20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
పెళ్లకూరు: 71వ నంబరు జాతీయ రహదారి మార్గంలో దిగువచావలి ఫ్లైఓవర్పై శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం లోడ్డుతో వెళ్తున్న వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, అధికారుల సమాచారం మేరకు.. శ్రీకాళహస్తి నుంచి నెల్లూరుకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనం మార్గమధ్యంలో దిగువచావలి గ్రామం ఫ్లై ఓవర్పై టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే బియ్యం వ్యాపారులు వాహనంలోని 20 టన్నుల బియ్యాన్ని గ్రామంలోని రహస్య ప్రదేశానికి తరలించారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగరాజు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లై డీటీ గోపీనాథరెడ్డి, తహసీల్దార్ ద్వారకానాథ్రెడ్డికి సమాచారం అందించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని వీఆర్వోలు రమేష్, వంశి నాయుడుపేట గోదాముకు తరలించి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


