Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Participate In Iftar Dinner 2025 Vijayawada1
ఇఫ్తార్‌ విందుకు హాజరైన వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయవాడ: రంజాన్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్‌ విందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్‌ జగన్‌ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

CM Revanth Reddy statement in Telangana Legislative Assembly2
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్‌ పదవి, విప్‌ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్‌ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్‌ వాళ్లే రాశారు. రూల్‌బుక్‌ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్‌ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్‌ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

Sakshi Editorial On AP High Court Fires On Police Officers3
ఎన్నాళ్లీ ఆగడాలు!

సందేహం లేదు... న్యాయస్థానాలతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఆటలాడుతున్నారు. పరిధులు గుర్తెరిగి విధినిర్వహణ చేయాలని పదిరోజులనాడు చెప్పినా తమ వెనకటి గుణం మానుకోవటానికి ససేమిరా అంటున్నారు. అందుకే ఏపీ హైకోర్టు మంగళవారం మరోసారి చీవాట్లు పెట్టవలసి వచ్చింది. హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావనకొచ్చిన ప్రేమ్‌కుమార్‌ కేసు విచిత్రమైనది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడైన ప్రేమ్‌కుమార్‌ రహదారుల బాగుకు నిధుల కోసం ఊరూరా టోల్‌గేట్లు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా ఒక చిన్న రూపకాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దానిపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. తాము కట్టే పన్నుల్లో రోడ్‌ సెస్‌ వంటివి ఉండగా ఇలా ప్రత్యేకించి మళ్లీ వసూలు చేయడమేమిటన్న చర్చ మొదలైంది. అందుకే సర్కారువారికి కంటగింపైంది. ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టడమే ధ్యేయంగా తప్పుడు కేసు సృష్టించారు. ‘మనోభావాలు’ దెబ్బతిన్నాయని ఒక వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేయించి కర్నూలునుంచి గుంటూరుకు ఆగమేఘాలమీద వచ్చి అర్ధరాత్రి అరెస్టుకు పూనుకున్నారు. ఇంగితం మరిచి ఆయన భార్య, కుమార్తెలపై దౌర్జన్యం కూడా చేశారు. ఇదొక్కటే కాదు... నిరుడు డిసెంబర్‌నుంచి ఇలాంటి కేసులెన్నో ఉన్నత న్యాయస్థానం దృష్టికి వస్తూనేవున్నాయి. ఆ పిటిషన్లపై విచారించిన న్యాయమూర్తులు హెచ్చరిస్తూనే వున్నారు. కానీ పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. బహుశా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏలినవారే చూసుకుంటారన్న ధైర్యమేమో! హైకోర్టుతో చీవాట్లు తిన్న మరునాడే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసుల తీరు ఈ సందేహాన్నే కలిగిస్తోంది. ఎంపీపీ ఎన్నికల్లో విప్‌ జారీ చేయటానికి అధికారులను కలవడానికెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులపై తెలుగుదేశం నేతలు దౌర్జన్యానికి దిగితే అడ్డుకోవాల్సిన పోలీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపైనే తప్పుడు కేసు బనాయించి నిర్బంధంలోకి తీసుకున్నారు.నిద్రపోయేవారిని లేపవచ్చు... నిద్ర నటిస్తున్నవారిని తెలివిలోకి తీసుకురావటం సాధ్యమేనా? వీళ్లంతా కొత్తగా విధి నిర్వహణలో చేరినవారు కాదు. ‘జీ హుజూర్‌’ అంటే తప్ప జీతంరాళ్లు రాని వారు కాదు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులద్వారా వచ్చే ఆదాయంతో నెలనెలా జీతభత్యాలు పొందు తున్నవారు. అంచెలంచెలుగా పదోన్నతులు పొందినవారు. కానీ పాలకులు మారేసరికి వీరిలో అపరిచితుడు బయటికొచ్చినట్టుంది. తప్పుడు వాగ్దానాలతో, ప్రత్యర్థులపై దుష్ప్రచారంతో, చడీ చప్పుడూ కాకుండా సాగించిన అక్రమాలతో అందలం ఎక్కిన పాలకులు ఎంతకాలం ఊరేగుతారు? వారిని నమ్ముకుని ఇష్టారాజ్యం చేయొచ్చనుకోవటం, తమకేమీ కాదనుకోవటం మంచిదికాదని అధికారులు గ్రహించాలి. ఈ పాలన కొడిగట్టి కొండెక్కాక తమ పరిస్థితేమిటన్న స్పృహ కలగాలి. అసలు దేశానికి రాజ్యాంగం ఉన్నదని, పౌరులకు దానిద్వారా హక్కులు సమకూరాయని, తమతో సహా అన్ని వ్యవస్థలూ వాటికి అనుగుణంగానే ప్రవర్తించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవని తెలుసుకోవాలి. ఈ దేశంలో న్యాయస్థానాలు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో సైతం నిర్భయంగా తీర్పులిచ్చిన ఉదంతాలున్నాయి. ఆ సంగతిని ప్రభుత్వమూ, పోలీసులూ కూడా తెలుసుకోవాలి.విధినిర్వహణ తీరుతెన్నులెలా వుండాలో తెలిపే మాన్యువల్‌ గురించి ధర్మాసనం పోలీసులకు గుర్తు చేయక తప్పలేదు. సాధారణ స్థాయి కానిస్టేబుల్‌ మొదలుకొని డీజీపీ వరకూ విధినిర్వహణ ఎలా వుండాలో, బాధ్యతలేమిటో తెలిపే మాన్యువల్‌ అది. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, దర్యాప్తు విధి విధా నాలూ, అధికారాల వినియోగంలో పాటించాల్సిన పద్ధతులు, పరిమితులు వగైరాలన్నీ అందులో నిర్దేశించివుంటాయి. పౌరులకుండే హక్కులేమిటో, విధినిర్వహణలో వాటిని పాటించాల్సిన అవసర మేమిటో మాన్యువల్‌ చెబుతుంది. హైకోర్టు భిన్న సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ మాన్యువల్‌ను పోలీసులు పట్టించుకోవటం మానేశారని అర్థమవుతుంది. కనీసం గుర్తు చేస్తున్నా దున్నపోతు మీద వానపడిన చందాన ప్రవర్తిస్తున్నారు. వర్రా రవీంద్రరెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, పప్పుల వెంకటరమణారెడ్డి, బొసా రమణ వగైరాల అరెస్టుల విషయంలో పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే పోలీసుల తీరు చూస్తే మాకు బీపీ పెరిగిపోతున్నదని ధర్మా సనం వ్యాఖ్యానించింది. అవసరాన్నిబట్టి కేసులు కాక, ఏదోవిధంగా కేసులు పెట్టాలి... ఎవరో ఒకర్ని అరెస్టు చేయాలని చూడటం సరికాదని హెచ్చరించింది. తమ ముందు దాఖలైన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండానే మేజిస్ట్రేట్‌లు రిమాండ్‌ విధిస్తు న్నారని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం అనటం గమనించదగ్గది. ప్రేమ్‌కుమార్‌ కేసు సంగతే తీసుకుంటే ఆయన అక్రమార్జనకు పూనుకున్నాడంటూ రూ. 300 స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు. ఇంత హాస్యాస్పదంగా పెట్టే కేసుల్ని మేజిస్ట్రేట్‌లే తమ స్థాయిలో అడ్డు కోవచ్చు. అది లేకపోవటంవల్ల ఉన్నత న్యాయస్థానంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా స్థాయిలో న్యాయవ్యవస్థ సక్రమంగా పనిచేయక పోవటంవల్ల బెయిల్‌ దరఖాస్తులు తమవద్దకు వెల్లువలా వచ్చిపడుతున్నాయని నిరుడు జూలైలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత సోమవారం కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ దరఖాస్తులపై కిందిస్థాయి కోర్టుల తీరును తప్పుబట్టింది. హైకోర్టు ధర్మాసనం తాజా వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకుంటే చిక్కులు తప్పవని తెలుసుకోవాలి. నిబంధనలు గుర్తెరిగి మసులుకోవాలి.

UPI Down For Several Users Across India4
UPI Down: ఫోన్‌పే, గూగుల్‌ పే యూజర్లకు షాక్‌.. యూపీఐ సేవల్లో అంతరాయం

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు దేశవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. చాలామంది వినియోగదారులు లావాదేవీలను చేయలేకపోయినట్లు వెల్లడించారు. బుధవారం రాత్రి 7:50 గంటలకు 2,750 యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్‌పే వినియోగదారుల నుంచి 296 ఫిర్యాదులు వచ్చాయి.యూపీఐ సేవలు డౌన్ అవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వినియోగదారులు లావాదేవీలు చేయడంలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న సమస్యలను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సమస్య కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.Is UPI down? Anyone facing the issue? #Upidown— Sumit Mishra (@SumitLinkedIn) March 26, 2025UPI Down ⚠️Nationwise issue or it's only me ?— Crypto with Khan ( SFZ ) (@Cryptowithkhan) March 26, 2025Anyone facing UPI app issues or just me facing?? #phonepe #gpay #paytm— Anoop CSKian 💛 (@Anoopraj_7) March 26, 2025

IPL 2025: Quinton De Kock powers Kolkata to first win5
డికాక్ వ‌న్ మ్యాన్ షో.. రాజ‌స్తాన్‌ను చిత్తు చేసిన కేకేఆర్‌

ఐపీఎల్‌-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ తొలి విజ‌యం సాధించింది. గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 152 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్‌.. 17.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. కోల్‌క‌తా విజ‌యంలో క్వింట‌న్ డికాక్ కీల‌క పాత్ర పోషించాడు.ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన డికాక్ ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. 60 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 8ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 97 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అత‌డితో పాటు ర‌ఘువంశీ(22), ర‌హానే(18) ప‌రుగుల‌తో రాణించారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో హ‌స‌రంగా ఒక్క‌డే ఓ వికెట్ సాధించ‌గా.. మ‌రో వికెట్ ర‌నౌట్ రూపంలో వ‌చ్చింది.చెతులేత్తేసిన బ్యాటర్లు..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది. కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్తాన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, మొయిన్ అలీ త‌లా రెండు వికెట్లు సాధించారు. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో ధ్రువ్ జురెల్‌(33) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. య‌శ‌స్వి జైశ్వాల్‌(29), రియాన్ ప‌రాగ్‌(25) ప‌రుగుల‌తో రాణించారు. కాగా రాజస్తాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.చ‌ద‌వండి: IPL 2025: డికాక్ మాస్ట‌ర్ మైండ్‌.. హెల్మెట్‌ను తీసి మ‌రి! వీడియో వైర‌ల్‌

Saroor Nagar Apsara Case Judgement: What happend on that Night6
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు

వివాహితుడైనప్పటికీ ఆమె అతన్ని గాఢంగా ఇష్టపడింది. శారీరక సుఖం కోసం అతనూ ఆమెను ఇష్టపడినట్లు నటించాడు. ఇద్దరూ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగారు. పైపెచ్చు వాళ్ల తిరుగుళ్లకు ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. అలా నాలుగేళ్లు గిర్రుమన్నాయి. తీరా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేసరికి భరించలేకపోయాడు. ప్రేమ మత్తులో ఉండగానే ఆమెను అనంతలోకాలకు పంపించేశాడు. అప్సర-వెంకటసాయికృష్ణ జీవితాలు ఆ ఒక్కరాత్రిలో తలకిందులయ్యాయి. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే.. అప్సర-సాయికృష్ణ.. ఏడాది కాలంలోనే వాళ్ల మధ్య బంధం బలపడింది!. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తల్లితో సహా వచ్చిన అప్సర.. సరూర్‌ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించసాగింది. దైవభక్తి కారణంగా ఆలయాలకు క్రమం తప్పకుండా వెళ్తుండేది. అలా.. 2022లో సరూర్‌ నగర్‌ బంగారు మైసమ్మ గుడి పెద్ద పూజారి వెంకటసాయికృష్ణతో పరిచమైంది. తరచూ అప్సరకు వాట్సాప్‌ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. అలా స్నేహం బలపడింది. ఈలోపు.. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. వాట్సాప్‌ ద్వారా ఇద్దరూ వాళ్ల ప్రేమ వ్యక్తం చేసుకున్నారు. 👉అప్పటికే అప్సరకు వివాహమై భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మరోవైపు సాయికృష్ణకు వివాహమైంది కూడా. కానీ, ఇద్దరూ చనువుగా ఉంటూ వచ్చారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు. అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. సాయి-అప్సరల స్నేహ బంధం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్‌ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఆమె బ్లాక్‌మెయిల్‌కు దిగడాన్ని భరించలేకపోయాడు. అలా చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని హెచ్చరించడంతో రగిలిపోయాడు. చివరకు.. .. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్‌ వేసుకున్నాడు. సరూర్‌ నగర్‌లో తాను పూజారిగా ఉన్న గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు.👉హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్‌ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్‌ అయ్యాడు. జూన్‌ 3.. అప్సర పాలిట కాళరాత్రిఓ ఫిల్మ్‌మేకర్‌తో సినిమా అవకాశాల కోసం మాట్లాడదామని.. అందుకోసం కోయంబత్తూరు వెళ్దామని అప్సరను సాయికృష్ణ నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. 2023 జూన్‌ 3న.. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్‌ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు.ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్‌ బుక్‌ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ మండలం రాళ్లగూడలో డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు.అప్సరకు ఎంతో ఇష్టమైన గోశాలలో కొంతసేపు గడిపారు. అయితే గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్‌ వద్దకు చేరారు. ఫ్రంట్‌ సీటులో తన పక్కనే గాఢ నిద్రలోకి జారుకున్న అప్సరను.. కారు సీటు కవర్‌ను ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. ఆపై బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.మృతదేహంపై కారు కవర్‌ కప్పి అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని.. కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. ఆపై దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్‌ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు. అప్సర నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి ఆమె తల్లి కంగారుపడి సాయికృష్ణకు ఫోన్‌ చేసింది. ఏమీ తెలియనట్లు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసి.. తాను వెతుకుతున్నట్లు నటించాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో సాయికృష్ణే హంతకుడని తేలింది. దర్యాప్తు జరుగుతున్న టైంలో సాయికృష్ణ అమాయకుడని.. తప్పంతా అప్సరదేనని అతని తల్లిదండ్రులు, భార్య వాదించారు. తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన మృగానికి తగిన శిక్ష పడాలని అప్సర తల్లి డిమాండ్‌ చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు విస్తృతంగా జరిగింది. విచారణలోనూ సాయికృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. అలా.. 2023 జూన్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషి సాయికృష్ణకు బుధవారం(మార్చి 26, 2025)న శిక్ష పడింది. జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకుగానూ అదనంగా మరో ఏడేళ్ల శిక్ష వేసింది. అప్సర కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Serious Discussion In Telugu States Over The Hatya Movie7
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు.. హత్య మూవీలో అసలు ఏముంది?

అమెజాన్ ప్రైమ్‌లో ఓ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాదాపు 15 రోజుల క్రితం ఈ సినిమా ప్రైమ్‌లో రిలీజైనప్పటి నుంచిం తెలుగు రాష్ట్రాల్లో సీరియస్ డిస్కషన్‌కు కేంద్ర బిందువైంది. కొందరు ఈ సినిమా థ్రిల్లింగ్‌గా ఉంది.. చాలా ఫ్యాక్చువల్‌గా ఉందని చెబుతుంటేం మరికొంతమంది ఈ సినిమాను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో టాప్‌-2గా ట్రెండ్ అవుతున్న హత్య సినిమా ఐదు భాషల్లో రిలీజైంది.👉అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న హత్య సినిమా ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా బిట్స్ షేర్ చేసిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఓ సీనియర్ పొలిటీషియన్‌ హత్య విచారణకు సంబంధించిన కథాంశంతోం సినిమా ప్రారంభం అవుతుంది. ఆ పొలిటీషియన్‌ను ఎవరు హత్యచేశారనే విషయంపై ఓ పోలీస్ అధికారి చేసే విచారణ సినిమాలో ప్రధాన అంశం. సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు అని నిర్మాతలు.. డైరెక్టర్‌ డిస్‌క్లైమర్ వేసినా ఈ సినిమా ఇతివృత్థం ఏంటో చూసే వారికి ఈజీగా అర్థం అయిపోతుంది.👉మాజీ మంత్రి హత్య నేపథ్యంలో ఈ సినిమా తీశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీమంత్రి హత్యకు దారితీసిన అంశాలను ఈ సినిమాలో చర్చించారనే డిస్కషన్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. కేసు విచారణ మొదలుం సాంకేతిక ఎవిడెన్సెస్‌ వరకు ప్రతీ అంశంపై చాలా నిశితంగా చర్చిస్తూ సినిమా స్క్రీన్‌ప్లేను నడిపించిన తీరుం అందరిని ఆకట్టుకుంటోంది. మాజీమంత్రి హత్యకేసులో డిస్కషన్‌కు వచ్చిన చాలా టెక్నికల్ అంశాలను సైతం ఈ సినిమాలో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించారనే ప్రశంసలు వస్తున్నాయి.👉ఒక సినిమా పూర్తి ఫిక్షన్‌ అయినపప్పటికీ ఆ సినిమా కథ ఏదో ఒక వాస్తవ ఘటన ఆధారంగా తీసుకున్నదే అయి ఉంటుంది. ఇప్పుడు హత్య సినిమా కూడా ఎంతో కొంత వాస్తవ ఘటనల ఆధారంగా తీసుకన్నారనే డిస్కషన్ ఉంది. హత్య సినిమాలో ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు హత్యకు గురవుతాడు. ఈ కేసులో వాస్తవాలు వెలికితీయాలనే ఉద్దేశంతోం హత్యకు గురైన వ్యక్తి బంధువు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై నిస్పక్ష విచారణకు ఆదేశిస్తారు. తన బాబాయి హంతకులు ఎవరనేది బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి సిన్సియర్‌గా యత్నిస్తారు.👉దీనిపై ఓ నిబద్ధత ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్‌కుం విచారణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ కేసులో వాస్తవాలను బయటకు తెచ్చేందుకు ఆ మహిళా అధికారి అన్ని కోణాల్లో విచారణ చేపడుతుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నో కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. అయితే విచారణ చేసిన అధికారిని కొన్ని శక్తులు అడ్డుకునేందుకు యత్నిస్తాయి. కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కొంతమంది అధికారులు ఆమెకు ద్రోహం చేస్తారు. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఆమెను విచారణ నుంచి తప్పిస్తారు. మొత్తానికి వాస్తవాలు బయటకు రాకుండా ఆమెను అడ్డుకుంటారు.👉సినిమా ముందుకు కదులుతున్నకొద్దీ హత్యకు గురైన మాజీ మంత్రికి సంబంధించి చాలా కొత్త కొత్త విషయాలు రివీల్ అవుతాయి. ఈ సినిమాలో హత్య గురైన వ్యక్తికి ఉన్నటువంటి వివాహేతర సంబంధంపైం చాలా డీటేయిల్డ్ ఇన్‌ఫర్‌మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా సినిమాలో హత్యకు గురైన మాజీమంత్రి ఆ మహిళతో పరిచయం అయిన తీరు ఆ పరిచయం ఏవిధంగా కుటుంబంలో చిచ్చుపెట్టిందో ఇందులో స్పష్టంగా వివరించారు. ఈ కేసు విచారణలో చనిపోయిన మాజీమంత్రికి ఉన్న వివాహేతర సంబంధం కీలకంగా మారిందనేది సినిమా చూస్తున్న వారందరికీ అర్ధం అవుతుంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం ఆయన కూతురు, అల్లుడితో పాటు బావమరిదికి నచ్చలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది.👉ఒకవేళ రెండో వివాహానికి అంగీకారం తెలిపితే ఆస్తిలోవాటా ఇవ్వాల్సి వస్తుందనే భయం.. హత్యకు గురైన మాజీమంత్రి కూతురు, అల్లుడిని వెంటాడుతుంది. ఓ సందర్భంలో మాజీమంత్రి బావమరిది.. ఆమె రెండో భార్య దగ్గరకు వెళ్లి ఆమెపై దాడి చేసిన దృశ్యం సినిమాలో టర్నింగ్ పాయింట్. ఈ విషయం తెలిసిం హత్యకు గురికావడానికి ముందు ఆ మాజీమంత్రి తన మొదటి భార్య బంధువులతో సహా కూతురు అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. హత్యకు గురికావడానికి ముందు తన ముస్లిం భార్యకు ఆస్తిలో వాటాతో పాటు ఆమెతో కలిగిన కుమారుడికి కాన్వెంట్ అడ్మిషన్ ఇప్పించాలని మాజీమంత్రి కోరుకుంటాడు అనే సినిమాలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇదే హత్యకు కారణమైన ఉండొచ్చు అనే అనుమానాలు తరువాత విచారణలో ముందుకు వస్తాయి.👉ఈ సినిమాలో మాజీమంత్రి హత్యకు సంబంధించి రెండు కీలకమైన అంశాలను హైలైట్ చేశారు. ఒకటి హత్య జరిగిన సందర్భంగా హత్య చేసే సమయంలో దుండగులు మాజీమంత్రితో ఓ లేఖ రాయిస్తారు. సినిమాలో ఇది చాలా డ్రమటిక్ సీన్. లేఖలో తనను డ్రైవర్ తీవ్రంగా కొట్టాడంటూ రాయిస్తారు. అయితే ఉదయాన్నే మృతదేహం వద్ద ఈ లేఖను చూసిన పీఏ.. విషయం మాజీమంత్రి అల్లుడికి చెప్తాడు. ఈ విషయం బయట ఎవరికి చెప్పినాం ఇది హత్య అని అప్పుడే తెలిసే అవకాశం ఉండింది. కాని మాజీ మంత్రి అల్లుడు ఈ విషయం బయటకు రాకుండా మధ్యాహ్నం వరకు దాచిపెడతాడు. మొత్తం సినిమాలో ఇది చాలా కీలకమైన అంశం.👉ఎందుకు హత్యకు గురయిన మాజీ మంత్రి అల్లుడు ఇది హత్య అనే విషయం బయటకు రాకుండా అడ్డుకున్నాడనే సినిమా కథలో కీలకమైన అంశం. దీంతో మాజీమంత్రి మృతిపై రకరకాల పుకార్లు వస్తాయి. హత్య అని ముందే తెలిస్తే సాక్ష్యాలు భద్రపరిచే అవకాశం ఉన్నాం లేఖను ఎందుకు దాచిపెట్టారనే విషయం హత్య సినిమాలో కీలకం. ఇక పీఏను అబద్ధమపు సాక్ష్యం చెప్పమని మాజీమంత్రి కూతురు బలవంతపెడుతుంది. దీంతో తాను అబద్ధం చెప్పనని పీఏ తిరగబడతాడు. పీఏ అబద్ధం చెప్పకపోతే తన భర్త జైలుకు వెళ్లాల్సి వస్తుందనిం హత్యకు గురైన మాజీ మంత్రి కూతురు నోరుజారడం షాకింగ్‌ విషయం. అసలు హత్య వెనకాల మాజీమంత్రి కుటుంబం ఉందా? అనే విషయం ముందు నుంచీ ప్రతీ ఒక్కరికీ అనుమానం కలిగిస్తుంది. పరిస్థితులు సాక్ష్యాధారాలు సైతం మాజీ మంత్రి కూతురు,అల్లుడి వైపే అనుమానాలు కలిగిస్తాయి. హత్య వల్ల లాభం ఎవరికి అనేది సినిమా చూసిన వారికి స్పష్టంగా అర్థమైపోతుంది.👉హత్యకు సంబంధించిన అబద్ధాలు ప్రచారం చేసి ఏవిధంగా రాజకీయ రంగు పులుమే ప్రయత్నం జరుగుతుందో హత్య సినిమా చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. తండ్రి హత్యను రాజకీయాల కోసం వాడుకున్న కూతురు కథ ఈ సినిమాలో కనిపిస్తుంది. రెండో వివాహం కుటుంబంలో చిచ్చురేపిం అది హత్య వరకు దారితీసిన ఘటనలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నిజాలు బయటకు రాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ఏవిధంగా ద్రోహం చేశారో కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఏది ఏమైనా ఓ బలమైన వర్గం సొంత కూతురు కలిసి మాజీ మంత్రి హత్య కేసును ఏ విధంగా దారితప్పించారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

BJP MLA Basanagouda Patil Yatnal Expelled from Party for Six Years8
నటి రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు.. సొంతపార్టీ ఎమ్మెల్యేకి బీజేపీ షాక్‌!

బెంగళూరు: గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సొంత పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ (Basanagouda Patil Yatnal)పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించినట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చారు. ఇటీవలే, బెంగళూరులో బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. Karnataka BJP MLA Basangouda Patil Yatnal-"I will name all Ministers involved in Ranta Rao gold smuggling case in Assembly session. I have complete information about her relationships and how the gold was brought in.She had gold all over her body and smuggled it in." pic.twitter.com/6xd4dy5Tne— News Arena India (@NewsArenaIndia) March 17, 2025 కొన్ని వారాల క్రితం మాజీ సీఎం యడియూరప్పపై విమర్శలు చేశారు. ఆయన తన కుమారుడు బి.వై విజయేంద్రపై కాకుండా పార్టీపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాదు, బీ.వై.విజయేంద్ర కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం శివకుమార్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతేడాది డిసెంబర్‌లో 32 జిల్లా అధ్యక్షులు యత్నాళ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ నాయకత్వం ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Under Construction Building Collapses In Bhadradri9
భద్రాచలంలో విషాదం.. బిల్డింగ్‌ కూలి పలువురి మృతి

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ కూలి ఆరుగురు మృతిచెందారు. ఆరంతస్తుల భవనం కూప్పకూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రస్ట్‌ పేరుతో విరాళాలు సేకరించి.. భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది.పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్‌లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఈ భవనాన్ని నాసిరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని పలువురు చెబుతున్నారు.సామాజిక కార్యకర్తలపై ఇంటి యజమాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు భవన నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఎవరు ఫిర్యాదు చేసిన సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని పలువురు అంటున్నారు.

Kerala Chief Secretary Sarada Muraleedharan decries colourism10
నలుపు అంటే శక్తి

నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్‌ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్‌.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్‌ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్‌ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్‌ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్‌ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేశారు. వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్‌ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశారు. ‘మీ పోస్ట్‌ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్‌ చేశారు. రీ–షేర్‌ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్‌ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్‌ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement