంది. కాగా, ఇది ప్రస్తుతం అంతకు ముందరి మూడవ త్రైమాసికంలోని వృద్ధి రేటుతో పోలిస్తే కేవలం 2.1 శాతం మాత్రమే ఎదుగుదలను చూపింది. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటు పతనం వెనుక వ్యక్తిగత వినియోగ పతనం ఉందన్నది గమనించాల్సిన అంశం. ఈ వ్యక్తిగత వినియోగం తగ్గటం వెనుక అసమానతలతో కూడిన ఆర్థిక అభివృద్ధి ఉంది. దీనినే మనం ఆంగ్లాక్షరం ‘కే’ పై గీత, కింది గీతలతో పోలుస్తున్నాం. పై గీతను పోలిన ధనవంతులు మరింతగా ధనవంతులవుతుండగా, కింది గీతను పోలిన సామాన్య జనం మరింత కిందికి దిగజారుతున్నారు. ఈ అసమానతల అభివృద్ధికి వక్కాణింపుగా – ఇండియా రేటింగ్స్ సంస్థ ఆర్థిక వేత్త సునీల్ కుమార్ సిన్హా మాటలను చెప్పుకోవచ్చు: ‘ప్రస్తుత వినియోగ డిమాండ్ అనేది ప్రధానంగా ఉన్నత ఆర్థిక వర్గాలు వినియోగించే సరుకులు, సేవల నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం దేశంలోని ప్రజల వ్యక్తిగత వినియోగంలో సింహభాగం – ఉన్నత ఆదాయ వర్గాల నుంచే వస్తోంది. మరో రకంగా చెప్పాలంటే – మెజారిటీ జన సామాన్యం కొనుగోళ్లు బల హీనంగా ఉన్నాయి.›ఫలితంగా అంతిమ లెక్కింపులో దేశంలో వ్యక్తిగత వినియోగం బలహీనపడుతోంది’. కోవిడ్ మహమ్మారి కాలంలో దేశంలో ప్రజల వినియోగం భారీగా పడిపోయింది. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తొలి దశలో ఈ వ్యక్తిగత వినియోగం పెద్దగంతులో పెరిగింది. కోవిడ్, లాక్ డౌన్ల కాలంలో ప్రజలు తమకు కావాల్సిన సరుకులు లేదా సేవల కొను గోళ్లను వాయిదా వేసి ఉంచడం... కోవిడ్ బెడద తగ్గగానే ఒక్కసారిగా కొనుగోళ్లు చేయడం ఈ పెద్దగంతు వినియోగ పెరుగుదలకు కారణం. ఒక మారు ఈ తరహా కొనుగోళ్లు పూర్తయి పోగానే, మరలా వినియోగం తగ్గుముఖం పట్టసాగింది. కోవిడ్ అనంతర కాలంలో కూడా జఠిలంగానే మిగిలి పోయిన నిరుద్యోగం, పడిపోతున్న దేశీయ ఎగుమతులు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం వంటి సమస్యలన్నీ కల గలిసి ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. కోవిడ్, లాక్డౌన్లు, అనంతరం కూడా సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యారు. బంగారాన్ని తనఖా పెట్టడం భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల పొదుపు స్థాయి దారుణంగా పడి పోయింది. కొత్తగా అప్పులు చేయగల స్థితి కూడా లేకుండా పోయింది. జీడీపీ పతనం కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితం కాదు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలలో అది 1 శాతానికి లోపు పరిమి తమైంది. అంటే, భారతదేశంలో జీడీపి వృద్ధి, మిగత ప్రపంచం తాలూకూ సమస్యలతో సంబంధం లేకుండా, ప్రపంచంలోనే అత్యధి కంగా ఉంటుందనే కట్టుకథను ఇది వట్టిదిగా కొట్టేసింది. పైన పేర్కొన్న దేశాలన్నింటికీ ఉన్నటువంటి కీలక సారూప్యత – ఆయా దేశాలలో ఆర్థిక అసమానతలు అత్యంత తీవ్రస్థాయిలో ఉండడం. భారత్ సహా దరిదాపు ఈ దేశాలన్నింటిలోనూ కార్మికులు, ఉద్యోగుల వేతనాల పెరుగుదల బలహీనంగా ఉంది. ఉదాహరణకు, అంత ర్జాతీయ కార్మిక సమాఖ్య గణాంకాల ప్రకారం 2008–11 కాలంలో మన దేశంలో నిజ వేతనాల పెరుగుదల 1 శాతం ప్రతికూల దిశగా ఉన్నది. అదే కాలంలో దేశంలో కార్మిక ఉత్పాదకత 7.6 శాతం పెరిగింది. పెరిగిన సంపద తాలూకు ప్రయోజనం కార్మికులు, ఉద్యోగు లకు దక్కక పోగా, వారికి అప్పటికే ఉన్న ఆర్థిక స్థితి దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో జరుగుతోంది ఈ వేతనాల పతనమే. 2018 నాటి అంతర్జాతీయ కార్మిక సమాఖ్య తాలూకు ప్రపంచ వేతనాల నివేదిక కూడా ఈ అంశాన్నే చెబుతోంది. ఒక్క చైనా మినహా 2017లో ప్రపంచ వ్యాప్తంగా వేతనాల పెరుగుదల వార్షికంగా కేవలం 1.1 శాతం. జపాన్లో దశాబ్దాల కాలంపాటు ఉద్యోగులు, కార్మికుల వేతనాలు ఎదుగూ బొదుగూ లేకుండా స్తంభించిపోయి ఉన్నాయి. మొత్తంగా జీ 20 దేశాల్లో 2017లో నిజ వేతనాల వృద్ధి కేవలం 0.4 శాతం. చైనాలో 2015 నాటికే సరుకు ఉత్పత్తి రంగంలోని కార్మికుల 1 గంట కాలపు వేతనాలు, అప్పటికే అధిక ఆదాయ దేశాలుగా ఉన్న గ్రీస్, పోర్చుగల్తో సమానంగా ఉన్నాయి. దాని వలన అక్కడ యావన్మంది ప్రజల కొనుగోలు శక్తి తగినస్థాయిలో ఉంది. ఫలితంగానే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం తన దేశీయ ఎగుమతులు కొంత మేర తగ్గినా, స్వయంగా తన దేశంలోనే పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి ద్వారా, ఆర్థిక వృద్ధిని కొనసాగించగలిగింది. ప్రస్తుతం తన జీరో కోవిడ్ పాలసీ, నిర్మాణ రంగం పట్ల కఠిన వైఖరి తరువాత కూడా చైనాలో కర్మాగారాల ఉత్పత్తి రికార్డు స్థాయిని అందుకుంది. దీనంతటికీ కారణం, కొనుగోలు శక్తి ప్రజానీకం అంతటిలోనూ విస్తారంగా పెరిగి ఉండడమే. మన దేశంలో నేడు సంస్కరణల పేరిట అమలు జరుగుతోన్న విధానాలు పొదుపు చర్యల రూపంలో ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఈ పొదుపు చర్యల వల్ల ప్రతీ సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలపై కోతలు పడుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా ఆహారం, ఎరువులు, ఇంధన సబ్సిడీలు, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక సంక్షేమ విధానాలపై కోతలు పడడం చూశాం. ఈ పొదుపు చర్యలలో భాగంగానే దేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గిపోయింది. 2022లోనే దీనిలో 8.8 శాతం తగ్గుదల నమోదైంది. దీనంతటి ఫలితంగా ప్రజల ఉపాధి అవకాశాలు, కొనుగోలు శక్తి వేగంగా పడిపోతున్నాయి. దశాబ్దాల కాలం ప్రజల పన్నుల డబ్బు, శ్రమలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు వేగంగా ప్రైవేటు పరం అవుతుండడం... దేశంలోని రోడ్లు, రైలు మార్గాలు, స్టేడియాలు ఇత్యాది సమస్త మౌలిక సదు పాయాల వ్యవస్థలూ నగదీకరణ పేరిట ప్రైవేట్ పరం అవుతుండడంతో – ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే పేరిట (ద్రవ్యలోటు తగ్గింపు కోసం) నిత్యావసరాల పైన కూడా జీఎస్టీ వంటి పన్ను భారాలను మోపడం ప్రజల కొనుగోలు శక్తి పాలిట అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్న విధంగా, మెజారిటీ ప్రజానీకానికి నష్టం కలిగించేవిగా ఉండడం వలననే జీడీపీ దారుణంగా పతనమయ్యింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్గం – ఇప్పటి వరకూ జరిగినట్లుగా కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు ఇస్తూ పోయి, జన సామాన్యంపై భారాలు మోపుతూ నిర్ణయాలు తీసు కోవడం కాదు. సంపదలో సాధ్యమైనంతగా కార్మికులు, ఉద్యోగులు, మధ్య తరగతి జనాలకు తగిన వాటాను కల్పించడం! ప్రస్తుత వృద్ధి రేటు పతనం, దానికి మూలంగా ఉన్న ప్రజల కొనుగోలు శక్తి పతనం వంటి వాటిని పరిష్కరించలేని పక్షంలో మున్ముందు దేశ ఆర్థిక సమస్యలు మరింత జఠిలం కాగలవు. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
హిందూ వృద్ధి రేటుకు దగ్గర్లో భారత్
న్యూఢిల్లీ: ప్రైవేట్ పెట్టుబడుల తగ్గుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ ‘‘హిందూ వృద్ధి రేటుకు ప్రమాదకర స్థాయిలో చాలా దగ్గరగా’’ ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. సీక్వెన్షియల్గా త్రైమాసికాలవారీ వృద్ధి నెమ్మదిస్తుండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1950ల నుంచి 1980ల దాకా అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వ్యవహరిస్తారు. ఇది సగటున 4 శాతంగా ఉండేది. 1978లో భారతీయ ఆర్థికవేత్త రాజ్ కృష్ణ ఉపయోగించిన ఈ పదం ఆ తర్వాత నుంచి అత్యంత నెమ్మదైన వృద్ధి రేటుకు పర్యాయపదంగా మారింది. జాతీయ గణాంకాల కార్యాలయం గత నెల విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 13.2 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, రెండో క్వార్టర్లో 6.3 శాతానికి, తర్వాత మూడో త్రైమాసికంలో 4.4 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘గత జీడీపీ గణాంకాలను తిరిగి ఎగువముఖంగా సవరించే అవకాశం ఉందని ఆశావహులు ఆశిస్తుండవచ్చు. కానీ సీక్వెన్షియల్ మందగమనం ఆందోళనకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడటం లేదు .. ఆర్బీఐ ఇప్పటికీ వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది .. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి మందగించే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు వృద్ధికి అవసరమైన తోడ్పాటు ఎక్కణ్నుంచి లభిస్తుందన్నది తెలియడం లేదు’’ అని రాజన్ పేర్కొన్నారు. తన ఆందోళనకు బలమైన కారణాలే ఉన్నాయని ఆయన చెప్పారు. నాలుగో త్రైమాసికంలో వృద్ధి మరింత నెమ్మదించి 4.2 శాతానికే పరిమితం కావచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు దాదాపు మూడేళ్ల క్రితం నాటి కరోనా పూర్వపు 3.7 శాతం స్థాయికి దగ్గర్లో నమోదైందని పేర్కొన్నారు. ‘‘హిందూ వృద్ధి రేటుకు ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో, అత్యంత దగ్గరగా ఉంది!! మనం ఇంకా మెరుగ్గా వృద్ధి సాధించాలి’’ అని ఆయన చెప్పారు. ఆశావహంగా సర్వీసులు.. ప్రభుత్వం తన వంతుగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతోందని రాజన్ చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఇంకా ఫలితాలు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సర్వీసుల రంగం ఆశావహంగా కనిపిస్తోందని రాజన్ చెప్పారు. చాలా మటుకు సంపన్న దేశాలు సేవల ఆధారితమైనవే ఉంటున్నాయని.. భారీ ఎకానమీగా ఎదగాలంటే తయారీపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సర్వీసులతో .. నిర్మాణ, రవాణా, టూరిజం, రిటైల్, ఆతిథ్యం తదితర రంగాల్లో ఒక మోస్తరు నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలను భారీగా కల్పించేందుకు వీలవుతుందని రాజన్ తెలిపారు. అదానీ గ్రూప్–హిండెన్బర్గ్ రీసెర్చ్ వివాదంపై స్పందిస్తూ ప్రైవేట్ కంపెనీలపై నిఘాను తీవ్రంగా పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుందని తాను భావించడం లేదన్నారు. తమ పని తాము చేసేలా నియంత్రణ సంస్థలను ప్రోత్సహిస్తూనే అటు వ్యాపార సంస్థలు .. ప్రభుత్వాల మధ్య లోపాయికారీ సంబంధాలను తగ్గించుకుంటే ఇలాంటివి తలెత్తడం తగ్గుతుందని ఆయన చెప్పారు. ఖాతాల్లో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. -
జనవరిలో మౌలిక రంగం ఊరట
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ జనవరిలో మంచి ఫలితా న్ని నమోదు చేసింది. ఈ గ్రూప్ వృద్ధి రేటు సమీక్షా నెల్లో 7.8 శాతంగా నమోదయ్యింది. 4 నెలల గరిష్ట స్థాయి ఇది. క్రూడ్ ఆయిల్ (1.1 శాతం క్షీణత) మినహా మిగిలిన ఏడు రంగాలూ వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. వీటిలో బొగ్గు, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్–జనవరి మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వెయిటేజ్ 49.27 శాతం. -
తగ్గిన వృద్ధి వేగం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులతో పాటు దేశంలో కీలక తయారీ రంగం కుంటుపడటం ఎకానమీ మందగమనానికి కారణమవుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన అక్టోబర్–నవంబర్–డిసెంబర్ (3వ త్రైమాసికం) గణాంకాల ప్రకారం, స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.4 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం గడచిన రెండు త్రైమాసికాల్లో (జూన్, సెప్టెంబర్) జీడీపీ వృద్ధి రేట్లు వరుసగా 13.5 శాతం, 6.3 శాతాలుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలో భారత్ వృద్ధి రేటు 11.2%. ఈ లెక్కలు ఎకానమీ మందగమనాన్ని సూచిస్తున్నాయి. 2021–22 వృద్ధి రేటు 9.1 శాతానికి పెంపు 2021–22 వృద్ధి అంచనాలను ఎన్ఎస్ఓ తాజాగా క్రితం 8.7 శాతం నుంచి 9.1 శాతానికి ఎగువముఖంగా సవరించడం కొంత ఊరట కలిగించే అంశం. 2020–21లో జీడీపీ విలువ రూ.136.87 లక్షల కోట్లు. 2021–22లో ఈ విలువ రూ.149.26 లక్షల కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 9.1 శాతంగా నమోదయ్యిందన్నమాట. కరోనా తీవ్ర సంక్షోభం నేపథ్యంలో 2020–21లో ఎకానమీలో అసలు వృద్ధిలేకపోగా 5.8% క్షీణతను నమోదుచేసుకుంది. ఇక తలసరి ఆదాయం 2020–21 నుంచి 2021–22కు రూ.1,27,065 నుంచి రూ.1,48,524కు పెరిగింది. పెట్టుబడులకు సంబంధించి గ్రాస్ క్యాపి టల్ ఫార్మేషన్ కరెంట్ ప్రైస్ ప్రకారం, ఇదే కాలంలో రూ.55.27 లక్షల కోట్ల నుంచి రూ.73.62 లక్షల కోట్లకు ఎగసింది. స్థూల పొదుపులు రూ.57.17 లక్షల కోట్ల నుంచి రూ.70.77 లక్షల కోట్లకు ఎగశాయి. 2022–23లో 7 శాతంగా అంచనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ రెండవ ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా (6.8 శాతం) ఇది 20 బేసిస్ పాయింట్లు అధికంకావడం గమనార్హం. 4.4 శాతం వృద్ధి ఎలా అంటే.. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన స్థిర (2011–12 బేస్ ఇయర్) ధరల వద్ద 2021–22 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.38.51 లక్షల కోట్లు. 2022–23 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.19 లక్షల కోట్లుగా తొలి అంచనాలు వేయడం జరిగింది. అంటే వృద్ధి రేటు 4.4 శాతమన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 11.2% వృద్ధితో రూ.62.39 లక్షల కోట్ల నుంచి రూ.69.38 లక్షల కోట్లకు చేరింది. కీలక రంగాల తీరిది... ► తయారీ: గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ ప్రకారం (పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి దోహదపడే విధానం) 3వ త్రైమాసికంలో తయారీ రంగం ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా 1.1 శాతం క్షీణించింది. 2021 ఇదే కాలంలో ఈ రంగం కనీసం 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► వ్యవసాయం: మొత్తం ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న ఈ రంగంలో వృద్ధి రేటు 3.7 శాతంగా ఉంది. 2022 ఇదే కాలంలో ఈ రేటు 2.2 శాతం. ► మైనింగ్ అండ్ క్వారియింగ్: వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గింది. ► నిర్మాణం: నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 8.4 శాతానికి చేరింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలు: వృద్ధి 6 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. ► ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్ సేవలు: వృద్ధి 9.2 నుంచి 9.7 శాతానికి చేరింది. 2022–23పై అంచనాలు ఓకే మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలు తగిన విధంగా, వాస్తవికతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ఈ స్థాయి వృద్ధి సాధనకు భారత్ నాల్గవ త్రైమాసికంలో 5 నుంచి 4.1 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అయితే ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి భారత్ సిద్ధం కావాల్సి ఉంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
ఫార్మాస్యూటికల్స్ వృద్ది అంతంతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2023 జనవరిలో 2.3 శాతం వృద్ధి చెందింది. 2022 జూన్ నుంచి పోల్చితే ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది గరిష్ట అమ్మకాలు నమోదు కావడం, కాలానుగుణ ప్రభావం ఇందుకు కారణమని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపై తీసుకున్న ధరల పెంపు గత నెలలో మొత్తం మార్కెట్ పనితీరుకు కీలకంగా ఉంది. అయితే పరిమాణాలు క్షీణించాయని వివరించింది. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం 2022 జనవరిలో పరిశ్రమ 14.1 శాతం, డిసెంబర్లో 10.4 శాతం దూసుకెళ్లింది. గతేడాది ధరలు 5.8 శాతం పెరిగితే, జనవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. కొత్త ఉత్పత్తుల రాక 1.8 శాతం పెరిగింది. 2022లో ఇది 2.8 శాతం. పరిమాణం 5.5 నుంచి 5.4 శాతానికి క్షీణించింది. భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2021లో 14.9 శాతం, 2022లో 8 శాతం దూసుకెళ్లింది. 2023–24లో పరిశ్రమ 8–10 శాతం వృద్ధికి ఆస్కారం ఉంది. 2023 జనవరిలో డెర్మటాలాజికల్, గైనకాలాజికల్ విభాగం ఔషధాల అమ్మకాలు వరుసగా 11, 10 శాతం పెరిగాయి. విటమిన్స్ విక్రయాలు అతి తక్కువగా 0.3 శాతం అధికం అయ్యాయి. -
వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధి రేటుపై ద్రవ్యోల్బణం ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు గణనీయంగా తగ్గనుందని ‘ముందస్తు ప్రాథమిక అంచనాలు (ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్/పీఏఈ)’ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ 19.4శాతం వృద్ధి రేటును నమోదుచేయగా.. 2022–23లో 15.6 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జాతీయ స్థాయిలో చూసినా.. 2021–22లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 19.5శాతం వృద్ధిరేటు నమోదు చేయగా.. 2022–23లో 15.4 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్ర శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టిన తెలంగాణ సామాజిక–ఆర్థిక సర్వే–2023 నివేదికలో ఈ గణాంకాలను వెల్లడించింది. స్థిర ధరల వద్ద 7.4 % దేశ, రాష్ట్ర వృద్ధిరేటు తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, సప్లై మందగమనం, డిమాండ్ తగ్గడంతో వృద్ధికి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రధానంగా తయారీ రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉందని తెలిపింది. ఇక గత ఏడాది (2021–22) సాధించిన 19.4శాతం భారీ వృద్ధిరేటుపై అంతకు మించిన వృద్ధిరేటును ఈ ఏడాది ఆశించడం సాధ్యం కాదని వివరించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014–15 నుంచి 2019–20 వరకు జాతీయ సగటును మించి వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని.. కోవిడ్ తర్వాత కాలంలో జాతీయ సగటుతో సమానంగా వృద్ధి రేటు కొనసాగుతోందని పేర్కొంది. ఇక స్థిర (2011–12 నాటి) ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 7.4 శాతం, దేశ జీడీపీ వృద్ధి రేటు 7శాతం ఉంటుందని అంచనా వేసింది. తగ్గిన నిరుద్యోగం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్) ప్రకారం రాష్ట్ర లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (ఎల్ఎఫ్పీఆర్) 65.4 శాతంగా ఉంది. ఏదో ఒక పనిచేస్తూ లేదా ఏదైనా పనికోసం ఎదురు చూస్తున్న 15–59 ఏళ్ల జనాభా శాతాన్ని ఎల్ఎఫ్పీఆర్గా పరిగణిస్తారు. ఈ సర్వే ప్రకారం.. 2019–20తో పోల్చితే 2020–21లో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 7.5 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. 2022 ఏప్రిల్తో పోల్చితే 2022 డిసెంబర్లో రాష్ట్ర నిరుద్యోగ రేటు 9.9 శాతం నుంచి 4.1 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా పట్టణాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉంది. 2019–20తో పోల్చితే 2020–21లో గ్రామీణ నిరుద్యోగం 5.7శాతం నుంచి 3.6శాతానికి, పట్టణ నిరుద్యోగం 10.7శాతం నుంచి 8శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో పురుషుల్లో నిరుద్యోగం 8.4శాతం నుంచి 5.5 శాతానికి, మహిళల్లో నిరుద్యోగం 6.1 శాతం నుంచి 4.5శాతానికి తగ్గాయి. పెరిగిన ఉద్యోగ భద్రత సామాజిక–ఆర్థిక సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఉద్యోగులకు సదుపాయాలు, భద్రత క్రమంగా పెరుగుతున్నాయి. 2019–20తో పోల్చితే 2020–21లో పెయిడ్ లీవ్కు అర్హతగల ఉద్యోగులు 45.2శాతం నుంచి 50.9శాతానికి.. పెన్షన్లు, ఆరోగ్య సేవలు వంటి సదుపాయాలు కలిగిన ఉద్యోగులు 40.8శాతం నుంచి 46.9శాతానికి పెరిగారు. రాతపూర్వక జాబ్ కాంట్రాక్టు కలిగిన ఉద్యోగులు 39.9శాతం నుంచి 36.2శాతానికి తగ్గారు. ఈఓడీబీ, టీ–ఐడియా, టీ–ప్రైడ్ వంటి కార్యక్రమాలతో పాటు ఐటీ, ఇతర సేవా రంగాలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగుల పరిస్థితులు మెరుగయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర, జాతీయ వృద్ధిరేటు తీరు జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానం ►స్థిర ధరల వద్ద 2022–23లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.13.27 లక్షల కోట్లు, దేశ జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.48 లక్షల కోట్లు, దేశ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ►జీఎస్డీపీ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో (19.4 శాతంతో) నిలిచిందని.. ఒడిశా (20.5శాతం), మధ్యప్రదేశ్ (19.7 శాతం) తొలి రెండు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ►2021–22లో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతమని.. 2022–23లో కూడా ఇదే స్థాయిలో భాగస్వామ్యం ఉండనుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
AP: రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8% పెరిగింది
సాక్షి, కడప: వ్యవసాయపరంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే తమ వర్సిటీ లక్ష్యమని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి చెప్పారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప సమీపంలోని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో గురువారం నిర్వహించిన కిసాన్మేళాలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ మన రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 8 శాతం పెరిగిందని చెప్పారు. బోధన, పరిశోధన, విస్తరణ లక్ష్యంగా తమ విశ్వవిద్యాలయం పనిచేస్తోందన్నారు. ప్రగతిపరంగా దేశంలోనే 11వ స్థానంలో నిలిచామని, దాన్ని నంబర్వన్గా నిలిపేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. 2022లో అత్యున్నత స్కోచ్ అవార్డు కూడా సాధించామన్నారు. డ్రోన్ టెక్నాలజీలో డీసీజీఏ సర్టిఫికెట్ కూడా కైవసం చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల ఆర్బీకేలకు డ్రోన్లు సరఫరా చేసేందుకు రూ.200 కోట్ల బడ్జెట్ పొందామని, పైలట్, కో పైలట్లకు కడప, తిరుపతి, మార్టూరు, విజయనగరంలలో శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లభించిందని చెప్పారు. -
ఇది అసలు ఊహించలేదు.. 50 ఏళ్లలో ఇది రెండో సారి, దారుణంగా చైనా పరిస్థితి!
బీజింగ్: కరోనా తెచ్చిపెట్టిన కష్టాలు, రియల్ ఎస్టేట్ మార్కెట్ దెబ్బతినడం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా తర్వాత ప్రపంచ రెండవ అతిపెద్ద ఎకానమీ 2022లో కేవలం 3 శాతం పురోగతి సాధించింది. మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, వార్షిక జీడీపీ విలువ 121.02 ట్రిలియన్ యువాన్ (17.94 ట్రిలియన్ డాలర్లు). 2021 విలువతో (114.37 ట్రిలియన్ యువాన్లు) పోల్చితే ఈ గణాంకాలు కేవలం 3 శాతం అధికం. కనీసం 5.5 శాతం వృద్ధి నమోదవుతుందన్న అంచనాలకన్నా... గణాంకాలు తగ్గినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటస్టిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. 1974లో చైనా జీడీపీ వృద్ధి రేటు 2.3 శాతం. అటు తర్వాత ఈ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అమెరికా డాలర్లతో పోల్చితే జీడీపీ విలువ 2021లో 18 ట్రిలియన్ డాలర్లుకాగా, తాజాగా 17.94 ట్రిలియన్ డాలర్లకు తగ్గడం గమనార్హం. డాలర్లో చైనా కరెన్సీ ఆర్ఎంబీ బలహీనపడ్డమే దీనికి కారణం. ఎన్బీఎస్ డేటా ప్రకారం, చైనా జాబ్ మార్కెట్ 2022లో స్థిరంగా ఉంది. పట్టణ వార్షిక ఉపాధి కల్పనా లక్ష్యం 11 మిలియన్లుకాగా, 12.06 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. 2021లో చైనా ఎకానమీ వృద్ధి రేటు 8.4 శాతం. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
దిగువబాటన భారత్ వృద్ధి రేటు
న్యూఢిల్లీ: భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్ అప్డేట్లో తెలిపింది. భారత్ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. కాగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ 6.1 శాతంగా అంచనావేసింది. అంటే వృద్ధి రేటు క్రమంగా దిగువకే పయనిస్తుందన్నది ప్రపంచ బ్యాంక్ అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, ఎగుమతులు, పెట్టుబడుల వేగం తగ్గడం తన అంచనాలకు కారణమని ప్రపంచ బ్యాంక్ పేర్కొంటోంది. అయితే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీల్లో భారత్ తొలి స్థానంలో ఉంటుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. చదవండి: టాలెంట్ కోసం విప్రో కీలక నిర్ణయం: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ -
Andhra Pradesh: అభి'వృద్ధి'లో అగ్రగామి
సాక్షి, అమరావతి: వృద్ధి రేటు పరంగా 2022లో ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా నిలిచింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ప్రోత్సాహకాల కారణంగా 2021–22లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో భారీ వృద్ధి నమోదైంది. కోవిడ్కు ముందు 2018–19 చంద్రబాబు హయాంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. అయితే, 2021–22లో స్థిర ధరల ఆధారంగా వ్యవసాయ రంగంలో 11.27 శాతంతో రెండంకెల వృద్ధి నమోదు కాగా.. పారిశ్రామిక రంగంలో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. సేవా రంగంలో కూడా 2018–19 కన్నా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 11.43 శాతం వృద్ధి మరోవైపు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్బీఐతో పాటు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు ఇటీవలే వెల్లడించాయి. ఇదే 2018–19 చంద్రబాబు హయాంలో 5.36 శాతమే వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అండగా నిలవడంవల్లే సాధారణ పరిస్థితులకు మించి రెండంకెల వృద్ధి నమోదవ్వడానికి కారణమని తేలింది. కోవిడ్ కారణంగా రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలో తగ్గుదల ఉన్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుంటుపడకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడంతోనే ఈ రంగాలు నిలదొక్కుకుని దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఆదాయ వనరులు తగ్గినప్పటికీ కూడా ప్రజల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ పథకాలను నిరాటంకంగా అమలుచేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఆ ప్రభావం రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపైన స్పష్టంగా కనిపించింది. అలాగే, కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని చెప్పిన తేదీకి ఇవ్వడమే కాకుండా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం, రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిండం వంటి చర్యలను ప్రభుత్వం పక్కాగా అమలుచేసింది. దీనివల్లే.. 2021–22లో వ్యవసాయ రంగం వృద్ధి 11.27శాతంగా నమోదైంది. అదే 2018–19లో కేవలం 3.54కు పరిమితమైంది. పారిశ్రామిక వృద్ధి ఇలా.. ఇక పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. 2018–19లో చంద్రబాబు హయాంలో 3.17 శాతమే వృద్ధి నమోదు కాగా అదే 2021–22లో 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంతో పాటు పారిశ్రామిక రాయితీలను సకాలంలో విడుదల చేసింది. 2021–22లో సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్ఎంఈలకు రూ.191.10 కోట్ల రాయితీలను విడుదల చేసింది. ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్ఎంఈలకు రూ.101.31 కోట్ల రాయితీలను విడుదల చేసింది. వైఎస్సార్ నవోదయం పేరుతో ఒకసారి ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ అమలుచేశారు. ఏకంగా 1,78,919 ఖాతాలకు సంబంధించిన రుణాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దీంతోపాటు 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్ఎంఈలు ఏర్పాటవ్వడంతో 37,604 మందికి ఉపాధి లభించింది. అలాగే, కోవిడ్ కష్టాల్లోనూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలుచేయడంతో సేవా రంగంలో కూడా 2021–22లో 9.73 % వృద్ధి నమోదైంది. అదే 2018–19 బాబు హయాంలో కేవలం 4.84 శాతమే. 2021–22లో కేంద్రం విడుదల చేసిన నివేదిక మేరకు స్థిర ధరల ఆధారంగా రాష్ట్రాల జీఎస్డీపీల శాతం ఇలా.. -
భారత్ వృద్ధి రేటు 7 శాతానికి కోత: క్రిసిల్
ముంబై: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును రేటింగ్ సంస్థ క్రిసిల్ 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. దీనితో ఇందుకు సంబంధించి క్రిసిల్ అంచనా 7 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రతికూలతలు, పంట ఉత్పత్తికి సంబంధించి అందుతున్న మిశ్రమ ఫలితాలు, ఎగుమతులు తగ్గడం, పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు తమ తాజా అంచనాలకు కారణంగా తెలిపింది. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. 2022–23 తుది ఆరు నెలల్లో వృద్ధి 6.5 శాతం: ఇక్రా కాగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) భారత్ వృద్ధి 6.5 శాతానికి పరిమితం అవుతుందని మరో రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. అయితే సెప్టెంబర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన పరపతి కమిటీ అంచనా 6.3 శాతంకన్నా ఇది అధికం కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 12.7 శాతం కావడం గమనార్హం. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
6.5–7.1 శాతం వృద్ధి సాధ్యమే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022– 23) భారత్ జీడీపీ 6.5 శాతం నుంచి 7.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయింట్ ఇండియా అంచనా వేసింది. ‘‘ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా అధిక స్థాయిల్లోనే ఉంటూ విధానకర్తలకు సవాలుగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆర్బీఐ 1.9 శాతం రెపో రేటు పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం గరిష్ట పరిమితికి పైనే 9 నెలలుగా కొనసాగుతోంది. డాలర్ బలపడడంతో దిగుమతుల బిల్లు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఏడాది ముగింపు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మాంద్యం తలెత్తవచ్చు. దీంతో పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల ప్రభావం భారత్ వృద్ధి కారకాలపై చూపించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తుకు సంబంధించి స్థిరమైన అంచనాలు వేయడం కష్టమే’’అని డెలాయిట్ ఇండియా తన నివేదికలో వివరించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత్ జీడీపీ 5.5–6.1 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. సవాళ్లు ఉన్నాయ్.. ‘‘పండుగల సీజన్ వినియోగ రంగానికి తగినంత ప్రోత్సాహాన్నిస్తుందని అంచనా వేశాం. కానీ, ఇది ఇంకా స్థిరమైన పునరుద్ధరణను చూపించలేదు. పరిశ్రమలో, తయారీ రంగంలో రుణాల వృద్ధి చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. దీంతో ప్రైవేటు రంగంలో మూలధన పెట్టుబడులకు ఎంతో సానుకూల అవకాశాలున్నాయి. స్థిరమైన పెట్టుబడులకు సుస్థిరమైన డిమాండ్ అవసరం. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతున్న తరుణంలో ఎగుమతులు, ప్రభుత్వ తోడ్పాటు అన్నవి వృద్ధికి కావాల్సినంత మద్దతును ఇవ్వలేవు. ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, కరెన్సీ విలువ క్షీణత రూపంలో వృద్ధి క్షీణించే రిస్క్లు సైతం ఉన్నాయి’’అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుక్మి మజుందార్ తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు 2023 మధ్య నాటికి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు డెలాయిట్ తెలిపింది. ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టి, కంపెనీల ముడి సరుకుల ధరలు సైతం దిగొస్తాయని, ఫలితంగా దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు క్షీణిస్తాయని పేర్కొంది. -
సాటిలేని ‘వృద్ధి’ .. రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ప్రధాన రంగాలలో వృద్ధి రేటు పరుగులు తీస్తుండటం లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వ దృఢ సంకల్పం, కార్యదక్షతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆర్ధిక మందగమనం, కోవిడ్ సంక్షోభంలోనూ ఆంధ్రప్రదేశ్లో వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.1,20,298.54 కోట్ల మేర పెరిగింది. రాష్ట్రంలో మూడేళ్లలో జీఎస్డీపీలో 19.19 శాతం వృద్ధి నమోదు కాగా ఏటా సగటున 6.39 శాతం వృద్ధి సాధించింది. దేశవ్యాప్తంగా 2021–22 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచింది. ప్రస్తుత ధరల కన్నా స్థిర ధరలు మాత్రమే వాస్తవ ప్రగతిని ప్రతిబింబిస్తాయి. ఈ నేపథ్యంలో స్థిర ధరల ఆధారంగా 2019–20 నుంచి 2021–22 వరకు వరుసగా మూడేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుతూనే ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం, తయారీ రంగాలలో మూడేళ్లుగా భారీ వృద్ధి నమోదైనట్లు తెలిపింది. మరోవైపు కోవిడ్ లాంటి సంక్షోభాలేవీ లేనప్పటికీ టీడీపీ హయాంలో వ్యవసాయ రంగం తిరోగమనంలోకి వెళ్లడం గమనార్హం. వ్యవసాయంలో మూడేళ్లలో 20.05 శాతం వృద్ధి చంద్రబాబు హయాంలో 2018–19లో స్ధిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,26,614.20 కోట్లు ఉండగా 2021–22లో రూ.7,46,912.74 కోట్లకు పెరిగింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 19.19 శాతం వృద్ధి నమోదైంది. సగటు వార్షిక వృద్ధి రేటు 6.39 శాతం ఉంది. 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.76,591.24 కోట్ల మేర పెరిగి ఏకంగా 11.42 శాతం మేర వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో వ్యవసాయ రంగంలో వృద్ధి నమోదైంది. 2019–20 నుంచి 2021–22 వరకు మూడేళ్లలో వ్యవసాయ రంగంలో రూ.13,900.77 కోట్ల మేర ఉత్పత్తి పెరిగి 20.05 శాతం వృద్ధి నమోదైంది. వ్యవసాయ రంగం వృద్ధి ఏటా సగటున 6.88 శాతంగా ఉంది. పారిశ్రామిక పరుగులు.. కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వరుసగా మూడేళ్లు వృద్ధి నమోదైంది. మూడేళ్లలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి విలువ రూ.26,719.51 కోట్లు పెరిగి 17.58 శాతం మేర వృద్ధి నమోదైంది. ఏటా సగటున 5.85 శాతం మేర వృద్ధి నమోదైంది. సేవా రంగంలో మూడేళ్లలో రూ.49,068.81 కోట్లు పెరిగి 20.76 శాతం మేర వృద్ధి నమోదైంది. ఏటా సగటున 6.92 శాతం వృద్ధి ఉంది. తయారీ రంగంలో కూడా మూడేళ్లలో రూ.7,758.15 కోట్లు పెరిగి 10.85 శాతం మేర వృద్ధి నమోదైంది. అంటే ఏటా సగటున 3.61 శాతం వృద్ధి నమోదైంది. నాడు.. సాగు దయనీయం కోవిడ్ లాంటి సంక్షోభం లేకున్నా టీడీపీ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి తిరోగమనంలోకి వెళ్లిపోవడం గమనార్హం. 2017–18లో స్దిర ధరల ప్రకారం వ్యవసాయ రంగం ఉత్పత్తి రూ.74,118.40 కోట్లు ఉండగా 2018–19లో రూ.69,303.17 కోట్లకు పడిపోయింది. అంటే వ్యవసాయ రంగం ఉత్పత్తి రూ.4,815.23 కోట్లు తగ్గి 6.49 శాతం క్షీణించింది. ఏపీలోనే జీఎస్డీపీ ఎక్కువ దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధికంగా ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 11.42 శాతం ఉండగా కర్నాటక, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల స్థూల ఉత్పత్తి తక్కువగా ఉన్నట్లు తెలిపింది. -
ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది: 7 శాతం వృద్ధి సాధిస్తుంది
ముంబై: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మొదలైందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని ఆర్బీఐ పేర్కొంది. దేశీ స్థూల ఆర్థిక పరిస్థితులు బలంగానే ఉన్నాయంటూ.. అదే సమయంలో అంతర్జాతీయ సంక్షోభాల సమస్యల ప్రభావం ఉంటుందని శుక్రవారం విడుదలైన ఆర్బీఐ ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ తాజా బులెటిన్లో భాగంగా ఈ ఆర్టికల్ను ప్రచురించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గమనంపై మేఘాలు కమ్ముకునే ఉన్నాయంటూ, ఇక్కడి నుంచి ఇంకా తగ్గుముఖం పట్టే రిస్క్లు ఉన్నట్టు తెలిపింది. (ట్విటర్ ఉద్యోగి కీలక చర్య: ఎలాన్ మస్క్కు మరో షాక్!) అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారుతుండడం, మార్కెట్ లిక్విడిటీ తగ్గుతుండడం ఆర్థిక సాధనాల రేట్లపై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ‘‘పాలసీ రేట్ల మోస్తరు పెంపును మార్కెట్లు సర్దుబాటు చేసుకుంటున్నాయి. రిస్క్ తీసుకునే ధోరణి తిరిగి ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థలో సరఫరా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పట్టణాల్లో డిమాండ్ బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఇంకా పుంజుకోలేదు. కాకపోతే ఇటీవలే కొంత మెరుగుపడడం ఆశావహం’’అని ఆర్బీఐ ఆర్టికల్ తెలిపింది. దీన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవబ్రత పాత్ర రూపొందించారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 6.1-6.3 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొంది. ఇది నిజమైతే 2022-23 సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధిని చేరుకునే క్రమంలోనే ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చని తెలిపింది. ఆర్బీఐ రోజువారీగా వ్యవస్థ నుంచి రూ.1.5 లక్షల కోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు చెబుతూ.. మానిటరీ పాలసీకి అనుగుణంగా వ్యవస్థలో లిక్విడిటీ సాధారణ స్థితికి చేరినట్టు వివరించింది. అయినప్పటికీ ఇంకా కొంత మిగులే ఉన్నట్టు తెలిపింది. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్పై ప్రశంసలు) -
భారత్ వృద్ధి రేటు అంచనాకు మూడీస్ రెండవ కోత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్లుక్ 2023–24 నివేదికలో మూడీస్ పేర్కొంది. 2024లోనే వెలుగు రేఖలు... 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్లుక్ పేర్కొంది. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు. ► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం. ► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్పై ప్రభావం చూపుతుంది. ► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది. ► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి. ► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది. ► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది. -
ఐఎంఎఫ్ అంచనాలకు మించి భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలు 6.8 శాతం మించి నమోదవుతుందన్న విశ్వాసాన్ని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. పెరుగుతున్న మూలధన పెట్టుబడులు తమ విశ్వాసానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో భారత్ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ వరుసగా రెండోసారి తగ్గించింది. తొలుత ఈ ఏడాది జనవరిలో 2022–23లో వృద్ధి అంచనాలను 8.2 శాతంగా వెలువరించింది. అయితే జూలైలో దీనిని 7.4 శాతానికి కుదించింది. అంతర్జాతీయంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో రేటు అంచనాలను ఈ నెల మొదట్లో మరింతగా 6.8 శాతానికి ఐఎంఎఫ్ కుదించింది. ఈ నేపథ్యం అనంత నాగేశ్వరన్ సోమవారం చేసిన ఒక ప్రకటనలో తన తాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఒక కీలక మైలురాయిని దాటింది. ఇది పటిష్ట ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుతోపాటు అధిక వృద్ధికి కూడా దోహదపడే అంశం. ► ఆర్థిక, ద్రవ్య విధానలు సాధారణంగా ఒకదానికి మరోటి అనుసంధానమై ఉంటాయి. ఒకదానికొకటి సమతుల్యత కలిగి ఉంటాయి. ► దేశీయ రుణం– జీడీపీ నిష్పత్తి విషయంలో ఆందోళన లేదు. అసెట్ మానిటైజేషన్ (నిరర్ధక ఆస్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం) ఈ నిష్పత్తి మరింత తగ్గుతుంది. క్రెడిట్ రేటింగ్ పెరుగుదల విషయంలోనూ ఇది సానుకూల అంశం. ► ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, తయారీ, నిర్మాణంసహా అన్ని కీలక రంగాలూ మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయి. -
భారత్ ఆశాకిరణం
వాషింగ్టన్: ప్రపంచంలో అన్ని దేశాలు వృద్ధి అధోగమనాన్ని చూస్తుంటే.. భారత్ మంచి పనితీరు చూపిస్తూ ఆశాకిరణంగా ఉందని ఐఎంఎఫ్ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాసన్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతూ, ప్రపంచదేశాలు మందగమనంలోకి వెళుతున్నట్టు చెప్పారు. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన మూడింట ఒక వంతు దేశాలు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది మాంద్యంలోకి వెళతాయని అంచనా వేస్తున్నాం. ద్రవ్యోల్బణం బలీయంగా ఉంది. ఇదే అంతర్జాతీయంగా నెలకొన్న వాస్తవ పరిస్థితి. దాదాపు ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థ నిదానిస్తోంది. ఈ విధంగా చూస్తే భారత్ మాత్రం మెరుగైన పనితీరు తో వెలిగిపోతోంది’’అని శ్రీనివాసన్ వివరించారు. వృద్ధి రేటు 6.8 శాతం భారత్ ఆర్థిక వ్యవస్థ 2022 సంవత్సరానికి 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. 2021లో జీడీపీ 8.7 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. 2023 సంవత్సరానికి జీడీపీ 6.1 శాతం రేటు నమోదు చేస్తుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక వంతు 2023లో క్షీణతను చూస్తుందని అంచనా వేసింది. అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థల్లో స్తబ్ధత కొనసాగుతుందని పేర్కొంది. 2023లో మాంద్యం వస్తుందని చాలా మంది భావిస్తున్నట్టు తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సెంట్రల్ బ్యాంకులు విధానాలను కట్టడి చేస్తుండడంతో ద్రవ్య పరిస్థితులు కూడా కఠినవుతున్నాయి. ఇది పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, కమోడిటీల ధరల పెరుగుదలకు దారితీసింది. మూడోది చైనా మందగమనాన్ని చూస్తోంది. ఈ అంశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ఆసియా, భారత్ వృద్ధి అవకాశాలపైనా చూపిస్తోంది. భారత్ వెలుపలి డిమాండ్ మందగమన ప్రభావాన్ని చూస్తోంది. అలాగే, దేశీయంగా ద్రవ్యల్బణ పెరుగుదలను చూస్తోంది’’అని ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అనుసరించే ద్రవ్య విధాన కఠినతరం పెట్టుబడులపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భారత్ విధానాలు బాగు.. భారత్ ప్రతిష్టాత్మక మూలధన వ్యయాల ప్రణాళికను ఐఎంఎఫ్ మెచ్చుకుంది. దీన్ని కొనసాగించాలని, అది దేశీయంగా డిమాండ్ బలపడేందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అలాగే, పేదలు, సున్నిత వర్గాలపై ప్రభావం చూపిస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రశంసించింది. ఎౖMð్సజ్ పన్నును తగ్గంచడాన్ని ప్రస్తావించింది. దీనివల్ల ధరలవైపు ఉపశమనం ఉంటుందని పేర్కొంది. డిజిటైజేషన్ దిశగా భారత్ అద్భుతమైన ప్రగతి చూపించిందని, పలు రంగాల్లో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని కూడా ప్రశంసించింది. -
ఔషధ విక్రయాలకు రెండంకెల వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఔషధ విక్రయాలు గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్లో 13 శాతం వృద్ధి చెందాయి. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ (ఏఐవోసీడీ) గణాంకాల ప్రకారం నాలుగు మాసాలుగా పరిశ్రమ రెండంకెల వృద్ధి కొనసాగిస్తోందని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ వెల్లడించింది. ఆగస్ట్లో ఇది 12.1 శాతం నమోదైతే, 2021 సెప్టెంబర్లో ఇది 12.6 శాతంగా ఉంది. భారత ఔషధ విపణి యాంటీ–ఇన్ఫెక్టివ్స్, రెస్పిరేటరీ మినహా అన్ని రకాల చికిత్సలలో బలమైన రెండంకెల వృద్ధి కారణంగా మెరుగైన పనితీరును అందించడం కొనసాగించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ధరల్లో 6.6 శాతం పెరుగుదల.. 2021 సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ఔషధాల అమ్మకాల పరిమాణం 4.5 శాతం ఎగసింది. నూతన ఉత్పత్తుల రాక 1.9 శాతం పెరిగింది. ధరలు 6.6 శాతం దూసుకెళ్లాయి. తీవ్రమైన జబ్బులకు వాడే ఔషధాల విక్రయాలు 9.2 శాతం పెరిగాయి. మొత్తం పరిశ్రమలో వీటి వాటా 47 శాతం. దీర్ఘకాలిక రోగాలకు వాడే మందులు 16.1 శాతం, మిత, మధ్యస్థ వ్యవధి జబ్బులకు ఉపయోగించే ఔషధాల అమ్మకాలు 17.3 శాతం అధికం అయ్యాయి. గైనకాలజీ సంబంధ మెడిసిన్స్ అత్యధికంగా 24.7 శాతం, హృదయ 18.2, చర్మ, నాడీ వ్యవస్థ సంబంధ మందులు 17.8 శాతం ఎగశాయి. కంపెనీల వారీగా ఇలా.. సెప్టెంబర్ నెల అమ్మకాల్లో అత్యధికంగా నాట్కో ఫార్మా 31.2 శాతం వృద్ధి సాధించింది. బయోకాన్ 28.2, గ్లెన్మార్క్ 23.2, ఈరిస్ లైఫ్సైన్సెస్ 21.2 శాతం దూసుకెళ్లాయి. టోరెంట్, ఆస్ట్రాజెనికా, అజంతా, జైడస్, సన్ ఫార్మా, అబాట్, వొకార్డ్, జేబీ కెమికల్స్, ఇప్కా ల్యాబ్స్ మార్కెట్ కంటే అధికంగా 16 నుంచి 19 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్డీసీ, ఆల్కెమ్, సిప్లా, గ్లాక్సోస్మిత్క్లైన్ 10–12 శాతం, లుపిన్, రెడ్డీస్, అలెంబిక్ 8–9 శాతం అధికంగా విక్రయాలు సాగించాయి. నొవార్టిస్, ఇండాకో రెమెడీస్, ఫైజర్, సనోఫి 3 శాతం లోపు వృద్ధికి పరిమితం అయ్యాయి. ఇక సెప్టెంబర్ త్రైమాసికానికి పరిశ్రమ 13 శాతం వృద్ధి సాధించింది. -
జీవిత బీమా ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు సెప్టెంబర్ నెలకు మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల ద్వారా ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) 17 శాతం పెరిగి రూ.36,366 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలకు ప్రీమియం ఆదాయం రూ.31,001 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయంలో మంచి వృద్ధిని చూపించింది. 35 శాతం అధికంగా రూ.24,991 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించింది. 2021 సెప్టెంబర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.18,520 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నెల గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. ఇక 23 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా రూ.11,375 కోట్ల నూతన ప్రీమియం ఆదాయం సంపాదించాయి. 2021 సెప్టెంబర్ నెలకు ఇవే సంస్థలు సంపాదించిన కొత్త పాలసీల ప్రీమియం రూ.12,481 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణించింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 15 శాతం తగ్గి రూ.2,471 కోట్లుగా ఉంటే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఆదాయం 22 శాతం తగ్గి రూ.2,166 కోట్లకు పరిమితమైంది. బజాజ్ అలియాంజ్ ఆదాయం కూడా 38 శాతం తగ్గి రూ.670 కోట్లుగా నమోదైంది. -
2022లో బెటరే కానీ, 2023 దారుణం!
న్యూఢిల్లీ: ప్రపంచ వస్తు వాణిజ్యం నడుస్తున్న 2022వ సంవత్సరంలో మెరుగ్గాఉన్నా.. 2023లో పరిస్థితి అస్సలు బాగోలేదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ధి రేటును గత ఏప్రిల్ నాటి అంచనాలకన్నా ఎక్కువగా తాజాగా 3 శాతం నుంచి 3.5 శాతానికి సవరించింది. 2023లో వృద్ధి రేటు అంచనాను మాత్రం 3.4 శాతం నుంచి భారీగా ఒక శాతానికి తగ్గించింది. నివేదికలో సంస్థ ఆర్థికవేత్తల మరిన్ని అభిప్రాయాలను పరిశీలిస్తే.. ► అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతున్నాయి. ► 2022 అక్టోబర్ నుంచే ప్రపంచ వాణిజ్య మందగమనం తీవ్రమై, 2023లో తీవ్ర రూపం దాల్చుతుంది. ► పలు కారణాల వల్ల దిగ్గజ ఎకానమీలో దిగుమతుల డిమాండ్ కూడా మందగించే అవకాశం ఉంది. ► ప్రత్యేకించి యూరోప్ను చూస్తే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గృహ వ్యయం, తయారీ వ్యయాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ► అమెరికాలో వడ్డీరేట్ల పెంపు– గృహాలు, మోటార్ వాహనాల కొనుగోళ్లు, స్థిర ఇన్వెస్టమెంట్లకు విఘాతం కలిగిస్తోంది. ► ఇక చైనాలో కోవిడ్–19 సవాళ్లు కొనసాగుతున్నాయి. బలహీన అంతర్జాతీయ డిమాండ్, తగ్గిన ఉత్పత్తి వంటి సమస్యలు చైనాకు ఎదురవుతున్నాయి. ► ఇంధనం, ఆహారం, ఎరువుల కోసం పెరుగుతున్న దిగుమతి బిల్లులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహార అభద్రత, రుణ సవాళ్లకు దారితీసే వీలుంది. ► పలు ఆర్థిక వ్యవస్థల్లో అనుసరిస్తున్న వడ్డీరేట్ల పెంపు విధానం డిమాండ్ పరిస్థితులను దెబ్బతీసే అంశం. భారత్కు చేదువార్తే... ఎగుమతులను భారీగా పెంచుకోవాలని చూస్తున్న భారత్కు ఐఎంఎఫ్ తాజా అంచనాలు కొంత ప్రతికూలమైనవే కావడం గమనార్హం. 2021–22లో 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఎగుమతుల విషయంలో భారత్ గడచిన రెండు నెలల నుంచి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. జూలై, ఆగస్టు నెలల్లో తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్ డాలర్లు) ఆగస్టు తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది. ఇక జూలై నెల్లో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. మొత్తంమీద తాజా గణాంకాలతో 21 నెలలు వృద్ధి బాటన నడిచిన ఎగుమతులు తీవ్ర ఒడిదుడుకుల నడుమ 2022 సెప్టెంబర్లో క్షీణతలోకి జారిపోయినట్లయ్యింది. ఇక ఎగుమతులకన్నా, దిగుమతులు భారీగా ఉండడం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారీగా పెరగవచ్చన్న అంచనాలు ఉన్నాయి. భారత్ కరెంట్ అకౌంట్లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువలో)గా నమోదయ్యింది. విలువలో ఇది 23.9 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ 6.6 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగుల్లో ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరంలో 3 శాతం క్యాడ్ ఉంటుందని ఆర్బీఐ పాలసీ విధానం భావిస్తోంది. ఇక 2022 ఏప్రిల్లో 606.5 బిలియన్ డాలర్లు ఉన్న భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు, సెప్టెంబర్ 23 నాటికి 537.5 బిలియన్ డాలర్లకు చేరాయి. వరుసగా ఎనిమిది వారాలుగా తగ్గుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తున్న మరో అంశం. -
ఇదీ నిజం.. నమ్మొద్దు విష ప్రచారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నో విమర్శలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పింది. అప్పులపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని నమ్మొద్దంటూ సవివరంగా, పూర్తి గణాంకాలతో తేటతెల్లంగా ప్రజల ముందుంచారు. ఎల్లో మీడియాతో కలిసి విపక్షాలు చేస్తోన్న విష ప్రచారం నమ్ముతారా? నిజాలను కళ్లకు కట్టినట్టు చూపించే గణాంకాలను నమ్ముతారా? 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో వృద్ధి రేటు ఎంత? 2019 నుంచి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ లెక్కలు మీరే చూడండి. 2018-19 చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36% ఏపీ ర్యాంకు 21 2019 -20 సీఎం జగన్ పాలనలో వృద్ధి రేటు 6.89% ఏపీ ర్యాంకు 6 కోవిడ్ సమయంలో విపత్కర పరిస్థితులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆర్థికంగా అన్ని కష్టాలను తట్టుకుంది. వృద్ధి రేటులో నాలుగో స్థానానికి ఎదిగింది 2020 -21 వృద్ధి రేటు 0.08% ఏపీ ర్యాంకు 4 2021 -22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. వృద్ధి రేటులో అద్భుతంగా రాణించింది, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2021 -22 వృద్ధి రేటు 11.43% ఏపీ ర్యాంకు 1 2014 నుంచి 2019 వరకు అంటే చంద్రబాబు హయాంలో జాతీయ ఆదాయంలో రాష్ట్రం వాటా 4.45% మాత్రమే ఉండగా.. 2019 నుంచి అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత, ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు జాతీయ ఆదాయంలో ఏపీ వాటా 5% చేరింది. అప్పులపై అసలు నిజం ఇది విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.లక్షా 20వేల 556 కోట్లు ఉంటే దాన్ని చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే సమయానికి రూ.2లక్షల 69వేల 462 కోట్లకు తీసుకెళ్లారు. అంటే అప్పుల్లో అది 123.52% పెరుగుదల. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చే నాటికి అప్పులు రూ.2లక్షల 69వేల 462 కోట్లు ఉంటే.. ప్రస్తుతం అది రూ.3కోట్ల 82లక్షల 165 కోట్లుగా ఉంది. అంటే సీఎం జగన్ హయాంలో అప్పులు పెరిగింది 41.83% మాత్రమే. అప్పులపై కాగ్ చెప్పిన వాస్తవమిది ♦చంద్రబాబు హయాంలో ప్రభుత్వ గ్యారంటీతో వివిధ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు చేసిన అప్పు రూ.14028 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి అది రూ.59257 కోట్లకు చేరింది. మొత్తమ్మీద అప్పుల శాతం 19.55 % ♦ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో పీఎస్యూలు తీసుకున్న అప్పు 15.46% మాత్రమే ♦ఏపీ సర్కారుపై విషపు రాతలు రాస్తోన్న ఎల్లో మీడియా అసలు నిజాలు మాత్రం దాచిపెడుతోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఏపీలో ఉందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఒక సారి కేంద్రం అప్పులు, వృద్ధి రేటు చూస్తే నిజాలు వెల్లడవుతాయి. ఈ లెక్కలు పార్లమెంటు సాక్షిగా కేంద్రం సమర్పించిన బడ్జెట్లో చెప్పినవే. ♦ 2014-19 మధ్య కేంద్రం అప్పులు రూ.62లక్షల 42వేల 220 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 50.07% ♦ 2020-21 కల్లా కేంద్రం అప్పులు రూ.1 కోటీ 20లక్షల 79వేల 18 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 61% కేంద్రం vs ఆంధ్రప్రదేశ్ .. అప్పుడెంత? ఇప్పుడెంత? మీరే గమనించండి ♦2014-19 మధ్య కేంద్రం అప్పులు 59.88% పెరిగితే అదే సమయంలో ఏపీలో సర్కారు నడిపించిన చంద్రబాబు అప్పుల శాతాన్ని ఏకంగా 123.52% పెంచేశారు. ♦2019 నుంచి మార్చి 31, 2022 వరకు కేంద్రం అప్పులు 43.8% పెరిగిన , అదే సమయంలో ఏపీ సర్కారు అప్పుల శాతం పెంపు 41.83% మాత్రమే ఇదీ వాస్తవం ♦ 2018-19 మధ్య వడ్డీ, అప్పు కలిపి చంద్రబాబు సర్కారు చెల్లించింది రూ.28886 కోట్లు అయితే 2021-22 మధ్య సీఎం జగన్ చెల్లించింది రూ.36007 కోట్లు ♦ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, 2019 నుంచి కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వాటిని తట్టుకుని ఏపీని నిలబెట్టింది ♦ సీఎం జగన్ సర్కారు. సంక్షేమం, సంస్కరణలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను కరోనా నుంచి కాపాడుకున్నారు సీఎం జగన్. పచ్చ ప్రచారం ఆపండి, నిజాలు చూడండి ♦ మూలధన వ్యయం విషయానికి వస్తే టిడిపి హయాంలో రాష్ట్రం సగటు రూ.15227 కోట్లు. అదే సీఎం జగన్ హయాంలో మూలధన వ్యయం రాష్ట్రం సగటు రూ.18362 కోట్లు. ఈ లెక్కలు దాచిపెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారబోతుంటూ చొక్కాలు చించుకున్నారు విష ప్రచారం చేశారు. కేంద్రం ఇచ్చిందెంత? కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా చాలా కీలకమైన అంశం. 2015 నుంచి 2019 వరకు ఏ ఏడాది చూసినా 34.91% నుంచి 36.63% వరకు ఉంది. అంటే చంద్రబాబు సర్కారుకు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పన్నుల్లో వాటా ఇచ్చింది. సీఎం జగన్ హయాంలో అంటే 2019 నుంచి ఏ ఏడాది చూసినా 29.35% నుంచి 23.13% మధ్యలోనే కేంద్ర పన్నుల వాటా ఉంది. 15వ ఆర్థిక సంఘం 41% ఇవ్వాలని చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రజంటేషన్ pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
13 నుంచి 15.7 శాతం వృద్ధికి చాన్స్
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 13 శాతం నుంచి 15.7 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నెలాఖరున అధికారిక గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో పలువురు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు వృద్ధి తీరుపై తమ అంచనాలను వెలువరిస్తున్నారు. మహమ్మారి కరోనా మొదటి వేవ్ కారణంగా 2020 జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీలో అసలు వృద్ధి లేకపోగా 23.9 శాతం క్షీణించింది. ఇక 2021 జూన్తో ముగిసిన త్రైమాసికంలో భారీగా 20.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఇదే కాలంలో చోటుచేసుకున్న రెండవ వేవ్లో మొదటి వేవ్కన్నా ప్రాణనష్టం అపారంగా ఉన్నప్పటికీ ఈ స్థాయి వృద్ధి రేటు (20.1 శాతం) నమోదుకు లో బేస్ కూడా ఒక కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఆగస్టు 5వ తేదీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ 16.2 శాతం వరకూ క్యూ1 వృద్ది రేటు ఉండవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ముగిసిన త్రైమాసికంపై (2022 ఏప్రిల్–జూన్) అంచనాలు, అభిప్రాయాలను పరిశీలిస్తే... 15.7 శాతం దాటినా దాటచ్చు... మొదటి త్రైమాసికంలో జీడీపీ 15.7 శాతం దాటిపోతుందని భావిస్తున్నాం. తుది గణాంకాలు ఇంతకు మించి కూడా నమోదుకావచ్చు. ఇది వాస్తవరూపం దాల్చితే ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఆర్బీఐ అంచనాలకు (7.2 శాతం) మించి జీడీపీ వృద్ధి రేటు నమోదుకావచ్చు. 41 రంగాలకు సంబంధించి 41 హై ఫ్రీక్వెన్సీ లీడిండ్ ఇండికేటర్స్ ప్రకారం, వృద్ధి విస్తృత ప్రాతిపదిక ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికంలో కరోనా సవాళ్లతో రూ.4.77 లక్షల కోట్ల వరకూ గణనీయంగా పడిపోయిన వినియోగ వ్యయం 2021–22 మొదటి త్రైమాసికంలో 46 శాతం వరకూ రికవరీ అయ్యింది. 2022–23 క్యూ1లో మిగిలిన 54 శాతం రికవరీ అయ్యిందని సూచీలు తెలుపుతున్నాయి. సేవల రంగం రికవరీ ఇందుకు దోహదపడింది. ప్రత్యక్ష వాణిజ్యాన్ని యుద్ధం ప్రభావితం చేస్తున్న మాట వాస్తవమే. ఇంధనం, వస్తువుల ధరలు, వినియోగ విశ్వాసం, పాలసీ చర్యలకు సంబంధించి కొంత అనిశ్చితి ఉన్న మాట నిజమే. అయినప్పటికీ ఈ సవాళ్లను తట్టుకోగలిన ఫండమెంటల్స్ పటిష్టతను భారత్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. – సౌమ్య కాంతి ఘోష్, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ 13 శాతానికి పరిమితం అవుతుందని భావిస్తున్నాం... అధిక బేస్ ఎఫెక్ట్తో పాటు (2021 ఇదే కాలంలో 20.1 శాతం వృద్ధి) గోధుమల ఉత్పత్తిపై వేసవి ప్రభావం, భౌగోళిక–రాజకీయ సమస్యలు, డిమాండ్–మార్జిన్లపై పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం క్యూ1లో వృద్ధి వేగాన్ని 13 శాతానికి తగ్గిస్తాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ సంబంధించిన ఉత్పత్తి (జీవీఏ) స్థూల విలువ జోడింపు విధానంలో వృద్ధి 12.6 శాతానికి పరిమితం కావచ్చు. జీడీపీలో మెజారిటీ షేర్ ఉన్న సేవల రంగంలో 17 నుంచి 19 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం. 9 నుంచి 11 శాతం వృద్ధితో పారిశ్రామిక రంగం రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఆరవ నెలలోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోంది. ఇటీవల కమోడిటీ ధరలు కొంత తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు కొంత తగ్గవచ్చు. ఈ పరిస్థితిలో రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్)లో ద్రవ్యోల్బణం 6.5 శాతం నుంచి 7 శాతం వరకూ ఉండవచ్చు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ అంచనా (6.2 శాతం) ఇది ఎక్కువే కావడం గమనార్హం. – అదితీ నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
దేశంలో రిటైల్ జోరు..కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారాలు కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బుధవారం తెలి పింది. ‘రిటైల్ వ్యాపారం తూర్పు భారత్లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది. దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్ 17% దూసుకెళ్లాయి. ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్నెస్, వ్యక్తిగత సంరక్షణ 3% పెరిగాయి. పండుగల సీజన్లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్లో 13 శాతం ఎగశాయి. -
డేంజర్ బేల్స్.. మౌలిక రంగ వృద్ధిలో క్షీణత..
న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల మౌలిక పరిశ్రమల గ్రూప్, మార్చిలో 4.3 శాతం పురోగతి సాధించింది. ఫిబ్రవరిలో నమోదయిన 6 శాతంకన్నా తాజా సమీక్షా నెలల్లో వృద్ధి వేగం తగ్గింది. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 గణాంకాలను పరిశీలిస్తే.. మౌలిక రంగంలో అసలు వృద్ధిలేక పోగా 6.4 శాతం క్షీణించింది. గణాంకాలు ఇలా... అధికారిక గణాంకాల ప్రకారం, సమీక్షా కాలంలో బొగ్గు, క్రూడ్ ఆయిల్ 0.1 శాతం, 3.4 శాతం చొప్పున క్షీణించాయి. అయితే సహజవాయువు (7.6 శాతం), స్టీల్ (3.7 శాతం), సిమెంట్ (8.8 శాతం), విద్యుత్ (4.9 శాతం) రంగాలు కొంత పర్వాలేదనిపించింది. అయితే 2021 మార్చితో ఈ రేట్లు హై బేస్తో వరుసగా 12.3 శాతం, 31.5 శాతం, 40.6 శాతం, 22.5 శాతాలుగా ఉన్నాయి. ఇక సమీక్షా నెల మార్చితో రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువుల రంగం వృద్ధి రేట్లు వరుసగా 6.2 శాతం, 15.3 శాతాలుగా ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 40.27 శాతం. ఐఐపీ మార్చి గణాంకాలు వచ్చే రెండు వారాల్లో విడుదలవుతాయి. చదవండి: బ్రిటన్ కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను! అదే నిజమైతే! -
పారిశ్రామిక ఉత్పత్తి ఓకే!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో 1.3 శాతం పురోగతి (2021 ఇదే కాలంతో పోల్చి) సాధించింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు విడుదల చేసింది. 2021 జనవరిలో ఐఐపీలో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 0.6 శాతం క్షీణతలో ఉంది. 2021 డిసెంబర్లో వృద్ధి రేటు కేవలం 0.7 శాతంగా ఉంది. మైనింగ్, మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగాలు తాజా సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉండగా, భారీ పెట్టుబడులకు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది. ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 13.7 శాతం వృద్ధి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 13.7 శాతంగా నమోదయ్యింది. దీనికి లో బేస్ ఎఫెక్ట్ కూడా ఒక కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలాన్ని పరిశీలిస్తే, అసలు వృద్ధిలేకపోగా 12 శాతం క్షీణత నమోదయ్యింది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. పలు నెలల నుంచి క్షీణతలో కొనసాగిన పారిశ్రామిక ఉత్పత్తి 2021 మార్చి నుంచి స్థిరంగా సానుకూల శ్రేణిలో కదిలింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... చదవండి: రిస్క్ ప్రాజెక్టులకు ఈక్విటీ నిధులే బెటర్! -
వృద్ధి రేటులో ఏపీ సరికొత్త రికార్డ్
-
జనవరిలో మౌలిక రంగం వృద్ధి 3.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు జనవరిలో 3.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 1.3 శాతం. 2021 డిసెంబర్లో ఈ రేటు 4.1 శాతం. అధికారిక గణాంకాల ప్రకారం, బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉంది. క్రూడ్ ఆయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది. బొగ్గు (8.2 శాతం), సహజ వాయువు (11.7 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (3.7 శాతం), సిమెంట్ (13.6 శాతం) ఉత్పత్తులు బాగున్నాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాల పనితీరు అంతంతమాత్రంగానే నమోదయ్యింది. కాగా, ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ గడచిన 10 నెలల్లో ఈ ఎనిమిది రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా ఉంటే, 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ధిలేకపోగా 8.6 క్షీణత నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 44 శాతం. రానున్న రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు వెలువడనున్నాయి. -
మార్కెట్ విలువలపై అధ్యయనం
సాక్షి, అమరావతి: స్థిరాస్తి మార్కెట్ విలువలపై రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, వృద్ధి రేటును పరిగణలోకి తీసుకుని స్థానిక మార్కెట్ విలువలు ఏమైనా పెరిగాయా? అనే కోణంలో విస్తృత సమాచారాన్ని సేకరిస్తోంది. ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవో నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్గా, ఎంఆర్వో, ఎంపీడీవో సభ్యులుగా కమిటీలు నియమించారు. పట్టణ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్గా జడ్పీ సీఈవో, పట్టణాభివృద్ధి సంస్థ కమిషనర్ సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఏకాభిప్రాయంతో ప్రతిపాదనలు సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి, భూ మార్పిడి తదితర అంశాల ఆధారంగా మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో సమాచారం సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని కమిటీ సమావేశాల్లో చర్చించి ఏకాభిప్రాయంతో మార్కెట్ విలువలపై ప్రతిపాదనలు తయారు చేస్తారు. అనంతరం ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు కూడా స్వీకరించి మార్పులు చేర్పులుంటే నమోదు చేస్తారు. అనంతరం తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. వీటి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ విలువలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీలోపు ప్రతిపాదనలు సమర్పించాలని కమిటీలకు ప్రభుత్వం సూచించింది. గడువు ముగియనుండటంతో.. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి అభివృద్ధిని బట్టి ఆయా ప్రాంతాల మార్కెట్ విలువలను సవరిస్తారు. కరోనా కారణంగా గత సంవత్సరం సవరణను ప్రభుత్వం వాయిదా వేసింది. 2022 మార్చి 31 వరకు సవరణను వాయిదా వేస్తున్నట్లు గతేడాది ఉత్వర్వులిచ్చింది. ఆ గడువు ముగియనుండటంతో మార్కెట్ విలువలపై అధ్యయనం చేస్తోంది. -
పారిశ్రామిక ఉత్పత్తి... నాలుగో నెలా నిరాశే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి వరుసగా నాల్గవ నెల 2021 డిసెంబర్లోనూ పేలవంగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 0.4 శాతంగా నమోదయినట్లు (2020 ఇదే నెలతో పోల్చి) జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. మొత్తం సూచీలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండంకెల్లో వృద్ధి నమోదయ్యింది. అటు తర్వాత క్రమంగా బలహీనపడింది. 2020 లో బేస్ ఎఫెక్ట్ ప్రభావం క్రమంగా తొలగిపోతూ రావడం కూడా దీనికి కారణం. సెప్టెంబర్లో 4.4 శాతం, అక్టోబర్లో 4 శాతం, నవంబర్లో 1.3 శాతం (తొలి 1.4 శాతానికి దిగువముఖంగా సవరణ) వృద్ధి రేట్లు నమోదయ్యాయి. కొన్ని కీలక రంగాల పనితీరును పరిశీలిస్తే.. ► మైనింగ్ రంగంలో వృద్ధి 2.6 శాతంగా నమోదయ్యింది. ► విద్యుత్ ఉత్పత్తి 2.8 శాతం పెరిగింది. ► పెట్టుబడులు, భారీ యంత్రసామాగ్రి కొనుగోళ్లను ప్రతిబింబించే క్యాపిటల్ గూడ్స్ విభాగం కూడా 2021 డిసెంబర్లో క్షీణతలోనే ఉంది. క్షీణరేటు 4.6 శాతంగా నమోదయ్యింది. 2020 ఇదే నెలల్లో ఈ విభాగంలో 2.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ► రిఫ్రిజిరేటర్లు, ఎయిర్కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో కూడా 2.7 శాతం క్షీణతను నమోదయ్యింది. 2020 డిసెంబర్లో ఈ విభాగంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ఇక ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కు సంబంధించి విభాగంలో ఉత్పత్తి కూడా 0.6 శాతం క్షీణతలోనే ఉంది. 2020 డిసెంబర్లో ఈ విభాగం 1.9 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. తొమ్మిది నెలల్లో ఇలా... ఇక ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 15.2 శాతం. లో బేస్ దీనికి ప్రధాన కారణం. 2020 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 13.3 శాతం క్షీణత నమోదయ్యింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... -
కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!
న్యూయార్క్: గత వారం ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక వారపు కేసులు ఇవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అయితే మరణాల సంఖ్య స్థిరంగా 50వేలకు పైగా కొనసాగుతున్నాయని పేర్కొన్నది. కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5 శాతం పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుదల కనిపిస్తోందని, మొత్తంగా చూస్తే పెరుగుదల రేటు మందగిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో 39శాతంతో అత్యధికంగా కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 36 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అమెరికాలలో మరణాలు పెరిగాయని, ఇతర ప్రాంతాలలో తగ్గాయని వివరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించింది. దేశాలన్నీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరింది. -
ఎకానమీ స్పీడ్ 5 శాతం దాటకపోవచ్చు
ముంబై: ఎకానమీపై కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం తప్పదని ఇక్రా రేటింగ్స్ హెచ్చరించింది. నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) దీని ప్రభావం వల్ల 40 బేసిస్ పాయింట్లు మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) కోత తప్పదని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 5 శాతం శ్రేణిలోనే ఉంటుందని ఆభిప్రాయపడింది. ఒమిక్రాన్ వల్ల నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటు 0.3 శాతం మేర హరించుకుపోతుందని, ఈ నేపథ్యంలో వృద్ధి రేటు 5.8–5.9 శాతం శ్రేణికి పరిమితమవుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనా వేసిన మరుసటి రోజే అంతకంటే తక్కువగా వృద్ధి శాతాన్ని చూపుతూ ఇక్రా విశ్లేషణ వెలువడిన విషయం గమనార్హం. కాగా మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదని ఇక్రా స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) 7.4 శాతం క్షీణ ఎకానమీ గణాంకాల నేపథ్యంలో 2021–22లో మొదటి రెండు త్రైమాసికాల్లో (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్) భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్లు వరుసగా 20.1 శాతం, 8.4 శాతాలుగా నమోదయిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మొత్తంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. ఆర్బీఐ ఈ అంచనాలను 9.5 శాతంగా పేర్కొనగా, వివిధ సంస్థలు 8.5 నుంచి 10 శ్రేణిలో అంచనాలను వెలువరిస్తున్నాయి. ఏజెన్సీ చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపిన ఇక్రా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మూడవ వేవ్ ఇప్పుడే ప్రారంభమైనందున, ఈ అంశంపై తక్షణం ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. ముందస్తు సూచనలు, కొత్త అంటువ్యాధి విస్తరణ విశ్లేషణల ఆధారంగా మున్ముందు పరిస్థితిని అంచనావేయవచ్చు. మొబిలిటీ ఆంక్షల వల్ల ముఖ్యంగా కాంటాక్ట్ ప్రాతిపదికన ఉపాధి రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే వీలుంది. ► ఇప్పటికి 2021–22లో 9 శాతం వృద్ధి అంచనాలనే కొనసాగిస్తున్నాం. మూడవ వేవ్ ప్రభావంపై డేటా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డిసెంబర్లో ప్రభుత్వ వ్యయాల గణాంకాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. ► కేంద్రం గత నెల్లో రూ.3.73 లక్షల కోట్ల అదనపు వ్యయ ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు ఎంత మేర పెరిగితే అంతమేర మూడవవేవ్ ప్రభావం తగ్గుతుంది. దీనికితోడు మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వాలు, కుటుంబాల సంసిద్ధత, ఆరోగ్య వ్యవస్థ పటిష్టత వంటి అంశాలూ ఇక్కడ కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇంకా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ► సరఫరాల కొరత తగ్గడం, పండుగల సీజన్ వంటి అంశాల నేపథ్యంలో మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లో వృద్ధి రేటు అంచనాలను యథాతథంగా 6 నుంచి 6.5 శ్రేణిలో కొనసాగిస్తున్నాం. ► ఇటీవలి కోవిడ్–19 కేసుల పెరుగుదల, అనిశ్చితికి దారితీసే అంశాల నేపథ్యంలో ‘ద్రవ్యోల్బణం తీవ్ర ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంటే తప్ప’ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన సరళతర విధానాన్ని ఇప్పుడే విడనాడకపోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే వరుస 10వ ద్వైమాసిక సమావేశాల్లోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 4శాతం) ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే వీలుంది. -
అప్పులపై తప్పుదోవ
సాక్షి, అమరావతి: రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేని విపక్ష టీడీపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. సానుకూల వృద్ధి దిశగా ఏపీ పరుగులు తీస్తుంటే తట్టుకోలేక తిరోగమనం అంటూ దుష్ప్రచారానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019–20లో వృద్ధి రేటు పెరిగిందని, కరోనా కష్టాలతో మధ్యలో తగ్గినా ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని బుగ్గన స్పష్టం చేశారు. కరోనాలోనూ తలసరి ఆదాయాలు పడిపోకుండా చూశామన్నారు. ఒకవైపు రెవెన్యూ లోటు తగ్గుతోందని కాగ్ చెబుతున్నా టీడీపీ నేతలు అబద్ధాలు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంతో పోలిస్తే 2020–21లో రాష్ట్రంలో ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు తక్కువేనని చెప్పారు. ప్రతీ అప్పు, ప్రతీ ఖర్చుకూ లెక్కలున్నాయని, ప్రత్యక్ష నగదు బదిలీలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని తెలిపారు. ఈ మేరకు మంత్రి బుగ్గన ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పులపై కోవిడ్ ప్రభావం 2020 నుంచి జీఎస్డీపీ, తలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం, అప్పులపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపినా ఇది ప్రభుత్వ లోపాల వల్ల మాత్రం కాదు. విభజన సవాళ్లతో పోరాడుతున్న సమయంలో కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందనే వాస్తవాలను గుర్తుంచుకోవాలి. ► గత సర్కారు హయాంలో అనుకూల పరిస్థితులున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 2017–18లో 10.09 శాతం, 2018–19లో 4.88 శాతానికి క్షీణించింది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో అత్యల్పం. ప్రస్తుత ధరలతో తప్పుదోవ యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఎన్నో ఏళ్లు పనిచేశారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆర్థిక వృద్ధిని లెక్కించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సబబేనా? టీడీపీ నేతలు ప్రస్తుత ధరలతో జీఎస్డీపీని పోల్చి చూడటం వల్ల 2020–21కి సంబంధించి వాస్తవ జీఎస్డీపీ లెక్కలతో వారి వాదన సరిపోలడం లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీ వృద్ధి రేటు 2019–20లో 7.23 శాతం పెరిగింది. ఇది దేశంలో ఆంధ్రప్రదేశ్ను నాలుగో స్థానంలో నిలబెట్టింది. తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్డీపీ క్షీణతను 2020–21లో 2.58 శాతానికి పరిమితం చేసింది. తద్వారా మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, కర్నాటక, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ లాంటి ఎన్నో రాష్ట్రాల కంటే మెరుగ్గా నిలిచింది. తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి రేటు గత ప్రభుత్వ హయాంలో 2017–18లో 14.6 శాతం ఉండగా 2018–19లో 10.11 శాతానికి క్షీణించింది. 2019–20లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.63 శాతం ఉంది. ఇది దేశంలో 3వ వేగవంతమైన వృద్ధి రేటు. తెలంగాణ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల కన్నా ఏపీ మెరుగైన పనితీరు కనబరిచింది. 2020–21లో కరోనా వల్ల జాతీయ స్థాయిలో తలసరి వృద్ధి రేటు మైనస్ 4 శాతం నమోదు కాగా ఏపీలో తలసరి క్షీణతను 1.03 శాతానికి ఆపగలిగాం. రాబడులు గత ఆర్థిక ఏడాదితో పోల్చి చూస్తే ఈదఫా తొలి ఆరు నెలల్లో రెవెన్యూ లోటు తగ్గిందని సెప్టెంబర్లో కాగ్ నివేదిక స్పష్టం చేసినా రెవెన్యూ లోటు ఆర్థిక లోటును అధిగమించిందని ప్రతిపక్ష నేతలు పచ్చి అవాస్తవాలు చెబుతున్నారు. రాష్ట్ర పన్నుల రాబడులు 2021–22లో పెరుగుతున్నాయి. 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 34 శాతం రాబడుల్లో వృద్ధి నమోదైంది. ద్రవ్య, రెవెన్యూ లోటు విభజన సమస్యలకు తోడు గత సర్కారు నిర్వాకాలు, విచ్చలవిడి ఖర్చులతో రాష్ట్ర ద్రవ్య బాధ్యతలు అనవసరంగా పెరిగాయి. కోవిడ్ నివారణకు లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. 2020–21లో కేంద్ర ద్రవ్య లోటు 9.5 శాతం, రెవెన్యూ లోటు. 7.5 శాతానికి పెరిగాయి. ఇదే ఏపీలో 2019–20లో ద్రవ్య లోటు 3.5 శాతం, రెవెన్యూ లోటు 2.6 శాతం మాత్రమే ఉంది. 2020–21లో ద్రవ్యలోటు 5.38 శాతం, రెవెన్యూ లోటు 3.46 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరగడానికి అసలు కారణాలను చెప్పకుండా ప్రభుత్వాన్ని నిందించడం విడ్డూరం. అప్పులపై దుష్ప్రచారం టీడీపీ సర్కారు బడ్జెటేతర అప్పులతో కలిపి రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. 2021 మార్చి 31 నాటికి ప్రజాపద్దు కింద తీసుకున్న రుణాలు రూ.3,55,874.3 కోట్లు. ఇందులో కోవిడ్ కారణంగా కేంద్రం అనుమతించిన జీఎస్డీపీలో అదనపు 2% రూ.20 వేల కోట్లున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగే కొద్దీ రుణ విలువ పరిమితి పెరుగుతుంది. విభజన సమయానికి ప్రజా రుణం రూ.1,30,654.34 కోట్లకు పెరగ్గా 2019 మార్చి 31 నాటికి రూ.2,57,509.87 కోట్లకు చేరింది. గత ప్రభుత్వం రూ.1,20,000 కోట్లు అప్పు చేసి నీరు–చెట్టు లాంటి పథకాలతో వృథాగా ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ప్రజా రుణం రూ.16,419 కోట్లు ఎక్కువగా తీసుకోవడంతో కేంద్రం 2021–22లో రుణ పరిమితిని తగ్గించింది. డీబీటీతో ప్రజలకు రూ.1,14,9670.93 కోట్లు కోవిడ్ సంక్షోభంలో సమాజంలోని అన్ని వర్గాలకు ఆర్థిక సాయం అందించి ఆదుకునేందుకు గత రెండున్నరేళ్లలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.1,14,967.93 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. జూన్ 2019 నుంచి ఇప్పటి వరకు మొత్తం 6,82,02,159 ప్రత్యక్ష నగదు బదిలీలు జరిగాయి. కోవిడ్ సంక్షోభాన్ని అధిగమించడానికి కేంద్రం అనుమతించిన మేరకు డబ్బును అప్పుగా తీసుకున్నాం. ప్రతి రూపాయికీ లెక్కలు చూపిస్తాం. ఆ రుణాలు గుదిబండగా.. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.31,647.64 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకు, డిస్కమ్లు ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,817.69 కోట్ల నుంచి రూ.20,121.97 కోట్లకు ఎగబాకాయి. పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.20,000 కోట్లు, ఏపీఆర్డీసీ ద్వారా రూ.3,000 కోట్లు, ఏపీడబ్ల్యూఆఆర్డీసీ ద్వారా రూ.4,000 కోట్లు, సీఆర్డీఏకు రూ.5,014 కోట్లు, ఏపీటిడ్కోకు రూ.4,601.59 కోట్లు, రైతు సాధికార సంçస్థ్దకు రూ.2,000 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీ రూ.1,356 కోట్లు, ఏపీడీడబ్ల్యూసీ రూ.980 కోట్లు, ఏపీఎస్ఎహెచ్సీ రూ.1,870 కోట్లు, ఇతర కార్పొరేషన్ల రుణాలు రూ.9,438.59 కోట్ల అప్పు చేశారు. 2–3 ఏళ్ల మారటోరియంతో ఇది తీసుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వంపై పెనుభారం పడింది. -
వ్యవసాయ వృద్ధి రేటులో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రజా మౌలిక వసతుల కల్పన, సౌకర్యాల విషయంలో మెరుగైన పనితీరు కనపరిచింది. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా శనివారం విడుదల చేసిన సుపరిపాలన సూచిక–2021 (గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్–జీజీఐ) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రాష్ట్ర వార్షిక వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3 శాతం ఉండగా, 2020–21లో 11.3 శాతానికి పెరిగింది. ఉద్యానవన పంటల రంగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. రాష్ట్ర ఉద్యానవన పంటల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 12.3 శాతానికి చేరింది. పాల ఉత్పత్తిలో వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 11.7 శాతానికి పెరిగింది. మాంసం ఉత్పత్తికి సంబంధించిన వృద్ధి రేటులో గణనీయమైన మార్పు నమోదైంది. 2019 ఇండెక్స్లో 6.7 శాతంగా ఉన్న వృద్ధిరేటు.. 2021 ఇండెక్స్లో 10.3 శాతానికి పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో పంటల బీమా 20.2 శాతం నుంచి 26.1 శాతానికి చేరుకుందని వెల్లడించింది. పెరిగిన వైద్యుల సంఖ్య ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య బాగా పెరిగినట్లు జీజీఐ నివేదిక స్పష్టం చేసింది. 2019లో 90.21 శాతంగా ఉన్న డాక్టర్ల సంఖ్య ఇప్పుడు 96.61 శాతానికి చేరింది. ప్రజల్లో రోగనిరోధక శక్తిలో కూడా గణనీయమైన వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది. 2019లో ఉన్న 89.96 శాతం నుంచి 97.83 శాతానికి చేరింది. మాతృ, శిశు మరణాల సంఖ్య బాగా తగ్గడం రాష్ట్రంలో ప్రజా వైద్య సదుపాయాలు మెరుగైన విషయాన్ని స్పష్టం చేస్తోంది. మాతృ మరణాల సంఖ్య 74 నుంచి 65కి తగ్గితే, శిశుమరణాలు 32 నుంచి 29కి తగ్గాయి. సొంత ఆదాయంలో పెరుగుదల 2019తో పోలిస్తే 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా తగ్గిన విషయాన్ని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర సొంత ఆదాయం 45.76 శాతం నుంచి 51.17 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా 46.56 శాతం నుంచి 42.56 శాతానికి చేరింది. అందరికీ ఇళ్లు విషయంలో కూడా రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. 2019లో 17.6 శాతంగా ఉన్న అందరికీ ఇళ్లు సంఖ్య 2021 నాటికి 24.10 శాతానికి చేరింది. 2019లో 42.5 శాతంగా ఉన్న మహిళా ఆర్థిక స్వావలంబన రేటు 2020–21 నాటికి 58.2 శాతానికి పెరిగింది. 2019లో ప్రతి వెయ్యి మంది బాలురులకు 946గా ఉన్న బాలికల సంఖ్య ఇప్పుడు 955కు పెరిగింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలపై నమోదైన కేసులు తగ్గాయి. 2019లో 26.96గా ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల సంఖ్య 2021 నాటికి 12.62 శాతానికి తగ్గాయి. ఇదిలా ఉండగా పది రంగాల్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి 58 సూచికల ఆధారంగా ఈ నివేదిక సిద్ధం అయ్యింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోర్టల్ స్కోర్లో 100 శాతం విజయాన్ని నమోదు చేస్తున్నాయి. 20 రాష్ట్రాలు తమ కాంపోజిట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ స్కోర్లను మెరుగు పరుచుకున్నాయి. -
8.9% కాదు... 9.5%
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను స్విస్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ 9.5 శాతానికి పెంచింది. ఇప్పటి వరకూ ఈ అంచనా 8.9 శాతం. ఆర్థిక రికవరీ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతుండడం, పెరిగిన వినియోగ విశ్వాసం, వ్యయాల పెరుగుదల వంటి అంశాలు తమ అంచనాల పెంపునకు కారణమని వివరించింది. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు వరుసగా 7.7 శాతం, 6 శాతంగా నమోదవుతుందన్నది అంచనాగా తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021–22 జీడీపీ వృద్ధి రేటుకు సమానంగా తాజాగా యూబీఎస్ సెక్యూరిటీస్ తన అంచనాలను పెంచడం గమనార్హం. ప్రభుత్వం 10 శాతం అంచనావేస్తోంది. వివిధ రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనా శ్రేణి 8.5 శాతం నుంచి 10 శాతం వరకూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం. వడ్డీరేట్లు పెరిగే అవకాశం! రానున్న 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తక్కువ వడ్డీరేటు ప్రయోజనాలకు ముగింపు పలికే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను అరశాతం పెంచే అవకాశం ఉందని కూడా యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనావేసింది. 2021–22లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందన్న ఇంతక్రితం అంచనాలను 4.8 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22లో 10.1 శాతంగా, 2022–23లో 8.8 శాతంగా నమోదవుతుందని తమ అంచనా అని యూబీఎస్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10 శాతం నమోదవుతుందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవ్రాయ్ వ్యక్తం చేశారు. ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
వచ్చే త్రైమాసికాల్లో పటిష్ట వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న త్రైమాసికాల్లో పటిష్ట వృద్ధి రేటును నమోదుచేసుకుంటుదన్న విశ్వాసాన్ని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ ప్రదీప్ ముల్తానీ వ్యక్తం చేశారు. పీహెచ్డీసీసీఐ ట్రాక్ చేసే 12 ప్రధాన ఆర్థిక, వాణిజ్య ఇంటికేటర్లలో తొమ్మిది 2021 సెప్టెంబర్లో (2020 సెప్టెంబర్తో పోల్చితే) మంచి పురోగతిలో ఉన్నాయని, 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్లో ఆరు రంగాలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని ముల్తానీ పేర్కొన్నారు. జీఎస్టీ వసూళ్లు, స్టాక్ మార్కెట్, యూపీఐ లావాదేవీలు, ఎగుమతులు, మారకపు విలువ, విదేశీ మారకద్రవ్య నిల్వలు, రిటైల్– టోకు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, వంటి అంశాలు 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్లో ఎంతో పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రత్యేకించి నిరుద్యోగ సమస్య ఆగస్టులో 8.3 శాతం ఉంటే, సెప్టెంబర్లో 6.9 శాతానికి తగ్గినట్లు తెలిపారు. సవాళ్లు ఉన్నాయ్.. కాగా, సానుకూల అంశాలతోపాటు ప్రస్తుతం ఉన్న సమస్యల్లో కమోడిటీ ధరల తీవ్రత ఒకటికాగా, మరొకటి ముడి పదార్థాల కొరతని తెలిపారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో వినియోగం, ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గృహ వినియోగం మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. దీనివల్ల డిమాండ్, పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడతాయని తెలిపారు. ఆగస్టు 31వ తేదీన విడుదలైన గణాంకాల ప్రకారం, 2021–22 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. -
క్యూ3లో చైనా వృద్ధి 4.9 శాతం
బీజింగ్: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మూడవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెపె్టంబర్) 4.9 శాతంగా నమోదయ్యింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలంతో పోలి్చతే (7.9 శాతం) వృద్ధి రేటు తగ్గడం గమనార్హం. కరోనా సవాళ్లకుతోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని తాజా గణాంకాలు సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 18.3 శాతం పురోగమించిన సంగతి తెలిసిందే. మూడు త్రైమాసికాల్లో ఎకానమీ 9.8 శాతం వృద్ధి సాధించినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిక్స్ (ఎన్బీఎస్) పేర్కొంది. ఈ తొమ్మిది నెలల్లో వినియోగం వాటా మొత్తం జీడీపీలో 64.8 శాతంగా ఉందని ఎన్బీఎస్ ప్రతినిధి ఫు లింగ్హవా పేర్కొన్నారు. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో 2020 తొలి త్రైమాసికం మినహా గత ఏడాది మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. కరోనా సవాళ్లతో 2020 మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ మధ్యా ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్ డాలర్లు) నమోదుచేసుకుంది. అయితే గడచిన 45 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో దేశం వృద్ధి రేటు నమోదుకాలేదు. 2021లో దేశ ఎకానమీ పదేళ్ల గరిష్ట స్థాయిలో 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. -
భారత్ ఎకానమీ రికవరీ బాట
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ బాటన వేగంగా పయనిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో గడచిన ఏడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు దీనికి కారణమని అన్నారు. మహమ్మారి సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు ప్రభుత్వం సంస్కరణల ప్రక్రియను కొనసాగించినట్లు తెలిపారు. పలు వ్యూహాత్మక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ‘‘మహమ్మారి సవాళ్లు విరిసిన 18 నెలల్లో ఈ సమస్యలను కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా నిర్వహించింది. ప్రత్యేకించి సంస్కరణల పటిష్ట అజెండా అమలు ద్వారా ఆర్థిక వ్యవస్థను వేగవంతమైన రికవరీ బాటన నిలబెట్టింది. దీనితో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పుంజుకునే అవకాశం ఏర్పడింది’’ ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో అని ఆయన అన్నారు. కొనసాగుతున్న సవాళ్లు ఇవీ... మహమ్మారి నేపథ్యంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి పుంజుకోకపోవడం కొంత నిరాశ కలిగిస్తోందని అన్నారు. ప్రైవేటు పెట్టుబడుల్లో మందగమనం దీనికి ప్రధాన కారణమని వివరించారు. మౌలిక రంగం పురోగతి కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలని ఆయన పారిశ్రామిక వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జీడీపీలో మౌలిక విభాగం పెట్టుబడుల వాటా 5 నుంచి 6 శాతం ఉందని ఆయన పేర్కొంటూ ఈ పరిమాణం రెట్టింపు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం–పరిశ్రమ మధ్య సన్నిహిత సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. చదవండి : ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ ట్రేడింగ్పై బీఎస్ఈ కసరత్తు -
మౌలిక రంగం పరుగు
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ ఆగస్టులో మంచి పురోగతిని కనబరిచింది. ఈ రంగాల వృద్ధి రేటు 11.6 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, ఎరువుల విభాగాలుమినహా కీలక రంగాల పురోగతితోపాటు లో బేస్ ఎఫెక్ట్ కూడా దీనికి కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఆగస్టు నెలను తీసుకుంటే కరోనా కష్టాలతో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 6.9 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లో బేస్తో పోలి్చతే తాజా సమీక్షా నెల్లో ఎనిమిది రంగాల ఉత్పత్తి 11.6 శాతం పెరిగిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) ఈ గ్రూప్ వెయిటేజ్ దాదాపు 40.27 శాతం. గురువారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన గణాంకాలను పరిశీలిస్తే... ► బొగ్గు, సహయ వాయువు రంగాల ఉత్పత్తిలో 20.6 శాతం పురోగతి నమోదయ్యింది. ► సిమెంట్ రంగం 36.3% పురోగమించగా, స్టీల్ విషయంలో ఈ వృద్ధి శాతం 5.1 శాతంగా ఉంది. ► పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తి 9.1% పెరిగింది. ► విద్యుత్ ఉత్పత్తి 15.3 శాతం ఎగసింది. ► క్రూడ్ ఆయిల్ (మైనస్ 2.3 శాతం), ఎరువుల (మైనస్ 3.1 శాతం) పరిశ్రమలు మాత్రం ఇంకా వృద్ధి నమోదుకాకపోగా, క్షీణతను ఎదుర్కొన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఎనిమిది రంగాల పురోగతి 19.3 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కరోనా కష్టాలతో ఈ గ్రూప్ వృద్ధి లేకపోగా 17.3 శాతం క్షీనత నమోదయ్యింది. -
Telangana: వ్యవసాయం భళా.. వృద్ధి రేటులో రెండో స్థానం
వ్యవసాయ వృద్ధి ప్రధానంగా క్రియాశీలక వ్యవసాయ విధానం, నీటిపారుదల సౌకర్యం, భూ సంస్కరణలు చేపట్టడం వల్లే సాధ్యమైంది. సాంకేతిక పరిజ్ఞానం కూడా భారీ వృద్ధి రేటుకు దోహదపడింది. సరళీకృత ఆర్థిక వ్యవస్థతో కొన్ని రాష్ట్రాలు వ్యవసాయంలో ముందుకు సాగాయి. – నీతి ఆయోగ్ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది. పదేళ్లలో వ్యవసాయ పంటల వృద్ధి రేటులో దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. 6.87 శాతం వృద్ధి రేటుతో త్రిపుర ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 6.59 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. సిక్కిం కూడా ఇదే స్థానంలో ఉంది. అయితే పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణదే మొదటి స్థానమని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో ఉద్యానం, పాడి, పశుసంవర్థక తదితర అనుబంధ రంగాల వృద్ధి రేటులో రాష్ట్రం ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని నీతి అయోగ్ వెల్లడించింది. 2011–20 మధ్య కాలంలో దేశంలో వ్యవసాయ రంగ పురోగతి, వివిధ రాష్ట్రాలు సాధించిన వృద్ధిపై రూపొందించిన విశ్లేషణ పత్రాన్ని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసింది. కేవలం 11 రాష్ట్రాల్లో మాత్రమే 3 శాతానికి మించి సగటు పంటల వృద్ధి రేటు నమోదైందని వెల్లడించింది. పది రాష్ట్రాల్లో మైనస్ 3.63 శాతం నుంచి ఒక శాతం లోపు వృద్ధి రేటు నమోదైంది. మరో ఎనిమిది రాష్ట్రాల్లో వృద్ధి రేటు 1.05 శాతం నుంచి 2.96 శాతం మధ్య నమోదైంది. మిగిలిన 11 రాష్ట్రాల్లో 3.38 శాతం నుంచి 6.87 శాతం నమోదైంది. రైతు ఆదాయంలో పడిపోయిన పంటల వాటా దేశంలో రైతు ఆదాయంలో పంటల వాటా 2011–12లో 65.4 శాతం ఉండగా, 2018–19 నాటికి అది 55.3 శాతానికి పడిపోయింది. పంచవర్ష ప్రణాళికలు మొదలైన తొలి 15 ఏళ్లలో వరి, గోధుమ, మొక్కజొన్న పంటల వార్షిక వృద్ధి రేటు 4.28 శాతం వరకు నమోదవగా గత 15 ఏళ్లలో ఆ 3 పంటల సగటు వృద్ధి రేటు 2.37 శాతానికే పరిమితమైంది. చిరుధాన్యాల వృద్ధి రేటు 2.88 శాతం నుంచి 1.94 శాతానికి తగ్గిందని, ఈ నేపథ్యంలో విధానకర్తలు మేల్కోవాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ హెచ్చరించింది. మరికొన్ని ముఖ్యాంశాలు ►సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యవసాయ పరిమాణం క్షీణిస్తోంది. వ్యవసాయం నుంచి కొందరు రైతులు బలవంతంగా బయటకు రావాల్సి వచ్చింది. కొందరు కూలీలుగా మారారు. పెరుగుతున్న సాగు వ్యయం. ప్రపంచ పోటీతత్వానికి అనుగుణంగా మారే పరిస్థితులు లేకపోవడమే ఇందుకు కారణం. 2001–11 మధ్యకాలంలో దేశంలో కొందరు వ్యవసాయేతర రంగంలో భాగస్వాములయ్యారు. ►ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ రైతులకు ప్ర భుత్వాల నుంచి చాలా తక్కువ సహకారం లభిస్తోంది. గ్రామీణ మహిళా కార్మికులలో 73% మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు. ►గత పదేళ్లలో వ్యవసాయానికి ఇస్తున్న సబ్సిడీలు స్వల్పంగా పెరిగాయి. విద్యుత్ సబ్సిడీ కాకుండా చూస్తే 2011–12లో రూ. లక్ష కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2028–19లో అది రూ. 1.51 లక్షల కోట్లకు చేరింది. మత్య్సరంగానికి ఇస్తున్న సబ్సిడీ చాలా తక్కువగా ఉంటోంది. కొన్నిచోట్ల లేనేలేదు. ప్రభుత్వ భాగస్వామ్యం కరువైంది. ►కూరగాయలు, పండ్లు పండిస్తే మద్దతు ధర అందడం లేదు. దీంతో ఆయా పంటలపై రైతు లు ఆసక్తి కనబరచడం లేదు. హరిత విప్లవం వచ్చాక వ్యవసాయరంగంలో ఆధునిక పరిజ్ఞానం అమలు జరిగింది. దీంతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సంభవించాయి. ►వ్యవసాయంలో సరైన పద్ధతులు అవలంభించకపోవడం వల్ల ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడేవారు దేశంలో 15 శాతం మంది ఉన్నారు. దేశంలో 15–49 ఏళ్లవయస్సు మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు 53 శాతం మంది ఉన్నారు. -
చైనాను పట్టిపీడిస్తున్న వరుస సంక్షోభాలు...!
Goldman Sachs Cuts China's Growth Forecast: వరుస సంక్షోభాలు చైనాకు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. చైనాలో ఏదైనా సంక్షోభం తలెత్తితే ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. వరుస సంక్షోభాలతో చైనా వృద్దిరేటు మందగించేలా ఉన్నట్లు పలు ఫైనాన్షియల్ సంస్థలు గుర్తించాయి. వరుస సంక్షోభాలు..చైనాకు షాకే..! కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన రియల్టీ సంస్థ ఎవర్గ్రాండే దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. ఈ సంక్షోభం సమసిపోకముందే చైనాను మరో సంక్షోభం తలుపుతట్టింది. తీవ్ర విద్యుత్తు కొరత ఇప్పుడు డ్రాగన్ను పట్టిపీడిస్తోంది. కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ లైట్లు సైతం వెలగడం లేదు. ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న చైనాలో ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పలు దేశాలను ఈ సంక్షోభం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..? షాకిచ్చిన గోల్డ్మన్ సాక్స్..! అమెరికన్ ఇన్వెస్ట్బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీస్ గ్రూప్ గోల్డ్మన్ సాక్స్ చైనాకు షాకిచ్చింది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గిన చైనా వృద్ధి అంచనాను గోల్డ్మన్ సాక్ భారీగా తగ్గించింది. ఈ ఏడాదిగాను చైనా 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లకు, పలు దేశాల ఎకానమీకి చైనీస్ ప్రాపర్టీ భీమోత్ 'లీమన్ సంక్షోభం' గా మారగలదనే భయాల మధ్య చైనా ఇప్పటికే ఎవర్గ్రాండేను కాపాడేందుకు చర్యలను తీసుకుంటుంది. ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికానికిగాను 4.8 శాతం, నాలుగో త్రైమాసికానికి 3.2 శాతం మేర వృద్ధి రేటును తగ్గించింది. మునపటితో పోలిస్తే వృద్ధి రేటు భారీగా తగ్గనుంది. వృద్దిరేటు తగ్గడం చైనాకు భారీ దెబ్బే అని గోల్డ్మన్ సాక్స్ అభిప్రాయపడింది. చదవండి: భారత్లో ఊపందుకొనున్న స్టార్లింక్ శాటిలైట్ సేవలు -
‘తప్పుడు లెక్కలతో ప్రజలను బురిడీ కొట్టించలేరు’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేట్లపై టీడీపీవి తప్పుడు లెక్కలని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. కరోనాకు ముందు ఏడాది 2019-2020లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7.23 శాతంగా ఉన్నట్ల తెలిపారు. వ్యవసాయరంగంలో 7.91 శాతం, పారిశ్రామిక రంగంలో 10.24 శాతం వృద్ధి ఉన్నట్లు చెప్పారు. 20202-2021 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండెక్స్లో ఏపీకి 3వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపులో ఏపీకి 5,6 స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు. చదవండి: AP: ఏఎన్యూకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకు తప్పుడు లెక్కలతో టీడీపీ నేతలు ప్రజలను బురిడీ కొట్టించలేరని ఆయన మండిపడ్డారు. ప్రతి పక్షంలో ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు దాచిపెట్టి టీడీపీకి అనుకూలమైన లెక్కల చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. -
నగర రియల్టీలోకి పెట్టుబడుల వరద
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల వరద ప్రవహిస్తుంది. ప్రతీ ఏటా ఆరోగ్యకరమైన వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఈ ఏడాది జనవరి–జూన్ (హెచ్1) మధ్య కాలంలో నగర రియల్టీలోకి 309.4 మిలియన్ డాలర్లు (రూ.2,250 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో పుణేలోకి 232.2 మిలియన్ డాలర్లు (రూ.1,690 కోట్లు), ముంబైలోకి 188.6 మిలియన్ డాలర్లు (రూ.1,370 కోట్లు), కోల్కతాలోకి 104.6 మిలియన్ డాలర్లు (రూ.760 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. హెచ్1లో చెన్నై రియల్టీలో ఎలాంటి స్టాండలోన్ ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలు జరగలేదు. హైదరాబాద్, చెన్నై నగరాల్లో పలు ప్రాజెక్ట్లలో సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్, ఆర్ఎంజెడ్ కార్ప్ జాయింట్ వెంచర్ 210 మిలియన్ డాలర్లు (రూ.1,500 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి లావాదేవీలను ఒకటే నగరంలో పెట్టుబడులుగా పరిగణించకుండా.. బహుళ నగరాల ఇన్వెస్ట్మెంట్స్గా పరిగణించారు. ఈ ఏడాది హెచ్1లో దేశవ్యాప్తంగా 2.4 బిలియన్ డాలర్లు (రూ.18,600 కోట్లు) పెట్టుబడు లు వచ్చాయి. గతేడాది హెచ్1తో పోలిస్తే 52 శాతం ఎక్కువ. గతేడాది హెచ్1లో నగరంలోకి 79 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. పుణేలోకి 39.7 మిలియన్ డాలర్లు (రూ.290 కోట్లు) ఇన్వెస్ట్మెంట్స్ వచ్చా యి. బెంగళూరు, కోల్కతా, చెన్నైలలో స్టాండలోన్ ఇన్వెస్ట్మెంట్స్ లావాదేవీలు జరగలేదు. గృçహాలు, ఆఫీస్లకు డిమాండ్.. నివాస, కార్యాలయాల సముదాయాలలో పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయమైన నగరంగా మారింది. అంతకుక్రితం ఐదేళ్లతో పోలిస్తే 2015–19లో భాగ్యనగరంలో అత్యధికంగా ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల వృద్ధి నమోదయింది. నిర్మాణంలో ఉన్న ఆఫీస్ ప్రాజెక్ట్లలో కంటే భవిష్యత్తు ప్రాజెక్ట్లలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారని ఆసియా కొల్లియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. ప్రపంచంలోని చాలా వరకు టెక్నాలజీ కంపెనీలు తమ గ్లోబల్ సెంటర్లను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. స్థిరమైన, నిజమైన గృహ వినియోగదారుల నుంచి నివాస సముదాయాలకు డిమాండ్ ఉందని చెప్పారు. సులభమైన వ్యాపార విధానాలు, మెరుగైన మౌలిక వసతుల వంటి కారణంగా రాష్ట్రం నిలకడగా అగ్రస్థానంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ఎకానమీకి లోబేస్ భరోసా.. జీడీపీ జూమ్!
న్యూఢిల్లీ: అంచనాలకు అనుగుణంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ 2021–22 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఇందుకు లోబేస్ ప్రధాన కారణమైంది. అయితే ఇదే కాలంలో దేశం మహమ్మారి సెకండ్వేవ్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఎకానమీ తగిన సానుకూల ఆర్థిక ఫలితాన్ని సాధించడం కొంతలో కొంత ఊరట. లోబేస్ అంటే..? ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 ఏప్రిల్–జూన్ కాలాన్ని తీసుకుంటే కరోనా కష్టాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో అసలు వృద్ధిలేకపోగా (2019 ఇదే కాలంలో పోల్చి) 24.4 శాతం క్షీణతను ఎదుర్కొంది. అప్పటి లోబేస్తో పోల్చితే జీడీపీ విలువ తాజా సమీక్షా కాలంలో 20.1 శాతం పెరిగిందన్నమాట. విలువలు ఇలా... 2020–21 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.26,95,421 కోట్లు (2019–20 తొలి క్వార్టర్తో పోల్చితే 24.4 శాతం డౌన్). జాతీయ గణాంకాల కార్యాలయం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజా సమీక్షా కాలంలో(2021–22 ఏప్రిల్–జూన్) ఈ విలువ రూ.32,38,020 కోట్లకు చేరింది. వెరసి వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదయ్యింది. అయితే తాజా సమీక్షా నెల్లో విలువ కరోనా ముందు కాలంలో పోల్చితే ఇంకా వెనుకబడి ఉండడం గమనార్హం. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకానమీ పరిమాణం రూ.35,66,708 కోట్లు. అప్పటితో పోల్చితే, ఎకానమీ ఇంకా రూ. 3,28,688 కోట్లు వెనుకబడి ఉండడం గమనార్హం. శాతాల్లో చెప్పాలంటే కోవిడ్–19 ముందస్తు కాలంతో పోల్చితే ఇంకా 9.2 శాతం ఎకానమీ వెనుకబడి ఉందన్నమాట. రంగాల వారీగా... ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువ ప్రకారం తాజా సమీక్షా కాలంలో (ఏప్రిల్–జూన్) వివిధ రంగాల వృద్ధి తీరు ఇలా... ► తయారీ: ఈ రంగం ఉత్పత్తి 49.6% ఎగసింది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 36 శాతం క్షీణించింది. ► వ్యవసాయ రంగం: వృద్ధి 3.5% నుంచి 4.5%కి చేరింది. ► నిర్మాణం: 49.5% క్షీణత నుంచి 68.3% వృద్ధికి మళ్లింది. ► మైనింగ్: 18.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య ఈ విభాగం 17.2 శాతం క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవలు: ఈ విభాగంలో తాజా సమీక్షా కాలంలో 14.3 శాతం వృద్ధి నమోదుకాగా, 2020 ఇదే కాలంలో 9.9 శాతం క్షీణత నమోదయ్యింది. ► వాణిజ్యం, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవలు: 48.1 శాతం క్షీణత 34.3 శాతం వృద్ధిబాటకు వచ్చింది. ► ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలు: 2020 ఏప్రిల్–జూన్ మధ్య 5 శాతం క్షీణిస్తే, తాజా సమీక్షా కాలంలో 3.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవల రంగాలు మైనస్ 10.2% నుంచి 5.8% వృద్ధి బాటలోకి వచ్చాయి. త్రైమాసికం పరంగా 16.9 శాతం పతనం త్రైమాసికం పరంగా చూస్తే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఎకానమీ విలువ 38.96 లక్షల కోట్లు. తాజా సమీక్షా కాలంలో ఈ విలువ రూ.32.38 లక్షల కోట్లు. అంటే త్రైమాసికపరంగా చూసినా ఎకానమీ 16.9% డౌన్లో ఉందన్నమాట. దీనికి ప్రధానంగా ఏప్రిల్–మే నెలల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కోవిడ్–19 సెకండ్వేవ్ కారణం. ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) విలువలో చూస్తే క్యూ1లో వృద్ధి రేటు (2020 ఇదే కాలంలో పోల్చి) 18.8% పురోగమించింది. అయితే 2020 జనవరి–మార్చి కాలంతో చూస్తే, విలువ 13.3% క్షీణించడం గమనార్హం. 2021–22పై అంచనాలు ఇలా... కోవిడ్–19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం ఎకనామీ 7.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అయితే లోబేస్కుతోడు ఎకానమీ ఊపందుకుని 2021–22లో వృద్ధి రేటు 17 శాతం వరకూ నమోదవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం సెకండ్వేవ్ సవాళ్లు ప్రారంభమయ్యాయి. దీనితో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు 2021–22పై తమ వృద్ధి అంచనాలను రెండంకెల లోపునకు కుదించేశాయి. 7.5 శాతం నుంచి 9.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదవుతుందన్న అంచనాలను తాజాగా వెలువరిస్తున్నాయి. ఆర్బీఐ, ఐఎంఎఫ్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 9.5 శాతం అంచనావేస్తుండగా, మూడీస్ అంచనా 9.3 శాతంగా ఉంది. అయితే ప్రపంచబ్యాంక్ వృద్ధి రేటు అంచనా 8.3 శాతంగా ఉంది. ఫిచ్ రేటింగ్స్ మాత్రం 10 శాతం వృద్దిని అంచనావేస్తోంది. కాగా, 2021లో 9.6 శాతం, 2022లో 7 శాతం వృద్ధి నమోదవుతుందని మూడీస్ తాజా నివేదికలో అంచనా వేసింది. కీలక రంగాలు విలువల్లో... ఒక్క వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాల విలువలూ కోవిడ్–19 ముందస్తు స్థాయికన్నా తక్కువగానే ఉండడం గమనార్హం. 2019 ఏప్రిల్–జూన్ మధ్య తయారీ రంగం ఉత్పత్తి విలువ 5.67 లక్షల కోట్లయితే, ఈ విలువ 2021 ఏప్రిల్–జూన్ మధ్య రూ.5.43 లక్షల కోట్లుగా ఉంది. సేవల రంగం విలువ మాత్రం కోవిడ్ ముందస్తు స్థాయి (రూ.6.64 లక్షల కోట్లు)కి ఇంకా చాలా దూరంలో ఉంది. సమీక్షా కాలంలో ఈ విలువ రూ.4.63 లక్షల కోట్లుగా ఉంది. వ్యవసాయ రంగం విలువ రూ.4.49 లక్షల కోట్ల నుంచి రూ.4.86 లక్షల కోట్లకు ఎగసింది. దేశ ఎకానమీలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వాటా 15 శాతం చొప్పున ఉండగా, సేవల రంగం విలువ దాదాపు 60 శాతం వరకూ ఉంది. వేగవంతమైన వృద్ధి హోదా తాజా గణాంకాల ప్రకారం, ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకున్న దేశాల్లో మొదటి స్థానం హోదాను భారత్ దక్కించుకుంది. 2021 ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో చైనా వృద్ధి రేటు 7.9 శాతం. భవిష్యత్ వృద్ధికి బాటలు మొదటి త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం రానున్న నెలల్లో ఎకానమీ మరింత మెరుగుపడుతుందన్న సంకేతాలను ఈ గణాంకాలు అందిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధి అంచనాలను ఎగువముఖంగా సవరించే అవకాశం ఉంది. – రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆర్థిక మూలాలు పటిష్టం భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాగత సంస్కరణలు, చేస్తున్న భారీ మూలధన వ్యయాలు వృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఎకానమీలో ‘వీ’ (ఠి) నమూనా వృద్ధి ధోరణి నమోదవుతుందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుదల ధోరణి ఎకానమీకి కలిసివస్తుంది. – కేసీ సుబ్రమణ్యం, సీఈఏ పునరుత్తేజం: పారిశ్రామిక రంగం ఎకానమీ కోవిడ్–19 సవాళ్ల నుంచి కోలుకుని పునరుత్తేజం అవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని భారత్ పారిశ్రామిక రంగం పేర్కొంది. సెకండ్వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, మొదటి త్రైమాసికంలో ఎకానమీ తగిన మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఇండస్ట్రీ చాంబర్–సీఐఐ పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కార్యక్రమాలు వృద్ధికి ఊతం ఇస్తున్నట్లు పీహెచ్డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. -
‘నిధుల విషయంలో కేంద్రం అసత్యాలు చెబుతోంది’
-
మనమే నం.1.. మంత్రి హరీశ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిపై ఎవరికీ సందేహాలు అవసరం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ లెక్కలు, నివేదికల ప్రకారమే తెలం గాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నట్టుగా తెలుస్తోందని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా స్థిరమైన ఆర్థికాభివృద్ధిని తెలంగాణ నమోదు చేస్తోందని, ప్రతి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉందని తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్రోస్, ఆర్థిక సలహాదారు జీఆర్రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, జాతీయ సగటు తదితర అంశాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘జీఎస్డీపీ’లో ఆరో అతిపెద్ద రాష్ట్రం గత ఆరేళ్లలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీఎస్ డీపీ) వృద్ధిలో రాష్ట్రం మూడో స్థానంలో నిలి చింది. జీఎస్డీపీ భాగస్వామ్యంలో ఆరో అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. జనాభా పరంగా మనది 12వ రాష్ట్రం.. భౌగోళికంగా 11వ స్థానం.. అయినా జీఎస్డీపీలో మాత్రం ఆరోస్థానానికి ఎదిగాం. కరోనా క్లిష్ట సమయంలో కూడా సానుకూల వృద్ధిని నమోదు చేశాం. ఈ సమయంలో దేశ అభివృద్ధి సగటు –3 శాతం ఉంటే, తెలంగాణలో వృద్ధి రేటు 2.4గా నమోదైంది. జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటులో దేశ సగటు 8.1 శాతం ఉంటే తెలంగాణ 11.7 శాతం నమోదు చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న విధానాలే కారణం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు రూ.1,28,289 అయితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632. తలసారి ఆదాయంలో రాష్ట్రం ఏర్పాటైన రోజున తెలంగాణ ఏడో స్థానంలో ఉంటే ఇప్పుడు మూడోస్థానానికి ఎగబాకింది. తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నం.1గా నిలిచింది. ఇది సీఎం కేసీఆర్ కృషి, ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. 2019–20 సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధి రేటు భారత్లో 2.5 శాతం ఉంటే, బంగ్లాదేశ్లో 8.1 శాతంగా నమోదైంది. దేశ ఆర్థిక పరిస్థితిని బీజేపీ బలహీనపర్చి బంగ్లాదేశ్కన్నా దిగజార్చింది. వ్యవసాయ రంగంలో అద్భుత ప్రగతి మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, డెయిరీ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం అద్భుత ప్రగతి సాధించినట్టుగా కేంద్రం చెబుతున్న లెక్కలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో ఏకంగా 11.52 శాతం వృద్ధి నమోదైంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశ అభివృద్ధి 3.6గా ఉంటే తెలంగాణలో 14.3గా ఉంది. తయారీ రంగంలో 2014–15తో పోలిస్తే 72 శాతం వృద్ధి సాధించాం. ఐటీ సెక్టార్లో 120 శాతం అభివృద్ధి జరిగింది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోపే అప్పులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నామన్న ప్రతిపక్షాల వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. అప్పులు ఎడాపెడా తీసుకునే అధికారం రాష్ట్రాలకు లేదు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం జీఎస్డీపీలో 25 శాతం వరకు అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ మన రాష్ట్రం ఆ పరిమితికి లోబడి 22.83 శాతం మాత్రమే అప్పుగా తీసుకుంటోంది. అందరికీ దళిత బంధు దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలుచేస్తాం. అన్ని దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తాం. ఈ పథకం ద్వారా దళితుల అభివృద్ధికి పెట్టుబడి పెడుతున్నాం. ఆ పెట్టుబడితో ఆయా వర్గాలు మళ్లీ రాష్ట్రానికి సంపదను సృష్టిస్తాయి. దళిత బంధుకు నిధుల కొరత గురించి ఆలోచించాల్సిన పనిలేదు. నిరర్ధక ఆస్తులను అమ్మయినా నిధులను సమకూరుస్తాం. తుది దశకు ఉద్యోగాల భర్తీ కసరత్తు ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. జిల్లాల విభజన కారణంగా కొత్త జిల్లాల్లో లోకల్ రిజర్వేషన్ కోసం పోస్టుల గుర్తింపు, జోనల్, మల్టీజోనల్ పోస్టుల గుర్తింపు లాంటివి జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ కసరత్తును పూర్తి చేశాం. త్వరలోనే కేబినెట్కు అన్ని వివరాలు సమర్పిస్తాం. కేబినెట్ ఆమోదం అనంతరం దశల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కిషన్రెడ్డి నిధులు, ప్రాజెక్టులు తెచ్చి మాట్లాడాలి బీజేపీ నేత కిషన్రెడ్డి ఏదైనా మాట్లాడదల్చుకుంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను తెచ్చి మాట్లాడాలి. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చెప్పాలి. ఫలానా రాష్ట్రంలో అమలవుతున్నాయంటే అక్కడకు అందరం వెళ్దాం. బీజేపీ చేసిన చేసిన అభివృద్ధి, సాధించిన పురోగతి ఏదైనా ఉందంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు మాత్రమే. ఆస్తులు, రోడ్లు, విమానాశ్రయాలు, ఎల్ఐసీ వంటి సంస్థలు, నవరత్నాలను అమ్మడంలో బీజేపీ పురోగతి సాధించింది. ద్వితీయ స్థానం కోసమే ప్రతిపక్షాల పోరాటం రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఎజెండా లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్లు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామంటే తామేనని చెప్పుకునేందుకే టీఆర్ఎస్ను విమర్శిస్తున్నాయి. వారు చేసే విమర్శలు వారికే సెల్ఫ్ గోల్ మాదిరి అవుతున్నాయి. ప్రజలు కూడా ఈ విమర్శలను మెచ్చుకోవడం లేదు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తక్కువ సమయంలోనే ఎవరూ సాధించలేని విజయాలను సాధించాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు మమ్మల్ని మెచ్చుకోకపోయినా ఫర్వాలేదు. కానీ రాష్ట్రం పరువును తీసేవిధంగా తెలంగాణ ఆగమైందని, తాలిబాన్ల రాజ్యంగా మారిందనే వ్యాఖ్యలు చేయొద్దు. ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్, బీజేపీలు పోరాడేది ద్వితీయ స్థానం కోసమే. కేసీఆర్, టీఆర్ఎస్ ఉన్నంత కాలం వారు ప్రథమ స్థానంలోకి రాలేరు. ఏ రాష్ట్ర అభివృద్ధినైనా తలసరి విద్యుత్ వినియోగంతో పోల్చి చూస్తారు. 1,896 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో సేవల రంగం 2014–15తో పోలిస్తే 1.5 రెట్లు వృద్ధి చెందింది. ఐటీ ఉత్పత్తుల విలువ 120 శాతం పెరిగింది. 2014–15లో రూ.66,276 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు సాధిస్తే ఇప్పుడు రూ.1,45,522 కోట్ల ఉత్పత్తులు సాధించాం. గాం«ధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నేడు తెలంగాణలో కనిపిస్తోంది. – మంత్రి హరీశ్ చదవండి: హైదరాబాద్లో రేసింగ్.. కుర్ర‘కారు’.. హుషారు -
భారత్ వృద్ధి రేటు అప్గ్రేడ్
ముంబై: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. ఇంతక్రితం 9.1% ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ఆర్బీఐ వృద్ధి అంచనా 9.5% కాగా, మిగిలిన పలు సంస్థల అంచనాలు 7.9% నుంచి 10 శాతం వరకూ ఉన్న సంగతి తెలిసిందే. ‘కే’ నమూనా రికవరీ..: సమాజంలో అసమానతలు పెరిగిపోవడంపై ఇండ్ రా ప్రధాన ఆర్థికవేత్త, పబ్లిక్ ఫైనాన్స్ డైరెక్టర్ సునీల్ కుమార్ సిన్హా నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి లక్షలాది సంఖ్యలో ప్రజలను పేదరికంలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ (ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ (జు) నమూనా రికవరీ అని సిన్హా తెలిపారు. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు వేగంగా మరింత సమస్యల్లోకి జారిపోతారు. ఎకానమీలో దాదాపు 58 శాతం ఉన్న ప్రైవేటు వినియోగంలో గత స్థాయి వృద్ధి ప్రస్తుతం లేదని సిన్హా అన్నారు. -
6.5 నుంచి 7 శాతం శ్రేణిలో వృద్ధి
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచీ వరుసగా 6.5 శాతం నుంచి 7 శాతం సుస్థిర వృద్ధి బాటన సాగుతుందని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంచనావేశారు. కేంద్రం చేపట్టిన వివిధ ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ పురోగతిలో ఉందని కూడా వివరించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎకానమీపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ దిగ్గజ విశ్లేషణా సంస్థ– డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ (డీఅండ్బీ) నిర్వహించిన ఒక వర్చువల్ కార్యక్రమంలో సుబ్రమణియన్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ముఖ్యమైనవి... ► గడచిన ఏడాదిన్నరగా కేంద్రం పలు సంస్కరణాత్మక చర్యలను తీసుకుంటోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆయా చర్యలు మంచి వృద్ధి ఫలాలను అందిస్తాయని నేను భావిస్తున్నాను. ► 2020–21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో రికవరీ బాగుంది. అయితే ఊహించని రీతిలో సవాళ్లు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా ఆరోగ్య మౌలిక రంగం తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. అయితే మొదటి వేవ్తో పోల్చితే ఎకానమీపై ప్రభావం పరిమితమే. ► వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఎగుమతుల పీఎల్ఐ స్కీమ్, సూక్ష్మ లఘు మధ్య చిన్న తరహా పరిశ్రమల నిర్వచనం మార్పు, మొండిబకాయిలకు సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి పలు అంశాలు భవిష్యత్లో దేశాభివృద్ధిని సుస్థిర బాటన నడపనున్నాయి. ► మహమ్మారి నుంచి దేశం రికవరీ సాధించడానికి వ్యాక్సినేషన్ చాలా కీలకం. తద్వారా కోవిడ్–19ను సాధారణ ఫ్లూ కింద మార్చి, దాని తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. రెండేళ్ల పురోగతికి దూరమయ్యాము: వివేక్ దేవ్రాయ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేవ్రాయ్ అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ, 2021–22లో భారత్ ఎకానమీ వృద్ధి 10 శాతం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇది బేస్ మాయగా (పోల్చుతున్న నెల లేదా ఏడాదిలో అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెల లేదా ఏడాదిలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్) ఆయన అంగీకరించారు. మహమ్మారి వల్ల దేశం రెండేళ్లు ఆర్థిక పురోగతిని కోల్పోయిందన్నారు. ప్రస్తుతం కన్నా దాదాపు రెట్టింపై 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఆవిర్భావం కల దూరమయ్యిందన్నారు. దీనితోపాటు 2030 నాటికి సుస్థిర ఆర్థికవృద్ధి (ఎస్డీజీ) లక్ష్యాలనూ భారత్ చేరుకోలేని పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. -
వృద్ధి రేటుపై కీలక వ్యాఖ్యలు చేసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్...!
సాక్షి, న్యూ ఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రెండంకెల వృద్ధి రేటును నమోదుచేస్తోందని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణ కూగా సాఫీగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా మొదటి, రెండో వేవ్లో రాష్ట్రాలు ఎదుర్కొన్న తీరు రాబోయే కాలంలో వచ్చే కోవిడ్-19 వేవ్లను దేశం, రాష్ట్రాలు ఎదుర్కొనే స్థితి వస్తోందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కోవిడ్-19 సెకండ్వేవ్ నుంచి ఇబ్బందులను అధిగమించామని, పలు రాష్ట్రాలు లాక్డౌన్ను ఎత్తివేయడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఎకనామిక్ రికవరీ చాలా బలంగా ఉందని తెలిపారు. ఫిచ్ లాంటి పలు రేటింగ్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును తగ్గించాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న రికవరీతో అదే సంస్థలు తిరిగి వృద్ధి రేటును సవరించే అవకాశాలు ఉన్నాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 2021 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం కుదించింది. ప్రముఖ రేటింగ్ ఏజన్సీలు ఎస్&పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ భారత దేశ జీడీపీ వృద్ధి రేటును 11 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించగా, ఫిచ్ రేటింగ్స్ అంతకుముందు జీడీపీ వృద్ధి రేటు 12.8 శాతం నమోదు చేస్తోందని తెలుపగా తిరిగి వృద్ధిరేటును 10 శాతానికి సవరించింది. ఉక్కు, సిమెంట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో కొన్ని రంగాలలో సామర్థ్య విస్తరణలో గణనీయమైన పెట్టుబడులు ఇప్పటికే జరుగుతున్నాయాని పేర్కొన్నారు. కన్యూసమర్ డ్యురాబుల్ సెక్టార్లో కరోనాతో వినియోగదారుల్లో అనిశ్చితి నెలకొలడంతో పెట్టుబడులను పెట్టేందుకు కాస్త సంకోచాలకు గురవౌతున్నారని తెలిపారు. పూర్తిస్తాయి ప్రైవేట్ పెట్టుబడి రికవరీలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అదనంగా 23,123 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. దీంతో కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వారి ప్రకటనలు ప్రస్తుతానికి ద్రవ్యోల్బణ అంచనాలను అధిక స్థాయిలో ఉంచలేదని చాలా స్పష్టంగా తెలియజేశాయి. ప్రస్తుతం ఇది తాత్కాలికమైన, ఆర్బిఐ నిర్ధేశించిన ద్రవ్యోల్భణ స్థాయి లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటామని రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు, -
భారత్ ఎకానమీ అంచనాలకు కోత
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా రికవరీ ప్రక్రియ మందగించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి అంచనాలను 10 శాతానికి కుదిస్తున్నట్లు రేటింగ్స్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. గతంలో ఇది 12.8 శాతంగా ఉంటుందని ఫిచ్ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సెకండ్ వేవ్ వ్యాప్తి వల్ల బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు మరింతగా పెరిగాయని తాజాగా ఒక నివేదికలో పేర్కొంది. స్థానికంగా లాక్డౌన్లు విధించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు .. పూర్వ స్థాయికి పడిపోకుండా కాస్త ఊతం లభించిందని వివరించింది. అయితే, కీలకమైన పలు వ్యాపార కేంద్రాల్లో కార్యకలాపాలు దెబ్బతినడం వల్ల రికవరీ ప్రక్రియ మందగించిందని ఫిచ్ తెలిపింది. 2019–20లో 4 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు .. కోవిడ్–19 మొదటి దశ వ్యాప్తి తరుణంలో 2020–21లో 7.3 శాతం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండవచ్చని ముందుగా అంతా అంచనా వేసినప్పటికీ, కరోనా సెకండ్ వేవ్ రాకతో పరిస్థితి మారిపోయింది. ఆర్బీఐ ఇటీవలే తమ అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి కుదించింది. మూడీస్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మొదలైన అంతర్జాతీయ సంస్థలు కూడా ఇది 9.3 శాతం–9.5 శాతం దాకా ఉండవచ్చని భావిస్తున్నాయి. అటు ప్రపంచ బ్యాంకు ఏకంగా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి కుదించింది. టీకా ప్రక్రియ కీలకం.. టీకాల ప్రక్రియ వేగం పుంజుకుంటే వ్యాపార వర్గాలు, వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడే అవకాశం ఉందని ఫిచ్ వెల్లడించింది. అయినప్పటికీ తదుపరి కరోనా ఉధృతి మరింత పెరిగినా, లాక్డౌన్లు విధించిన ఆర్థిక వ్యవస్థ రికవరీకి సవాళ్లు ఎదురు కావచ్చని పేర్కొంది. ‘2021 జూలై 5 నాటికి 137 కోట్ల జనాభాలో 4.7 శాతం ప్రజలకు మాత్రమే టీకా ప్రక్రియ పూర్తయ్యింది. అర్థవంతమైన, నిలకడైన ఆర్థిక రికవరీ సాధనకు దీనివల్ల రిస్కులు పొంచి ఉన్నాయి‘ అని ఫిచ్ వివరించింది. ఫలితంగా, బ్యాంకుల మధ్యకాలిక పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చని పేర్కొంది. వ్యాపార, ఆదాయ వృద్ధికి అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల బ్యాంకులకు పరిస్థితి సమస్యాత్మకంగా ఉండవచ్చని తెలిపింది. మరోవైపు, ’బీబీబీమైనస్’ రేటింగ్ గల ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి కాస్త మెరుగ్గానే ఉండవచ్చని, కానీ కరోనా గాయాల కారణంగా మధ్యకాలికంగా వ్యాపార వర్గాలు, వినియోగదారుల సెంటిమెంటు బలహీనపడే రిస్కులు ఉన్నాయని ఫిచ్ తెలిపింది. -
ఆర్బీఐ వడ్డీరేట్ల ఊరట..!
ముంబై: దేశంలో కరోనా ప్రభావం కనిష్ట స్థాయికి చేరే వరకూ తగిన సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) భరోసా ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ భారత్ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021ఏప్రిల్–2022 మార్చి) వృద్ధి రేటు 9.5 శాతంగానే ఉంటుందని అంచనావేసింది. ఈ విషయంలో గత అంచనా 10.5 శాతానికి ఒకశాతం మేర కోత పెట్టింది. ఈ పరిస్థితుల్లో ఎకానమీ వృద్ధికి సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించక తప్పదని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరవ ద్వైమాసిక సమావేశంలోనూ యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని గవర్నర్ శక్తికాంత్దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీనితోపాటు అవసరమైతే మరింత తగ్గించే అవకాశం ఉందనీ సంకేతాలు ఇచ్చింది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. ఇక బ్యాంకులు తమ అదనపు నిధుల డిపాజిట్పై ఇచ్చే వడ్డీ–రివర్స్ రెపో రేటును కూడా యథాతథంగా 3.35గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ జరిగిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం గవర్నర్ శక్తికాంత్దాస్ మీడియాతో మాట్లాడారు. సంబంధిత వివరాలు, నిర్ణయాలను క్లుప్లంగా పరిశీలిస్తే.. కట్టడిలో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం సరళతర ద్రవ్య విధానం కొనసాగింపునకు దోహదపడుతుందని ఆర్బీఐ విశ్లేషించింది. కేంద్రం నిర్దేశాలకు (2 నుంచి 6 శాతం మధ్య) అనుగుణంగా 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని అంచనావేసింది. అయితే ఇది గత అంచనాలకన్నా 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎక్కువ కావడం గమనార్హం. బ్యాంకింగ్కు నిధుల భరోసా 2021–22 ఆర్థిక సంవత్సరంలో తీవ్రంగా నష్టపోయిన రంగాలకు రుణ సహాయాన్ని అందించడానికి భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (ఎస్ఐడీబీఐ– సిడ్బీ)సహా ఫైనాన్షియల్ సంస్థలకు తాజా మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా 2022 మార్చి 31 వరకూ రూ.15,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ విండో (ద్రవ్య లభ్యత సౌలభ్యం)ను ప్రకటించింది. ఈ విండో కింద బ్యాంకులు మూడేళ్ల కాలానికి రెపో రేటుకు రుణాలను తీసుకోవచ్చు. తద్వారా హోటల్స్, రెస్టారెంట్లు, పర్యాటకం వంటి కోవిడ్ బాధిత రంగాల పునరుద్ధరణకు బ్యాంకులు రుణ సహాయం అందించవచ్చు. దీనికితోడు లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతను ఇవ్వడానికి సిడ్బీకి రూ.16,000 కోట్ల అదనపు నిధిని కేటాయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రంగాలకు రుణ సహాయ పరిమితిని రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచింది. రుణ రేట్ల కట్టడికి... బాండ్ల కొనుగోలు సరళ విధానంలో రుణ రేట్లను కట్టడిలో ఉంచడానికి రెండవ త్రైమాసికంలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అక్విజేషన్ కార్యక్రమం (జీ–ఎస్ఏపీ–2.0) కింద అదనంగా రూ.1.2 లక్షల కోట్ల బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఏప్రిల్–మే మధ్య జీ–ఎస్ఏపీ–1.0 కింద రూ. లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఏప్రిల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచీ నిరంతరం... ఎన్ఏసీహెచ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) వ్యవస్థ 2021 ఆగస్టు 1వ తేదీ నుంచి నిరంతరం అన్ని రోజులూ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ పనిదినాల్లో మాత్రం ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటోంది. చెల్లింపులకు సంబంధించి మధ్యవర్తిత్వ సంస్థగా ఎన్ఏసీహెచ్ నుంచి అత్యాధునిక సేవలు అందుబాటులో ఉంటాయి. డివిడెండ్, వడ్డీ, వేతనం, పెన్షన్ వంటి బదలాయింపులకు అలాగే విద్యుత్, గ్యాస్ టెలిఫోన్, వాటర్ నెలవారీ రుణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా ప్రీమియం చెల్లింపులకు ఎన్ఏసీహెచ్ వ్యవస్థ కీలక సేవలు అందిస్తోంది. క్రిప్టో కరెన్సీపై ఆందోళనలు ఉన్నాయ్... బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ వైఖరిలో మార్పు లేదు. తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ఇలాంటి ఇన్స్ట్రమెంట్లపై ‘‘తీవ్ర ఆందోళనలు’’ ఉన్నాయి. ఇప్పటికే దీనిపై విడుదల చేసిన ఆర్బీఐ సర్క్యులర్ ఆయా అంశాలకు సంబంధించి పూర్తి స్పష్టతను ఇచ్చింది. 2018లో తొలుత ఇందుకు సంబంధించి జారీ చేసిన ఒక సర్క్యులర్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సవరిత నోటిఫికేషన్ను తాజాగా ఆర్థిక సంస్థలకు జారీ చేయడం జరిగింది. అందువల్ల క్రిప్టోకరెన్సీ అంశాల విషయంలో 2018 నాటి సర్క్యులేషన్ను ఉదహరించవద్దని తాజా నోటిఫికేషన్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, పేమెంట్ వ్యవస్థలకు ఆర్బీఐ సూచిస్తోంది. -
ఆర్థిక అవస్థ!
వ్యవసాయం, మత్స్యరంగం, అటవీ రంగం మినహా దేశంలో సకల రంగాలూ 2020–21 ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలోనే వున్నాయని జాతీయ గణాంక కార్యాలయం వెలువరిం చిన గణాంకాలు ఆర్థిక నిపుణులు కొంతకాలంగా వ్యక్తం చేసిన భయాందోళనలను ధ్రువీకరిస్తు న్నాయి. కరోనా మహమ్మారి తొలి దశను అడ్డుకోవటానికి నిరుడు దీర్ఘకాలంపాటు విధించిన లాక్డౌన్ వల్ల మొత్తంగా వృద్ధి రేటు మైనస్ 7.3 శాతంగా నమోదు అయింది. వాస్తవానికి ఇంతకన్నా ఎక్కువగానే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆర్బీఐ, ఇతర సంస్థలు భావించినా నాలుగో త్రైమాసికంలో అన్ని రంగాలూ ఏదోమేర పనిచేయటం మొదలుకావటంతో ఆ సమ యంలో స్వల్పంగా 1.6 శాతం వృద్ధి నమోదు చేసిన పర్యవసానంగా మొత్తంగా ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం స్వల్పంగా తగ్గింది. దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో నాలుగు దశాబ్దాల తర్వాత ప్రతికూల వృద్ధి నమోదు కావటం ఇదే తొలిసారని అంటున్నారు. ద్రవ్యలోటు సైతం జీడీపీలో 9.3 శాతమని తేలింది. దేశ పాలకుల దగ్గర ఇందుకు సంబంధించి ముందస్తు అంచనాలు ఏమేరకున్నాయోగానీ అంతా సవ్యంగా వున్నదన్న అభిప్రాయం దేశ ప్రజల్లో కలగజేయటానికి ప్రయత్నించటమే గత ఏడెనిమిది నెలలుగా కనబడుతుంది. ఒకపక్క అమెరికా మొదలుకొని అన్ని దేశాలూ తమ పౌరులకు నేరుగా నగదు బదిలీ చేసి ఆదుకొంటుండంగా, రకరకాల ప్యాకే జీల ద్వారా చేసిన కేటాయింపులు, వాటి చుట్టుతా వున్న నిబంధనలవల్ల మెజారిటీ ప్రజలకు అందకుండా పోయాయి. విద్యావంతులైన యువత ఉపాధిని కోల్పోయింది. కొత్తవారికి ఉపాధి ఊసేలేదు. రోజువారీ పనులు చేసి పొట్ట పోసుకునే వర్గాల పరిస్థితి అయితే మరింత దారుణం. ఇన్ని వర్గాలు నిస్సహాయ స్థితిలో పడబట్టే వినియోగం బాగా పడిపోయి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందన్నది వాస్తవం. కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సరఫరా వ్యవస్థ కాస్త మెరుగుపడింది. తయారీ రంగం అనుకున్నంత కాకపోయినా కొంతయినా పుంజుకుంది. అది పన్నుల వసూళ్లలో ప్రతిఫలి స్తున్నది. కేంద్రానికి పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాతో పోలిస్తే 5.5 శాతం అధికమని తేలింది. కానీ ఆ తయారైన ఉత్పత్తులను కొనే వర్గాలెక్కడ? వినియోగదారుల సూచీని గమనిస్తే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నిరుడు డిసెంబర్లో డిమాండ్ గణనీయంగా పడిపో యిందని భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణా కేంద్రం చీఫ్ మహేష్ వ్యాస్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 97 శాతం కుటుంబాల ఆదాయం క్షీణించిందని ఆ సంస్థ సర్వే తెలి పింది. కేవలం 3 శాతం కుటుంబాలు మాత్రమే తమ ఆదాయం పెరిగిందని చెప్పాయి. 55 శాతం కుటుంబాలు ఏదో నెట్టుకు రాగలుగుతున్నామని చెప్పగా...మిగిలిన 42 శాతం కుటుం బాలు కరోనాకు ముందూ తర్వాతా ఒకేలా వున్నామని చెప్పాయి. అంటే జనాభాలో అధిక శాతంమంది ఆదాయ క్షీణత అంతక్రితమే మొదలైందన్నమాట. ఈమధ్య ఫిక్కీ సంస్థ రూపొందించిన బిజినెస్ కాన్ఫిడెన్స్ సూచీ(బీసీఐ)ని కూడా ప్రస్తావిం చుకోవాలి. వర్తమాన పరిణామాలు చూశాక వ్యాపార సంస్థల్లో ఆత్మవిశ్వాసం బాగా సన్నగిల్లిం దని ఆ సర్వే చెబుతోంది. మూడు త్రైమాసికాలకు ముందున్న ఆత్వవిశ్వాసం వ్యాపా రుల్లో ఇప్పుడు కొరవడిందని అది వెల్లడిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రూ. 145 లక్షల కోట్లు కాగా, నిరుడు దీనికి పదిలక్షల కోట్ల మేర గండి పడింది. కనీసం 2019– 20నాటి స్థితికి చేరాలన్నా ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనబడటం లేదు. మన జీడీపీ 2019–20నాటి స్థాయికెళ్లాలంటే దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కావాలి. ఈ రెండో దశ కరోనాలో పరిమిత స్థాయిలో విధించిన లాక్డౌన్ల వల్ల నిరుడు కలిగినంత నష్టం వుండకపోవచ్చు. కానీ రోజువారీ పనులు చేసుకునేవారి ఉపాధిని ఈ లాక్డౌన్లు పూర్తిగా ఊడ్చిపెట్టాయి. ఇదంతా మౌనంగా వీక్షిస్తున్న సాధారణ పౌరుల్లో ఒక రకమైన భయాందోళనలు ఏర్పడ్డాయి. ఆక్సిజన్ కొరత, ఔషధాల కొరత, ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి వగైరా కారణాలతో కళ్లముందు జనం పిట్టల్లా రాలిపో వటంచూశాక వారు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. రోజువారీ తప్పనిసరి అవస రాలు మినహా మరి దేనిపైనా వ్యయం చేసేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. కనుకనే విని యోగం భారీగా పడిపోయింది. ఆదాయ కల్పన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసనీయమైన చర్యలు తీసుకుంది. వివిధ పథకాలకింద నగదు బదిలీ ద్వారా రూ. 95,528 కోట్లను...ఇతరేతర పథకాల ద్వారా పరోక్షంగా రూ. 36,197 కోట్లను ప్రజలకు అందజేసింది. అంటే రూ. 1,31,725 కోట్ల మొత్తం ప్రజానీకానికి చేరింది. ఈ గణాంకాలు గత రెండేళ్లలో అమలైన పథకాలకు సంబంధించినవే అయినా ఇందులో అధిక కాలం కరోనా ముట్టడిలోనే గడిచిందన్నది గుర్తుంచుకోవాలి. కేంద్రం చర్యలు కూడా దీనికి దీటుగా వుంటే ఆర్థిక వ్యవస్థకు అది మరింత తోడ్పడేది. కనీసం కరోనా టీకాలైనా సాధ్యమైనంత త్వరగా అందరికీ అందు బాటులోకొస్తే పౌరుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నీ రంగాలూ క్రమేపీ పుంజుకోవటం మొదలవుతుంది. 2019 సెప్టెంబర్లో జీడీపీ తగ్గినప్పుడు వృద్ధి ప్రక్రియలో అదొక భాగమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది కనుక కేంద్రం పునరాలోచించాలి. -
నేడు 2020–21 జీడీపీ గణాంకాలు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్–21మార్చి) గణాంకాలు సోమవారం వెలువడే అవకాశాలు ఉన్నాయి. కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో 7.5% నుంచి 8% ఎకానమీ క్షీణత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చివరి త్రైమాసికంలో మాత్రం 2 శాతం వరకూ వృద్ధి అంచనాలు ఉన్నాయి. కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం మొదటి (–24.4 శాతం), రెండు (–7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలోనూ ఇదే సానుకూల ఒరవడి కొనసాగింది. 2 నుంచి ఆర్బీఐ పరపతి సమీక్ష కాగా, ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష జూన్ 2 నుంచి 4వ తేదీ వరకూ జరగనుంది. 4న ప్రధాన నిర్ణయాలు వెలువడతాయి. బ్యాంకు లకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో వరుసగా ఆరవ త్రైమాసికంలో వృద్ధే లక్ష్యంగా 4 శాతంగా కొనసాగే వీలుంది. -
వృద్ధి బాటలో ఏపీ..
సాక్షి, అమరావతి: జాతీయ వృద్ధి రేటు తిరోగమనంలో ఉండగా రాష్ట్రం వృద్ధి బాటలో పయనిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ 2020 – 21 రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 1.58 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి – 3.8 శాతంతో తిరోగమనంలో ఉండటం గమనార్హం. రాష్ట్ర తలసరి ఆదాయంలో కూడా రూ.1,735 పెరుగుదల నమోదైంది. 2020 – 21 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 2019 – 20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,68,480 ఉండగా 2020–21లో రూ.1,70,215గా నమోదైంది. 2019 –20లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,34,186గా ఉంది. లాక్డౌన్, కర్ఫూ్యలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు సామాజిక ఆర్ధిక సర్వే వెల్లడించింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.1,902.35 కోట్ల వ్యయంతో 5,33,670 మందికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించినట్లు సర్వే పేర్కొంది. నవరత్నాలతో అన్ని వర్గాలకు పెద్ద ఎత్తున సహాయం అందించినట్లు స్పష్టమైంది. సర్వేలో ప్రధానాంశాలు ఇవీ... ఆరోగ్యం – మహిళా సంక్షేమం ► కోవిడ్ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళికతో ఎదుర్కొంటోంది. ► కరోనా కట్టడికి లాక్డౌన్తో పాటు పేదలకు సాయం ► 1,80,49,054 మందికి పరీక్షలు నిర్వహించగా 14,54,052 మందికి పాజిటివ్గా నిర్థారణ. ► పది లక్షల జనాభాకు దేశంలో సగటున 2.2 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలో సగటున 3.3 లక్షల మందికి పరీక్షలు జరిగాయి. ► విదేశాల నుంచి క్రయోజనిక్ ట్యాంకర్ల కొనుగోలు. ► రాష్ట్రానికి రోజూ కేటాయిస్తున్న 590 టన్నుల ఆక్సిజన్ పూర్తిస్థాయిలో వినియోగం నమోదవుతున్న నేపథ్యంలో 900 టన్నులు కేటాయించాలని కేంద్రానికి వినతి. ► వ్యాక్సినేషన్లో 45 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్స్కు ప్రాధాన్యం. ► రాష్ట్రంలో తొలి డోసు టీకా తీసుకున్న వారు 53.28 లక్షల మంది కాగా రెండు డోసులూ తీసుకున్న వారి సంఖ్య 21.64 లక్షలు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా వెచ్చించి టీకాల కొనుగోలు. గృహ నిర్మాణం, సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు ► పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన 27.94 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు 27.94 లక్షల ఇంటి పట్టాల పంపిణీ ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో భాగంగా రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం. ► వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ. 61.73 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.1,487 కోట్లు పెన్షన్ రూపంలో పంపిణీ. ► దివ్యాంగులకు నెలకు రూ.3,000, డయాలసిస్ రోగులకు రూ.10,000 చొప్పున పెన్షన్. ► వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ. ఇతర సంక్షేమ పథకాలు.. ► జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా 15.63 లక్షల మంది ఎస్సీలు, 5.23 లక్షల మంది ఎస్టీల నివాసాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ► కొత్తగా 53 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ► వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా సొంతంగా ఆటో, కారు కలిగిన 2.74 లక్షల మందికి లబ్ధి ► వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా పేద చేనేత కుటుంబాలకు ఏటా రూ.24,000 ఆర్థిక సాయం. 81,703 మంది లబ్ధిదారులకు రూ.383.79 కోట్ల పంపిణీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీఎస్) ► 2030 నాటికి 17 విభాగాల్లో ఎస్డీజీఎస్ సాధించడం కోసం ఐక్యరాజ్యసమితి తోడ్పాటు. ► దేశీయ ఎస్డీజీఎస్ ర్యాంకుల్లో 2018లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండగా 2019లో మూడో స్థానానికి ఎగబాకింది ► పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యానికి సంబంధించి నీతి ఆయోగ్ విధించిన 6 లక్ష్యాలు, శాంతి భద్రతలు, న్యాయం, పటిష్ట వ్యవస్థలకు సంబంధించి విధించిన 16 లక్ష్యాల్లో 2019లో మొదటిస్థానం సాధించిన రాష్ట్రం. ► మరో నాలుగు ఎస్డీజీఎస్ల్లో రెండవ ర్యాంకు, పేదరిక నిర్మూలనలో మూడో ర్యాంకును రాష్ట్రం సాధించింది. మహిళా సాధికారత... ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పేద మహిళలకు ఆర్థిక తోడ్పాటు. ► 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న 24.55 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4,604.13 కోట్ల మేర ఆర్థికసాయం ► అన్ని కాంట్రాక్టు పనులు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► వైఎస్సార్ ఆసరా ద్వారా 87,74,674 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రూ.6,792.21 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ... ► వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షల లోపు ఉన్న 1.44 కోట్లకుపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీతో ప్రయోజనం పొందుతున్నాయి. ► పథకం ద్వారా 1,577 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 2,436 ప్రొసీజర్లకు వర్తింపు. ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 1,484 ఎంపానల్డ్ నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా 1,059 ప్రొసీజర్లకు చికిత్స. ► ఈ పథకం ద్వారా 5,33,670 మంది రోగులకు రూ.1,902.35 కోట్ల మేర ప్రయోజనం. ► శస్త్రచికిత్స తర్వాత రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 సాయం. ► డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కింద మూడేళ్లలో ఆరు దశల్లో పూర్తి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహణ వ్యవసాయం సంక్షేమం ► ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం. ఈ పథకం ద్వారా 52.38 లక్షల మందిరైతు కుటుంబాలకు రూ.17,030 కోట్ల మేర ప్రయోజనం. ► పంటల బీమా ప్రీమియం భారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఉచిత పంటల బీమా పథకం ద్వారా 5.67 లక్షల మంది రైతులకు రూ.1,968 కోట్ల మేర లబ్ధి. ► రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు. ► ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. ► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందించేలా గ్రామ సచివాలయాల వద్ద 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ► ఉద్యానవన పంటల సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమోటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో రాష్ట్రం. ► జలయజ్ఞంలో భాగంగా 54 సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో 14 ప్రాజెక్టులు పూర్తి. రెండు ప్రాజెక్టుల్లో తొలి దశ పనుల పూర్తి. పురోగతిలో పోలవరం, పూల సుబ్బయ్య ప్రాజెక్టులు. ► వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం. ► 2020 – 21లో 168.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి. 2019–20లో 175.12 లక్షల టన్నుల ఉత్పత్తి నవరత్నాలు – విద్య ► జాతీయ సగటుతో పాటే రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తక్కువగా ఉంది. అక్షరాస్యతలో జాతీయ సగటు రేటు 72.98 శాతం కాగా రాష్ట్రంలో 67.35 శాతం ఉంది. ► జగనన్న అమ్మ ఒడి కింద దారిద్రరేఖకు దిగువన ఉన్న 44.5 లక్షల మంది తల్లులకు రూ.15,000 చొప్పున మొత్తం రూ.6,673 కోట్లు ఆర్థిక సాయం అందింది. ► ఒకటి నుంచి పదో తరగతి చదివే 42.34 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా పాఠ్యపుస్తకాల పంపిణీ. ► జగనన్న గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజనం పథకాన్ని సమూలంగా మార్చేసి బలవర్థకమైన పౌష్టికాహారాన్ని 36.88 లక్షల మందికి అందిస్తోంది. ► పోటీ ప్రపంచంలో రాణించేలా ఇంగ్లీష్ మీడియం విద్యకు ప్రోత్సాహం ► ‘మనబడి నాడు– నేడు’ కింద తొలిదశలో 15,715 పాఠశాలల్లో మౌలికవసతుల అభివృద్ధి ► జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 13.26 లక్షల మంది విద్యార్థులకు రూ.4,879 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లింపులు. ► జగనన్న వసతి దీవెన కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు చెందిన 10.89 లక్షల మంది విద్యార్థులకు ఆహారం, హాస్టల్ ఫీజుల వ్యయాన్ని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. పరిశ్రమలు – మౌలిక వసతులు ► రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 75 శాతం స్థానిక యువతకు ఉపాధి కల్పన ► వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు. ► వైఎస్సార్ నవోదయం ద్వారా ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ. ► రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం ► మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ సెజ్ల్లో నాలుగు నాన్ మేజర్ పోర్టుల నిర్మాణ పనులు -
India GDP: భారత్ వృద్ధి అంచనాలు డౌన్..!
ముంబై : కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్ ఏజెన్సీ క్రెడిట్ సూసీ గణనీయంగా తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.5–9 శాతానికి పరిమితం కాగలదని వెల్లడించింది. కోవిడ్ పరిణామాల ప్రతికూల ప్రభావం 100–150 బేసిస్ పాయింట్ల మేర ఉండొచ్చని పేర్కొంది. ఇక భారత్ తన సామర్థ్యానికి తగినట్లుగా పూర్తి స్థాయి వృద్ధి రేటును చేరుకోవాలంటే 2022–23 తర్వాత అదనంగా మరో రెండు మూడేళ్లు పట్టేయొచ్చని క్రెడిట్ సూసీ వెల్లడించింది. తాము వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ మిగతా ఏజెన్సీల లెక్కలతో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 4 శాతంగా ఉండగా, 2021–22లో ఇది అంతకు మించి 5 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రెడిట్ సూసీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు గతేడాది నెలల తరబడి కొనసాగగా ఈసారి కొద్ది వారాలకు మాత్రమే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు. చదవండి: భారత్ ఎకానమీకి నష్టం తప్పదు! -
కరోనా దెబ్బకు తగ్గిన జీడీపీ వృద్ది రేటు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ 2021 వృద్ధి విషయంలో తొలి అంచనాలకు కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ వరుసలో ప్రపంచ దిగ్గజ ఆర్థిక విశ్లేషణ సంస్థ-ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ చేరింది. 2021లో భారత్ స్థూల దేశీయోత్పత్తి 10.2 శాతానికి పరిమితం అవుతుందని తన తాజా నివేదికలో పేర్కొంది. క్రితం అంచనాలు 11.8 శాతాన్ని ఈ మేరకు దిగువముఖంగా సవరిస్తున్నట్లు తెలిపింది. కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో దేశంలో పెరిగిన వైద్య సంబంధ సవాళ్లు, వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరగకపోవడం, మహమ్మారి కరోనా నియంత్రణలో ప్రభుత్వ వ్యూహంలో లోపాలు తమ తాజా అంచనాల సవరణకు కారణమని వివరించింది. ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ పేర్కొన్న మరిన్ని విశేషాలు చూస్తే... భారత్ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో బెడ్స్లేని పరిస్థితి నెలకొంది. స్వల్ప కాలంలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి పది రోజులకూ మరణాల సంఖ్య రెట్టింపు అవుతోంది. మరి కొన్ని సంస్థల అంచనాలు... అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) 2021లో భారత్ వృద్ధిని 12.5 శాతం వరకూ అంచనావేస్తోంది. ఏప్రిల్ నుంచీ ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా 10.5 శాతంగా ఉంది. 2020–21 ఎకనమిక్ సర్వే 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 11 శాతంగా పేర్కొంది. సెకండ్వేవ్ తీవ్రత నేపథ్యంలో ఆయా అంచనాల వృద్ధి సవరణ కూడా చోటుచేసుకునే వీలుంది. 10 శాతంలోపే వృద్ధి! కోవిడ్ 19 తాజా కేసుల పెరుగుదల, ఫలితంగా స్థానిక లాక్డౌన్ల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 10 శాతం దిగువనే నమోదయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేం. ప్రభుత్వ చర్యలు, ప్రజల ప్రతిస్పందనల ఆధారంగా వ్యవస్థలో డిమాండ్, సరఫరాల పరిస్థితి ఆధారపడి ఉంటుంది. 2020 దేశవ్యాప్త లాక్డౌన్తో పోలి్చతే రాష్ట్రాల తాజా ఆంక్షల వల్ల వ్యవసాయం, మైనింగ్, తయారీ, యుటిలిటీ, నిర్మాణ రంగాలపై కొంత తక్కువ ప్రభావమే ఉండే వీలుంది. - ఎస్సీ గార్గ్, మాజీ ఫైనాన్స్ కార్యదర్శి నెల లాక్డౌన్తో జీడీపీకి 2 శాతం నష్టం స్థానిక లాక్డౌన్ల వల్ల మహమ్మారి కరోనా కట్టడి అనుకున్నంత స్థాయిలో జరక్కపోవచ్చు. సెకండ్వేవ్ కట్టడికి భారత్ నెలపాటు లాక్డౌన్ విధిస్తే, ఎకానమీకి 100 నుంచి 200 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే ఎకానమీకి భారీ నష్టం వాటిల్లే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కఠిన లాక్డౌన్లు విధించకపోవచ్చు. కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం మే, జూన్ నెలల్లో ఉచిత ఆహార ధాన్యాల సరఫరా వంటి సహాయక చర్యలను ముమ్మరం చేసే వీలుంది. - ఇంద్రనీల్ సేన్ గుప్తా, ఆస్థా గడ్వానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్-భారత్ ఆర్థికవేత్తలు చదవండి: వేతన జీవులూ.. జర జాగ్రత్త! -
లాక్డౌన్ తర్వాత ఏపీలోనే వ్యాపార లావాదేవీలు అధికం
సాక్షి, అమరావతి: లాక్డౌన్ తర్వాత ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో లాక్డౌన్ తర్వాత జూన్ నుంచి మార్చి వరకు జరిగిన వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్రల్లో క్షీణత నమోదయితే మన రాష్ట్రంలో ఏకంగా 8.83 శాతం వృద్ధి నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జీఎస్టీ కౌన్సిల్ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 జూన్ నుంచి 2021 మార్చి వరకు మన రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు 8.83 శాతం వృద్ధితో రూ.22,407.46 కోట్ల నుంచి రూ.24,386.66 కోట్లకు చేరినట్లు ఈ గణాంకాల్లో పేర్కొన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో జీఎస్టీ ఫైలింగ్ ఎంత బాగా జరుగుతోందన్న విషయం కూడా తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. జీఎస్టీ వ్యాపార లావాదేవీలు కేవలం ఆ రాష్ట్రంలో జరిగిన వ్యాపార లావాదేవీలను తెలియచేస్తాయి. అంతర్ రాష్ట్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) బదలాయింపుల తర్వాత ఆ రాష్ట్రానికి వచ్చిన తుది జీఎస్టీ ఆదాయం లెక్కిస్తారు. ఆదుకున్న సంక్షేమం: ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మన రాష్ట్రంలోనే వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వ్యాపార లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కర్ణాటకలో 0.18%, తెలంగాణలో 0.81%, కేరళలో 1.07%, తమిళనాడులో 3.78% వృద్ధి మాత్రమే నమోదైంది. కోవిడ్ సంక్షోభ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికవ్యవస్థలో నగదు లభ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోవడమే దీనికి కారణమని వాణిజ్యపన్నుల అధికారులు పేర్కొంటున్నారు. -
‘వారు ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు’: కేటీఆర్
ఖమ్మం: ‘కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు పెద్దగా సహకారం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు. విభజన చట్టంలో ఎన్నో మాటలు చెప్పారు. కానీ, ఏ ఒక్క మాటా నిలుపు కోలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీ పేటలో కోచ్ ఫ్యాక్టరీ కావొచ్చు.. మన రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కావొచ్చు. మన దగ్గర నుంచి తీసుకోవడమే తప్ప.. తిరిగి ఇచ్చింది లేదు. ఇన్ని రకాల ప్రతికూల పరిస్థితుల్లో.. సీఎం నేతృత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూనే.. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ఖమ్మం నగరంలో రూ.25 కోట్లతో ఆధునిక బస్టాండ్ను నిర్మించుకున్నాం. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం ఉండ టంతో దేశవృద్ధి రేటు కన్నా రెట్టింపు వేగంతో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ ఎగుమతులు రూ.58 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.1.49 లక్షల కోట్లకు పెరిగాయి’అని మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరం, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో రూ.423.26 కోట్లకు సంబంధించి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, నిర్మాణం చేయనున్న పనులకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నగరంలో నూతన ఆర్టీసీ బస్టాండ్, 1,004 డబుల్ బెడ్రూం ఇళ్లు, వైకుంఠధామం, మిషన్ భగీరథ కింద ఏర్పాటు చేసిన 45 వేల మంచినీటి కనెక్షన్లతోపాటు ఇంటింటికీ ప్రతి రోజూ మంచినీటి సరఫరా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. రెండో ఐటీ హబ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లి నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్స వం చేయడంతోపాటు వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట రవాణా మంత్రి పువ్వాడ అజయ్, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఐటీ హబ్ ప్రాంతం, నూతన బస్టాండ్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఐటీ దిగ్గజాలు హైదరాబాద్ బాట.. దేశంలోనే బెంగళూర్, చెన్నై, కోల్కతా, పుణే వంటి నగరాలను కాదని ఐటీ కంపెనీలు హైదరాబాద్ బాట పడుతున్నాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలైన ఖమ్మం, కరీంనగర్, నిజామా బాద్, మహబూబ్నగర్ జిల్లాలకు ఐటీ హబ్లు వచ్చాయని, త్వరలో నల్లగొండ, సిద్దిపేట, రామగుండం ప్రాంతాల్లో ఐటీ హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువత హైదరాబాద్కో.. బెంగళూరుకో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా ఉద్యోగాలను సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. టీ ఫైబర్ ప్రాజె క్టుతో రాష్ట్రంలోని కోటి ఇళ్లకు రానున్న కాలంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కామర్స్, ఎడ్యుకేషన్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం స్వయంగా పూనుకుని ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఆర్టీసీ లాభాల బాట పట్టేలా కృషి చేస్తున్నారన్నారు. ఖమ్మం వచ్చి నేర్చుకోవాలి.. ఏ ప్రభుత్వమైనా, ప్రజాప్రతినిధి అయినా కోరుకునేది ప్రజల కోసం తపించడమేనని, మంత్రి పువ్వాడ కూడా అలాగే చేస్తున్నారన్నారు. ఖమ్మం పట్టణాన్ని చూసి ఇతర ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చి నేర్చుకోవాలన్నారు. ముందు చూపుతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, దీంతో ఖమ్మం రూపురేఖలే మారాయన్నారు. మిగిలిన పనులు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని చెప్పారు. మంచి చేసే వారిని ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారన్నారు. చేసిన పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు మనం చేసిన పనులు చెప్పుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ ఎండీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్శర్మ, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, లావుడ్యా రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా రికవరీ అవుతున్న ఎకానమీ!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్లో వచ్చిన ఒక ఆర్టికల్ విశ్లేషించింది. కరోనా ప్రేరిత అంశాలతో అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్)లోనే వృద్ధిని నమోదుచేసుకుంటుందని అంచనావేసింది. కాగా ఆర్బీఐ అధికారులు రాసిన ఈ ఆర్టికల్లో వ్యక్తమైన అభిప్రాయాలను రచయితల అభిప్రాయాలుగానే పరిగణించాలితప్ప, ఆర్బీఐకి ఆపాదించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొనడం గమనార్హం. తొలి త్రైమాసికంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 23.9 శాతంగా నమోదుకావడం... దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 8% నుంచి 14% వరకూ ఉంటుందని పలు రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనాలు... అటు తర్వాత కనబడిన ఆర్థిక క్రియాశీలత... సెప్టెంబర్ త్రైమాసికంలో క్షీణరేటు 7.5 శాతానికి కట్టడి... ఈ సానుకూల వాతావరణంలో ఆర్బీఐసహా పలు సంస్థల తమ క్షీణ అంచనాలను సవరించడం (2020–21 ఆర్థిక సంవత్సరానికి) వంటి అంశాల నేపథ్యంలో వెలువడిన ఆర్టికల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► కోవిడ్–19 కఠిన పరిస్థితుల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ బయటపడినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో మూడవ త్రైమాసికంలోనే భారత్ 0.1 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ► భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీకి సంకేతంగా రెండు అంశాలను ప్రస్తావించుకోవచ్చు. అందులో ఒకటి సెప్టెంబర్ మధ్యస్థం నుంచే పెట్టుబడులు, వినియోగ డిమాండ్ విషయంలో సానుకూలత కనిపించింది. ఇక రెండవ విషయానికి వస్తే, ద్రవ్యపరమైన చర్యలు వినియోగంవైపే కాకుండా, పెట్టుబడుల వైపునకూ మళ్లాయి. ► దేశంలో సెకండ్వేవ్ ప్రభావం పెద్దగా కనిపించని పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సంబంధించిన ద్రవ్యపరమైన చర్యలు మరింత ఊపందుకున్నాయి. ► ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న పలు సానుకూల అంశాల నేపథ్యంలోనే క్షీణతకు సంబంధించి తొలి అంచనాల సవరణ జరుగుతోంది. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్మన్ శాక్స్, గోల్డ్మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది. త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సానుకూలత పరిస్థితుల్లో ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి), ఎస్అండ్పీ ఆ సంస్థ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి), ఇక్రా (–11 శాతం నుంచి 7.8 శాతానికి) ఎస్బీఐ రీసెర్చ్ (– 10.9 శాతం నుంచి 7.4 శాతానికి) క్షీణ అంచనాలను తగ్గించాయి. క్షీణ అంచనాలను తగ్గించిన ఇండియా రేటింగ్స్ కాగా, 2020–21 భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన తొలి క్షీణ అంచనాలను ఇండియా రేటింగ్స్ గురువారం 11.8 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గించింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా – 0.8 శాతం, – 0.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనావేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.6 శాతంగా విశ్లేషించింది. -
పుంజుకుంటున్న పెట్రోల్, డీజిల్ అమ్మకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాల్లో భారీ వృద్ధి రేటు నమోదవుతుండగా, డీజిల్ అమ్మకాలు కోవిడ్ పూర్వ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండు నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ఆదాయంలో నమోదవుతున్న వృద్ధి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో పెట్రో వ్యాట్ ఆదాయంలో 6.39 శాతం వృద్ధి నమోదు కాగా.. అక్టోబర్కల్లా 25.24 శాతానికి పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.851.40 కోట్లుగా ఉన్న పెట్రో వ్యాట్ ఆదాయం.. ఈ ఏడాది 6.39 శాతం వృద్ధితో రూ.905.78 కోట్లకు చేరింది. అలాగే అక్టోబర్లో 25.24 శాతం వృద్ధితో రూ.750.35 కోట్ల నుంచి రూ.939.76 కోట్లకు చేరింది. లాక్డౌన్తో తొలి త్రైమాసికంలో 30 శాతం ఆదాయం నష్టపోగా రెండవ త్రైమాసికంలో కొద్దిగా కోలుకొని 3.76 శాతం వృద్ధి నమోదయ్యింది. పెరిగిన సొంత వాహనాల వినియోగం లాక్డౌన్ తర్వాత డీజిల్తో పోలిస్తే పెట్రోల్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోందని పెట్రోలియం డీలర్లు పేర్కొంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు కంటే సొంత వాహనాలకే వినియోగదారులు మొగ్గు చూపుతుండటంతో రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాల్లో 20 శాతం వరకు వృద్ధి కనిపిస్తోందని ఏపీ పెట్రో డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. తాము ప్రతి నెలా సగటున 4,500 లీటర్ల పెట్రోల్ విక్రయిస్తుండగా గత రెండు నెలల నుంచి 4,700 లీటర్లు విక్రయిస్తున్నట్లు గుంటూరుకు చెందిన డీలర్ ‘సాక్షి’కి వివరించారు. ఇదే సమయంలో డీజిల్ అమ్మకాలు మాత్రం కోవిడ్ ముందు స్థాయికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ, సరుకు రవాణా పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాకపోవడం..డీజిల్ అమ్మకాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. కోవిడ్కు ముందు ప్రతి నెలా 8,000 లీటర్ల వరకు డీజిల్ విక్రయిస్తుండగా, ఇప్పుడది 7,000 లీటర్ల స్థాయికి చేరిందన్నారు. ఒకటి రెండు నెలల్లో డీజిల్ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఏడు నెలల్లో రూ.5,448.79 కోట్ల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.5,448.79 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఏప్రిల్–అక్టోబర్ కాలంలో ఈ ఆదాయం రూ.5,965.50 కోట్లుగా నమోదయ్యింది. తొలి త్రైమాసికంలో రూ.1,860.09 కోట్లుగా ఉన్న ఆదాయం ద్వితీయ త్రైమాసికానికి రూ.2,648.98 కోట్లకు చేరింది. మూడో త్రైమాసికం రెండు నెలల్లో మంచి వృద్ధిరేటు నమోదు కావడంతో పూర్తి ఏడాది కాలానికి లాక్డౌన్ నష్టాన్ని పూడ్చుకొని వృద్ధి బాట పట్టగలమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పట్టాలెక్కని ‘పరిశ్రమ’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మూలంగా రాష్ట్రం లో పారిశ్రామిక వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోయినట్లు రాష్ట్ర అర్థ గణాంక విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, క్వారీ విభాగాల్లో ఉత్పత్తి తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సిబ్బంది, కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతోంది. వ్యవసాయ, సేవా రంగాల తర్వాత పారిశ్రామిక రంగం ఎక్కువ మందికి (సుమారు 18 శా తం) ఉపాధి కల్పిస్తుండగా, కోవిడ్ మూలం గా పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50– 60 శాతమే ఉత్పత్తి రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే కేవలం 50 నుంచి 60 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్తో పాటు ఆటోమొబైల్, మైన్స్, మినరల్స్, టెక్స్టైల్స్, స్టీలు, సిమెంట్ తదితర పరిశ్రమలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా, బల్క్ డ్రగ్ మినహా ఇతర కేటగిరీలకు చెందిన పరిశ్రమలు అన్నీ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అన్లాక్ ప్రక్రియ తొలి విడతలోనే పరిశ్రమలకు నిబంధనలు సడలింపు ఇచ్చినా వివిధ కారణాలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడం లేదు. ముడిసరుకుల కొరత, రవాణా, మార్కెటింగ్ సమస్యలతో పాటు కొన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమల్లో కార్మికుల కొరత వల్ల పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం లేదు. సిబ్బంది, కార్మికుల ఉపాధికి దెబ్బ లాక్డౌన్ మూలంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో అరకొర వేతనాలు చెల్లించిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత ఉత్పత్తి తగ్గడాన్ని కారణంగా చూపిస్తూ సిబ్బంది, కార్మికుల సంఖ్యను తగ్గించాయి. ప్రతి ఏటా ఏప్రిల్లో కాంట్రాక్టు కార్మికులను రెన్యువల్ చేస్తూ వచ్చిన పరిశ్రమలు కోవిడ్ మూలంగా రెన్యువల్ ఊసెత్తకపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. వీరిలో అవసరమైన వారిని మాత్రమే తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుంటుండగా, మరికొందరి వేతనాల్లో భారీగా కోత విధించారు. రూ.15వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారిని మినహాయించి, ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు, సిబ్బంది వేతనాల్లో పరిశ్రమలు కోత విధిస్తున్నాయి. వేతన ఒప్పందాల్లో ‘డిఫర్మెంట్’ మూడేళ్లకు ఒకసారి వేతన ఒప్పందం జరగా ల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరో రెండేళ్లపాటు నూతన ఒప్పందాలు వాయిదా వేస్తామని యాజమాన్యాలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల్లోనూ డిఫర్మెంట్ను కోరుతూ కార్మిక సంఘాలు, సిబ్బందికి యాజమాన్యా లు లేఖలు రాస్తున్నాయి. ఒప్పందం మేరకు సిబ్బందిని పర్మినెంట్ చేయాల్సి ఉండగా వేచి చూడాలని చెప్తున్నాయి. తిరిగి వస్తున్న వలసకార్మికులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్ రాష్ట్రాల కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో సుమారు లక్షన్నర మందిని రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలాలకు తరలించింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత మేర కుదుటపడటంతో వీరు తిరిగి గతంలో తాము పనిచేసిన ప్రదేశాలకు చేరకుంటున్నారు. లోహ, ఫ్యాబ్రికేషన్, వాటి అనుబంధ పరిశ్రమల్లో వలస కార్మికులను రప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో ఆరు నెలల్లో సాధారణ పరిస్థితి పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారం భించేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. వలస కార్మికులు తిరిగి ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇటీవలి వర్షాలతో పారిశ్రామిక ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్ డిఫర్మెంట్ కోసం యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటేనే కార్మికులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు, బోనస్ ఇవ్వడం సాధ్యమవుతుంది. – కె. సుధీర్రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అసంఘటిత కార్మికులకు భద్రతలేదు అసంఘటిత కార్మికుల ఉపాధి, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిం ది. ఉత్పత్తి తగ్గడా న్ని కారణంగా చూపుతూ వేతన ఒప్పందాలు మొదలుకుని, అన్ని రకాలైన డిఫర్మెంట్లకు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులను తొలగించొద్దని ప్రభుత్వం చెప్తున్నా పరిస్థితి భిన్నంగా ఉంది. –బి.మల్లేశం, అధ్యక్షులు, సీఐటీయూ, సంగారెడ్డి జిల్లా -
భారీగా పెరిగిన డిజిటల్ చెల్లింపులు
ముంబై: నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో భాగంగా ఆర్బీఐ డిజిటల్ చెల్లింపులను భారీగా ప్రోత్సహిస్తోంది. దీంతో గత ఐదేళ్లలో ఈ డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని ఆర్బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2015 – 2020 మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులు 55.1 శాతం చక్రీయ వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. 2016 మార్చి నాటికి 593.61 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు సంఖ్య మార్చి 2020 చివరి నాటికి 3,434.56 కోట్లకు చేరినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. విలువ పరంగా చెప్పాలంటే ఈ ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు 15.2 శాతం వృద్ధిని సాధించి రూ.920.38 లక్షల కోట్ల నుంచి రూ.1,623.05 కోట్లకు పెరిగాయి. వార్షిక ప్రాతిపదికగా పరిశీలిస్తే... డిజిటల్ చెల్లింపుల సంఖ్య 2015–16లో 593.61 కోట్లుగా ఉంది. 2016–17 నాటికి 969.12 కోట్లకు చేరింది. చెల్లింపుల విలువ రూ.1,120.99 లక్షల కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2017–18లో డిజిటల్ చెల్లింపుల వ్యాల్యూమ్ వృద్ధి 1,459.01 కోట్లుగా ఉండగా, విలువ రూ.1,369.86 లక్షల కోట్లుగా నమోదైంది. 2018 –19లో చెల్లింపుల సంఖ్య 2,343.40 కోట్లుగా నమోదైంది. చెల్లింపు విలువ రూ.1,638.52 లక్షల కోట్లుగా ఉంది. 2019–20లో లావాదేవీలు పెరిగాయ్... విలువ తగ్గింది ... ఇక 2019–20లో డిజిటల్ చెల్లింపులు వాల్యూమ్స్ 3,434.56 కోట్లుగా నమోదయ్యాయి. అయితే చెల్లింపు విలువ మాత్రం రూ.1,623.05 లక్షల కోట్ల కు పరిమితమైంది. ఆర్థిక వ్యవస్థ క్షీణత, భారీగా ఉద్యోగాలను కోల్పోవడం తదితర అంశాలు ప్రజల వినియోగ సామర్థ్యాన్ని తగ్గించా యి. ఈ ఏడాదిలో ప్రజలు సొమ్ము భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా అనుకున్న స్థాయిలో చెల్లింపుల విలువ నమోదుకాలేదని విశ్లేషకులంటున్నారు. విలువ కొంత తగ్గొచ్చు కరోనా అంటువ్యాధి, లాక్డౌన్ పరిమితులు డిజిటల్ చెల్లింపులు అనేక రెట్లు పెరిగాయి. అయితే కోవిడ్–19 అంటువ్యాధితో ప్రతి ఒక్కరూ అర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో చెల్లింపుల విలువ మరింత తగ్గే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దశాబ్దం నుంచి క్రమంగా పెరుగుతూ... పదేళ్ల క్రితం నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఈసీఎస్ పేమెంట్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ తర్వాత కేంద్రం నోట్ల రద్దుతో డిజిటల్ చెల్లింపులకు మరింత ప్రాధాన్యత పెరిగింది. యూపీఐ ఆధారిత, యాప్ ఆధారిత చెల్లింపులు.... డిజిటల్ చెల్లింపుల సరిహద్దులను చెరివేశాయి. వీటికి తోడు అనేక సంస్థలు.., బ్యాంకింగ్యేతర కంపెనీలు డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రవేశించడంతో కస్టమర్లు కూడా నగదు చెల్లింపుల నుంచి డిజిటల్ చెల్లింపులకు మారడం జరిగింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి చెల్లింపు వ్యవస్థలలో పదేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆవిష్కరణలు ఇప్పటికీ సురక్షితంగా పనిచేస్తున్నాయి. ఆర్బీఐ కృషి అమోఘం డిజిటల్ చెల్లింపుల పరిమాణం, విలువ పెరిగేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. ఈ చెల్లింపుల వ్యవస్థకు పర్యవేక్షక పాత్ర పోషిస్తూ, నియంత్రణాధికారి బాధ్యత వహిస్తూ డిజిటల్ చెల్లింపుల వృద్ధికి కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో ‘‘సురక్షితమైన, సమర్థవంతమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధి, ప్రోత్సాహం’’ అనే తన విధాన లక్ష్యాన్ని సమర్థంగా నిర్వర్తిస్తోంది. కస్టమర్ల భద్రతే లక్ష్యం.. కస్టమర్ల భద్రత, సౌలభ్యత లక్ష్యంగా డిజిటల్ చెల్లింపుల బాటలో ఆర్బీఐ పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. డిజిటల్ పేమెంట్ల పట్ల విశ్వాసం పెంచేందుకు అనేక చర్యలను తీసుకుంది. అందులో భాగంగా గతేడాది(2019) జనవరి నుంచి ఈవీఎం చిప్, పిన్ ఆధారిత క్రెడిట్/డెబిట్ కార్డులను మాత్రమే చెల్లింపులకు వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. టోకనైజేషన్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం దేశం దాటి వెళ్లకుండా తగిన చర్యలు తీసుకుంది. -
కరోనా సంక్షోభంపై రాజన్ విశ్లేషణ..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ జూన్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 23.9 శాతం క్షణించడంపై ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అధికార యంత్రాంగం కీలక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజన్ చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కరోనాను నివారించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందని, కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సరిపోదని అభిపప్రాయపడ్డారు. అయితే దేశ వృద్ధి రేటు మెరుగవ్వాలంటే యువత ఆశయాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని తెలిపారు. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కార్మిక రక్షణ చట్టాలను రద్దు చేయడం ద్వారా పరిశ్రమ, ఉద్యోగులలో చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో దేశ ఎగుమతులు వృద్ధి చెందే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ కంటే ముందే ప్రపంచం కోలుకుంటుందని తెలిపారు. మరోవైపు చిన్న కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నిధులను వేగంగా సమకూర్చాలని పేర్కొన్నారు . బాండ్ మార్కెట్ల ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుకొని అవసరమైన రంగాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అయితే మెట్రో నగరాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల అమ్మకంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వాలని తెలిపారు. కరోనా సంక్షోభంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(ఎమ్ఎన్ఆర్జీఏ) ద్వారా గ్రామీణ ప్రజలకు కొంత స్వాంతన కలగనుందని, కానీ మెట్రో నగరాలలో ఆదాయం లేని వారికి ఎమ్ఎన్ఆర్జీఏ వర్తించదు కనుక ప్రభుత్వం వారిని ఆదుకోవాలని రఘురామ్ రాజన్ కోరారు. -
భారత్లో ‘వీ’ నమూనా ఆర్థికాభివృద్ధి!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న భారత్ ఆర్థిక వ్యవస్థ, తిరిగి ‘వీ’ (V) తరహా వృద్ధి రేటును చూస్తోందని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. కోవిడ్–19పై సమరానికి అమలు చేసిన కఠిన లాక్డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ప్రతికూల పరిస్థితే నెలకొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ 33 శాతం, బ్రిటన్ 21.7 శాతం, ఫ్రాన్స్ 18.9 శాతం, స్పెయిన్ 22.1 శాతం, ఇటలీ 17.7 శాతం, జర్మనీ 11.3 శాతం నష్టపోగా. యూరో ప్రాంతం దాదాపు మైనస్ 15 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. జపాన్ విషయంలో ఈ క్షీణ రేటు 9.9 శాతంగా ఉంది. ► ఇక లాక్డౌన్ వల్ల ప్రయోజనాల విషయానికి వస్తే, కోవిడ్–19 ప్రతికూల పరిస్థితులపై ఈ కాలంలో ఒక స్పష్టమైన అంచనాలకు రాగలిగాం. మరణాల రేటు తగ్గడానికి తగిన చర్యలు తీసుకున్నాం. ప్రపంచంలో కోవిడ్–19 ప్రేరిత మృతుల రేటు (శాతాల్లో) భారత్లోనే తక్కువ ఉంది. ఆగస్టు 31 వరకూ చూస్తే, భారత్లో మృతుల రేటు కేవలం 1.78 శాతంగా ఉంటే, అమెరికాలో ఈ రేటు 3.04 శాతంగా ఉంది. బ్రిటన్లో ఈ రేటు ఏకంగా 12.35 శాతం. ఫ్రాన్స్లో 10.09 శాతం. జపాన్లో 1.89 శాతం. ఇటలీలో 13.18 శాతం. ► ప్రస్తుతం భారత్ ‘వీ’ (ఠి) తరహా వృద్ధి పురోగమనంలో ఉంది. ఇందుకు తగిన గణాంకాలు కనిపిస్తున్నాయి. ఆటో, ట్రాక్టర్, ఎరువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. రైల్వే రవాణా పెరుగుతోంది. స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరుగుతోంది. ఈ– వే బిల్స్ బాగున్నాయి. జీఎస్టీ వసూళ్ల విషయంలో సానుకూలత కనిపిస్తోంది. రహదారులపై రోజూవారీ టోల్ వసూళ్లు మెరుగుపడుతున్నాయి. రిటైల్ ఫైనాన్షియల్ లావాదేవీలు, తయారీ పర్చేజింగ్ మేనుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ పరిస్థితి బాగుంది. మౌలిక రంగాలు సానుకూల సంకేతాలు ఇస్తున్నాయి. పెట్టుబడులు మెరుగుపడుతున్నాయ్. ఎగుమతులు వృద్ధి బాటలోకి వెళ్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యవసాయ రంగంలో మంచి పురోగతి కనబడుతోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు చరిత్రాత్మక రికార్డు స్థాయిల్లో (ఆగస్టు 28వ తేదీతో ముగిసిన వారంలో చరిత్రాత్మక రికార్డు స్థాయి 541.431 బిలియన్ డాలర్లు)కొనసాగుతున్నాయి. 14 నెలలకుపైగా దిగుమతులకు ఇవి సరిపోతాయి. ► దేశంలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా కేంద్రం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే ఇంకా కొన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలు, మౌలిక రంగం, స్టార్టప్స్, మానవ వనరుల నైపుణ్యత, ఆరోగ్య భద్రత వంటి రంగాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉంది. భూ, న్యాయ, కార్మిక, క్యాపిటల్ మార్కెట్ విభాగాల్లో మరిన్ని వ్యవస్థాగత సంస్కరణలు అవసరం. నిరుద్యోగ సమస్యసహా సమస్యల పరిష్కారానికి కేంద్రం అధిక దృష్టి కేంద్రీకరించింది. రూపాయికి 33 పైసలు లాభం ఈక్విటీ మార్కెట్ భారీగా నష్టపోయినా, శుక్రవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 33 పైసలు బలపడి 73.14 వద్ద ముగిసింది. దీనితో వారం వారీగా రూపాయి 25 పైసలు లాభపడినట్లయ్యింది. రూపాయి వరుసగా నాలుగు వారాల నుంచీ బలపడుతూ వస్తోంది. ఈ నెల మొత్తం ఐపీఓల ద్వారా దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయన్న అంచనాలే రూపాయి బలోపేతానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రిసెర్చ్ డిప్యూటీ హెచ్ దేవర్‡్ష వికెల్ అభిప్రాయపడుతుండడం గమనార్హం. 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంగా భారత్: వుయ్ వర్క్ కోవిడ్–19 తీవ్ర సవాళ్లు విసురుతున్నప్పటికీ, భారత్ ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో 25 శాతం రెవెన్యూ వృద్ధి లక్ష్యంతో ఉందని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రియల్టీ సంస్థ– ఎంబసీ గ్రూప్ అనుబంధ విభాగం వుయ్ వర్క్ అంచనావేసింది. దీనిని సాధించే అవకాశాలు కూడా భారత్కు ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే రాబడీ–వ్యయాలను చూస్తే 2019 కన్నా, 2020లో కొంత ప్రతికూలతలు తప్పవని తెలిపింది. -
8.5 శాతం వృద్ధి లేదంటే భారత్కు కష్టమే!
ముంబై: కోవిడ్–19 సమస్య సమసిపోయిన అనంతరం భారత్లో అవకాశాల సృష్టికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దశాబ్ద కాలంపాటు వార్షికంగా 8 నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి సాధన జరగాల్సిన అవసరం ఉందని మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. భారీ వృద్ధిరేటులేని పరిస్థితిలో దేశంలో ఆదాయాల స్తబ్దత నెలకొంటుందని, జీవన నాణ్యత లోపిస్తుందని విశ్లేషించింది. ఈ పరిస్థితుల్లో భారీ వృద్ధికి తక్షణ చర్యలు అవసరమని తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►దేశంలో ఉత్పాదకత పెరగాలి. ఉపాధి సృష్టి జరగాలి. ఇందుకు రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో పలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ►2013 నుంచి 2018 మధ్య భారత్ వార్షికంగా సగటున 40 లక్షల వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు సృష్టించింది. తాజా పరిస్థితుల ప్రకారం పట్టణీకరణ పెరుగుతోంది. జనాభా పెరుగుదల కూడా ఉంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి వార్షికంగా 1.2 కోట్ల వ్యవసాయేతర ఉపాధి అవకాశాల సృష్టి జరగాలి. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) భారత్ జీడీపీ 5% వరకూ క్షీణించే అవకాశం ఉంది. అయితే కోవిడ్ అనంతరం తాజా అవకాశాల సృష్టికి వచ్చే దశాబ్ద కాలంలో భారత్ 8 నుంచి 8.5% వృద్ధి సాధించాల్సిందే. లేదంటే రానున్న దశాబ్ద కాలంలో తీవ్ర సవాళ్లు తప్పవు. ►తయారీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ పరిశ్రమసహా కార్మిక, భూ వ్యవహారాల్లో సంస్కరణలు తక్షణం జరగాలి. అలాగే తక్కువ టారిఫ్లతో వినియోగదారులకు విద్యుత్ సౌకర్యాలను అందించడానికి తగిన ప్రయత్నాలు జరగాలి. ►ఫైనాన్షియల్ రంగంలో సంస్కరణలు, ద్రవ్యలోటు కట్టడి, తగిన సరళతర వడ్డీరేట్ల విధానంతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ►మొండిబకాయిల పరిష్కార దిశలో ‘బ్యాడ్బ్యాంక్’ ఏర్పాటు జరగాలి. ►సంస్కరణల పరంగా చూస్తే, 60 శాతం రాష్ట్రాల వైపు నుంచి జరగాల్సి ఉండగా, 40 శాతం కేంద్రం చేపట్టాల్సి ఉంటుంది. -
ఇది యాంత్రిక రికవరీయే..!
న్యూఢిల్లీ: ఆర్థిక రంగం కోలుకోవడం అన్నది యాంత్రికంగా చోటు చేసుకుంటున్నదే కానీ.. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాలు పూర్వపు స్థితికి చేరుకుంటున్నాయని ప్రభుత్వం భావించడం సరికాదంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి భారత్ వృద్ధి అవకాశాలు చూడ్డానికి బలహీనంగానే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. కరోనా వైరస్ రావడానికి పూర్వమే మన దేశ వృద్ధి రేటు 2017–18లో ఉన్న 7 శాతం నుంచి 2019–20లో 4.2 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘మీరు పేర్కొంటున్న ఆర్థిక రికవరీ సంకేతాలను లాక్ డౌన్ నాటి క్షీణించిన పరిస్థితుల నుంచి యాంత్రికంగా జరిగే రికవరీగానే మేము చూస్తున్నాము. దీన్ని మన్నికైన రికవరీగా చూడడం పొరపాటే అవుతుంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కనుక స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉండనున్నాయి. మహమ్మారి సమసిపోయిన తర్వాత (దీన్ని త్వరలోనే చూస్తామన్నది నా ఆశాభావం) ఈ సమస్యలు మరింత పెద్దవి కానున్నాయి. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోనుంది. రుణ భారం కూడా భారీగానే ఉంటుంది. ఆర్థిక రంగం దారుణ పరిస్థితులను చూస్తుంది. ఈ సవాళ్లను ఏ విధంగా పరిష్కరించుకుంటామన్న దానిపైనే మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ సుబ్బారావు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆశావహం.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా కోలుకోవడాన్ని సానుకూల సంకేతంగా దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్యగా పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండడాన్ని తక్కువ మంది గుర్తించిన మరో సానుకూల అంశంగా చెప్పారు. 4 కోట్ల మంది పట్టణ కార్మికులు కరోనా లాక్ డౌన్ల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని, అయినప్పటికీ అక్కడ భారీ కేసులు ఏమీ లేకపోవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చే వృద్ధి చోదకం ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులను ఖర్చు చేయడం లేదన్న విమర్శలకు సుబ్బారావు స్పందిస్తూ.. రుణాలు తీసుకుని ఖర్చు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన విషయం కాదన్నారు. ‘‘ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదు. వద్ధికి ఆధారమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ కూడా మందగించి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి క్షీణతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత ఖర్చు చేయకపోతే మొండి బకాయిలు సహా పలు సమస్యలు ఆర్థిక వ్యవస్థను చుట్టుముడతాయి’’ అని సుబ్బారావు చెప్పారు. అయితే, కేంద్రం రుణాలకు పరిమితి మాత్రం ఉండాలన్నారు. -
భారత ఆర్థిక వృద్ధి రేటుపై ఆందోళన
వాషింగ్టన్ : భారత ఆర్థిక వృద్ధిపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్దిని నమోదు చేస్తుందని ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వృద్ధి రేటు మైనస్ 3.2 శాతానికి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం (నిన్న) నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా కరోనా వైరస్ కట్టడికి వివిధ దశల్లో విధించిన లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం కోలుకోలేని దెబ్బతీసిందని పేర్కొంది. అయితే 2021లో వృద్ధిరేటు తిరిగి పుంజుకుంటుదని పేర్కొంది. ఆర్థికవ్యవస్థపై వాస్తవ ప్రభావం 9 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేసింది. మహమ్మారి కట్టడికి తీసుకున్న చర్యల మూలంగా వినియోగం భారీగా క్షీణించిందనీ, సేవల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని తెలిపింది. అలాగే ఈ అనిశ్చితి ప్రైవేట్ పెట్టుబడులను అడ్డుకుంటుందని వ్యాఖ్యానించింది. భారత వృద్ధిరేటు ప్రభావం ఇతర ఆసియా ఆర్థిక వ్యవస్థలపై కూడా పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక ఉద్దీపన చర్యలు కొంత వరకు ఊరట నిస్తాయని, ద్రవ్య విధానాల కొనసాగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. మూడీస్, ఫిచ్, ఎస్ అండ్ పీ వంటి గ్లోబల్ సంస్థలు ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ 4 నుంచి 5 శాతం ప్రతికూల వృద్ధి అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. చదవండి : పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ -
3.1 శాతానికి పడిపోయిన జిడిపి వృద్ధి రేటు
-
11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన జీడీపీ
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా నెమ్మదించింది. ఈ కాలంలో కేవలం 4.2 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఏడు రోజులూ (2020 మార్చి చివరి వారం) కరోనా భయాలతో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఈ కాలంలో (మార్చి 25 నుంచి 31వ తేదీ వరకూ) ఆర్థిక వ్యవస్థకు రూ.1.4 లక్షల కోట్ల నష్టం జరిగిందన్నది ఒక అంచనా. ఇక ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో వృద్ధి రేటు కేవలం 3.1 శాతం. భారత్ జీడీపీ 2019–2020 మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) ఏడేళ్ల కనిష్టం 4.1 శాతానికి (4.7 శాతం నుంచి దిగువవైపు సవరణ) పడిపోయింది. తాజాగా మరింత కిందకు జారింది. మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 4.4 శాతం వృద్ధి రేట్లు (5.6 శాతం, 5.1 శాతం నుంచి తగ్గింపు) నమోదయ్యాయి. 2018–19లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను క్లుప్తంగా విశ్లేషిస్తే... ► 2008–09లో కేవలం 3.1 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. అటు తర్వాత ఆర్థిక వృద్ధి ఇంత తక్కువ స్థాయి (4.2 శాతం) ఇదే తొలిసారి. ఆర్బీఐ 5 శాతం అంచనాకన్నా తక్కువకు ఇది పడిపోవడం గమనార్హం. ► నాల్గవ త్రైమాసికంలో వచ్చిన 3.1 శాతం గడచిన 44 త్రైమాసికాల్లో ఎన్నడూ రాలేదు. అంటే ఈ స్థాయి వృద్ధిరేటు 11 సంవత్సరాల కనిష్టమన్నమాట. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.7 శాతం. ఇక భారత్ పోల్చుకునే చైనా ఆర్థిక వ్యవస్థ జనవరి–మార్చి 2020 త్రైమాసికంలో –6.8 శాతం క్షీణతలో ఉంది. కోవిడ్–19 దీనికి నేపథ్యం. ► నిపుణుల అంచనాల ప్రకారం కరోనా నేపథ్యంలో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మాంద్యం పరిస్థితిలోకి జారి‡పోనుంది. 1958, 1966, 1980 ఆర్థిక సంవత్సరాల్లో మూడుసార్లు దేశం మాంద్యాన్ని ఎదుర్కొంది. ఈ మూడు సందర్భాల్లోనూ వర్షపాతం సరిగా లేక, అప్పట్లో ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం దెబ్బతినడమే కారణం. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో అసలు వృద్ధిలేకపోగా, మైనస్ (క్షీణత) గనుక నమోదయితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. క్యూ4లో రంగాల వారీ ‘జీవీఏ’ వృద్ధి... జనవరి–మార్చి మధ్య కాలంలో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ఆధారిత వృద్ధి రేటు కేవలం 3 శాతంగా ఉండడం గమనించదగిన మరో అంశం. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఈ రేటు 3.5 శాతం ఉంటే, 2018–19లో నాల్గవ త్రైమాసికంలో ఈ విభాగంలో వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాల 4వ త్రైమాసికాలను చూస్తే... తయారీ రంగం జీవీఏ 2.1 శాతం వృద్ధి నుంచి – 1.4 శాతం క్షీణతలోకి పడిపోయింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.7 శాతం నుంచి 0.03 శాతానికి తగ్గింది. నిర్మాణ రంగం జీవీఏ 6 శాతం వృద్ధి నుంచి –2.2 శాతం క్షీణతలోకి జారింది. అయితే జీడీపీలో 14 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగంలో వృద్ధి మాత్రం 1.6 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. ఈ రంగంలో ప్రభుత్వ వ్యయాలు దీనికి ఒక కారణం. మైనింగ్ రంగం కూడా –4.8 శాతం క్షీణత నుంచి 5.2 శాతం వృద్ధికి మారింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు అలాగే బ్రాడ్కాస్టింగ్ సేవల్లో 6.9 శాతం వృద్ధిరేటు 2.6 శాతానికి పడిపోయింది. ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల వృద్ధి రేటు 8.7 శాతం నుంచి 2.4 శాతానికి దిగింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతర సేవల వృద్ధిరేటు కూడా 11.6% నుంచి 10.1 శాతానికి తగ్గింది. విలువలు ఇలా... 2011–12 ధరల స్థితి ప్రకారం... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ (రియల్ జీడీపీ) వేసిన లెక్కల ప్రకారం... 2018–19 ఆర్థిక సంవత్సరం క్యూ4 జీడీపీ విలువ రూ.36.90 లక్షల కోట్లు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.38.04 లక్షల కోట్లకు పెరిగింది. అంటే క్యూ4లో జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంమన్నమాట. ఇక ఇదే విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ.139.81 లక్షల కోట్లయితే, ఈ విలువ 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.145.66 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇక్కడ వృద్ధిరేటు 4.2 శాతం అని అర్థం. తలసరి ఆదాయంలో 6.1 శాతం వృద్ధి జీడీపీ లెక్కప్రకారం, తలసరి ఆదాయం 2018–19లో రూ.1,26,521 అయితే, ఇది 2019–20లో రూ.1,34,226కు చేరింది. వృద్ధి 6.1 శాతం. కట్టు తప్పిన ద్రవ్యలోటు... తాజా జీడీపీ గణాంకాల నేపథ్యంలో మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) 4.6 శాతంగా నమోదయ్యింది. నిజానికి ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీలో ద్రవ్యలోటు 3.8 శాతం దాటకూడదని సవరిత అంచనాలు నిర్దేశిస్తున్నాయి. సవరించకముందు ఇది ఇంకా తక్కువగా 3.3 శాతంగానే ఉంది. రెవెన్యూ అంచనాల మేర లేకపోవడం మొత్తం ద్రవ్యలోటుపై చివరకు తీవ్ర ప్రభావమే చూపిందని చెప్పవచ్చు. రెవెన్యూలోటు కేవలం 2.4 శాతమే (జీడీపీ విలువలో) ఉండాలని భావిస్తే, ఇది తాజా లెక్కల ప్రకారం 3.27 శాతానికి చేరింది. జీడీపీ... జీవీఏ అంటే... గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ): ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి ఈ విధానం దోహదపడుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ): వినియోగదారులు లేదా డిమాండ్ వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ పనితీరును చూపిస్తుంది. దేశంలో వార్షికంగా లేదా త్రైమాసిక పరంగా జరిగే (పూర్తి స్థాయిలో) మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి విలువ ఇది. జీడీపీని ఫ్యాకర్ కాస్ట్లో అలాగే మార్కెట్ ప్రైస్లో చూస్తారు. జీడీపీ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నమాటే. మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ ప్రభుత్వ పన్నులు, సబ్సిడీలు కూడా గమనంలోకి వస్తాయి. జీడీపీలో కూడా నామినల్ – రియల్ అని 2 రకాలు. ద్రవ్యోల్బణం లెక్కలతో పనిలేకుండా, ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని లెక్కిం చే ది నామినల్ జీడీపీ. అయితే, ఒక బేస్ సంవత్సరం గా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించేదే రియల్ జీడీపీ. మనం అనుసరించేది దీన్నే. -
వృద్ధి 1.5 శాతమే
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు గణనీయంగా మందగించనుంది. 2020–21లో ఇది 1.5–2.8 శాతం స్థాయిలో ఉండొచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇదే నిజమైతే, 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాల్లో వృద్ధి రేటు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి కానుంది. దక్షిణాసియా ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 4.8–5 శాతం స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రభావాలు తగ్గే కొద్దీ 2022 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ పుంజుకోగలదన్నది బ్యాంక్ అంచనా. -
ఎకానమీపై మహమ్మారి పంజా!
కరోనా వైరస్ మహమ్మారి మరింతగా విస్తరించి, లాక్డౌన్ను పొడిగించడంతో పాటు ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకున్న పక్షంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 3 శాతం లోపునకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. జీడీపీలో ప్రధానమైన ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు, విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మూడు రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేపీఎంజీ దీన్ని రూపొందించింది. ఒకవేళ ఏప్రిల్ ఆఖరు నుంచి మే మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తే.. 2020–21లో భారత వృద్ధి రేటు 5.3–5.7 శాతం స్థాయిలో ఉండవచ్చని.. కానీ ప్రస్తుతం ఇది జరిగే అవకాశమైతే లేదని పేర్కొంది. ఇక రెండో కోణంలో.. కరోనా వైరస్ను భారత్ కట్టడి చేసినా అంతర్జాతీయంగా మాంద్యం వస్తే.. భారత వృద్ధి రేటు 4–4.5 శాతం మధ్యలో ఉండవచ్చు. అలా కాకుండా మహమ్మారి మరింత ముదిరి, మాంద్యం వస్తే మాత్రం భారత వృద్ధి 3 శాతం లోపునకు పడిపోవచ్చని కేపీఎంజీ పేర్కొంది. దీంతో పాటు వివిధ రంగాలపై కరోనా వైరస్ ప్రభావాల గురించి విశ్లేషించింది. వాటిలో ముఖ్యమైన కొన్ని రంగాలు.. టెక్స్టైల్స్ 10–12 శాతం డౌన్ కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకు ఏప్రిల్–జూన్ క్వార్టర్లో దేశీ టెక్స్టైల్స్, అపారెల్ రంగ ఉత్పత్తి 10–12 శాతం పడిపోవచ్చు. అలాగే రాబోయే మరికొన్ని త్రైమాసికాలు టెక్స్టైల్ ఎగుమతులు దెబ్బతినొచ్చు. తయారీ రంగ కోణంలో చూస్తే దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. లాక్డౌన్ నాలుగు వారాలు మించి కొనసాగిన పక్షంలో దేశీయంగా 7.5 కోట్ల ఎంఎస్ఎంఈల్లో దాదాపు పావు వంతు సంస్థలు మూతబడవచ్చు. ఇది ఎనిమిది వారాలు పైగా కొనసాగితే ఏకంగా 43 శాతం సంస్థలు మూతపడే అవకాశం ఉందని అఖిల భారత తయారీ సంస్థల సమాఖ్య (ఏఐఎంవో) అంచనా. ఆటోకు కష్టకాలం.. ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసరాల కొనుగోళ్లకు గణనీయంగా వెచ్చించాల్సి రావడం వల్ల ప్రజలు.. వాహనాల్లాంటి వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశముంది. కేవలం తప్పనిసరి రిపేర్ సంబంధ ఆఫ్టర్ మార్కెట్ సర్వీసులకు మాత్రమే కాస్త డిమాండ్ ఉండవచ్చు. కొనుగోలు శక్తి, సెంటిమెంటు బలహీనపడటం వల్ల ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లకు డిమాండ్ అంతంతే ఉంటుంది. నిత్యావసరాలు కాని సేవలన్నీ నిలిపివేయడం వల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్ మరింత పడిపోతుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల్లో సంక్షోభం, బ్యాంకింగ్లో నెలకొన్న పరిస్థితులతో రుణ లభ్యత సమస్యల వల్ల అమ్మకాలు దెబ్బతినొచ్చు. నిర్మాణ రంగం..పెట్టుబడుల మందగమనం.. డిమాండ్ ఒక మోస్తరుగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం గణనీయంగా తగ్గిపోతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో మందగమనంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో పెట్టుబడులు తగ్గవచ్చు లేదా ద్వితీయార్ధానికి వాయిదా పడొచ్చు. దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్త పెట్టుబడులు మందగించడం వల్ల అనుబంధ రంగాలన్నీ కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వంటి రంగాలు స్వల్పకాలికంగా దెబ్బతిన్నా, కంపెనీలు చైనా నుంచి ఇతర ఆసియా దేశాలకు (భారత్, వియత్నాం, కాంబోడియా వంటివి) తమ తయారీ బేస్ను మార్చుకునే యోచనలో ఉన్నందున.. వేగంగా పుంజుకోవచ్చు. రిటైల్.. ఈకామర్స్కు సవాళ్లు.. బియ్యం, పప్పు ధాన్యాలు వంటి వాటిపై ప్రజల ఖర్చుల సరళిని కరోనా పరిణామాలు నిర్దేశించనున్నాయి. సరఫరా వ్యవస్థలకు రాబోయే రెండు, మూడు వారాలు పరీక్షా సమయంలాంటిది. ఈ–కామర్స్ రంగం వృద్ధి మందగించవచ్చు. నిత్యావసరయేతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పడిపోవచ్చు. వీటికి సంబంధించి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడం కూడా పెద్ద రిస్కే. అపారెల్, డ్యూరబుల్స్, రెస్టారెంట్లు, జిమ్లు మొదలైన విభాగాలు పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చు. బలహీన బ్యాంకులకు ఇబ్బందే... సొమ్ము భద్రత కోసం ఖాతాదారులు పటిష్టమైన పెద్ద బ్యాంకుల్లోకి డిపాజిట్లను మళ్లించుకుంటూ ఉండటం వల్ల బలహీన ప్రైవేట్ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపై లిక్విడిటీపరంగా ప్రతికూల ప్రభావం పడవచ్చు. మారటోరియం ఎత్తివేశాక రెండు, మూడో త్రైమాసికాల్లో మొండిపద్దులు పెరిగే పక్షంలో బ్యాంకులపై భారం పెరగవచ్చు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలేమీ ఇప్పటివరకూ లేకపోవడంతో ఏవియేషన్, ఆటోమొబైల్, నిర్మాణ తదితర రంగాల సం స్థలు రుణాల చెల్లింపుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆ ప్రభావం ఆర్థిక సంస్థలపైనా పడే అవకాశం ఉంది. ఇక రిటైల్ రుణాల విషయానికొస్తే అఫోర్డబుల్ హౌసింగ్, ద్విచక్ర వాహనాల ఫైనాన్సింగ్, సూక్ష్మ రుణాల విభాగాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఫార్మాకు ముడి వనరుల సమస్యలు.. చైనా నుంచి సరఫరా తగ్గిపోవడంతో ముడివనరుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే జనరిక్ డ్రగ్స్ తయారీ సంస్థలపై ప్రభావం పడుతోంది. చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతుండటంతో ఈ సమస్య కాస్త తగ్గవచ్చు. ఇక లాక్డౌన్ కారణంగా కార్మికులు దొరక్కపోవడం, ప్యాకింగ్ మెటీరియల్ లభ్యతపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో ఉత్పత్తి దెబ్బతింటోంది. ముడిఉత్పత్తులు ఫ్యాక్టరీలకు చేరకపోవడం కూడా తయారీని దెబ్బతీస్తోంది. అత్యవసర ఔషధాలు, శానిటైజర్లు, పీపీఈల (మాస్కులు, గ్లవ్స్ మొదలైనవి) సరఫరా, పంపిణీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లోని పలు దేశాలు ఔషధాలను నిల్వ చేసుకుంటూ ఉండటం వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులకు డిమాండ్ పెరగవచ్చు. ఈసారి వృద్ధి 1.6 శాతమే... గోల్డ్మాన్ శాక్స్ అంచనా ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్మన్ శాక్స్ హెచ్చరించింది. 2020–21లో ఇది 1.6 శాతమే ఉండవచ్చని పేర్కొంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని, ఇకనైనా జోరు పెంచాల్సి ఉంటుందని గోల్డ్మన్ శాక్స్ అభిప్రాయపడింది. ‘విధానాలపరంగా ప్రభుత్వం ఎంత తోడ్పాటు అందిస్తున్నా.. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్, వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చిలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పడిపోయాయి. తదుపరి క్వార్టర్లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది‘ అని వివరించింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ సరిపోదు.. కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60% ఉండే వినియోగం.. లాక్డౌన్ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది. -
భారత వృద్ధి రేటులో భారీ కోత..
ముంబై : మహమ్మారి వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలు కుదేలవుతున్న క్రమంలో అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఇప్పటికే భారత వృద్ధి రేటు అంచనాలు తగ్గించగా, తాజాగా దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సైతం వృద్ధి రేటు అంచనాలో భారీ కోత విధించింది. కరోనా ప్రభావంతో 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 3.6 శాతానికి పరిమితమవుతుందని ఇండియా రేటింగ్స్ సోమవారం అంచనా వేసింది. ఏప్రిల్ మాసాంతం వరకూ పూర్తి, లేదా పాక్షిక లాక్డౌన్ కొనసాగుతుందని,మే తర్వాతే ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటాయని పేర్కొంది. మహమ్మారి వ్యాప్తికి ముందే ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న క్రమంలో కరోనా వైరస్ అనంతరం ఏప్రిల్ 14 వరకూ లాక్డౌన్ ప్రకటించడం ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుండటంతో ఇండియా రేటింగ్స్ భారత వృద్ధి రేటు అంచనాల్లో భారీ కోత విధించింది. జూన్ త్రైమాసంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 2.3 శాతంగా ఉంటుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. టూరిజం, ఆతిథ్య, పౌరవిమానయాన రంగాలు దాదాపు కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న వ్యాపారాల్లో నగదు ప్రవాహం తగ్గిపోయిన పరిస్ధితి కనిపిస్తోందని పేర్కొంది. ఆర్థిక సేవలు, ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు మాత్రం మారిన పరిస్ధితులకు అనుగణంగా ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయిస్తున్నాయని పేర్కొంది. ధాన్యం, ఇతర పంటల కొనుగోలులో అవాంతరాలు రైతుల ఆదాయంపై గ్రామీణ డిమాండ్పై ప్రభావం చూపుతాయని అంచనా వేసింది. నిర్మాణ రంగ కార్యకలాపాలు నిలిచిపోవడం రియల్ఎస్టేట్ రంగం సమస్యలను మరింత పెంచుతాయని పేర్కొంది. ఇక ముడిచమురు ధరలు దిగిరావడం భారత్కు కలిసివచ్చే అంశమని వ్యాఖ్యానించింది. చదవండి : కరోనా చికిత్సకు కొత్త పరికరం -
వృద్ధి రేటుకు కరోనా కాటు..
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాది భారత వృద్ధి రేటు 5.2 శాతానికే పరిమితమవుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. కోవిడ్-19 వ్యాప్తితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతోందని పేర్కొంది. 2020 కేలండర్ సంవత్సరంలో భారత్ ఆర్థిక వృద్ధి రేటు 5.7 శాతంగా ఉంటుందని గతంలో ఎస్అండ్పీ అంచనా వేయగా కరోనా మహమ్మారి ప్రభావంతో వృద్ధి రేటు అంచనాను తాజాగా 5.2 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుండటంతో ఆసియా పసిఫిక్ వృద్ధిరేటు 2020లో మూడు శాతానికే పరిమితమవుతుందని ఎస్అండ్పీ పేర్కొంది. కరోనా కేంద్రమైన చైనా అతలాకుతలం కావడం, అమెరికా, యూరప్లలో షట్డౌన్లు, స్ధానికంగా వైరస్ వ్యాప్తి వంటి అంశాలతో ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం కోరల్లో చిక్కుకుంటోందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనమిస్ట్ షౌన్ రోచే స్పష్టం చేశారు. 2020లో చైనా, భారత్, జపాన్ వృద్ధిరేట్లను తాము వరుసగా 2.9, 5.2, -1.2 శాతానికి తగ్గించామని ఎస్అండ్పీ పేర్కొంది. ఇక మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సైతం 2020లో భారత వృద్ధి రేటును 5.4 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గించింది. చదవండి : సైన్యంలో తొలి కరోనా కేసు -
స్లోడౌన్ సెగలు లేవు..
పుణె: దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందన్న వాదనతో తాను ఏకీభవించడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.దేశంలో రవాణా రంగం, పౌర విమానయాన రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కాగా ఆటోమొబైల్ రంగంలో వృద్ధి నెమ్మదించినా, ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి ఆటోమొబైల్ రంగం ఒక్కటే కొలమానం కాదన్నారు. పౌర విమానయాన రంగంలో వృద్ధి తగ్గిందన్న వార్తలను ఆయన ఖండించారు. ప్రపంచంలోనే దేశీయ పౌర విమానయాన రంగం మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిపారు. వృద్ధి రేటు పుంజుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, రవాణా రంగాన్ని వేగంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు. చదవండి: ఒక లీటర్ తాగి చెప్పండి..ఎలా ఉందో..! -
ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి
న్యూఢిల్లీ: ఇంటా, బయటా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికం(క్యూ3)లో ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. 4.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) జూలై–సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2019 ఏప్రిల్–జూన్)లో వృద్ధి రేటును 5 శాతం నుంచి 5.6 శాతానికి సవరించింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2018–19) డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండడం గమనార్హం. తయారీ రంగంలో ఉత్పత్తి క్షీణించడం వృద్ధి రేటు తగ్గేందుకు దారితీసినట్టు ఎన్ఎస్వో తెలిపింది. వృద్ధి గణాంకాలు ఇవీ... ►డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 4.7 శాతం వృద్ధి రేటు 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 4.3 శాతం తర్వాత తక్కువ స్థాయి. ►2019 ఏప్రిల్–డిసెంబర్ వరకు తొమ్మిది నెలలకు జీడీపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.3 శాతంగా ఉంది. ►తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 5.2 శాతం వృద్ధి చెందగా, తాజా ఇది 0.2 శాతం మేర తగ్గింది. ►వ్యవసాయ రంగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం నుంచి 3.5 శాతానికి పుంజుకుంది. ►నిర్మాణ రంగంలో జీవీఏ 6.6 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. మైనింగ్ రంగంలోనూ జీవీఏ 4.4 శాతం నుంచి 3.2 శాతానికి దిగొచ్చింది. ►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలోనూ జీవీఏ 0.7 శాతం మేర తగ్గింది. ►వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్ అండ్ సర్వీసెస్ విభాగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7.8 శాతం నుంచి 5.9 శాతానికి పరిమితమైంది. ►ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం 2019–20లో రూ.1,34,432గా ఉంటుంది. 2018–19లో ఉన్న తలసరి ఆదాయం రూ.1,26,521తో పోలిస్తే 6.3 శాతం అధికం. ద్రవ్యలోటు... 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటును రూ.7,66,846 కోట్లకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, జనవరి చివరికే (10 నెలల కాలం) రూ.9,85,472 కోట్లకు ( 128.5 శాతం) చేరింది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. క్షీణత ఇక ముగిసినట్టే: ఆర్థిక శాఖ దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్టాన్ని చూసేసిందని (బోటమ్డ్ అవుట్) కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని అకనమిక్ అఫైర్స్ విభాగం కార్యదర్శి అతాను చక్రవర్తి ప్రకటించారు. కీలక పారిశ్రామిక రంగాల్లో వృద్ధి డిసెంబర్, జనవరి నెలల్లో పుంజుకున్నట్టు చెప్పారు. -
కరెంట్..కొత్త రికార్డు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ శుక్రవారం ఉదయం 7.52 గంటల ప్రాంతంలో 13,168 మెగావాట్లుగా నమోదైంది. 13 వేల మెగావాట్ల డిమాండ్ను రాష్ట్రం అధిగమించడం ఇది రెండోసారి. ఈ నెల 25న నమోదైన 13,040 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను శుక్రవారం రాష్ట్రం దాటేసింది. ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఏమాత్రం కోత, లోటు లేకుండా విద్యుత్ సరఫరా చేయగలిగామని ట్రాన్స్కో ఓ ప్రకటనలో తెలిపింది. 23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఏపీలోనే 2014 మార్చి 23న 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలోనే అంతకు మించి డిమాండ్ ఏర్పడింది. గతేడాది సరిగ్గా ఇదే రోజు రాష్ట్ర గరిష్ట డిమాండ్ 9,770 మెగావాట్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్ వచ్చింది. ప్రస్తుత వేసవి తీవ్రత పెరిగినా కొద్దీ రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ రోజుకో కొత్త రికార్డు సృష్టించే అవకాశాలున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటికి తెలంగాణ ప్రాంతంలో నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్లు కాగా, ఇప్పుడు 132.6 శాతం వృద్ధిని సాధించింది. పెరిగిన వార్షిక వినియోగం రాష్ట్రంలో గరిష్ట డిమాండ్తో పాటు వార్షిక విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. 2014లో రాష్ట్రంలో 47,338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2018–19లో 68,147 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగింది. ఆరేళ్లలో 44 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 23 శాతమే. పెరిగిన తలసరి విద్యుత్ వినియోగం సుస్థిర అభివృద్ధి సూచికల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ విషయంలో తెలంగాణ దేశ సగటును మించింది. ప్రస్తుతం రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 1,896 యూనిట్లు కాగా, జాతీయ సగటు 1,181 యూనిట్లు మాత్రమే. తెలంగాణ ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లుండగా, ఆరేళ్లలో 39.82 శాతం పెరిగింది. సీఎం కేసీఆర్ మార్గదర్శకం, అనుక్షణం పర్యవేక్షణ, విద్యుత్ సంస్థల ఉద్యోగుల అవిరళ కృషితోనే రాష్ట్ర విద్యుత్ డిమాండ్కు తగ్గట్లు సరఫరా సాధ్యమవుతోందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తెలిపారు. డిమాండ్ పెరిగింది ఇలా.. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం, భారీ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా జరుపుతుండటంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 6 వేల మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 19,02,754 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 24,31,056కు పెరిగాయి. ఎత్తిపోతలకూ అంతే.. 2014లో ఎత్తిపోతల పథకాలకు 680 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టుల ఫలితంగా పంపుహౌస్ల నిర్వహణకు ప్రస్తుతం 2,200 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం అవుతోంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటం వల్ల వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు కూడా పెరిగాయి. దీంతో తెలంగాణవ్యాప్తంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల వృద్ధి రేటు అధికంగా ఉంది. -
సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం
ముంబై: దేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపార విధానాలను మరింత సులభతరం చేయాలని ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్ తెలిపారు. శనివారం ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ ఆశిస్తున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవ్వాలంటే సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రో క్రోనీ క్యాపిటలిజం ద్వారా కేవలం వ్యాపార వర్గాల వారికి, అధికారంలో ఉన్నవారికే లబ్ది చేకూరుతుందన్నారు. దేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రో బిజినెస్ పాలసీలు తోడ్పడుతాయని, అంతేకాకుండా వ్యాపార వర్గాల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం ప్రస్తుత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడకుండా, బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాచీన అర్థశాస్త్రం లాంటి గ్రంథాలను అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. సంపద సృష్టించే మెళుకువలను ప్రాచీన కాలం నాటి అర్థశాస్త్రంలో చక్కగా వివరించారని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్లో సూచించినట్టుగా దేశంలోనే ముడిసరుకుల ఉత్పత్తి వల్ల భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశం దూసుకెళ్లాలంటే ఎక్కువ స్థాయిలో ముడిసరుకులను ఎగుమతి చేయాలని తెలిపారు. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాయని పేర్కొన్నారు. దేశంలోకి ప్రో బిజినెస్ పాలసీలు అమలు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చదవండి: అపుడు దోసానామిక్స్, ఇపుడు థాలినామిక్స్ -
2020లో భారత్ వృద్ధి 5.4 శాతమే..: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి 2020 అంచనాలకు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ కోత పెట్టింది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు కేవలం 5.4 శాతమే ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం 2019 నవంబర్లో వేసిన అంచనా ప్రకారం ఈ రేటు 6.6%. ఆర్థిక రికవరీ అంచనాలకన్నా నెమ్మదిగా ఉందని తన తాజా అవుట్లుక్లో పేర్కొంది. ఇక 2021లో భారత్ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలకూ మూడీస్ కోత పెట్టింది. ఈ రేటును 6.7% నుంచి 6.6 శాతానికి కుదించింది. క్యాలెండర్ ఇయర్ ప్రాతిపదకన వేసిన ఈ అంచనాల ప్రకారం– 2019లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 5%. అంతర్జాతీయ అంశాలకన్నా దేశీయ అంశాలే భారత్ వృద్ధిపై కొంత అధిక ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అవుట్లుక్ పేర్కొంది. దేశీయ డిమాండ్ పెంపు, బ్యాంకింగ్ మందగమనం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధి మెరుగుపడ్డానికి ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక ఉద్దీపనలకు 2020 బడ్జెట్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించింది. -
భారత్ వృద్ధికి ఢోకా లేదు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం మందగమనంలో కొనసాగుతున్నా... దేశ ఆర్థిక మూలాల పటిష్టతపై విశ్వాసాన్ని గ్లోబల్ దిగ్గజ రేటింగ్ సంస్థ– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. దీర్ఘకాలికంగా చూస్తే, భారత్ ఆర్థిక వృద్ధి క్రమంగా పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న వ్యవస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి, విధాన నిర్ణయాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2020–2021లో దేశ వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6 శాతంగా ఉంటుందని అంచనావేసింది. 2021–2022లో ఈ రేటు 7 శాతానికి, అటుపై ఆర్థిక సంవత్సరం 7.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. ఈ అంచనాల నేపథ్యంలో దీర్ఘకాలికంగా భారత్ సార్వభౌమ రేటింగ్ను స్టేబుల్ అవుట్లుక్తో ‘బీబీబీ–’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక కంపెనీ లేక దేశం తన ద్రవ్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలదని ‘బీబీబీ’ రేటింగ్ సూచిస్తుంది. ఎస్అండ్పీ ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను చూస్తే... ► ఇటీవలి త్రైమాసికాల్లో భారత్ ఆర్థిక వృద్ధి బలహీన ధోరణిని ప్రదర్శిస్తోంది. అయితే దేశ వ్యవస్థాగత వృద్ధి పనితీరు పటిష్టంగా, చెక్కుచెదరకుండా ఉంది. దీనివల్ల వాస్తవిక (ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని) జీడీపీ వృద్ధి క్రమంగా రెండు మూడేళ్లలో రికవరీ చెందుతుందని భావిస్తున్నాం. ► తోటి వర్థమాన ఆర్థిక వ్యవస్థలతో పోల్చిచూస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ పనితీరు రానున్న కాలంలో మెరుగ్గానే కొనసాగుతుంది. ► తగిన ద్రవ్య, పరపతి విధానాలు, సైక్లికల్ ఫ్యాక్టర్స్ (తప్పనిసరిగా తిరిగి మెరుగుపడే కొన్ని అంశాలు), సానుకూల వ్యవస్థాగత అంశాలు ఆర్థిక వ్యవస్థ రికవరీకి దోహదపడతాయి. విదేశీ మారకద్రవ్య నిల్వల పరిస్థితి మెరుగ్గా ఉండడం ఇక్కడ గమనార్హం. ► జనాభాలో యువత అధికంగా ఉండడం, పోటీపూర్వక కార్మిక వ్యయాలు, సానుకూల కార్పొరేట్ పన్ను విధానాల వంటి అంశాలను వ్యవస్థాగతంగా భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనవిగా పేర్కొనవచ్చు. 2020–2024లో వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు సగటు 7.1 శాతంగా ఉంటుందన్నది విశ్లేషణ. ► అయితే భారత్ ద్రవ్య పరిస్థితులు ఇంకా కొంత ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ముఖ్యంగా ద్రవ్యలోటు ప్రభుత్వ ప్రణాళికలను దాటిపోయింది. వచ్చే కొద్ది సంవత్సరాల్లో దీని కట్టడి కొంత పరిమితంగానే ఉండే వీలుంది. అయితే ఆయా అంశాల్లో భారత్ పురోగతి సాధించగలిగితే, రేటింగ్ పెరిగే అవకాశాలూ ఉంటాయి. వృద్ధి, ద్రవ్యలోటు వంటి అంశాల్లో తన అంచనాలు విఫలమైతే, రేటింగ్ మరింత కోతకు కూడా వీలుంటుంది. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల బలహీన పరిస్థితులు వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేటు వినియోగాన్ని కట్టడి చేసే వీలుంది. ► జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన అంచనాల ప్రకారం– 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 5 శాతం. అయితే 2020–21లో ఈ రేటు 6 శాతంగా ఉండే వీలుందని ఎన్ఎస్ఓ పేర్కొంది. దీనికి సరిసమానంగా ఎస్అండ్పీ అంచనాలు కూడా ఉండడం గమనార్హం. -
మోదీ సర్కారు ‘వృద్ధి’ మంత్రం!
న్యూఢిల్లీ: భయపెడుతున్న ద్రవ్యలోటు ఒకవైపు... అంతకంతకూ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ మరో వైపు... ఇలాంటి సంకట పరిస్థితుల్లో కీలకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన మోదీ సర్కారు వృద్ధిరేటుకే తన ఓటు వేసింది. ఆదాయపు పన్ను(ఐటీ) రేట్లలో కోత ద్వారా వేతనజీవులకు ఊరటతో పాటు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) భారం నుంచి కంపెనీలకు పూర్తిగా ఉపశమనం కల్పించి అటు కార్పొరేట్లను మెప్పించే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన మందగమనాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వ వ్యయాన్ని కూడా భారీగానే పెంచుతూ ఎడాపెడా కేటా యింపులు చేశారు. ముఖ్యంగా వ్యవసా యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యా లను కూడా పెంచేశారు. లోటును పూడ్చుకోవడానికి ‘ఎల్ఐసీ’ని తురుపు ముక్కగా ఆమె ప్రయోగించారు. మొత్తం మీద 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను శనివారం సీతా రామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో భారీస్థాయిలో మెరుపులేవీలేనప్పటికీ... అత్యంత తీవ్రం గా నిరాశపరిచే అంశాలు కూడా లేవనేది విశ్లేషకుల మాట!! వేతనజీవులకు ఊరట... మధ్య, ఎగువ మధ్య తరగతి వేతనజీవులకు ఊర టనిచ్చేందుకు ఐటీ రేట్లు, శ్లాబుల్లో కీలక మార్పు లకు మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. రూ.10 లక్షల పైబడి వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి గత పన్ను చెల్లింపుదారులకు దీనివల్ల సుమారుగా ఒక ఏడాదిలో రూ.1,820 నుంచి రూ.20,300 ఆదా అవుతుందని అంచనా. అయితే, ఇప్పుడున్న రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్తో పాటు బీమా ప్రీ మియం, భవిష్య నిధి, పిల్లల స్కూలు ఫీజులు, ఇతరత్రా అనేక మినహాయింపులన్నింటినీ వదు లుకుంటేనే ఈ కొత్త రేట్ల ప్రకారం పన్ను ప్రయో జనం లభిస్తుంది. కొత్త విధానం వద్దనుకునేవారికి పాత శ్లాబులు, రేట్లను కొనసాగించుకునే వెసులు బాటును కూడా బడ్జెట్లో సీతారామన్ కల్పించడం విశేషం. అయితే, పన్ను విధానాన్ని సరళీకరిస్తున్నా మంటూనే.. మరింత గందరగోళంగా మార్చారం టూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్యలోటు లక్ష్యానికి తిలోదకాలు... వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా పలు రంగాలకు భారీగా కేటాయింపులు జరపాల్సిన తరుణంలో ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) లక్ష్యాలకు కేంద్రం పూర్తిగా నీళ్లొదిలేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.3 శాతంగా నిర్దేశించిన ప్రభుత్వం... ఇప్పుడు దీన్ని 3.8 శాతానికి సడలించింది. అదేవిధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం(2020–21) ద్రవ్యలోటు లక్ష్యాన్ని కూ డా గతంలో 3 శాతంగా అంచనావేయగా... దీన్ని ఇప్పుడు 3.5 శాతానికి పెంచేసింది. దీనివల్ల మార్కెట్ నుంచి 2020–21లో ఏకంగా రూ.5.36 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 –20) రుణ సమీకరణను కూడా రూ.4.99 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. మార్కెట్లు ‘బేర్’... ద్రవ్యలోటు లక్ష్యాలను పూర్తిగా గాలికొదిలే యడం.. ఇన్వెస్టర్లను మెప్పించే చర్యలను(దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను–ఎల్టీసీజీ తొలగిం చాలన్నది మార్కెట్ వర్గాల ప్రధాన డిమాండ్) విస్మరించడం... వృద్ధికి ఊతమిచ్చేలా నిర్దుష్ట చర్యలేవీ ప్రకటించకపోవడం వంటి కారణా లతో స్టాక్ మార్కెట్లు బడ్జెట్ పట్ల తీవ్రం గా స్పందించాయి. సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లు కుప్ప కూలింది. దాదా పు దశాబ్దకాలంలో ఒక్క రోజులో ఇం త భారీ నష్టాన్ని చవిచూడటం గమనార్హం. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 300 పాయింట్లు క్షీణించింది. బ్యాంకు డిపాజిట్లపై ఇకపై రూ.5 లక్షల బీమా రక్షణ! బ్యాంకులేవైనా దివాలాతీస్తే ఇప్పటి వరకూ డిపాజిట్దారులకు రూ.లక్ష వరకూ మాత్రమే బీమా రక్షణ ఉంది. దీన్ని ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లకు.. అంటే రూ.5 లక్షలకు పెంచుతూ బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతేడాది మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు స్కామ్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో డిపాజిటర్లు గగ్గోలు పెట్టడం తెలిసిందే. ఈ పరిణామం నేపథ్యంలోనే డిపాజిట్లపై బీమా రక్షణను భారీగా పెంచుతున్నట్లు మోదీ సర్కారు ప్రకటించడం గమనార్హం. ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపే లక్ష్యం వరుసగా రెండో ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్... దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగానే ఉన్నాయని ఉద్ఘాటించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలోనే ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తిని పెంచడమే లక్ష్యంగా 2020–21 బడ్జెట్లో కీలక చర్యలను ప్రకటిం చామని ఆమె స్పష్టం చేశారు. దేశీయంగా తయారీని ప్రోత్స హించేందుకు వీలుగా వంట సామగ్రి నుంచి ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్, స్టేషనరీ, ఆటబొమ్మలు ఇలా అనేక ఉత్పత్తుల దిగుమతులపై సుంకాన్ని పెంచారు. మరోపక్క, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో వ్యవసాయం... గ్రామీణాభివృద్ధికి ఏకంగా రూ.2.83 లక్షల కోట్ల ను కేటాయించారు. రైతు రుణాల లక్ష్యాన్ని 2020–21లో రూ.15 లక్షల కోట్లకు పెంచారు. రూ.1.7 లక్షల కోట్లను రవాణా మౌలిక సదుపా యాల కల్పనకు వెచ్చిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. కీలకమైన ఇంధన రంగానికి కూడా రూ.40,750 కోట్లు కుమ్మరించడం విశేషం. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో కొన్ని స్కీములకు కేటాయింపుల పెంపు ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని 2020–21లో 13 శాతం మేర పెంచేలా సీతారామన్ చర్యలు చేపట్టారు. అయితే, ప్రస్తుతం ఉన్న తీవ్ర మందగమనానికి ఐటీ ఊరట, వ్యయాల పెంపు వంటి ఈ అరకొర చర్యలు సరిపోవని.. భారీ ఉద్దీపనలు అత్యవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్లకు రూ.25,000 కోట్ల తాయిలం గతేడాది సెప్టెంబర్లో కార్పొరేట్ పన్నును 30 శాతం స్థాయి నుంచి ఏకంగా 22 శాతానికి తగ్గి స్తూ.. కీలక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసు కుంది. కొత్తగా ప్లాంట్లు నెలకొల్పే కంపెనీలకైతే 15 శాతం పన్నునే వర్తింపజేస్తామని కూడా ప్రకటిం చారు. ఇప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) భారం నుంచి కూడా కార్పొరేట్లకు ఉపశ మనం కలిగించి.. మందగమనంలో ఉన్న పరిశ్ర మలకు ఊరటనిచ్చే చర్యలను కేంద్రం తీసుకుంది. డీడీటీని ఇకపై నిర్దేశిత శ్లాబులను అనుసరించి డివిడెండ్ పొందినవారే చెల్లించాల్సి ఉంటుంది. ఈ తాజా ప్రతిపాదనతో ప్రభుత్వ ఖజానాకు రూ.25,000 కోట్లు చిల్లుపడుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. మరోపక్క, ప్రభుత్వ రంగ బ్యాం కులకు ‘ఇంద్రధనుష్’ పథకంలో భాగంగా ఇప్పటికే దండిగా మూలధనం అందిం చడం.. పలు బ్యాంకులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నేప థ్యంలో బడ్జెట్లో ప్రత్యేకంగా వీటికి సంబంధించి ఎలాంటి ప్రకటనలూ చేయలేదు. స్టార్టప్లకు దన్ను... స్టార్టప్లకు ఊతమిచ్చే లా సీతారామన్ కీలక చర్యలు తీసుకున్నా రు. ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఎసాప్స్)పై అయిదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. ‘ఎసాప్స్కి సంబం ధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుం డా అయిదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రయించే దాకా (ఏది ముందైతే అది) ట్యాక్స్ హాలిడే వర్తిస్తుంది‘ అని మంత్రి పేర్కొన్నారు. శైశవ దశలో ఉన్న స్టార్టప్ సంస్థలు నిపుణులైన సిబ్బందిని ఆకర్షించేందుకు, సంస్థను విడిచిపెట్టి వెళ్లిపోకుండా అట్టే పెట్టు కునేందుకు ఈ ఎసాప్స్ ఉపయోగపడతాయి. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. భారత్ ఇప్పుడు ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థగా(దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్లు) ఎదిగిందని బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ పేర్కొన్నారు. 2014 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 52.2 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రుణాలు... 2019 మార్చినాటికి 48.7 శాతానికి దిగొచ్చాయని చెప్పారు. అంతేకాదు... 2014–19 మధ్యలో సగటు జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైందని... ద్రవ్యోల్బణాన్ని సగటున 4.5 శాతానికి కట్టడి చేశామని కూడా ఆర్థిక మంత్రి వివరించారు. కాగా, 2024 నాటికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలసిందే. ఆర్థిక క్రమశిక్షణకు సవాళ్లు: మూడీస్ భారత్లో జీడీపీ వృద్ధి మందగమనం ప్రభు త్వం చెబుతున్నదానికంటే చాలా ఎక్కువ కాలమే కొనసాగే అవకాశం ఉందని... దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి)కు తీవ్ర మైన సవాళ్లు పొంచిఉన్నాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ప్రస్తుతం భారత్ సార్వభౌమ (సావ రీన్) రేటింగ్పై తమ ప్రతికూల దృక్పథాన్ని (నెగటివ్ అవుట్లుక్) ఈ రిస్కులు ప్రతిబిం బిస్తున్నాయని కూడా అభిప్రాయపడింది. ప్రస్తు తం భారత్కు మూడీస్ ‘బీఏఏ2 (ప్రతికూల అవుట్లుక్)ను కొనసాగిస్తోంది. ఈ స్థాయి రేటింగ్ ఉన్న దేశాలతో పోలిస్తే.. భారత్ రుణ భారం చాలా ఎక్కువగా ఉందని కూడా మూడీ స్ స్పష్టం చేసింది. ‘బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాలను 3.8 శాతం(2019–20 ఏడాదికి), 3.5 శాతాలకు(2020–21 సంవత్సరానికి) సడ లించడం, బలహీన వృద్ధి, పన్నుల కోతలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం స్థూల ఆదాయ లక్ష్యాలను సాధించడం కష్ట సాధ్యమే’ అని రేటింగ్ దిగ్గజం కుండబద్దలు కొట్టింది. బంగారుబాతు.. ఎల్ఐసీ! ద్రవ్యలోటును పూడ్చుకోవ డానికి మోదీ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో ప్రతిపాదనల్లోనే ఉన్న ‘ఎల్ఐసీ’ వాటా విక్రయం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. దీనిలో కొంత వాటాను పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా విక్రయించడం ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)ల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్మెంట్) ప్రక్రియలో ఎల్ఐసీ నుంచే (షేర్లను కొనిపించడం ద్వారా) ప్రభుత్వం నిధులను లాగేస్తూ వస్తోంది. ఇప్పుడు నేరుగా ఎల్ఐసీలోనే వాటాను అమ్మడం అంటే... ‘బంగారు బాతు’ సామెతను తలపిస్తోందని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలి: ఆర్బీఐ గవర్నర్
ముంబై: వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలను అమలు చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..వినియోగ డిమాండ్, వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వృద్ది తదితర లక్ష్యాలను సాధించడానికి ద్రవ్య పాలసీకి పరిమితులు ఉన్నాయని అన్నారు. ఏ రంగంలో సంస్కరణలు చేపట్టాల్లో విశ్లేషిస్తున్నామని..అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించాలంటే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, పర్యాటక రంగం, ఇ-కామర్స్, స్టార్టప్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు. ద్రవ్యోల్భణానికి కారణమయ్యే అంశాలను నిరంతరం సమీక్షించి పరిష్కార మార్గాలను కనుగొనాలని అన్నారు. పాలసీల రూపకల్పనలో సర్వే, డాటాను విశ్లేషిస్తామని, అన్ని అంశాలను పరిశీలించి పాలసీల రూపకల్పన చేస్తామని అన్నారు. చదవండి: ద్రవ్యోల్బణానికి, టెలికాం షాక్ -
2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు అసాధ్యమే
న్యూఢిల్లీ: 2024 నాటికి దేశ జీడీపీని 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని ఆచరణ సాధ్యం కాని లక్ష్యంగా ప్రముఖ ఆర్థికవేత్త ఆర్ నాగరాజ్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని 2024 నాటికి సాధించాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా 9% ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తు తం మన జీడీపీ సుమారు 2.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఐదేళ్లలో రెట్టింపు అయితేనే కేంద్రం లక్ష్యం నెరవేరుతుంది. ఈ లక్ష్యం అసాధ్యమైనది కాకపోయినా, ఈ దశాబ్దంలో సాధ్యం కాకపోవచ్చని నాగరాజ్ పేర్కొన్నారు. వృద్ధి రేటు పడిపోతున్న క్రమంలో ఈ లక్ష్యం ఊహించుకోలేని అత్యాశగా ఉందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు సెపె్టంబర్ త్రైమాసికంలో 4.5%కి క్షీణించిన విషయం తెలిసిందే. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతల ధోరణి మారకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘జీడీపీలో భారత ఎగుమతుల నిష్పత్తి 2010 నుంచి క్రమంగా క్షీణిస్తోంది. ఈ ధోరణి మారుతుందన్న సంకేతాలు ఏవీ కనిపించడం లేదు’’ అని నాగరాజ్ తెలిపారు. గత కొన్నేళ్లుగా తగ్గుతున్న వడ్డీ రేట్లు ఏ విధంగానూ సాయపడలేదని, ద్రవ్య ప్రోత్సాహకాల అవసరం ఉందన్నారు. -
ఈ ఏడాది భారత్ వృద్ధి 5.1 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019లో 5.1 శాతమే ఉంటుందని ఆసి యా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. ఉపాధి అవకాశాలు నెమ్మదించడం, పంట దిగుబడులు సరిగాలేక గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలహీనత, రుణ వృద్ధి మందగమనం వంటి అంశాలు దీనికి కారణమని ఏడీబీ విశ్లేషించింది. అయితే 2020లో భారత్ వృద్ధి 6.5 శాతం ఉంటుందని అంచనావేసింది. ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉండడం 2020పై తమ అంచనాలకు కారణమని తన 2019 అప్డేటెడ్ ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్లో ఏడీబీ పేర్కొంది. రెండవసారి కోత...: నిజానికి 2019లో 7 శాతం వృద్ధి రేటు ఉంటుందని తొలుత ఏడీబీ అంచనావేసింది. అయితే సెప్టెంబర్ మొదట్లో దీనిని 6.5 శాతానికి తగ్గించింది. తాజాగా దీనిని మరింత కుదించి 5.1 శాతానికి చేర్చింది. ఇక 2020 విషయానికి వస్తే, తొలి అంచనా 7.2 శాతం అయితే దీనిని 6.5 శాతానికి తాజాగా తగ్గించింది. 2018లో భారత్ వృద్ధిరేటు 6.8 శాతంగా ఏడీబీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకూ) దేశీయ వృద్ధి రేటును 6.1 శాతం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఐఎఫ్ఎస్సీల నియంత్రణకు ప్రత్యేక సంస్థ న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్సీ)ల్లో ఆర్థిక లావాదేవీల నియంత్రణ కోసం ఏకీకృత సంస్థ ఏర్పాటుకు లోక్సభ బుధవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తొలి ఐఎఫ్ఎస్సీ గుజరాత్లోని గాంధీ నగర్లో ఏర్పాటైంది. దీన్ని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్)గా వ్యవహరిస్తున్నారు. ఈ నియం త్రణ సంస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని, అయితే.. సీవీసీ, కాగ్ పరిధిలో ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
వృద్ధి 5.1 శాతం మించదు
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019–20 ఆర్థిక సంవత్సరం అంచనాలను రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తగ్గించింది. ఇంతక్రితం 6.3 శాతం ఉన్న ఈ రేటును 5.1 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఊహించినదానికన్నా మందగమన తీవ్రత ఎక్కువగా ఉందనీ తన తాజా నివేదికలో పేర్కొంది. ‘‘పారిశ్రామిక ఉత్పత్తి, ఎగుమతులు, బ్యాంకింగ్ రుణ వృద్ధి, పన్ను వసూళ్లు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక స్వల్పకాలిక సూచీలన్నీ బలహీన ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) 4.75 శాతం వృద్ధి రేటు నమోదయితే, చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) మాత్రం వృద్ధిరేటు కొంత మెరుగ్గా 5.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది’’ అని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వస్తు, సేవల పన్ను, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్, దివాలా చట్టం వంటివి ఆర్థిక వ్యవస్థపై ఇంకా కొంత ప్రతికూలతను చూపుతున్నాయని, ఆయా అంశాల అమలు, సర్దుబాట్లలో బాలారిష్టాలు తొలగిపోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల బలహీనత వంటి పరిస్థితులను చూస్తుంటే డిమాండ్ పూర్తిగా కిందకు జారిన పరిస్థితులు స్పష్టమవుతున్నాయని వివరించింది. ఈ నివేదిక నేపథ్యం చూస్తే... ► ఆర్థిక సంవత్సరం మొత్తంలో కేవలం వృద్ధి 4.7 శాతంగానే ఉంటుందని నోమురా అంచనా. ► శుక్రవారం వెలువడిన క్యూ2 ఫలితాల్లో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ► ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష గురువారం జరగనున్న నేపథ్యంలో క్రిసిల్ తాజా నివేదిక వెలువడింది. అక్టోబర్లో జరిగిన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ 2019–20 వృద్ధి రేటును 7 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది. శుక్రవారంనాటి గణాంకాల నేపథ్యంలో.. వృద్ధిపై ఆర్బీఐ భవిష్యత్ అంచనా చూడాల్సి ఉంది. సమీప భవిష్యత్తులో బలహీనమే: డీఅండ్బీ అమెరికా ఆర్థిక గణాంకాల ప్రచురణ సంస్థ– డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ (డీఅండ్బీ) మరో నివేదికను విడుదల చేస్తూ, సమీప భవిష్యత్తులో భారత్ ఆర్థిక వృద్ధి బలహీనంగానే ఉంటుందని విశ్లేషించింది. ఊహించినదానికన్నా మందగమనం కొంత ఎక్కువకాలమే కొనసాగే అవకాశం ఉందనీ అభిప్రాయపడింది. ఇటీవల వచ్చిన వరదలు, తగ్గిన వ్యవసాయ ఉత్పత్తి వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల డిమాండ్ను దెబ్బతీసిందని పేర్కొంది. నవంబర్లో ‘తయారీ’ కొంచెం బెటర్ : పీఎంఐ కాగా, తయారీ రంగం నవంబర్లో కొంత మెరుగుపడినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) సర్వే పేర్కొంది. సూచీ 51.2గా నమోదయిందని పేర్కొంది. అక్టోబర్లో ఈ సూచీ రెండేళ్ల కనిష్ట స్థాయి 50.6గా ఉంది. అయితే పీఎంఐ 50కు ఎగువన ఉన్నంతవరకూ దానిని వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సర్వే ప్రకారం.. నవంబర్లో కొన్ని కంపెనీలు కొత్త ఆర్డర్లు పొందగలిగితే, మరికొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నాయి. -
వృద్ధి రేటును తగ్గించిన మరో సంస్థ
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై రాయటర్స్ పోల్ అధ్యయనం చేసింది. ఆర్థిక నిపుణుల పర్యవేక్షణలో పలు కీలక అంశాలను వెల్లడించింది. గత ఆరు సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా వృద్ధిరేటు తగ్గుదల కనిపించబోతుందని నివేదిక స్పష్టం చేసింది. ఈ సంవత్సరంలో (2019-2020) 4.7శాతం వృద్ధి రేటు నమోదవుతుందని తెలిపింది. వినియాగదారుల డిమాండ్, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తగ్గడం, ప్రపంచ మందగమనం వల్ల వృద్ధి రేటు తగ్గిందని నివేదిక తెలిపింది. ఆర్బీఐ రెపోరేట్లను మరోసారి 25 బీపీఎస్ పాయింట్ల ద్వారా 4.90శాతం తగ్గిస్తుందని అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోరేటును ఆరోసారి తగ్గించడం గమనార్హం. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో రేటు అన్న విషయం తెలిసిందే. వృద్ధి మందగించిన నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపును ఆర్బీఐ సమర్ధించుకుంటుందని, మారిన కేంద్ర బ్యాంక్ వైఖరితో తాజా సమీక్షలోనూ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు రేటింగ్ సంస్థలు భారత వృద్ధిరేటును తగ్గించడం వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
మూడీస్ ‘రేటింగ్’ షాక్
న్యూఢిల్లీ: భారత క్రెడిట్ రేటింగ్ అవుట్లుక్ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టేబుల్)గా ఉంది. ఆరి్థక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని, ఫలితంగా వృద్ధి రేటు ఇక ముందూ తక్కువగానే ఉంటుందని అభిప్రాయపడింది. విదేశీ కరెన్సీ రేటింగ్ను మార్చకుండా ‘బీఏఏ2 మైనస్’గానే కొనసాగించింది.పెట్టుబడుల విషయంలో రెండో అతి తక్కువ గ్రేడ్ ఇది. ద్రవ్యలోటు ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి (2019–20) 3.7 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ప్రభుత్వ లక్ష్యం జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతం కంటే ఇది ఎక్కువే. వృద్ధి తక్కువగా ఉండడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయాల నేపథ్యంలో ద్రవ్యలోటు అంచనాలను మూడీస్ పెంచింది. జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 2013 తర్వాత అత్యంత కనిష్ట స్థాయిలో 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడిస్ నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే, రేటింగ్ అవుట్లుక్ను తగ్గించడంతో మరిన్ని సంస్కరణలు, దిద్దుబాటు చర్యల దిశగా ప్రభుత్వంపై ఒత్తిళ్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిచ్ రేటింగ్స్, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మాత్రం ఇప్పటికీ భారత అవుట్లుక్ను స్థిరంగానే (స్టేబుల్)గానే కొనసాగిస్తున్నాయి. మూడీస్ అభిప్రాయాలు... ►అవుట్లుక్ను నెగెటివ్కు మార్చడం పెరిగిన రిస్కలను తెలియజేస్తుంది. ఆరి్థక రంగ వృద్ధి గతం కంటే తక్కువగానే ఉండనుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆరి్థక, వ్యవస్థాగత బలహీనతలను పరిష్కరించే విషయంలో ప్రభావవంతంగా వ్యవహరించలేకపోవడాన్ని ఇది కొంత మేర ప్రతిఫలిస్తుంది. ►ఇప్పటికే రుణ భారం అధిక స్థాయిలో ఉండగా, ఇది ఇంకా క్రమంగా పెరిగేందుకు దారితీస్తుంది. ►ఆర్థిక వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలు మందగమనం తీవ్రత, కాల వ్యవధిని తగ్గించొచ్చు. ►గ్రామీణ స్థాయిలో దీర్ఘకాలం పాటు ఆరి్థక ఒత్తిళ్లు, ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్ఐ) రుణ సంక్షోభంతో మందగమనం మరింత స్థిరపడే అవకాశాలున్నాయి. ►ఎన్బీఎఫ్ఐల్లో రుణ సంక్షోభం వేగంగా పరిష్కారం కాకపోవచ్చు. ►ఆర్బీఐ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఆరి్థక రంగానికి మద్దతునిస్తాయే గానీ, ఉత్పాదకత, వాస్తవ జీడీపీ వృద్ధి పూర్వపు స్థాయికి తీసుకెళ్లలేకపోవచ్చు. ►నెగెటివ్ అవుట్లుక్ సమీప కాలంలో రేటింగ్ అప్గ్రేడ్కు ఛాన్స్ లే దని తెలియ జేస్తుంది. ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయి: కేంద్రం రేటింగ్ అవుట్లుక్ను నెగెటివ్గా మార్చడం పట్ల కేంద్ర ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. దీనివల్ల భారత్పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొంది. ‘‘ఆరి్థక రంగ మూలాలు పూర్తి బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. బాండ్ ఈల్డ్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో తీసుకున్న వరుస సంస్కరణలు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి. భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది’’ అని కేంద్ర ఆరి్థక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. 2019 భాతర వృద్ధి రేటు 6.1 శాతం, తర్వాతి సంవత్సరంలో 7 శాతంగా ఉండొచ్చన్న ఇటీవలి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలను ప్రస్తావించింది. భారత వృద్ధి సామర్థ్యాలు ఏమీ మారలేదన్న ఐఎంఎఫ్, ఇతర సంస్థల అంచనాలను గుర్తు చేసింది. ‘‘అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో చురుకైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. ఈ చర్యలు భారత్ పట్ల సానుకూల దృక్పథానికి దారితీస్తాయి. నిధులను ఆకర్షించడంతోపాటు, పెట్టుబడులకు ప్రోత్సాహాన్నిస్తాయి’’అని పేర్కొంది. -
ఆ దేశాల మందగమనానికి నిరుద్యోగమే కారణం
దుబాయ్: అరబ్ దేశాల ఆర్ధిక పరిస్థితికి సంబంధించి ఐఎమ్ఎఫ్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ క్రమంలో అరబ్ దేశాల ఆర్థిక వృద్ధి మందగమనానికి నిరుద్యోగం, సామాజిక ఉద్రిక్తతలు ఆజ్యం పోస్తున్నాయని ఐఎమ్ఎఫ్ సోమవారం తెలిపింది. నివేదిక ప్రకారం ఉత్తర ఆఫ్రికా (మెనా) నెమ్మదిగా వృద్ధి చెందడానికి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, చమురు ధరల అస్థిరత, బ్రెక్సిట్ ప్రక్రియ ఆలస్యం కావడం ప్రధాన కారణాలని వెల్లడించింది. సౌదీ అరేబియా, ఇరాన్ యూఏఈ లాంటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేటు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. కాగా, ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ జిహాద్ అజహర్ మాట్లాడుతూ మద్య ఆసియాలో వృద్ధి రేటు తగ్గడానికి నిరుద్యోగమే ప్రధాన కారణమని చెప్పారు. నిరుద్యోగం కారణంగానే సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రాంతలలో నిరుద్యోగం సగటున 11 శాతం కొనసాగుతుండగా ఇతర అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలలో 7 శాతం అని తెలిపింది. 18శాతంగా ఉన్న మహిళలు, యువత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తోడ్పాటును అందించడం లేదని తెలిపింది. అరబ్ దేశాల రుణ భారం గణనీయమైన స్థాయిలో పెరగగా, ఈ ప్రభావం పెట్టుబడులను ఆకర్షించడంలో అడ్డంకులు సృష్టించవచ్చని పేర్కొంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షల కారణంగా తీవ్ర ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుందని తెలిపింది. ఈ దేశాల ఆర్ధిక వ్యవస్థల బలోపేతానికి చమురు నిల్వలతో పాటు వేగవంతమైన సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మరోవైపు సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల వృద్ధి రేటు 2018లో 2శాతం ఉండగా ప్రస్తుత సంవత్సరం ఆయిల్ ధరల తగ్గడం వలన కేవలం 0.7శాతం నమోదవుతుందని తెలిపింది. -
వృద్ధి రేటులో మందగమనం: ఫిచ్ రేటింగ్స్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020)లో భారత వృద్ధి రేటు 5.5శాతం నమోదవుతుందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. ఈ క్రమంలో క్రెడిట్ లభ్యతలో పెద్ద ఎత్తున లోటు సంభవించడం వల్ల వృద్ది రేటు తగ్గనుందని నివేదిక తెలిపింది. కానీ, (2020-21)లో 6.2 శాతానికి, (2021-22)లో 6.7 శాతానికి వృద్ధి రేటు చేరుకుంటుందని నివేదిక స్పష్టం చేసింది. రానున్న కాలంలో భారత్ అనుకున్న స్థాయిలో పుంజుకోదని నివేదిక తెలిపింది. ఏడాది కాలంగా వేగవంతంగా రుణాలు మంజూరు జరగలేదని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రుణాలు 6.6శాతం ఉండగా, ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.5శాతం తక్కువగా ఉండడం గమనార్హం. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్ధిక సంస్కరణల వల్ల క్రెడిట్ లభ్యత ఆశాజనకంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మరోవైపు జీడీపీ వృద్ది రేటు గత సంవత్సరం 8శాతంతో పోలిస్తే , ప్రస్తుత సంవత్సరం 5శాతానికి పడిపోయిందని నివేదిక తెలిపింది -
వ్యాపారానికి భారత్ భేష్..
వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలనం సృష్టించిన భారత్.. ఈ సారి ఏకంగా మరో 14 మెట్లు పైకెక్కింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆర్బీఐ, ఐఎంఎఫ్, పలు రేటింగ్ ఏజెన్సీలు దేశ వృద్ధి రేటులో కోతను విధించిన ప్రస్తుత తరుణంలో భారత ర్యాంక్ మరింత మెరుగుపడడం విశేషం కాగా.. వరుసగా మూడో సారి కూడా టాప్ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగడం మరో విశేషంగా నిలిచింది. ఈ విధమైన రికార్డులను నెలకొల్పడం భారత్కే సాధ్యపడిందని వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ సిమియన్ జంకోవ్ కొనియాడారు. వచ్చే రెండేళ్లలో టాప్ 50 వ్యాపార సులభతర దేశాల జాబితాలోకి చేరాలన్న భారత్ లక్ష్యానికి అనుకూలంగా ఇక్కడి వాతావరణం మారుతోందన్నారు. స్పైస్ సూపర్..: భారత్లో కంపెనీలను సునాయసంగా ప్రారంభించడం కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. స్పైస్ (సరళీకృత ఎలక్ట్రానిక్ నమోదు) పేరిట నూతన ఒరవడిని సృష్టించింది. ఇదే సమయంలో ఫైలింగ్ రుసుమును రద్దు చేయడం వంటి వ్యాపార సానుకూల నిర్ణయాలను తీసుకుంది. ఢిల్లీలో నిర్మాణ అనుమతులు పొందేందుకు సమయం, ఖర్చులను గణనీయంగా తగ్గించడం.. పరిపాలనా సంస్కరణలు వంటి కీలకాంశాలు భారత ర్యాంకును మరింత పైకి చేర్చాయని ప్రపంచ బ్యాంక్ ఈ సందర్భంగా వెల్లడించింది. జీఎస్టీ సరళీకరణతో మరింత మెరుగు.. వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి
బీజింగ్: చైనా 2019 మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 1992 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు ప్రపంచ రెండవ ఆర్థిక వ్యవస్థలో నమోదుకావడం ఇదే తొలిసారని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకూ మరింత నష్టం వాటిల్లకుండా, అమెరికా–చైనా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికివచ్చినకేవలం ఒక్కవారంలోనే తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. రెండవ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఆర్థికవృద్ధి 2019లో 6.1 శాతంగానే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. కాగా 2019 మొదటి మూడు త్రైమాసికాలూ కలిపితే, చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంది. విలువలో చూస్తే, ఇది 69.79 ట్రిలియన్ యువాన్లు. అంటే దాదాపు 9.87 ట్రిలియన్ డాలర్లు. 6–6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదుకావాలన్నది చైనా లక్ష్యం. -
బీజేపీ స్వయంకృతం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని.. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మాని... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం బీజేపీ స్వయంకృతమని, అన్ని అంశాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే వృద్ధిరేటు మందగమనంలో సాగుతోందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం.. ఆర్థిక మాంద్యం కొనసాగుతోందనేందుకు సూచన అని ఆయన చెప్పారు. ఇంతకంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత, రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక వేత్తలకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. తయారీ రంగం వృద్ధి 0.6 శాతం మాత్రమే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లో లోపాల ఫలితాల నుంచి దేశం బయటపడలేదు అనేందుకు తాజా పరిణామాలు నిదర్శనమని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, వాటి స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ నుంచి అందిన రూ.1.76 లక్షల కోట్లతో ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నది నిజమైతే... ఆర్బీఐకు పరీక్షేనని అన్నారు. పన్ను ఆదాయంలో భారీ కోత పడగా.. చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వేధింపులకు గురవుతున్నారన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని, గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆదాయాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ కారణంగానే మోదీ లక్ష్యాలు నెరవేరలేదు..
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక లోటును తీర్చే క్రమంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే 2017లో జాతీయ స్థాయిలో వినియోగ పన్నును ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని భావించారు, కానీ పన్ను ఎగవేతల కారణంగా లక్ష్యాలు నెరవేరలేదని కాగ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా పన్ను లక్ష్యాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. అయితే ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా పన్ను ఎగవేతదారులు పూర్తి స్థాయిలో పన్నులు చెల్లించకపోవడం ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్లో వినియోగ వస్తువుల కారణంగానే 60శాతం వృద్ది రేటు నమోదవుతుంది. కానీ బ్యాంకింగ్ రంగంలో నిధుల లేమి కారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వినియాగ పన్ను వల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని భావించినా నకిలీ బిల్లులు, ఆడిటింగ్ మాయాజాలంతో ఆర్థిక వ్యవస్థ మెరుగైన ఫలితాలు సాధించడంలేదని పీడబ్లూసీ అనే సంస్థలో భాగస్వామిగా ఉన్న ప్రతిక్ జైన్ తెలిపారు. జీడీపీ వృద్ది రేటు, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద సవాల్ అని నిపుణులు విశ్లేషించారు. కానీ, అభివృద్ధి చెందిన దేశాల వృద్ధితో భారత్ను పోల్చడం సరికాదని, త్వరలోనే ఆర్థిక వ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పబ్లిక్ ఫైనాన్స్ ప్రొఫెసర్ సచ్చిదానందా ముఖర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎన్బీఎఫ్సీలకు కష్టకాలం..
న్యూఢిల్లీ: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్ త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఆటో మొబైల్, రియల్ ఎస్టేట్, నాన్–రిటైల్ రంగాల్లో డిమాండ్ మందగించడం కొన్ని ఎన్బీఎఫ్సీలపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం చూపించిందన్న అంచనాలు ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో మొత్తం మీద పరిశ్రమ రుణ వృద్ధి 15 శాతమే ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. 2017 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి. ‘అంతటా మందగమనం కనిపిస్తోంది. నిధులపరమైన కొరతే కాకుండా రుణాలు తీసుకునే విభాగాల్లో కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, రియల్టీ రంగాల్లో మందగమనం ఎన్బీఎఫ్సీ రుణ వృద్ధిపై ప్రతికూలంగా ఉండొచ్చు‘ అని మోతీలాల్ ఓస్వాల్ సంస్థలో ఎన్బీఎఫ్సీ విశ్లేషకుడు అల్పేష్ మెహతా చెప్పారు. గతేడాది సెప్టెంబర్ నుంచి వాహన దిగ్గజాల అమ్మకాలు మందగించాయి. ఈ ఏడాది మేలో మారుతీ సుజుకీ ఉత్పత్తిని సుమారు 18% తగ్గించుకుంది. డిమాండ్ బలహీనంగా ఉండటంతో ఉత్పత్తిలో కోత విధించుకోవడం వరుసగా ఇది 4వ నెల. కొన్నే మెరుగ్గా.. అయితే హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ వంటి బలమైన మాతృసంస్థలున్న ఎన్బీఎఫ్సీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గానే ఉండొచ్చని అంచనా. మిగతా ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే వీటికి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి నుంచి పుష్కలంగా నిధుల లభ్యత ఉండటమే ఇందుకు కారణమని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఎంఏఎస్ ఫైనాన్షియల్, పీఎన్బీ హౌసింగ్ సంస్థల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని, మరోవైపు ఎల్అండ్టీ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. తొలి త్రైమాసికం అంతంత మాత్రమే.. సాధారణంగా తొలి త్రైమాసికంలో ఆటోమొబైల్ ఫైనాన్స్ సంస్థల పనితీరు అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక ఎన్నికలు ఆపై మందగమనం తదితర కారణాల వల్ల ఆ సంస్థల రుణాల పోర్ట్ఫోలియోల విశేషాలను త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ‘ఆటో, హౌసింగ్ లోన్స్ సంస్థలకు తొలి త్రైమాసికం కాస్త బలహీనంగా ఉంటుంది. ఈ ఏడాది ఎన్నికల ప్రభావం తోడైంది. రిటైల్ రుణాల్లో మందగమనం, డెవలపర్లు సమస్యల్లో ఉండటం వంటి అంశాలు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు‘ అని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఇక, సాధారణంగా గృహ రుణాల మెచ్యూరిటీ గడువు అనేక సంవత్సరాల పాటు, కొన్ని సార్లు కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది. దీంతో ఎన్బీఎఫ్సీలకు ఆస్తులు, అప్పుల మధ్య సమన్వయం పాటించడం కష్టతరంగా మారుతోంది. ఈ సంస్థలు స్వల్పకాలిక రుణాలు తీసుకొచ్చుకుని.. దీర్ఘకాలిక ప్రాతిపదికన రిటైల్ రుణాలు ఇస్తున్నాయి. అయితే, ఇన్ఫ్రా రుణాల దిగ్గజం ఐఎల్అండ్ఎఫ్ఎస్ గతేడాది సెప్టెంబర్లో డిఫాల్ట్ అయినప్పట్నుంచి ఎన్బీఎఫ్సీలకు నిధులు దొరకడమే గగనంగా మారింది. డీహెచ్ఎఫ్ఎల్ విషయమే తీసుకుంటే భారీ ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం, రుణ వితరణ తగ్గడంతో మార్చి త్రైమాసికంలో రూ. 2,223 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. ఎన్బీఎఫ్సీలకు మరిన్ని రుణాలతో బ్యాంకులకు సమస్యలు ఆర్బీఐ ప్రతిపాదనలపై ఫిచ్ హెచ్చరిక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), రిటైల్ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. గతేడాది ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ఎన్బీఎఫ్సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్ రుణాల రిస్క్ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్బీఎఫ్సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్బీఎఫ్సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది. -
గేరు మార్చు.. స్పీడు పెంచు!
న్యూఢిల్లీ: అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం మళ్లీ పుంజుకోనుంది. అయితే, 2024–25 నాటికి నిర్దేశించుకున్న 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలంటే మాత్రం... ఇటు పెట్టుబడులకు, అటు సంస్కరణలకు తోడ్పడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తద్వారా నిలకడగా 8 శాతం స్థాయిలో అధిక వృద్ధి సాధిస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోగలిగే పరిస్థితి లేదు. ఈ దిశగా ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన పెరగటమనేది చాలా కీలకంగా నిలవనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ అంశాలను వెల్లడించింది. బడ్జెట్కు ముందురోజు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వే... ఇటు ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించడంతో పాటు భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలకు కూడా దిశానిర్దేశం చేసేదిగా ఉంటుంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం (నేడు) పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎకనమిక్ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పుంజుకోనున్న పెట్టుబడులు .. ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2018–19లో 6.8%కి క్షీణించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2019–20లో 7% స్థాయిలో నమోదు కానుంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.8%కి పడిపోయింది. ఇది చైనా నమోదు చేసిన 6.4% వృద్ధి కన్నా తక్కువ కావడం గమనార్హం. ఇక 2011–12 నుంచి క్రమంగా తగ్గుతున్న పెట్టుబడుల రేటు.. ప్రస్తుతం కనిష్ట స్థాయికి చేరుకుందని, ఇక నుంచి మళ్లీ పుంజుకోగలదని ఆర్థిక సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. వినియోగదారుల డిమాండ్, బ్యాంకుల రుణాలు సైతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలియజేసింది. అయితే, పన్ను వసూళ్లు, వ్యవసాయ రంగంపై పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాల కారణంగా ద్రవ్యపరమైన ఒత్తిళ్లు తప్పకపోవచ్చని వివరించింది. ప్రస్తుతం 2.7 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో భారత ఎకానమీ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది బ్రిటన్ను దాటేసి అయిదో స్థానానికి చేరొచ్చన్న అంచనాలున్నాయి. రుతుపవనాలు కీలకం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో చమురు ధరలు తగ్గవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ జీడీపీలో దాదాపు 60%గా ఉన్న వినియోగానికి ఇది ఊతమివ్వగలదని పేర్కొంది. కాకపోతే వినియోగం మందగించే రిస్కు లున్నాయని హెచ్చరించింది. ‘వ్యవసాయ రం గం రికవరీ, వ్యవసాయోత్పత్తుల ధరలే గ్రామీణ ప్రాం తాల్లో వినియోగానికి కీలకం కానున్నాయి. రుతుపవనాల పరిస్థితి వీటన్నింటినీ నిర్దేశిస్తుంది. కొన్ని ప్రాం తాల్లో సాధారణ స్థాయికన్నా తక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చు. ఇది పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు’ అని సర్వే పేర్కొంది. కార్మిక సంస్కరణలు ప్రధానం .. దేశంలో డిమాండ్కు ఊతమివ్వాలన్నా, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలన్నా, కార్మిక ఉత్పాదకత పెర గాలన్నా ప్రైవేట్ పెట్టుబడులు కీలకమని సర్వే తెలిపింది. ఇవే కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడగలవని వివరించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్మిక రంగం మొదలైన వాటిల్లో వ్యవస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇక లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రధానంగా ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఈ రంగం నుంచే వృద్ధికి మరింత ఊతం లభించగలదని ఆర్థిక సర్వే వివరించింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలివీ... ► ఒప్పందాలు సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణలు తేవాలి. పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి. ► 2018–19లో ద్రవ్య లోటు 3.4 శాతంగా నమోదు కావొచ్చు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ద్రవ్య లోటు 5.8 శాతంగా ఉండొచ్చని అంచనా. అంతక్రితం ఏడాదిలో ఇది 6.4%. ► రాజకీయ స్థిరత్వం వృద్ధి అవకాశాలకు సానుకూలాంశం. పెట్టుబడులు, వినియోగమే ఎకానమీ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ► 2024–25 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే (ప్రస్తుత స్థాయికి రెట్టింపు) నిలకడగా 8 శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుంది. పొదుపు, పెట్టుబడులు, ఎగుమతుల ద్వారానే ఇది సాధ్యపడగలదు. ► చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మరింత ఎదిగేందుకు, ఉద్యోగాలు కల్పించేందుకు, ఉత్పాదకత పెంచుకునేందుకు అనువైన విధానాలు ఉండాలి. ఎప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండిపోయే సంస్థల కన్నా భవిష్యత్లో భారీగా ఎదిగే సత్తా ఉన్న అంకుర సంస్థలను ప్రోత్సహించాలి. ► వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంపై పెట్టుబడులు పెంచాలి. రిటైర్మెంట్ వయస్సునూ దశలవారీగా పెంచాలి. ► తక్కువ జీతభత్యాలు, వేతనాల్లో అసమానతలే సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధాలుగా ఉంటున్నాయి. వీటిని సరి చేసేందుకు చట్టపరమైన సంస్కరణలు, స్థిరమైన విధానాలు అవసరం. ► కాంట్రాక్టుల అమలయ్యేలా చూసేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకులను మెరుగుపర్చుకోవడానికి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. ► 2018–19లో రూ. 38,931 కోట్ల విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు (ఎఫ్పీఐ) తరలిపోయాయి. 2017–18లో నికరంగా రూ. 1,44,681 కోట్లు వచ్చాయి. ► 28 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయం విషయంలో ఆర్థిక శాఖ గణనీయ పురోగతి సాధించింది. మూడింట్లో వాటాల విక్రయం పూర్తి కూడా అయింది. ► 2021 నాటికి ఉక్కు ఉత్పత్తి 128.6 మిలియన్ టన్నులకు చేరనుండగా, 2023 నాటికి వినియోగం 140 మిలియన్ టన్నులకు చేరనుంది. 2018–19లో ఉత్పత్తి 106.56 మిలియన్ టన్నులు. ► ఉపాధి లేని గ్రామాలను గుర్తించేందుకు, ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రయోజనాలను కల్పించేందుకు రియల్ టైమ్లో వివరాలు లభించేలా ప్రత్యేక సూచీని ఏర్పాటు చేయాలి. ► ప్రజలకు ప్రయోజనం చేకూర్చడంలో డేటా ప్రాధాన్యాన్ని గుర్తించి, దానిపై తగినంత ఇన్వెస్ట్ చేయాలి. ► 2018–19లో దిగుమతులు 15.4 శాతం, ఎగుమతులు 12.5 శాతం వృద్ధి నమోదు చేసి ఉండొచ్చని అంచనా. ► 2018–19లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 283.4 మిలియన్ టన్నుల మేర ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణే ముఖ్యం: సీఈఏ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే రూపకర్త, ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రభుత్వమే భారీగా రుణాలు సమీకరిస్తూ పోతే పెట్టుబడులకు అవకాశాలు దెబ్బతింటాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. నిధుల లభ్యత బాగుంది. కాబట్టి ఇటు ప్రైవేట్ సంస్థలు, అటు ప్రభుత్వం రుణాల సమీకరణ కోసం అటువైపు దృష్టి పెట్టొచ్చు. 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే జీడీపీలో పెట్టుబడులనేవి 30 శాతానికి పైగా ఉండాలి. చైనాలో ఇది 50 శాతానికి చేరింది. ప్రస్తుతం మన దగ్గర 29.6 శాతంగా ఉన్న పెట్టుబడుల రేటును 35 శాతం దాకానైనా పెంచుకోవాలి‘ అని సుబ్రమణియన్ చెప్పారు. ‘మన వృద్ధి రేటు బాగానే ఉంది. కానీ నిలకడగా 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే మనం గేర్లు మార్చాలి. టేకాఫ్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం‘ అని ఆయన పేర్కొన్నారు. టాప్ ట్యాక్స్పేయర్స్కు ప్రత్యేక వెసులుబాట్లు.. సక్రమంగా పన్నులు చెల్లించడాన్ని ప్రోత్సహించే దిశగా ప్రతి జిల్లాలో టాప్ 10 ట్యాక్స్పేయర్స్కు ప్రత్యేక గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో డిప్లమాటిక్ తరహా వెసులుబాట్లు, ఎయిర్పోర్టుల్లో ఎక్స్ప్రెస్ బోర్డింగ్ సదుపాయాలు కల్పించవచ్చని పేర్కొంది. అలాగే ఒక దశాబ్దకాలంలో అత్యధికంగా పన్నులు చెల్లించిన వారి పేర్లను ముఖ్యమైన భవంతులు, రహదారులు, రైళ్లు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలకు పెట్టే అంశాన్ని కూడా పరిశీలించవచ్చని ఆర్థిక సర్వే సూచించింది. చాలా మంది కోరుకునే సామాజిక హోదాతో పాటు సంఘంలో గౌరవం కూడా లభించేలా ప్రత్యేక క్లబ్స్ను ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. వ్యవసాయ రంగానికి తోడ్పాటు.. దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో వ్యవసాయ రంగంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని సర్వే సూచించింది. 2050 నాటికి భారత్లో నీటి వనరులు ఆందోళనకరంగా అడుగంటుతాయన్న వార్తల మధ్య .. ’భూమిపరమైన ఉత్పాదకత’పై కాకుండా ’సాగు నీటిపరమైన ఉత్పాదకత’ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు రైతాంగం జలవనరులను సమర్ధంగా వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించింది. ఇన్ఫ్రాపై ఏటా 200 బిలియన్ డాలర్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా ఇన్ఫ్రా రంగంపై భారత్ వార్షిక వ్యయాలను దాదాపు రెట్టింపు చేయాలని, ఏటా 200 బిలియన్ డాలర్లు పెట్టాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే దానికి తగ్గ పటిష్టమైన మౌలిక సదుపాయాలూ ఉండాలని పేర్కొంది. అయితే ఈ క్రమంలో ప్రైవేట్ పెట్టుబడులు మరిన్ని వచ్చేలా చూడటమే పెద్ద సవాలుగా ఉండగలదని పేర్కొంది. ప్రస్తుతం భారత్ ఏటా కేవలం 100 నుంచి 110 బిలియన్ డాలర్లు మాత్రమే ఇన్ఫ్రాపై వెచ్చించగలుగుతోందని వివరించింది. స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధన.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం లక్ష్యాలు చాలావరకూ నెరవేరాయని, పలు రాష్ట్రాల్లో ప్రతీ ఇంటా మరుగుదొడ్ల నిర్మాణంతో బహిరంగ మలవిసర్జన నూటికి నూరు శాతం నిల్చిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2014 అక్టోబర్లో ఈ పథకం ప్రారంభించినప్పట్నుంచీ దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని తెలిపింది. 2019 జూన్ 14 నాటికి 30 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 100 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయని వివరించింది. రాబోయే రోజుల్లో ఎస్బీఎం కింద ద్రవ, ఘన వ్యర్థాల విసర్జనపై దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. వాటిపై పెట్టే వ్యయం తగ్గే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లేలా చూడొచ్చని పేర్కొంది. ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం నార్వేలో 39 శాతం, చైనాలో రెండు శాతం ఉండగా భారత్లో 0.06 శాతమే ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు, విద్యుత్ వాహనాలపై ఆర్థిక సర్వే సూచనలను పరిశ్రమవర్గాలు స్వాగతించాయి. కొత్త మార్కెట్లలో ఐటీకి బాటలు భారత ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు చాన్నాళ్లుగా సర్వీసులు అందిస్తున్న దేశాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న మార్కెట్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త మార్కెట్లపైనా అవి దృష్టి సారించాలి. యూరప్, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం దేశీ ఐటీ–బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) ఎగుమతులు 2018–19లో 136 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మొత్తం దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ పరిమాణం 181 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. అటు స్టార్టప్ సంస్థలకు తోడ్పాటునిచ్చేలా పన్నులను క్రమబద్ధీకరించాలని కూడా సర్వే సూచించింది. రిటైర్మెంట్ వయస్సు పెంచాలేమో... భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో పదవీ విరమణ వయస్సును కూడా పెంచే అవకాశాలు పరిశీలించాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే సూచనప్రాయంగా తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల్లో జనాభా వృద్ధి గణనీయంగా మందగించే అవకాశం ఉందని పేర్కొంది. ఓవైపు యువ జనాభా (0–19 మధ్య వయస్సున్న వారు) సంఖ్య 2041 నాటికి 25 శాతానికి తగ్గనుండగా వృద్ధుల సంఖ్య (60 ఏళ్లు పైబడిన వారు) రెట్టింపై 16 శాతానికి చేరనుంది. ఇక ప్రాథమిక స్థాయి విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతున్నందున పాఠశాలలు లాభదాయకంగా నడవాలంటే కొన్నింటిని విలీనం చేయాల్సి రావొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. 100 స్మార్ట్ సిటీలు.. స్మార్ట్ సిటీస్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా దాదాపు 100 నగరాలు తలపెట్టగా, ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ. 2.05 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ ప్రాజెక్టుల అమల్లో చెప్పుకోతగిన పురోగతి సాధించినట్లు తెలిపింది. నగర ప్రజలకు మెరుగైన జీవన విధానాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో 2015 జూన్లో అయిదేళ్ల వ్యవధికి కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సీఎం)ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 100 నగరాల్లో 5,151 ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ ప్రాంత) కింద ఇప్పటిదాకా 4,427 నగరాలు, పట్టణాలను చేర్చినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొంది. ఐబీసీతో పటిష్టంగా రికవరీ.. ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన కీలక ఆర్థిక సంస్కరణల్లో దివాలా స్మృతి (ఐబీసీ) ఒకటని, దీనివల్ల మొండిబాకీల రికవరీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇప్పటిదాకా దీని కింద రూ. 1.73 లక్షల కోట్ల క్లెయిమ్స్ సెటిల్ అయినట్లు వివరించింది. 94 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొంది. మరోవైపు మొండిబాకీల భారం తగ్గడంతో బ్యాంకింగ్ రంగం పనితీరు కూడా మెరుగుపడిందని ఆర్థిక సర్వే వివరించింది. ప్రధాన సూచీ 17 శాతం అప్.. గత ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 17 శాతం, నిఫ్టీ సుమారు 15 శాతం పెరిగాయని ఆర్థిక సర్వే తెలిపింది. 2018 మార్చి 31న 32,969గా ఉన్న సెన్సెక్స్ గతేడాది మార్చి 31న 38,673 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 10,114 నుంచి 11,624కి చేరింది. ఆచరణాత్మక లక్ష్యం: పరిశ్రమ వర్గాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 శాతంగా ఉండొచ్చన్న ఆర్థిక సర్వే అంచనాలను.. ఆచరణాత్మక లక్ష్యంగా పరిశ్రమవర్గాలు అభివర్ణించాయి. సర్వేలో పేర్కొన్నట్లుగా 2024–25 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో 8 శాతం వృద్ధి రేటు సాధించాలంటే.. ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం లభించాలని, వినియోగం పెరగాలని పేర్కొన్నాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని సీఐఐ, ఫిక్కీ, అసోచాం తదితర పరిశ్రమ సమాఖ్యలు అభిప్రాయపడ్డాయి. ‘7 శాతం వృద్ధి రేటు అంచనా కాస్త ఆచరణాత్మక లక్ష్యమే. విధానాలపరమైన తోడ్పాటు ఉన్నప్పుడు వచ్చే ఐదేళ్లలో సగటున 8 శాతం వృద్ధి రేటు కూడా సాధించవచ్చు‘ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ‘పెట్టుబడులను ప్రోత్సహించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడులు, వినియోగం, పొదుపును ప్రోత్సహించేలా నిర్దిష్ట చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం‘ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ చెప్పారు. ఎగవేతదారులు నరకానికే! ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినబడుతున్న మాట ‘ఎగవేత’ అంటే అతిశయోక్తి కాదేమో!! పన్నులు, రుణాలను ఎగ్గొడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. సర్కారు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా పరిష్కారం మాత్రం అంతంతే. బహుశా! అందుకేనేమో!! ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు... ప్రభుత్వం ఎగవేతల కట్టడికి ‘మతం’ మంత్రం జపిస్తోంది. ప్రజలకున్న మత విశ్వాసాలను దీనికి విరుగుడుగా వాడాలని చూస్తోంది. ఆర్థిక సర్వేలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. హిందూ మతం ప్రకారం ఎవరైనాసరే అప్పు తీసుకొని ఎగ్గొట్టడం అంటే పాపం చుట్టుకోవడమేకాదు.. తీవ్రమైన నేరం కూడా!!. ఇక రుణగ్రస్తులుగా కన్ను మూస్తే... ఏకంగా నరకానికి పోతారన్నది నానుడి!! అందుకే ఆ నరకకూపంలోకి పోకుండా చూడాలంటే ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత తమ పిల్లలదేనని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇస్లాం, బైబిల్లో కూడా ఇలాంటి బోధనలే కనబడతాయి. భారతీయ సంస్కృతిలో అప్పులు ఎగ్గొట్టడం అంటే ఎంత పాపమో, నేరమో అన్నది మన మతాలే చెబుతున్నప్పుడు.. దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్నది సర్వే చెబుతున్న సారాంశం. మరి మోదీ సర్కారు చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందో ఆ దేవుడికే తెలియాలి!!. -
భారత్తో బంధానికి తహతహ
భారత్ ఒక బిగ్ మార్కెట్. 2018 నాటికి ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అంతవరకు ఆరో స్థానంలో వున్న ఫ్రాన్స్ను వెనక్కి నెట్టేసింది. ఈ యేడాది భారత్ ఐదో స్థానానికి చేరుకోగలదని లండన్కు చెందిన ఐహెచ్ఎస్ మార్కిట్ లిమిటెడ్ (గ్లోబర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్) అంచనా వేస్తోంది. భారత్ 2019–23 మధ్య కాలంలో ఏడాదికి సగటున ఇంచుమించు 7% వృద్ధిరేటు నమోదు చేయగలదని, రానున్న రెండు దశాబ్దాల్లో ఏడాదికి సగటున 75 లక్షల మంది ఆర్థిక కార్యకలాపాల్లోకి ప్రవేశించే అవకాశముందని ఆ సంస్థ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.5% వృద్ధిరేటు సాధించగలదని ప్రపం చ బ్యాంకు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను బలపరచుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. దీనిపై దృష్టి సారించని ప్రభుత్వాలపై వేలెత్తి చూపుతున్నాయి. భారత్ పట్ల ట్రంప్ ప్రభుత్వ వైఖరి మారాలని డెమోక్రాట్లు కోరుతున్నారు. బ్రెగ్జిట్ను దృష్టిలో వుంచుకుని భారత్తో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేయాలంటోంది యూకే పార్లమెంటరీ నివేదిక. వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం భారత్తో సంప్రదింపులు జరపడానికి బదులు వివిధ అంశాలకు సంబంధించి ఆ దేశంపై ట్రంప్ సర్కారు ఒత్తిడి తీసుకువస్తోందనే అభిప్రాయం బలం పుంజుకుంటోందని అంటున్నారు అమెరికా దిగువసభ విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు ఇలియట్ ఇంజల్. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైకేల్ పాంపియోకు సోమవారం ఆయన లేఖ రాశారు. భారత్ సహా ఆసియాలో పాంపియో జరుపుతున్న పర్యటన నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) రద్దు చేయడాన్ని, ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోరాదంటూ మన దేశంపై ఆంక్షలు విధించడాన్ని ఈ లేఖ ప్రధానంగా ప్రస్తావించింది. పాంపియో తన భారత్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇలియట్ సూచించారు. భారత్ విషయంలో పాలకుల మాటలకు – చేతలకు మధ్య పొంతన లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం పట్ల అమెరికా అవలంభిస్తోన్న అస్థిర వైఖరి – దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన ఇరుదేశాల భాగస్వామ్యాన్ని దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట ప్రపంచ పోటీలో అంతకంతకూ వృద్ధి చెందుతున్న భారతదేశంతో పోల్చుకుంటే బ్రిటన్ వెనకబడిందని, పెరుగుతున్న భారత్ పలుకుబడికి సరితూగగలిగేలా తన వ్యూహం సరిచేసుకోవడంలో విఫలమయ్యిందని తాజాగా వెలువడిన బ్రిటిష్ పార్లమెంటరీ పరిశీలన నివేదిక పేర్కొంది. ‘బిల్డింగ్ బ్రిడ్జెస్ : రీఅవేకనింగ్ యూకే – ఇండియా టైస్’ శీర్షికన వెలువడిన ఈ నివేదికను ‘యూకె – ఇండియా వీక్ 2019’ సందర్భంగా బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. భారతీయ యాత్రికులు, విద్యార్థులు, వృత్తి నిపుణులకు ప్రయోజనకరమైన వీసా, వలస విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక వివరించింది. ద్వైపాక్షిక సంబంధాల ద్వారా బ్రిటన్ తగిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని వ్యాఖ్యానించింది. భారత్తో తన సంబంధాలను సరిచేసుకునేందుకు ఆచరణయోగ్యమైన కొన్ని చర్యలను బ్రిటన్ తీసుకోవాలని, ప్రత్యేకించి చదువు – ఉద్యోగం – సందర్శన కోసం భారతీయులు సులభంగా బ్రిటన్ వచ్చేందుకు వీలు కల్పించాలని నివేదిక పేర్కొంది. వీసాల విషయంలో ప్రజాస్వామ్య రహిత చైనా కంటే కఠిన నిబంధనలను బ్రిటన్ అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
వచ్చే మూడేళ్లూ 7.5 శాతమే
వాషింగ్టన్: భారత వృద్ధి రేటు విషయంలో తన అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో 2019–20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. ఇదే రేటును తదుపరి మూడేళ్లూ కొనసాగించవచ్చని తెలియజేసింది. పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వృద్ధి రేటుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ రేటు 6.8 శాతంగా ఉంటుందన్న అంచనాను కేంద్ర గణాంక శాఖ ఇటీవల పేర్కొనగా, ప్రపంచ బ్యాంకు మాత్రం 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది. పొరుగు దేశం చైనా 2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇక 2020లో 6.1 శాతం, 2021లో 6 శాతంగా ఉంటాయని పేర్కొంది. దీంతో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపును కొనసాగించనుంది. 2021 నాటికి భారత వృద్ధి రేటు చైనా 6 శాతం కంటే ఒకటిన్నర శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మానిటరీ పాలసీ అనుకూలం... ‘‘ఆర్బీఐ లక్ష్యానికి దిగువనే ద్రవ్యోల్బణం ఉండడంతో మరింత సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ మధ్య... ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు అన్నవి రుణాల వృద్ధి బలపడడం వల్ల ప్రయోజనం పొందుతాయి’’ అని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో వివరించింది. పట్టణ ప్రాంత వినియోగానికి రుణాల్లో వృద్ధి పుంజుకోవడం మద్దతుగా ఉంటుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంత వినియోగానికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండటం ఆటంకంగా విశ్లేషించింది. తయారీ రంగంలో అంతటా బలమైన వృద్ధి ఉన్నట్టు తెలిపింది. సేవల రంగం చల్లబడడానికి ప్రధానంగా వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్ రంగాల కార్యకలాపాలు నిదానించడమేనని పేర్కొంది. జీఎస్టీ ఇంకా పూర్తి స్థాయిలో సర్దుకోవాల్సి ఉందని నివేదిక అభిప్రాయపడింది. -
పన్నుల రాబడి పెరుగుతోంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఏటా పురోగమన దిశలోకి వెళుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో బడ్జెట్ రాబడులు, వ్యయాలు, అప్పులు కలిపి ఆర్థిక వ్యవస్థ విలువ రూ. 4 లక్షల కోట్లు ఉంటే గత ఐదేళ్లలో అది రూ. 9 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ముఖ్యంగా సొంత పన్నుల రాబడిలో అద్భుత ప్రగతి నమోదవుతోంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడి గతేడాదితో పోలిస్తే 29 శాతం వృద్ధి నమోదు చేసుకుంది. మొత్తం రూ. 77,514 కోట్ల సొంత పన్ను రాబడిని 2018–19లో లక్ష్యంగా పెట్టుకుంటే డిసెంబర్ నాటికే అది రూ. 49,203 కోట్లు వచ్చింది. మిగిలిన త్రైమాసికంలోనూ మంచి ఫలితాలు ఉండటంతో 2018–19 ఆర్థిక సంవత్సరం రూ.64,714 కోట్లతో ఆశాజనకంగా ముగిసింది. మొత్తానికి గత ఐదేళ్లలో సొంత పన్ను రాబడులు రూ. 29 వేల కోట్ల నుంచి రూ. 70 వేల కోట్లకు చేరడం గమనార్హం. రిజిస్ట్రేషన్లు.... సూపర్ రెవెన్యూ రాబడులను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం రాష్ట్రంలో గత ఐదేళ్లలో అద్భుత ప్రగతిని నమోదు చేసుకుంది. ఏటా రిజిస్ట్రేషన్ల ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. ఒక్కో నెలలో ఏకంగా రూ. 500 కోట్లు దాటుతున్న రిజిస్ట్రేషన్ల రాబడులు ఖజానాకు భారీగా నిధులు తెచ్చిపెడు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డులు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 27 శాతం అధికంగా రూ. 5,357 కోట్లు సమకూరాయి. దేశంలోనే ఈ మేర వృద్ధి సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాష్ట్రంలో 2014–15 ఆర్థిక సంవత్స రంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 2,531 కోట్లుగా ఉంటే అది ఐదేళ్లలో రూ. 5,357 కోట్లకు చేరింది. అంటే గత ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రెట్టింపుకన్నా ఎక్కువ పెరిగిందన్న మాట. జీఎస్టీలో రికార్డు... అమ్మకాలు, వర్తకపు పన్ను విషయంలోనూ రాష్ట్రంలో గణనీయ వృద్ధి నమోదవుతోంది. గత ఐదేళ్లలో పన్నుల ఆదాయం కూడా రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2017–18లో జీఎస్టీ అమల్లోకి వచ్చాక కూడా పన్నులు భారీగానే వసూలయ్యాయి. ఊహించిన దానికన్నా తక్కువే అయినా 2017–18లో రూ. 37,439 కోట్ల పన్నులు వసూలు కాగా, 2018–19లో ఆల్టైం రికార్డు సాధించింది. కేంద్రం నుంచి వచ్చే పరిహారంతోపాటు అన్ని పన్నులు కలిపి రూ. 45 వేల కోట్లకుపైనే వసూలయ్యాయి. 17 శాతం వృద్ధి నమోదు... 2014 మే నుంచి 2018 మార్చి వరకు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనుబట్టి కాగ్ నివేదికలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 17 శాతంగా నమోదు కావడం విశేషం. ఇది దేశంలోనే అత్యధికం కాగా, మన తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వరుసగా నాలుగేళ్లపాటు రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో ప్రగతి నమోదు చేసుకుందని, అన్ని రాష్ట్రాలకన్నా పన్నుల రాబడిలో తెలంగాణ మంచి వృద్ధి సాధిస్తోందని కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. సంక్షేమ భారాలను అధిగమిస్తూ... సంక్షేమం, అభివృద్ధితోపాటు రాష్ట్రంలో సాగునీటి వనరుల కల్పనే ధ్యేయంగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల అమలుకోసం ఏటా రూ. 30 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆసరా పింఛన్ల కోసమే రూ. 12 వేల కోట్ల మేర వెచ్చించాల్సి వస్తోంది. అప్పులూ చేయాల్సిందే... రాష్ట్రం ఏర్పాటయ్యాక రూ. 1.13 లక్షల కోట్ల మేర అప్పులు చేయాల్సి వచ్చింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రణాళికేతర వ్యయానికి తోడు సాగునీటి ప్రాజెక్టులకు కలిపి భారీగా నిధులు వెచ్చించాల్సి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకోవాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సామర్థ్యంలో 25 శాతం మేర అప్పులు తీసుకునే అవకాశం ఉండగా ప్రభుత్వం 22 శాతం అప్పులు తీసుకుంది. తెలంగాణ ఏర్పాటైన తొలి ఏడాది రూ. 9,410 కోట్లు అప్పు తీసుకుంటే ఆ తర్వాత వరుసగా రూ. 18,856 కోట్లు, రూ. 35,280 కోట్లు, రూ. 26,738 కోట్లు, రూ. 23,470 కోట్ల మేర అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు అనుగుణంగా మరో రూ. 29,800 కోట్ల మేర అప్పులు తీసుకునే అవకాశం ఉంది. -
అప్పుల కోసం చంద్రజాలం
సాక్షి, అమరావతి: లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు కనికట్టు చేశారు. ఇదే కనికట్టుతో భారీ ఎత్తున అప్పులు చేశారు. చేసిన అప్పులతో ఆస్తులు ఏమైనా సమకూర్చారా? అంటే అదీ లేదు. కమీషన్ల రూపంలో భారీగా కాజేశారు. ఇదీ నాలుగేళ్ల పది నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం. ఉమ్మడి రాష్ట్రంలో అంటే 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) 2013–14 నాటికి రూ.8,55,935 కోట్లు. కానీ, రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 2019–20 నాటికి రూ.10,67,990 కోట్లకు చేరుకుందని చంద్రబాబు సర్కార్ లెక్కలు వేసింది. ఇవే లెక్కలను చూపించి 2018–19 నాటికే రూ.2.58 లక్షల కోట్ల అప్పులు చేసింది. గత ఐదేళ్లలో ఏటా పది శాతం వృద్ధి రేటు సాధించినట్లు చంద్రబాబు పదేపదే చెబుతూ వచ్చారు. ఆ లెక్కన చూసుకున్నా జీఎస్డీపీ వృద్ధి రేటు ఐదేళ్లలో 50 శాతానికి మించకూడదు. కానీ, 2013–14లో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీతో పోల్చితే 2019–20 నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 124.79 శాతం అధికంగా ఉన్నట్లు చెప్పడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు. కేవలం భారీ ఎత్తున అప్పులు తేవడం కోసమే లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపి చంద్రబాబు మాయ చేశారని స్పష్టమవుతోంది. అన్నింటా అదే కథ రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి 2013–14లో 8,55,935 కోట్లు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపుతూ వచ్చింది. దేశంలో డబుల్ డిజిట్ వృద్ధిరేటు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ఊదరగొట్టింది. వాస్తవానికి వ్యవసాయ వృద్ధి తిరోగమనంలోనే కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయంతో సంబంధం లేని చేపలు, మాంసం ఉత్పత్తులు భారీగా పెరిగినట్లు అంచనాలు వేస్తూ దాన్ని వ్యవసాయంలో కలిపేసి వృద్ధిరేటు అమోఘం అంటూ కనికట్టు చేసింది. పరిశ్రమల నుంచి సేవల రంగం వరకూ వృద్ధి రేటులో ఇదే కథ. అప్పులతో రాష్ట్రానికి ఒరిగిందేమిటి? రాష్ట్ర విభజన మరుసటి ఏడాదే అంటే 2014–15లో జీఎస్డీపీ రూ.5,26,470 కోట్లకు.. 2015–16లో రూ.6,09,934 కోట్లకు.. 2016–17లో రూ.6,99,307 కోట్లకు, 2017–18లో రూ.8,03,873 కోట్లు, 2018–19లో 9,18,964 కోట్లు.. 2019–20 నాటికి కేవలం 13 జిల్లాల రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏకంగా రూ.10,67,990 కోట్లకు చేరినట్లు బాబు సర్కారు మాయ చేసింది. ఇలా లేని వృద్ధి రేటును ఉన్నట్లు చూపి 2018–19 నాటికే రూ.2.58 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. 2019–20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచి చూపిస్తూ, దాని ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.32,000 కోట్ల అప్పులు చేయాలని చంద్రబాబు భావించారు. ఇప్పటివరకూ చేసిన అప్పులతో టీడీపీ ప్రభుత్వ పెద్దల జేబులు నిండడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రెండంకెల వృద్ధికి తీవ్రంగా ప్రయత్నించాలి..
న్యూఢిల్లీ: రెండంకెల వృద్ధి రేటు సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అవసరమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యురాలు షమికా రవి చెప్పారు. 7 శాతం వృద్ధితో సరిపెట్టుకోకూడదని ఆమె స్పష్టంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదిగే క్రమంలో మధ్యలోనే ఆగిపోయే ‘మధ్యాదాయ చట్రం’లో భారత్ ఇరుక్కుపోతుందంటూ సహచర ఈఏసీ–పీఎం సభ్యుడు రతిన్రాయ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. బ్రూకింగ్స్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ సందర్భంలో రతిన్ రాయ్ మాట్లాడుతూ... ‘‘1991 నుంచి మన ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై ఆధారపడి వృద్ధి చెందడం లేదు. దేశంలోని పది కోట్ల మంది వినియోగం ఆధారంగానే వృద్ధి చెందుతోంది. భారత వృద్ధి ప్రస్థానానికి శక్తినిస్తోంది వీరే. అంటే త్వరలోనే మనం ఓ దక్షిణ కొరియా కాదు, చైనా కూడా కాబోవడం లేదు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా కానున్నాం. అధిక సంఖ్యలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారితో మధ్యదాయ దేశంగా మారబోతున్నాం’’అని అన్నారు. దానిపై షమికా ఈ వ్యాఖ్యలు చేశారు . -
చతికిలబడ్డ పారిశ్రామిక రంగం!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం కలిగిన తయారీ రంగం పేలవ పనితీరు మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► 2018 మార్చిలో ఐఐపీ వృద్ధి రేటు 5.3 శాతం. ► 2017 జూన్లో 0.3 శాతం క్షీణత నమోదయ్యింది. అటు తర్వాత ఈ తరహా ఫలితం ఇదే తొలిసారి. ►ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి రేటునూ దిగువముఖంగా సవరించడం గమనార్హం. ఇంతక్రితం ఈ రేటు 0.1 శాతం అయితే ఇప్పుడు 0.07 శాతానికి కుదించారు. ► మార్చి నెలలో తయారీ రంగాన్ని చూస్తే, వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణించింది. 2018 ఇదే నెలలో ఈ రంగం 5.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మొత్తం 23 గ్రూపుల్లో 12 గ్రూపులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. ►భారీ పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగం మార్చి నెలలో మరింతగా క్షీణించింది. 2018 మార్చిలో 3.1 శాతం క్షీణతలో ఉన్న ఈ విభాగం, తాజాగా 8.7 శాతం కిందకు దిగింది. ► విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా... ఈ స్పీడ్ 5.9 శాతం నుంచి (2018 మార్చి) 2.2 శాతానికి (2019 మార్చి) పడిపోయింది. ► మైనింగ్ రంగంలోనూ విద్యుత్ రంగం ధోరణే కనబడింది. వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో –5.1 శాతం క్షీణత నమోదయితే, కన్జూమర్ నాన్– డ్యూరబుల్స్ విభాగంలో కేవలం 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018–19లో మూడేళ్ల కనిష్టస్థాయి వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకూ పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు మూడేళ్ల కనిష్టస్థాయి. 2017–18లో వృద్ధి రేటు 4.4 శాతం. 2016–17లో 4.6 శాతం, 2015–16లో 3.3 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. -
వృద్ధి వేగంలో భారత్ టాప్
వాషింగ్టన్: ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పష్టం చేసింది. 2019లో భారత్ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని, 2020లో ఈ రేటు 7.5 శాతంగా నమోదుకానుందని ఐఎంఎఫ్ విశ్లేషించింది. పెట్టుబడుల్లో వేగవంతమైన రికవరీ నమోదవుతోందని, వినియోగ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంటూ, భారత్ వృద్ధి పటిష్టతకు ఈ అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్లేషించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2019–20) వృద్ధిరేటు అంచనాలను మాత్రం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ వార్షిక స్పింగ్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై సోమవారం ప్రపంచబ్యాంక్ అవుట్లుక్ విడుదలకాగా, మంగళవారం ఐఎంఎఫ్ కూడా ఈ మేరకు ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►2018లో భారత్ వృద్ధి రేటు 7.1 శాతం. చైనా 6.6 శాతం వృద్ధిరేటుకన్నా ఇది అధికం. 2019, 2020ల్లో చైనా వృద్ధిరేట్లు వరుసగా 6.3 శాతం, 6.1 శాతం ఉంటాయని భావిస్తున్నాం. ►ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, దీనితో వడ్డీరేట్ల తగ్గుదల భారత్ వృద్ధి జోరు కారణాల్లో కొన్ని. ►మధ్యకాలికంగా చూస్తే, 7 శాతం స్థాయిలో భారత్ వృద్ధి స్థిరీకరణ పొందే అవకాశం ఉంది. వ్యవస్థాగత సంస్కరణల అమలు, మౌలిక ప్రాజెక్టుల విషయంలో అవరోధాల తొలగింపు ఈ అంచనాలకు కారణం. ►భారత్లో వ్యవస్థాగత, ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించి సంస్కరణలు కొనసాగుతాయని విశ్వసిస్తున్నాం. ► ప్రభుత్వ రుణం తగిన స్థాయిలో ఉంచడం వృద్ధి పటిష్టతకు దోహదపడే అంశాల్లో ఒకటి. ఈ అంశంసహా ద్రవ్యలోటు కట్టడికి భారత్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. ►ఫైనాన్షియల్ రంగం పటిష్టతకు వస్తే, కంపెనీల బ్యాలెన్స్ షీట్ల మెరుగునకు తగిన ప్రయత్నం జరగాలి. సరళీకృత దివాలా విధానాల పరిధిలో మొండిబకాయిలు (ఎన్పీఏ) ఉండాలి. అంటే ఎన్పీఏల సమస్య క్లిష్టత లేకుండా పరిష్కారమయ్యే అవకాశాలు ఉండాలి. బ్యాంకింగ్ రంగం మెరుగుపడే దిశలో ఈ చర్యలు ఉండాలి. ►భూ సంస్కరణలు, మౌలిక రంగ వృద్ధి వంటి అం శాల్లో వేగవంతమైన పురోగతి ఉండాలి. ఇది ఉ పాధి కల్పన మెరుగుదలకూ దోహదపడుతుంది. ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, 2019, 2020ల్లో చైనా వృద్ధి నెమ్మదిగానే ఉండే వీలుంది. ►2018లో అంతర్జాతీయ వృద్ధి మందగమనంలోకి జారింది. చివరి ఆరు నెలల కాలంలో ఈ పరిస్థితి మరింత క్షీణించింది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అంశాలు దీనికి ప్రధాన కారణం. ప్రపంచ వృద్ధిరేటు అంచనాకు కోత 2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఐఎంఎఫ్ కోత పెట్టింది. వృద్ధి 3.3 శాతమే నమోదవుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. 2020ల్లో ఈ రేటు 3.6 శాతంగా విశ్లేషించింది. ఇంతక్రితం ఈ రెండు సంవత్సరాల్లో 3.7 శాతం వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘సున్నితమైన పరిస్థితి’’ని ఎదుర్కొంటోందని తెలిపింది. వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్, చమురు ఉత్పత్తి దేశాల్లో ఉద్రిక్తతలు, ఉద్దీపనలను వెనక్కు తీసుకుంటే, జరగబోయే పరిణామాలపై అనిశ్చితి వంటి అంశాలను ఐఎంఎఫ్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. పన్నుల వ్యవస్థలను ఆధునీకరించడం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడం ద్వారా ప్రజా రుణాలు, సంపద అసమానతలను తగ్గించడం వంటి గత సూచనలను సభ్య దేశాలు ఆచరణలో పెట్టాలని ఐఎంఎఫ్ సూచించింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 70 శాతం ఆర్థిక వ్యవస్థలు మందగమన పరిస్థితులను ఎదుర్కొనవచ్చని త్రైమాసిక నివేదిక పేర్కొంటున్నట్లు ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
‘7.2 శాతం వృద్ధి రేటుతో దూసుకెళతాం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ నరేంద్ర మోదీ సర్కార్కు ఊరట ఇచ్చే అంచనాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.2 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) బుధవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుని 7.2 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఏడాది 7.3 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఏడీబీ నివేదిక అంచనా వేసింది. వడ్డీరేట్లు దిగిరావడం, రైతులకు పెట్టుబడి ఊతం, దేశీయ డిమాండ్ ఊపందుకోవడంతో భారత్ నిలకడైన వృద్ధి రేటు నమోదు చేస్తుందని నివేదిక పేర్కొంది. దేశీయ వినిమయం పటిష్టంగా ఉండటంతో ఎగుమతులు తగ్గినా దాని ప్రభావం ఆసియా దేశాలపై అంతగా ఉండబోదని ఏడీబీ చీఫ్ ఎకనమిస్ట్ యుసుకి సవద పేర్కొన్నారు. ఆసియా దేశాలు సైతం రాబోయే రెండేళ్లలో ఐదు శాతం మేర వృద్ధి రేటు నమోదు చేస్తాయని ఏడీబీ అంచనా వేసింది. -
మౌలిక రంగం నత్తనడక
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలికరంగం ఫిబ్రవరిలో మందగమనంలో ఉంది. వృద్ధి కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో బలహీన ధోరణి దీనికి కారణం. 2018 ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4 శాతం. సోమవారం విడుదలైన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... ►క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా వరుసగా –6.1 శాతం, –0.8 శాతం చొప్పున క్షీణించాయి. ►ఎరువులు (5.2 శాతం నుంచి 2.5 శాతం), స్టీల్ (5 శాతం నుంచి 4.9 శాతం), సిమెంట్ (23 శాతం నుంచి 8 శాతం) విద్యుత్ (4.6 శాతం నుంచి 0.7 శాతం) రంగాల ఉత్పత్తుల్లో వృద్ధి ఉన్నప్పటికీ ఈ రేటు తగ్గింది. ►అయితే బొగ్గు, సహజ వాయువుల రంగాల్లో మాత్రం వృద్ధి 7.3 శాతం, 3.8 శాతం చొప్పున నమోదయ్యాయి. ►కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నెలల్లో చూస్తే, మౌలిక రంగం వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. -
37,700 మద్దతు కోల్పోతే డౌన్ట్రెండ్
ప్రపంచ మార్కెట్లను అనుసరిస్తూ భారత్ మార్కెట్సైతం కదంతొక్కుతున్న సమయంలోనే... వడ్డీ రేట్ల పెంపుదలను, బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి నిధుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అనూహ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేసిన పాలసీ ప్రకటన ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది. అలాగే అమెరికా వృద్ధి రేటు అంచనాల్ని కూడా ఫెడ్ తగ్గించింది. ఇప్పటికే యూరప్, చైనా, జపాన్ల వృద్ధి రేటు అంచనాల్లో కోతపడగా, అమెరికా కూడా ఈ బాటలోకి రావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ ట్రెండ్ కొద్దిరోజులపాటు కొనసాగవచ్చన్న అంచనాల్ని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... మార్చి 22తో ముగిసిన వారం చివరిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన రెండో నిరోధం సమీపస్థాయి అయిన 38,565 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత హఠాత్తుగా అమ్మకాలు వెల్లువెత్తడంతో వారం మొత్తంమీద ఆర్జించిన లాభాల్లో చాలావరకూ కోల్పోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 141 పాయింట్ల స్వల్పలాభంతో 38,165 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం అమెరికా సూచీలు భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ సోమవారం గ్యాప్డౌన్తో మార్కెట్ ప్రారంభమైతే సెన్సెక్స్కు 37,700 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే డౌన్ట్రెండ్ వేగవంతమై 37,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 37,230 వద్దకు క్షీణించవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే తొలుత 38,320 వద్దకు పెరగవచ్చు. అటుపైన 38,730 పాయింట్ల వరకూ పరుగు కొనసాగవచ్చు. నిఫ్టీ తక్షణ మద్దతు 10,345 గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,572 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 11,457 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూల సంకేతాల కారణంగా ఈ సోమవారం గ్యాప్డౌన్తో మొదలైతే నిఫ్టీకి 10,345 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. వారంరోజుల క్రితం ఇదేస్థాయిని అధిగమించి, నిఫ్టీ మరో 200 పాయింట్లకుపైగా పెరిగినందున, ఈ వారం ఇదేస్థాయి కీలక మద్దతుగా పరిణమించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 11,275 వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయి దిగువన 11,225 వద్దకు తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే తొలుత 11,505 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై క్రమేపీ తిరిగి 11,570 స్థాయిని చేరవచ్చు. ఆపై క్రమేపీ 11,630 వరకూ పెరగవచ్చు. -
8% వృద్ధికి రోడ్ మ్యాప్
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఏటా 8 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై భారత్ కార్పొరేట్లు రాజకీయ పార్టీలకు దిశానిర్ధేశం చేశారు. దీనికి సంబంధించి ‘ప్రతిపాదిత ఎలక్షన్ మ్యానిఫెస్టో’ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆదివారం విడుదల చేసింది. వచ్చే కొత్త ప్రభుత్వానికి ఈ మ్యానిఫెస్టో ఒక ఆర్థిక కార్యాచరణగా తోడ్పడుతుందని సీఐఐ పేర్కొంది. ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఆదివారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన తరుణంలో సీఐఐ ఈ మ్యానిఫెస్టోను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం ఇలా అనేక రంగాల్లో సాధించాల్సిన పురోగతిని ఈ మ్యానిఫెస్టోలో చేర్చారు. ‘పారిశ్రామిక ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సంప్రతింపుల ఆధారంగా ఈ కీలక సూచనలు చేశాం. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో దేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నీతివంతమైన నాయకత్వం లక్ష్యంగా పలు అంశాలను పొందుపరిచాం. రాజకీయ పార్టీలన్నీ తమ మ్యానిఫెస్టోలో ఈ సూచనలను చేరుస్తారని భావిస్తున్నాం’ అని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. సూచనల్లో ప్రధానాంశాలివీ... ►అంతర్జాతీయంగా వస్తున్న అధునాతన సాంకేతిక మార్పులను భారత్ అందిపుచ్చుకోవాలంటే భారీస్థాయి సంస్కరణలను కొనసాగించాలి. ►వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పన్ను శ్లాబ్లను 2–3 శాతం మేర కుదించాలి. ►ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని ఎదుర్కోవాలంటే కార్పొరేట్ ఆదాయపు పన్నును ఎలాం టి మినహాయింపుల్లేకుండా 18%కి తగ్గించాలి. ►పాలన, న్యాయ, పోలీసు విభాగాల్లో సంస్కరణలు తీసుకురావాలి. ►2024 నుంచి దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ఎన్నికల సంస్కరణలు చేయాలి. ►విద్యా రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 6 శాతానికి పెంచాలి. అదేవిధంగా వొకేషనల్ ట్రైనింగ్ను పాఠ్యాంశాల్లో భాగంగా చేయాలి. పనితీరు బాగున్న ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు, ముఖ్యంగా గ్రామాల్లో డిజిటల్ స్కూల్ ఇన్ఫ్రాను మెరుగుపరడం వంటి చర్యలు అవసరం. ►యూనివర్సిటీలన్నింటినీ పరిశ్రమలతో అనుసంధానం చేయాలి. పరిశోధన అభివృద్ధి(ఆర్అండ్డీ)లో ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీలో 1 శాతానికి పెంచాలి. ►సాంకేతికత ఆధారంగా నైపుణ్య శిక్షణలకు కొత్త విధానాలను ప్రవేశపెట్టాలి. ►వైద్య, ఆరోగ్య రంగంలో వ్యయాన్ని జీడీపీలో 3 శాతానికి పెంచాలి. ఈ రంగానికి మౌలిక హోదా కల్పించాలి. ప్రసూతి, శిశు మరణాలను తగ్గించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ►కార్మిక చట్టాల్లో తగిన మార్పుల కోసం కేంద్రం, రాష్ట్రాల కార్మిక మంత్రులతో ఒక సాధికార కమిటీ వేయాలి. ► రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రమైన జాతీయ వ్యవసాయ మిషన్ను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలకు సంబంధించి ‘ఈజ్ ఆప్ డూయింగ్ అగ్రికల్చర్(వ్యవసాయానికి అత్యంత సానుకూలత) ర్యాంకింగ్ను ప్రవేశపెట్టాలి. ► వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్ఈ)ల్లో మూడు దశల్లో ప్రభుత్వ వాటాను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. తొలి దశలో ప్రభుత్వ వాటాను 51 శాతానికి, రెండో దశలో 26 శాతానికి, మూడో దశలో పూర్తిగా విక్రయించి వైదొలగేలా చర్యలు తీసుకోవాలి. ఐదేళ్లలో ఈ మొత్తం అమ్మకం ప్రక్రియ పూర్తవ్వాలి. -
మున్ముందు మరిన్ని రేటు కోతలు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మున్ముందు మరిన్ని రేటు కోత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తాజాగా విడుదలైన మినిట్స్ సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకూ జరిపిన విధాన సమీక్ష, నిర్ణయాలపై గురువారం ఆర్బీఐ మినిట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 6.50 శాతం నుంచి 6.25 శాగానికి తగ్గించింది. వృద్ధి మందగమనం, తక్కువగా ఉన్న ధరల స్పీడ్ నేపథ్యంలో వృద్ధి స్పీడ్కు రేటు తగ్గింపు సరైన నిర్ణయమని ఎంపీసీలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడిన విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనితోపాటు గురువారం నాడు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో రేటు తగ్గింపు అవసరాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేయడాన్నీ వీరు ప్రస్తావిస్తున్నారు.