ప్రధాన వార్తలు

బాండ్లు చూపి బాబును నిలదీయండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలను కనీసం రిబ్బన్ కూడా కత్తిరించకుండానే.. మొత్తం హామీలు అమలు చేసేశానని చెబుతున్నాడు. అబ్రకదబ్ర.. ఛూమంతర్ అంటూ.. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేసేశానని ఊదరగొడుతున్నాడు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్పై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ ముందే బెదిరిస్తున్నాడంటూ ఎత్తి చూపారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా కూడా చంద్రబాబు చెబుతున్న పచ్చి అబద్ధాలను.. నిజాలుగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇన్ని అబద్ధాలు చెప్పి, మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేశానన్నది చెప్పేందుకు ఇంటింటికీ తన ఎమ్మెల్యేలు, నాయకులను పంపుతానంటున్నాడని దుయ్యబట్టారు. ‘ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన బాండ్లను దగ్గర పెట్టుకోండి. వాటిని చూపి ప్రభుత్వం మీకు ఎంత బాకీ ఉందో వడ్డీతో సహా చెల్లించాలని నిలదీయండి’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో..’ అంటే చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చుకుందాం’ అంటూ వైఎస్సార్సీపీ దాన్ని మీకు అందుబాటులోకి తెస్తుందని.. దాని కోసం మీరు క్యూఆర్ కోడ్ వినియోగిస్తే చాలు డౌన్లోడ్ అవుతుందని ప్రజలకు సూచించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా అన్ని హామీలు 2024 జూన్ నుంచి అమలు అవుతాయని.. మీ ఖాతాలో డబ్బులు జమ అవుతుందని చంద్రబాబు త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతూ మీకు ఇచ్చిన బాండ్లను.. మీ ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాగానే చూపి.. అవి తమకు ఎప్పుడిస్తారని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని హామీలను అమలు చేస్తుందేమో చూద్దామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే.. మీ తరఫున మీతో కలిసి పోరాడటానికి వైఎస్సార్సీపీ, తాను సిద్ధమని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయాలంటూ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమానికి ప్రణాళిక రచిద్దామని ప్రజలను చైతన్య పరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..జగన్ కంటే ఎక్కువ ఇస్తానని మోసం చేస్తావా?⇒ చంద్రబాబు ఎన్నికలకు ముందు జగన్ చేస్తున్నవే కాకుండా అంత కంటే ఎక్కువ చేస్తామన్నారు. ‘మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవీ ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నాను’ అంటూ 2024 ఏప్రిల్ 11న చంద్రబాబు హామీ ఇచ్చారు (చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపారు). ఇప్పుడు వాటన్నింటినీ అమలు చేసేశానని చెబుతున్నాడు. ⇒ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామన్నారు. ఎంత మందికి ఇచ్చారు? రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.56 కోట్ల మంది ఉన్నారని టీడీపీ అఫీషియల్ గెజిట్ ‘ఈనాడు’లో 2025 ఏప్రిల్ 17న కథనాన్ని ప్రచురించారు. కోటిన్నరకు పైగా ఉపాధి లేని యువత ఉంటే.. వారికి ఒక్కపైసా కూడా ఇవ్వకుండా అన్నీ చేసేశానని చెప్పడం మోసం కాదా? ⇒ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామని ఎగ్గొట్టలేదా? దీపం, ఉచిత బస్సు అనేవి చిన్న పనులు. కేంద్ర గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 1.59 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీళ్లందరికీ ఉచిత గ్యాస్ ఇవ్వాలి అంటే సిలిండర్కు రూ.877 చొప్పున మూడు సిలిండర్లకు రూ.4,109 కోట్లు ఖర్చు అవుతుంది. తొలి ఏడాది బడ్జెట్ కేటాయింపు రూ.865 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.3,244 కోట్లు ఇవ్వకుండా మోసం చేయలేదా? అక్కడా మళ్లీ మోసమే.. కనీసం ఒక్క సిలిండర్కైనా పూర్తిగా ఇవ్వాలంటే రూ.1,370 కోట్లు అవుతుంది. అలాంటిది రూ.865 కోట్లే ఇచ్చారు. ఒక్క సిలిండర్ను కూడా సరిగా ఇవ్వలేదు. దీపం పథకం బోగస్! ⇒ మహిళలకు ఉచిత బస్సు అన్నింటికంటే చాలా సులభం. నెలకు రూ.275 కోట్లు ఆర్టీసీ వాళ్లకు ఇస్తే ఏడాదికి రూ.3 వేల కోట్లతో పథకం అమలవుతుంది. మా కడపలో మహిళలు విశాఖపట్నం వెళ్లి చూసి రావొచ్చని ఉచిత బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. పండుగ పేర్లు మారిపోతున్నాయి తప్ప బస్సు రావట్లేదు. గతేడాది ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాది వరకు పండుగలు వెళ్లిపోతే.. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఉచిత బస్సు అమలుకు అధ్యయనంతో పనేముంది? ఆర్టీసీకి డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా? అప్పుడు కడప వాళ్లు విశాఖ వెళ్తారు.. అనంతపురం వాళ్లు అమరావతి చూసుకోవడానికి విజయవాడకు వస్తారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకేమైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఇటు రాయలసీమ వాళ్లు, అటు ఉత్తరాంధ్ర వాళ్లు కొంచెం సేద తీరుతారు. ⇒ 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. నెలకు రూ.4 వేలు చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు అవుతుంది. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా ఎగరగొడుతున్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్నవి పీకేశారు. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే నాటికి మార్చిలో 66,34,742 పింఛన్లు ఉంటే.. ఈ నెలలో ఇచ్చింది 61.48 లక్షల మందికి మాత్రమే. సంవత్సరం తిరిగే లోగా 5 లక్షల పింఛన్లు తగ్గించేశారు. వీటికి అదనంగా 50 ఏళ్లు నిండిన వాళ్లకు పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మహిళలను మోసం చేశారు.⇒ ప్రధాన మంత్రి పీఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. మడమ తిప్పను.. మాట తప్పను అన్నావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇస్తుంది కాబట్టి నేను రూ.6,500 ఇస్తానని చెప్పావు. ఇది ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మేము సంవత్సరానికి ఇప్పుడిచ్చేది కాకుండా రూ.20 వేలు ఇచ్చేలా తెలుగుదేశం పార్టీలో నిర్ణయం చేశామని చంద్రబాబు చెప్పాడు. (చంద్రబాబు మాట్లాడిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు). కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.20 వేలు ఇస్తానని ఊదరగొట్టి ఏడాదిలో ఒక్కపైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున ఇస్తే రూ.10,716 కోట్లు మేలు జరిగేది. ⇒ తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోమని ఎన్నికల్లో పదేపదే చెప్పారు. ‘ఎంత మంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15 వేలు.. ఆంక్షలు లేవు.. కటింగ్ లేదు.. పూర్తిగా ఇచ్చే బాధ్యత మాది అన్నారు (చంద్రబాబు ఈ మేరకు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ యూడైస్ డేటా ప్రకారం రాష్ట్రంలో 2023–24లో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. మరి 87.41 లక్షల మంది పిల్లలకు రూ.15 వేల చొప్పున రూ.13,111 కోట్లు ఇవ్వాలి. ఇస్తామంటోంది కేవలం రూ.8,700 కోట్లు. అది కూడా చివరికి వచ్చే సరికి ఏ మేరకు ఇస్తారో చూడాలి. అందరికీ ఇచ్చిన తర్వాత గాని తెలియదు ఎంత మందికి ఇచ్చారో.. ఎంత మందికి ఎగనామం పెట్టారో. ఈ లెక్కలు చూసినా 30 లక్షల మందికి కోత పెట్టారు. మేము గట్టిగా నిలదీస్తే రూ.15 వేలు కాదు రూ.13 వేలే ఇచ్చేది.. అందులో 67 లక్షల మందికి ఇస్తున్నామని ప్లేటు ఫిరాయించారు. మళ్లీ 67 లక్షల్లో ప్రస్తుతానికి 54 లక్షల మందికే ఇస్తున్నామంటున్నాడు. ఎన్నికలప్పుడు చెప్పిన నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు..నీకు రూ.15 వేలు పోయింది. ఇప్పుడు కొందరికి మాత్రమే రూ.13 వేలు అని తేలింది. ఇది మోసం కాదా చంద్రబాబూ? ప్రశ్నిస్తే నాలుక మందమంటావా?రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు నిండిన 2,10,58,615 మంది మహిళలు ఉన్నారు. వీళ్ల అడ్రస్లతో సహా వివరాలు ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. ఇందులో 60 ఏళ్లు నిండిన వాళ్లను తీసేస్తే.. 1.80 కోట్ల మంది మహిళలు ఉంటారు. వీళ్లందరిలో ఎంత మందికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున ఇచ్చారు? తొలి ఏడాది ఎగ్గొట్టాక.. ఇప్పుడు పీృ4 జపం చేస్తున్నాడు. నువ్వు ఇవ్వాల్సింది పోయి ఎవరో శ్రీమంతులతో ఒకరికో ఇద్దరికో ఇప్పిస్తానని డ్రామాలు చేయడానికి సిగ్గులేదా?ఇన్నిన్ని అబద్ధాలు, మోసాలు చేస్తున్న ఈ పెద్దమనిషి ఇప్పుడు ప్రతి ఇంటికీ తన ఎమ్మెల్యేలను, తన పార్టీకి సంబంధించిన నాయకులను పంపిస్తాడట. అప్పుడు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను, చంద్రబాబు ఇచ్చిన బాండ్లను అందరూ దగ్గర పెట్టుకుని చూపించండి. ఆ మేనిఫెస్టో ప్రకారం ఏడాదిగా మీకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని గట్టిగా డిమాండ్ చేస్తూ నిలదీయండి. మీ వద్ద ఆ మేనిఫెస్టో లేకపోతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకునేలా వైఎస్సార్సీపీ త్వరలో రిలీజ్ చేస్తుంది. దాన్ని దగ్గర పెట్టుకుని మీకు ఏమేం రావాలో చెబుతూ ప్రశ్నించండి. కనీసం వారికి అప్పుడైనా సిగ్గు వచ్చి అమలు చేస్తారేమో చూద్దాం. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చూపించి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం గురించి వివరిస్తున్న వైఎస్ జగన్ ఉన్న పథకాలను భ్రష్టు పట్టించారు⇒ ఒకవైపున ఉన్న పథకాన్ని భ్రష్టు పట్టించారు. అప్పట్లో ప్రతి తల్లికి అమ్మ ఒడి పేరుతో సాయం అందించి, పిల్లలను బడులకు పంపించేలా ప్రోత్సహించాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి 83–84 లక్షల మంది పిల్లలను బడుల బాట పట్టించాం. ఇప్పుడు నిబద్ధత లేకుండా మోటివేషన్ కార్యక్రమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యా రంగాన్ని దెబ్బ తీసి, మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంస్కరణలు నాశనం చేశాడు. ⇒ మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం బడులు, 3వ తరగతి నుంచి టోఫెల్ చెప్పే పీరియడ్లు పోయాయి. సబ్జెక్టు టీచర్ విధానం, రోజుకొక రుచికరమైన మెనూ, చిక్కీతో సహా ఇచ్చే గోరుముద్ద పోయింది. నాడు–నేడు పనులు ఆగిపోయాయి. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ, అక్కడి నుంచి ఐబీ వరకు ప్రయాణం నిలిచిపోయింది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేవి. ఇప్పడు అవీ లేవు. తొలిసారిగా మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ బడులు ప్రైవేటు బడుల కంటే మెరుగైనవిగా నిలిచాయి. స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు కనిపించేవి. ఇప్పడు విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. చివరికి పదో తరగతి పరీక్షల పేపర్లు సక్రమంగా దిద్దలేని అధ్వాన పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ⇒ మా ప్రభుత్వ హయాంలో పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే వాళ్లం. ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన అందించేవాళ్లం. ఇదంతా క్రమం తప్పకుండా జరిగేది. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఈ జూన్ దాటితే ఆరు త్రైమాసికాలు బకాయిలు పెట్టారు. ఎన్నికల కోడ్తో పెండింగ్ పడినప్పటి నుంచి ఆరు త్రైమాసికాలు రూ.4,200 కోట్లు, ఏప్రిల్ (2024)లో ఇవ్వాల్సిన వసతి దీవెన రూ.1100 కోట్లు, ఈ ఏడాదికి మరో రూ.1,100 కోట్లు మొత్తం రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు చెల్లించాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు మాత్రమే. ⇒ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను వెయ్యి నుంచి 3,300కు పెంచి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని, మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దరి చేర్చాం. మధ్య తరగతి ప్రజలు అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితి లేకుండా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేశాం. నెలకు ఆరోగ్యశ్రీ కింద రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే, చంద్రబాబు వచ్చిన ఏడాదిలో రూ.3,600 కోట్లు పెండింగ్ పెట్టేశారు. ఆరోగ్య ఆసరా కింద పేషెంట్ ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఇచ్చే వాళ్లం. దీనికి మరో రూ.400 కోట్లు అవుతుంది. ఇలా.. చంద్రబాబు ఏడాదిలో రూ.4 వేల కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. నెట్వర్క్ ఆస్పత్రులు వైద్యం చేయలేక చేతులు ఎత్తేశాయి. ఇప్పుడు పేదలు నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇవ్వకుండానే చంద్రబాబు.. అబ్రక దబ్రా అంటూ మాయ చేస్తున్నాడు. గట్టిగా అడిగితే నాలుక మందం అంటూ బెదిరిస్తున్నాడు. ⇒ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర.. ఇలా అన్నీ రద్దయ్యాయి. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.బాబు బాదుడే బాదుడుచంద్రబాబు నిజంగా కొన్ని చేశారు. ఏడాదిలో రూ.15 వేల కోట్లు కరెంటు చార్జీలు బాదాడు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు పెంచి పేదలను బాదేశాడు. అన్ని పన్నులు పెంచడంతో ఇంటి అద్దెల బాదుడు.. హెరిటేజ్ కోసం అమూల్ను చంపేసి పాలరేట్ల బాదుడు.. ఇంటింటికీ రేషన్ అందించే వాహనాలు తీసేసి.. సబ్సిడీకే కందిపప్పు ఇచ్చే కార్యక్రమం మానేశాడు. ఫలితంగా పప్పుల ధరలు పెరగడంతో.. రకరకాలుగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మొదలెట్టాడు. చంద్రబాబు దెబ్బకు పంటలకు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరిగి ప్రజలు కిందాపైనా పడుతున్నారు. ఏడాదిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఏకంగా 3 లక్షలకుపైగా ఉద్యోగాలు తీసేశాడు. 2.60 లక్షల మంది వలంటీర్లు, 20 వేల మంది రేషన్ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్ల ఉద్యోగాలు హుష్ కాకి! బెవరేజస్ కార్పొరేషన్లో పని చేస్తున్న 15 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు పోయాయి.ఉద్యోగులకు రూ.20 వేల కోట్ల బకాయిప్రభుత్వ ఉద్యోగస్తులకు మేలు జరిగిందా అంటే అదీ లేదు. వస్తూనే ఐఆర్ ఇస్తానన్నాడు. అదీ పాయే. ఉన్న పీఆర్సీని రద్దు చేశాడు. కొత్త పీఆర్సీ వేయలేదు. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెంచాల్సి వస్తుందని సాగదీస్తూ వస్తున్నాడు. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్ పెట్టాడు. జూలై 1వ తేదీ వస్తే నాల్గో డీఏ పెండింగ్. వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను తీసేసి ఓపీఎస్ తీసుకొస్తా అన్నాడు. ఆ విషయంలోనూ వెన్నుపోటు పొడిచాడు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఎవరైనా అడిగితే తోకలు కత్తిరిస్తా.. భూ స్థాపితం చేస్తా అంటున్నాడు. ప్రజలకు తానిచ్చిన వాగ్దానాలను ఎగవేయడానికి మాత్రం ఆయన, ఆయన ఎల్లో మీడియా రకరకాల స్కెచ్లు వేస్తున్నారు.ఇలా ఇంటింటా మోసం..మెహరాజ్ బేగం షేక్ అని ముస్లిం మహిళ. ఈమెకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అని యూనిక్ ఐడీ కోడ్ ఇచ్చారు. మీ సంక్షేమ వివరాల కోసం అంటూ ఓ వెబ్ సైట్ లింక్ ఇచ్చి ధన్యవాదములతో టీడీపీ అని రాశారు. ఆమె ఐడీ కోడ్, వయసు, కులం, వృత్తి, మొత్తం కుటుంబ సభ్యులు 5, 18 సంవత్సరాల లోపు వయసు పిల్లలు ఇద్దరు, 18 సంవత్సరాల కంటే పైబడి వయసున్న మహిళలు ఇద్దరు, నిరుద్యోగ యువతీ యువకులు సున్నా, నియోజకవర్గం రాజంపేట, కింది స్కీములు వర్తిస్తాయని రాశారు. ఆడబిడ్డ నిధి రూ.1500 చొప్పున ఇద్దరికి ఏడాదికి అందే సాయం రూ.36 వేలు, తల్లికి వందనం కింద ఇద్దరికి రూ.30 వేలు,.. మొత్తంగా ఏడాదిలో మీకు రూ.66 వేలు, ఐదేళ్లలో అందే మొత్తం రూ.3.3 లక్షలు అని స్పష్టంగా చూపించారు. ఇంకా మహాశక్తి దీపం పథకం కింద 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం జూన్ 2024 నుంచి ప్రారంభం అని రాశారు. మీ మద్దతు తెలపడానికి మిస్డ్ కాల్ ఇవ్వండి అని రాశారు. మిస్డ్ కాల్ ఇప్పించి ఓటీపీ పంపించారు. ‘బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. బెనిఫిట్ డీటెయిల్స్.. అభినందనలు... రూ.3 లక్షల 30 వేలు పొందేందుకు.. మీ కుటుంబం అర్హత పొందింది’ అని మెసేజ్ పెట్టారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అవుతుంది అని కూడా రాశారు. చంద్రబాబు నాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నానని ఏకంగా బాండ్ ఇచ్చాడు. ఇలా రాష్ట్రంలో ఇంటింటా చేశారు. అందుకే ఏడాది కాలంగా మీకు ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో కలిపి ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు మీ ఇంటికి వచ్చినప్పుడు.. ఇదిగో బాండు.. ఇదిగో ఎస్ఎంఎస్ అని చూపి డిమాండ్ చేయండి. ఏడాది అయింది.. మా అవసరాలు చాలా ఉన్నాయి.. ఇబ్బందులు పడుతున్నాము.. మా బాకీ ఎప్పుడిస్తావని గట్టిగా నిలదీయండి. అప్పుడైనా ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చి మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారని ఆశిద్దాం. ఒకవేళ ఇవ్వకపోతే మీ తరఫున పోరాటం చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరం కలిసి మళ్లీ ధర్నా చేద్దాం.. మళ్లీ కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమం చేద్దాం. సంపద సృష్టి కాదు.. ఆవిరిసాక్ష్యాధారాలతో కడిగిపారేసిన వైఎస్ జగన్ఆవిరయ్యే సంపదంతా చంద్రబాబు అండ్ కో జేబుల్లోకిమా హయాంలో జీఎస్డీపీలో అప్పుల శాతం 4.08% చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అది ఏకంగా 5.12% వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.3,32,671 కోట్ల అప్పుబాబు ఏడాది పాలనలోనే రూ.1,61,301 కోట్ల అప్పుఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎగవేయడానికి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రకరకాల స్కెచ్లు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నాడు. ఆయన కళ్లెదుటే సంపద ఆవిరి అవుతోంది. ఆ సంపద చంద్రబాబు జేబులోకి, ఆయనకు సంబంధించిన వారి జేబుల్లోకి పోతోంది’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపద పెరగకపోగా.. ఆదాయంతోసహా అన్నీ తగ్గుతున్నాయంటూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర జీఎస్డీపీలో మా హయాంలో అప్పుల శాతం 4.08% అయితే.. చంద్రబాబు ఏడాది పాలన కాలంలో అది ఏకంగా 5.12 శాతానికి చేరుకుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు చూస్తే, మా హయాంలో అది 2.65 శాతం అయితే (అప్పుడు రెండేళ్లు కోవిడ్ ఉంది), ఇప్పుడు ఏకంగా 3.61 శాతానికి పెరిగింది’ అని చెప్పారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఏడాది కాలంలోనే దారుణంగా అప్పులు చేశారు. మా హయాంలో ఐదేళ్లలో అన్నీ కలిపి రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే.. చంద్రబాబు ఈ ఒక్క ఏడాదిలోనే చేసిన మొత్తం అప్పులు రూ.1,61,301 కోట్లు. అంటే మా ఐదేళ్ల హయాంతో పోలిస్తే ఏకంగా 48.5% అప్పు చేశాడు’ అని వివరించారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే..చంద్రబాబు గజదొంగల ముఠా దోచుకుంటోందిరాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఖజానాకు రాకుండా చంద్రబాబు, ఆయనకు చెందిన గజ దొంగల ముఠా పంచుకుంటోంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం(ట్యాక్స్, నాన్ ట్యాక్స్) రూ.14,644 కోట్లు ఉంటే.. 2025 ఏప్రిల్, మే నెలల్లో అది రూ.14,580 కోట్లుగా ఉంది. నిజానికి ఈ ఏడాది 10–12 శాతం పెరగాల్సిందిపోయి.. 0.44 శాతం తగ్గింది. 2024–25లో కూటమి ప్రభుత్వ సొంత ఆదాయం రూ.96,227 కోట్లు కాగా, 2023–24లో రూ.93,354 కోట్లు. అంటే ఆదాయాల వృద్ధి కేవలం 3.08 శాతం మాత్రమే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ పెరుగుదల ఏకంగా 12.04 శాతం ఉంది. దీంతో పోలిస్తే.. సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పే చంద్రబాబు సాధించింది అత్యల్పం. ఇదీ చంద్రబాబు గారి పనితీరు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ?ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు చెప్పే అబద్ధాలు. తానెప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తినీ తాకట్టు పెట్టలేదని ఈ మధ్య చాలా గట్టిగా, గంభీరంగా చెప్పాడు (వీడియో ప్రదర్శించారు). ఏపీఎండీసీ జీవో నంబర్ 69 ద్వారా ఏపీఎండీసీకి సంబంధించిన 436 మైన్స్ ప్రాజెక్టులను తాకట్టు పెడుతూ, వాటి విలువ రూ.1.91 లక్షల కోట్లుగా చూపిస్తూ ఏప్రిల్ 24న పర్మిషన్ ఇచ్చాడు. దీని అర్థం ఏంటయ్యా చంద్రబాబూ? ఏపీఎండీసీ ఇష్యూ చేసిన బాండ్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడు. ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్మెంట్ లోన్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ కింద ఆర్బీఐ ఇస్తుంది) కోసం ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్దకు పోతుంది. ఆ లిమిట్స్ మీద అజమాయిషీని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన దాని కన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు.

ఇదెక్కడి దౌత్యనీతి?!
దేన్నయినా ఒకటికి పదిసార్లు చెబితే అది నిజమై కూర్చుంటుందని, ప్రపంచం దాన్ని మాత్రమే విశ్వసిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. పాకిస్తాన్ ఉగ్ర ఎత్తుగడను తిప్పికొట్టడానికి మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’తో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దానికి ప్రతిగా భారత్పై పాక్ సైన్యం చేసిన దాడుల్ని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. గత నెల 6న మొదలై 9వరకూ సాగిన ఈ ఘర్షణలు... ఇరుపక్షాలూ 11న కాల్పుల విరమణ ప్రకటించటంతో ముగిశాయి. కానీ ట్రంప్ వేరే పనిలేనట్టు ఆనాటి నుంచీ ‘కాల్పుల విరమణ’ తన ఘనతేనంటూ చెప్పుకు తిరుగు తున్నారు. అక్కడితో ఆగలేదు. సంధి కుదుర్చుకోనట్టయితే వాణిజ్య ఒప్పందం ఉండబోదని భారత్ను హెచ్చరించాకే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. మన దేశం దాన్ని ఖండించినప్పుడు ‘అవును... నిజమే. వారిద్దరూ మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్నారు. ఇందులో మాపాత్ర లేద’ని నాలుక మడతేస్తుంటారు. మళ్లీ నాలుగు రోజులు గడిచేసరికల్లా పాత పాటే అందుకుంటారు. భారత్, పాకిస్తాన్లు కాల్పుల విరమణ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఆ సంగతి వెల్లడించటమైతే వాస్తవం. ప్రకటించటంలో రెండు దేశాలూ కొంత వ్యవధి తీసుకోవటాన్ని ఆసరా చేసుకున్న ట్రంప్ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి ఆ పనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 35 నిమిషాలసేపు ఆయనతో ఫోన్లో సంభాషించారు. ‘కాల్పుల విరమణ ప్రతిపాదన ఏ దశలోనూ మీ నుంచి రాలేదు. అలాగే వాణిజ్య ఒప్పందం గురించి ఇంతవరకూ మీ దేశంతో చర్చించలేదు’ అని వివరణనిచ్చారు. అక్కడితో అయిందనుకుంటే... మరికొన్ని గంటలు గడిచాక మరోసారి ట్రంప్ పాత పాటే వినిపించారు.రష్యా–ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించి ఆయన అభాసుపాలయ్యారు. అక్కడ యథావిధిగా పోరు సాగుతోంది. గాజాలో ఇప్పటికి 56,000 మంది పౌరుల్ని ఊచకోత కోసిన ఇజ్రాయెల్పై చర్యకు అడ్డుపడటమే కాదు... వారంరోజుల క్రితం దాన్ని ఉసిగొల్పి ఇరాన్పై దాడులు చేయించారు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ను బెదిరిస్తున్నారు. పైగా ఆ దేశంపై సైనిక దాడికి పథక రచన చేస్తున్నారు. పశ్చిమాసియా ఊబిలోకి దేశాన్ని దించవద్దంటూ స్వదేశంలో, స్వపక్షంలో అనేకులు హెచ్చరిస్తున్నా ట్రంప్కు పట్టడం లేదు. ఇలాంటి వ్యక్తి భారత్, పాకిస్తాన్ల మధ్య సంధి కుదిర్చానని ఎలా చెప్పుకుంటారో అనూహ్యం. కశ్మీర్ సమస్యపై గానీ, భారత్–పాక్ల మధ్య ఉన్న ఇతరేతర సమస్యలపై గానీ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించ బోమని దశాబ్దాలుగా భారత్ చెబుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వైఖరే కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వం దీన్ని మరికాస్త సవరించింది. మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోబోమని చెబుతూనే మున్ముందు పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పైనా, ఉగ్రవాదుల అప్పగింత పైనా మాత్రమేనని స్పష్టం చేసింది. ట్రంప్తో సంభాషించినప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుకొని అన్ని విషయాలూ మోదీ పూసగుచ్చినట్టు చెప్పారని, ఇక నుంచి ఉగ్రదాడిని పరోక్ష యుద్ధంగా పరిగణించదల్చుకోలే దని, దాన్ని యుద్ధంగానే చూస్తామన్నారని మన విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలియజేశారు. జిత్తులమారితనం దౌత్యం అనిపించుకోదు. స్పష్టంగా, పారదర్శకంగా, అరమరికలు లేకుండా వ్యవహరించినప్పుడే ఎంతటి సంక్లిష్ట సమస్యయినా దారికొస్తుంది. దౌత్యం విజయవంతమవుతుంది. బెదిరింపులకు దిగటం, బెదిరించానని గొప్పలుపోవటం దౌత్యమెలా అవుతుంది? తన వ్యాపారాన్ని విస్తరించుకోవటానికీ, ప్రత్యర్థులపై పైచేయి సాధించటానికీ పూర్వాశ్రమంలో నేర్చు కున్న కళలన్నీ ట్రంప్ వైట్హౌస్లో ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది. దీన్ని వదిలించుకోనట్టయితే నవ్వులపాలవుతానన్న ఆలోచన ఆయనకు స్ఫురిస్తున్నట్టు లేదు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఊత మిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతున్నా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు బుధవారం విందుకు ఆహ్వానించారు. అది ఆయన ఇష్టం. కానీ అదే రోజు మోదీ అక్కడుండాలని కోరుకోవటం, వేరే దేశాల పర్యటన రద్దుచేసుకుని వాషింగ్టన్ రమ్మనటం హుందాతనం అనిపించుకుంటుందా? పర స్పరం కత్తులు దూసుకుంటున్న వైరిపక్షాలను ఒకేసారి పిలవటం తెలివితక్కువతనం అను కోవాలా? అతి తెలివి అనుకోవాలా? ఒకపక్క కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయటం సమ్మతం కాదని మన దేశం పదే పదే చెబుతున్నా ఈ మూర్ఖత్వం దేనికి? రేపో మాపో ఇరాన్పై తాము దండెత్తితే రీఫ్యూయలింగ్ కోసం పాకిస్తాన్ అవసరపడుతుంది. అందుకోసం ఆ దేశాన్ని దువ్వుతూ మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నట్టు ఈ కపటనాటకం ఎందుకు?జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి హడావిడిగా నిష్క్రమించనట్టయితే, అక్కడ మోదీ ప్రసంగాన్ని నేరుగా విన్నట్టయితే ట్రంప్కు విషయం కాస్తయినా అర్థమయ్యేది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తున్న పాశ్చాత్య దేశాలను మోదీ నిశితంగా విమర్శించారు. సొంత కారణాలతో కొన్ని దేశాలపై ఆంక్షలు పెడుతూ, ఉగ్రవాదుల్ని ఉసిగొల్పే దేశాలను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని మోదీ చెప్పారు. అయినా ట్రంప్ ధోరణి మారలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్తో సహా అన్ని అంతర్జాతీయ అంశాల్లోనూ స్వతంత్ర విధానం పాటించటమే మనకు శ్రేయస్కరం. ద్వంద్వ నీతిని అనుసరించేవారికి తమ స్థానం ఏమిటో చెప్పనట్టయితే మనమే నష్టపోతాం.

యాభై ఏళ్ల చీకటి గాయం
ఏదైనా చారిత్రక పరిణామం మీద సరైన అంచనాకు రావడానికి యాభై ఏళ్ల కాలం విశేషంగా దోహదం చేయగలదు. చరిత్రను పునర్లిలిఖించుకునే బాధ్యత ప్రతి తరం మీద ఉందన్న వాస్తవాన్ని గుర్తిస్తే, 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలాన్నీ, దాని ఫలితాలనూ అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయమే. ఎమర్జెన్సీ విధించిన వారు దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని చెప్పే పార్టీ వారు కావచ్చు. అయినా చరిత్ర తీర్పు ముందు అంతా సమానమే. ఎమర్జెన్సీ దేశంలో ‘క్రమశిక్షణ’ తెచ్చిందా? లేక చీకటి యుగంలోకి నెట్టిందా? ప్రేరేపించిన కారణాలేమిటి?1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కేంద్ర మంత్రిమండలి సిఫారసుతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 352లోని 1వ నిబంధన ఆ అధికారాన్ని రాష్ట్రపతికి ఇచ్చింది. ఆంతరంగిక భద్రతకు తీవ్ర విఘాతం వాటిల్లితే రాష్ట్రపతి ఈ అసాధారణ చర్య తీసుకుంటారు.ఎమర్జెన్సీ విధించిన సమయానికి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి రాజ్యాంగం నిర్దేశించినట్టు ఉన్నాయా? 1974 జన వరి నుంచి చూసినా ఆ పరిస్థితులు కానరావు. కొంచెం గట్టిగా కనిపించే పరిణామం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) సంపూర్ణ విప్లవం మాత్రమే. మెస్చార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో మొదలై, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న స్థాయికి వెళ్లిన గుజరాత్ విద్యార్థి ఆందోళన ఉంది. 1975 జనవరిలో సమస్తిపూర్(బిహార్)లో రైల్వే మంత్రి ఎల్ఎన్ మిశ్రా సభలో బాంబు పేలి, ఆయన చని పోయారు. దీనిని జేపీ ఉద్యమంతో ముడిపెట్టలేక పోయారు.సంపూర్ణ విప్లవానికి మద్దతుగా పార్లమెంటుకు జనతా మార్చ్ నిర్వ హించాలని విపక్షాలన్నీ (సీపీఐ మినహా) నిర్ణయించాయి. ఈ మధ్యలో జరిగిన మరొక అనూహ్య పరిణామం, రాయ్బరేలీ ఎన్నిక పిటిషన్పై మార్చి 18న అలహాబాద్ హైకోర్టు బోనులో ఇందిర నిలబడటం. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని మొరార్జీ దేశాయ్ ప్రారంభించిన నిరాహార దీక్షను ఏప్రిల్ 13న విరమించారు. ఎన్నికలు జరిపించడానికి ఇందిర సుముఖత వ్యక్తం చేశారు.అయినా స్వతంత్ర భారత చరిత్రను మలుపు తిప్పిన అత్యవసర పరిస్థితి వంటి తీవ్ర నిర్ణయం ఇందిర ఎందుకు తీసుకున్నారు? రెండు తక్షణ కారణాలు. 1971 నాటి సాధారణ ఎన్నికలలో రాయ్బరేలీ నియోజక వర్గం నుంచి ఇందిర ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్సిన్హా 1975 జూన్ 12న తీర్పు ఇవ్వడం. ఇందిరపై పోటీ చేసి ఓడిన సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ ఈ కేసు వేశారు. అదే రోజు గుజరాత్ అసెంబ్లీ ఎన్ని కలలో ప్రజా తీర్పు వచ్చింది. కాంగ్రెస్ ఓడి, జన మోర్చా గెలిచింది. రెండోది: అలహాబాద్ హైకోర్టు తీర్పు మీద శాశ్వత స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళితే జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 1975 జూన్ 25న షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చి, ఇందిరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఓటు హక్కు లేకుండా చేయడం. న్యాయ వ్యవస్థ చేసిన ఈ రెండు నిర్ణయాలు, గుజరాత్ ప్రజాతీర్పు ఆమెను ఇరకాటంలోకి నెట్టాయి. కాంగ్రెసేతర పక్షాలు ఇందిర పదవిలో కొనసాగడానికి అనర్హులని ప్రకటిస్తూ ఆ సాయంత్రం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సభ నిర్వహించి కొత్త ఉద్యమం కోసం లోక్సంఘర్ష సమితిని ప్రకటించాయి. ఆ అర్ధరాత్రి రాష్ట్ర పతి ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేశారు. మరునాడు ఉదయం ఆరు గంటలకు ఇందిర నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి మండలి ఎమర్జెన్సీ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి అప్పటి కేంద్ర హోంమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి రాష్ట్రపతి సంతకం పడిన తరువాత తెలిసింది.ప్రతిపక్షం అవసరం లేదా?ఇందిర భారత పాలనా వ్యవస్థకు కొత్త రూపం ఇవ్వాలను కున్నారు. దేశాభివృద్ధి అధ్యక్ష తరహా పాలనలోనే సాధ్యమన్న ఒక వాదాన్ని అప్పటికే ప్రచారంలో పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు దేవ్కాంత్ బారువా ‘ఇందిరే ఇండియా, ఇండియా అంటే ఇందిర’ అన్నారు. మరొక నినాదం కూడా ఇచ్చారు. ‘వర్తమాన పరిస్థితులలో భారత దేశానికి అసలు ప్రతిపక్షమే అవసరం లేదు’ అని! నాటి హరి యాణా ముఖ్యమంత్రి ఇందిరను జీవితకాలపు అధ్యక్షురాలిగా (పార్టీకి), తద్వారా యావజ్జీవితం దేశ ప్రధానిగా చూడాలని కోరుకున్నారు.ప్రచ్ఛన్న యుద్ధ నేపథ్యం కూడా ఇందిర చర్యకు ప్రాతిపదిక ఇచ్చాయి. ‘సోవియెట్ నాయకుల సలహాతో దేశంలో అత్యవసర పరి స్థితి విధించినట్లు అర్థమైంది. సోవియెట్లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారిని సైబీరియాకు పంపిస్తారు. ఇక్కడా ప్రతిపక్షాల వారిని అదే విధంగా జైళ్ల పాలు చేశారు.’ మాజీ గవర్నర్, పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి సుర్జీత్ సింగ్ బర్నాలా రాసిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్: స్టోరీ ఆఫ్ ఏన్ ఎస్కేప్’ గ్రంథంలోని వాక్యాలివి. బర్నాలా ఎమర్జెన్సీ బాధితుడే. ‘చిలీ పాలకుడు సాల్వెడార్ అలెండి తరువాత నిన్నే అమెరికా లక్ష్యంగా చేసుకుంది’ అంటూ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో చేసిన హెచ్చరికతోనే ఇందిరాగాంధీ ఆగమేఘాల మీద అత్యవసర పరిస్థి తిని విధించారన్న వాదన గురించి సంజయ బారు ప్రస్తావించారు. 1975 జూన్ 25 అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య జయ ప్రకాశ్ నారాయణ్ను, మొరార్జీ దేశాయ్ని పోలీసులు అరెస్టు చేశారు. మరునాడు ఉదయం జనసంఘ్ నాయకులు వాజ్పేయి, అడ్వాణీ, మధు దండావతె, మరికొందరిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఆంధ్రలో పెద్దలు గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, జూపూడి యజ్ఞనారాయణ, యలమంచిలి శివాజీ వంటి వారిని అరెస్టు చేశారు. దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ పేరుతో ఆ 21 మాసాలలో దాదాపు లక్ష మందిని అరెస్టు చేశారు. 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.ఎదురు దెబ్బ తప్పదు!ఎమర్జెన్సీ విధించిన వెంటనే తీసుకున్న చర్య సెన్సార్ షిప్. దీనితో దాదాపు భారతీయ పత్రికలన్నీ మూగబోయాయి. ఇది జూన్ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్, ఆనందమార్గ్, జమాతే ఇస్లాం, సీపీఐ (ఎం.ఎల్.)లతో సహా 26 సంస్థలపై నిషేధం విధించారు. న్యాయమూర్తులను బదిలీ చేశారు. క్రమశిక్షణ పేరుతో వందలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆనాడు లోక్సభలో ప్రతిపక్షాలన్నింటి బలం అరవై లోపే! కానీ, లోక్ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చరిత్రా త్మక ఉద్యమమే జరిగింది. దాంతో లోక్సభకు తాజాగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఇందిర 1977 జనవరి 18న ఆకాశవాణి ప్రసంగంలో వెల్లడించారు. 1977 జనవరి 20న జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ,సంజయ్గాంధీ కూడా ఓడిపోయారు. 1977 మార్చి 21న తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి ఎమర్జెన్సీని రద్దు చేశారు.ఎమర్జెన్సీ అంటే కొందరు విపక్షాల నాయకుల అర్ధరాత్రి అరెస్టులు మాత్రమే కాదు. కోటీ పదకొండు లక్షల మందికి జరిగిన బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు; మీసా, డిఫెన్స్ ఇండియా రూల్స్ పేరుతో లక్షా పద మూడు వేల మంది అమాయకుల అక్రమ అరెస్టులు; స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితో ఏర్పడిన రాజ్యాంగానికి జరిగిన తీరని అవమానం. అన్నింటికి మించి భార తీయ ఆత్మకు అది పెద్ద గాయం. న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం భంగపడి ప్రజాస్వామ్యం బలహీనమైంది.ఇక అత్యవసర పరిస్థితి, తదితర పరిణామాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని తానే సిద్ధం చేసుకుంది. బీజేపీ అనే ఒక రాజకీయ పక్షం అలా దేశ రాజకీయ రంగం మీదకు వచ్చింది.డా‘‘ గోపరాజు నారాయణరావు వ్యాసకర్త ‘జాగృతి’ సంపాదకుడు ‘ 98493 25634

ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.నవమి ఉ.6.32 వరకు, తదుపరి దశమి తె.4.13 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం: రేవతి రా.7.16 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: ఉ.8.00 నుండి 9.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.59 వరకు, తదుపరి ప.12.26 నుండి 1.18 వరకు, అమృత ఘడియలు: సా.4.57 నుండి 6.28 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.32. మేషం....రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.వృషభం...ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.మిథునం....శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కర్కాటకం...వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.సింహం......శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.కన్య.....బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.తుల..శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృశ్చికం.పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ధనుస్సు...మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.మకరం...దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.కుంభం...వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.మీనం...ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ఆస్పత్రిపై క్షిపణుల దాడి
బీర్షెబా/టెహ్రాన్/టెల్ అవీవ్/దుబాయ్/వాషింగ్టన్: అంతూదరీ లేకుండా భీకరంగా కొనసాగుతూ పశ్చిమాసియా శాంతిదీపం కొండెక్కేలా చేస్తున్న ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. కయ్యానికి కాలు దువ్వుతూ యుద్ధజ్వాలను మరింత రాజేసిన ఇజ్రాయెల్పై ఇరాన్ గురువారం బదులు తీర్చుకుంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. వాటిల్లో కొన్ని బాలిస్టిక్ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్లోనే అత్యంత పెద్ద ఆస్పత్రి అయిన బీర్షెబా నగరంలోని వేయి పడకల సొరొక ఆస్పత్రిపై పడ్డాయి. క్షిపణుల ధాటికి ఆస్పత్రి ధ్వంసమైంది. ఈ దాడి ఘటనలో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు. మంటలు అంటుకుని, అగి్నకీలలు ఎగసిపడుతున్న భవనం నుంచి రోగులను సహాయక బృందాలు స్ట్రెచర్లపై బయటకు తీసుకొస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆస్పత్రిపై దాడి జరగబోతోందని సైరన్లు వినిపించడంతో చాలా మంది ముందుగానే బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆస్పత్రిలో కొంతభాగాన్ని ఒకరోజు ముందే ఖాళీచేయించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆస్పత్రిలో 700 మంది రోగులున్నారు. గురువారం దేశవ్యాప్తంగా ఇరాన్ జరిపిన దాడుల్లో 270కిపైగా ఇజ్రాయెలీలు రక్తమోడారు. టెల్ అవీవ్, రమాత్ గాన్, రెహోవోత్ సిటీ సహా పలు నగరాలపైనా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. పలు భవనాలు పాక్షికంగా ధ్వంసమైన దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీచానళ్లు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. సిటీలోని గవ్యమ్ నెగెవ్ ఇజ్రాయెల్ సైనిక నిఘా కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోగా పొరపాటున ఆస్పత్రిపై క్షిపణులు పడ్డాయని తెలుస్తోంది. అయితే ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే పౌరుల రక్తం కళ్లజూస్తోందని, ఇందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ‘‘మాకు అమెరికా సాయం చేస్తుందన్న నమ్మకం నాకుంది. అమెరికాకు ఏది అత్యుత్తమమో అదే ట్రంప్ చేస్తారు’’ అని నెతన్యాహూ అన్నారు. అయితే యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనేదానిపై మరో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని శ్వేతసౌధం ప్రకటించింది. చర్చలకు ఇంకా అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. ప్లుటోనియం చిక్కకుండా దాడులు ప్రస్తుతం క్రియాశీలంగా లేని ఇరాన్లోని ఖోŠన్దాబ్ పట్టణ సమీపంలోని అరాక్ భారజల రియాక్టర్పై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులుచేశాయి. దాడుల తర్వాత ఈ రియాక్టర్ నుంచి ఎలాంటి రేడియోధారి్మకత వెలువడలేదని ఇరాన్ తెలిపింది. అణురియాక్టర్లను చల్లబరిచేందుకు భారజలాన్ని ఉపయోగిస్తారు. ఇలా అణురియాక్టర్లను చల్లబరిచినప్పుడు ఈ ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా ప్లుటోనియం అనే అత్యంత శక్తివంతమైన పేలుడుపదార్థం ఏర్పడుతుంది. దీనిని సైతం అణుబాంబు తయారీలో ఉపయోగించుకోవచ్చు. యురేనియంను 90 శాతం శుద్ధ్దత స్థాయికి తీసుకొచ్చాకే అణుబాంబు తయారీకి పనికొస్తుంది. యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ క్షిపణిదాడుల నేపథ్యంలో ఇరాన్కు అణుబాంబు తయారీలో ఈ ప్లుటోనియం అక్కరకొస్తుంది. ఇలా ఉపయోగపడకూడదనే ఉద్దేశంలోనే అరాక్ హెవీవాటర్ రియాక్టర్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులుచేసింది. గురువారం నాటికి యుద్ధంలో ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 639 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,300 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీనికి ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన 400కుపైగా క్షిపణుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. అప్రమత్తంగా ఉన్న అమెరికా యుద్ధవిమానాలు అత్యవసర పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు సాయం చేయాల్సి వస్తే ఇరాన్ ప్రతిదాడులు చేస్తుందన్న అంచనాతో అమెరికా యుద్ధవిమానాలను ఆయా వైమానిక స్థావరాల నుంచి వేరే చోటుకు తరలించారు. ముఖ్యంగా ఖతార్లోని దోహాలో ఉన్న అల్ ఉదేయిద్ అమెరికా వైమానిక స్థావరంలోని సైనిక, ఆయుధ రవాణా విమానాలు, యుద్ధవిమానాలు, డ్రోన్లను వేరే చోటుకు తరలించినట్లు తెలుస్తోంది. తొలుత దాక్కుని తర్వాత దాడి చేయడం అమెరికా వ్యూహమని కొందరు యుద్ధనిపుణులు చెప్పారు. మరోవైపు భారత్, జపాన్, చైనా, ఇండోనేసియా, ఒమన్ తదతర దేశాలు తమ పౌరులను ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తరలిస్తున్నాయి.

కక్ష కట్టి.. అక్రమ కేసు పెట్టి..
సాక్షి, నరసరావుపేట: ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా... వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతం కావడంతో కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. అక్కసుతో వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ జగన్ బుధవారం పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా వివిధ కారణాలు చూపి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతుండడం గమనార్హం. ⇒ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమీనుద్దీన్ అక్రమ కేసు కట్టారు. గుంటూరు–హైదరాబాద్ హైవేలో కంటెపూడి సమీపంలో విధులు నిర్వర్తిస్తుండగా అంబటి ర్యాలీగా వచ్చారని, అనుమతులు లేవని చెప్పినా వినిపించుకోకుండా ఇనుప స్టాప్ బోర్డును నెట్టేశారని, అది నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు గన్మెన్ చిలకా గోపి కాలుపై పడి రక్తస్రావమైందని ప్రస్తావించారు. గోపి ఫిర్యాదుతో అంబటి, మరికొందరి పై 189(2), 223(ఏ), 121(1), 132, 324(4), రెడ్విత్ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ⇒ వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకపోయినా.. పెద్దఎత్తున ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చి బైక్ ర్యాలీలు చేశారని వైఎస్సార్ సీపీ నేత గజ్జల సు«దీర్భార్గవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ నాగమల్లేశ్వరరావు అక్రమ కేసు నమోదు చేశారు. ప్రజా రవాణాకు ఆటంకం, బారికేడ్ల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తి నష్టానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరు వైఎస్సార్సీపీ నేతల పేర్లు చేర్చేందుకు పోలీసులపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.నాగమల్లేశ్వరరావు తండ్రిపైనా.. రెంటపాళ్ల వీఆర్వో బూసిరాజు లక్ష్మి ఫిర్యాదు మేరకు నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర్లు, గజ్జల సు«దీర్ భార్గవ్రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇరుకు సందులో ఎక్కువమందితో విగ్రహావిష్కరణ వద్దని పోలీసులు నోటీసులిచ్చినా పెద్దసంఖ్యలో జనం వచ్చేలా చేసి వారి జీవితాలను ప్రమాదంలో పడేశారని పేర్కొన్నారు. భారీ సౌండ్తో డీజే, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఫ్లెక్సీలు ప్రదర్శించారని... టీడీపీ నాయకుల అంతు చూస్తాం అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించాడని బొల్లెద్దు రవితేజపై సత్తెనపల్లి టౌన్ టీడీపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 352, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు. ⇒ వైఎస్ జగన్ పర్యటనలో అభిమానులు గజ్జల ఆసుపత్రి వద్ద రోడ్డుపై డీజే పెట్టడంతో ఇబ్బందిపడ్డామని సత్తెనపల్లికి చెందిన నూర్బాషా జానీబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ ఆపమన్నందుకు గుర్తుతెలియని నలుగురు తనౖపె దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి–సాగర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ.. గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను వినియోగించదలిస్తే కేంద్రం సాయమందించే ఇచ్చంపల్లి–సాగర్ లింకు ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముందుంచారు. దీంతో నాలుగేళ్ల కిందట గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తయారు చేసిన ఇచ్చంపల్లి–సాగర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.మొత్తం 247 టీఎంసీల మళ్లింపు ఎన్డబ్ల్యూడీఏ 2020–21లో రూపొందించి సంబంధిత రాష్ట్రాలకు అందజేసిన డీపీఆర్లో..ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధాన ప్రాజెక్టు, జలాల లభ్యత, మళ్లించే విధానం, అవసరమయ్యే నిధులు, ఆయా రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలు, వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితర అంశాలను స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం.. తెలంగాణలోని ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై 15.8 టీఎంసీల సామర్థ్యంతో బరాజ్ నిర్మించి తమిళనాడులో కావేరి నదిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు 247 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. బరాజ్ నుంచి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున నీటిని సాగర్కు మళ్లిస్తారు. ఈ దారిలో గొట్టిముక్కల బ్రాంచి కాలువ కింద నల్లగొండ జిల్లాలోని మునుగోడు, చండూరు ప్రాంతాల్లో 80 వేల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు, ఎస్సారెస్పీ–2 కింద 1.78 లక్షలు, ఎస్ఎల్బీసీ కింద 1.09 లక్షల హెక్టార్లకు నీరందించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో సాగర్ కుడి కాలువ కింద 1.26 లక్షల హెక్టార్లు, నాగార్జునసాగర్–సోమశిల కింద 1.68 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీటిని ప్రతిపాదించారు. సోమశిల–కావేరి మధ్య 2.5 లక్షల హెక్టార్లకు నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. మూడు రాష్ట్రాలకు 230 టీఎంసీలుగోదావరిలో వరద ఉండే జూన్–అక్టోబర్ నెలల్లో 143 రోజుల్లో 247 టీఎంసీలను మళ్లిస్తారు. ఇందులో ఆవిరి నష్టాలు పోనూ మిగిలే 230 టీఎంసీలలో తెలంగాణ 65, ఆంధ్రప్రదేశ్ 79.9, తమిళనాడు 84 టీఎంసీలు వినియోగించుకునేలా ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు ఆ సమయంలోనే రూ.85 వేల కోట్ల మేర వ్యయాన్ని అంచనా వేసింది. ఇచ్చంపల్లి నుంచి సాగర్కు నీటిని మళ్లించే క్రమంలో మూడు లిఫ్టులు నిర్మించాల్సి ఉండగా, వీటి నిర్వహణకు 3,840 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుందని, ఇందుకు ఏటా రూ.770 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టింది. ఇక ఇచ్చంపల్లి వద్ద నిర్మించే బరాజ్తో 9,300 హెక్టార్లు ముంపునకు గురికానుండగా, 22 వేల మంది నిరాశ్రయులవుతారని ఎన్డబ్ల్యూడీఏ పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లో తెలంగాణ వ్యతిరేకించింది. దీనికి దిగువన అకినేపల్లి నుంచి ఒక ప్రతిపాదన, తుపాకులగూడెం నుంచి మరో ప్రతిపాదన, దుమ్ముగూడెం నుంచి ఇంకో ప్రతిపాదన సిద్ధం చేశారు. అయితే ఇంద్రావతి మిగులు జలాలపై ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో దీనిపై చర్చోపచర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ పోలవరం–బనకచర్ల చేపట్టడంతో, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ తాజాగా ఇచ్చంపల్లి–సాగర్ అనుసంధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

నిర్లక్ష్యం వల్లే... ఈ ఘోర ప్రమాదం
ఒక ప్రమాదం, అందులోనూ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, జరగగానే ఒకటి రెండు రోజులు గగ్గోలు పెట్టడం, ఆ ప్రమాద కారణాలను గుర్తించి సవరించే పని ఎంత మాత్రమూ చేయకుండా మరొక ప్రమాదం దాకా మౌనంగా ఉండి పోవడం మన సమాజానికీ, రాజ కీయ నాయకత్వానికీ, ప్రచార సాధ నాలకూ బాగా అలవాటు అయిపోయింది. నిజానికి సమాజం మొత్తంగా ఇందులో చేయగలిగినదేమీ లేదు. ఆ బాధ్యత రాజకీయ నాయకత్వాలదీ, ప్రభుత్వాలదీ, అధికార వ్యవస్థలదీ! ఒక ప్రమాదం జరగగానే కూలంకుషంగా అధ్యయనం చేసి, ప్రమాద కారణాలను అన్వేషించి, మరొకసారి అటువంటి ప్రమాదం జరగడానికి వీలులేని విధంగా ఆ కారణాలన్నిటినీ తొలగించవలసిన బాధ్యత అధికార వ్యవస్థలదే! అహ్మదాబాద్ విమాన ప్రమాదం అత్యంత విషాద కరమైన, ఘోరమైన ప్రమాదం. టేకాఫ్ అయిన కొద్ది సెకన్ల లోనే కూలిపోయి, 241 మంది విమాన ప్రయాణికులు, కనీసం 40 మంది ఇతరులు చనిపోయారు. ఆ ప్రమాదం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో శాస్త్రీయ విశ్లేషణ జరిపి కారణాలు నిర్ధారించడానికి మూడు నాలుగేళ్లు పడుతుందంటున్నారు. ఈలోగా మన వాట్సప్ కార్ఖానాలూ, వాచాల త్వమే పెట్టుబడిగా నడుస్తున్న ఛానళ్లూ, సంచలనాత్మకమైతే చాలు ఎంత అబద్ధమైనా, ఎంత నిరాధారమైనా మాట్లాడ వచ్చునని అనుకుంటున్న సామాజిక మాధ్యమాలూ చాలా కారణాలను వండి వార్చాయి.ఈ ప్రమాదానికి సాంకేతిక కారణాలు ఎట్లాగూ అధ్యయనంలో బయటపడతాయి కాని ఈలోగా ఆలోచించ వలసిన సామాజిక, రాజకీయార్థిక కోణాల వైపు నుంచి చూస్తే అధికార వ్యవస్థల నిర్లక్ష్యం, లేదా లాభాపేక్షాపరుల అక్రమాలను అధికారులు అవినీతి వల్లనో, సోమరితనం వల్లనో చూసీ చూడనట్టు పోవడం మూల కారణం అని తేలుతుంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించి 2022 జనవరిలో టాటా గ్రూప్కు అప్పగించినప్పటి నుంచీ గడచిన మూడేళ్లలో ఆ సంస్థ నిర్వహణలో భద్రతా లోపాల గురించీ, నిర్వహణ లోపాల గురించీ, నిబంధనల ఉల్లంఘనలగురించీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనేక సార్లు మందలించింది, జరిమానాలు వేసింది, హెచ్చ రించింది. విమానాల నిర్వహణలో, కాక్ పిట్ క్రమశిక్షణలో, అంతర్గత జవాబుదారీతనంలో లోపాలను ఎత్తి చూపింది. అర్హత లేని పైలట్లను వాడుతున్నారని 2025 జనవరిలో కూడా ముప్పై లక్షల రూపాయల జరిమానా విధించింది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభ్ భాయి పటేల్ అంత ర్జాతీయ విమానాశ్రయం దేశంలో అత్యంత ప్రమాదకర విమానాశ్రయాలలో ఒకటని గతంలోనే పేరు పొందింది. విమానాలకు పక్షుల తాకిడి అతి ఎక్కువగా ఉండే విమానా శ్రయం అది. ఎందువల్లనంటే దాని రన్ వేలు సరాసరిగా కిక్కిరిసిన జనసమ్మర్దపు కాలనీలకూ, భవనాలకూ అంటు కుని ఉంటాయి. రన్ వేకూ నివాస గృహ, భవన సము దాయాలకూ మధ్య ప్రామాణికంగా ఉండవలసినంత దూరం కాదు గదా, కనీసమైన స్థలం కూడా లేదు. అందు వల్ల టేకాఫ్లో విఫలమయ్యే విమానం ఆ నివాస గృహాల మీద కూలిపోక తప్పదు. ఆ నివాస గృహాల భవన సముదాయాల కుప్పలో ఒకటి ఇప్పుడు నలభై మంది వైద్య విద్యార్థులు మరణించిన బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థి వసతిగృహం. అయితే ఈ సంగతి ఇప్పుడు, ఇంత ఘోరమైన ప్రమాదం జరిగాక మాత్రమే తెలిసినది కాదు. ఎన్నో భద్రతా అధ్యయనాలు ఈ సంగతి ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉన్నాయి. విమానాశ్రయ రన్ వే అంచుల్లో నివాస గృహాలు ఉన్నాయనీ, ఆ ఇళ్లవాళ్లు తమ చెత్తను ఈ గోడ ఇవతల పారబోస్తున్నారనీ, అక్కడ పురుగులు చేరి, ఆ పురుగుల కోసం పక్షులు వచ్చి, సరిగ్గా విమానం టేకాఫ్ సమయంలో ఫాన్లలోకి పక్షులు ఎగిరే అవకాశం ఉందనీ; అక్కడ నేల చదునుగా లేదనీ, మురికి కాల్వల మాన్ హోల్స్ మీద కప్పులు కూడా లేవనీ ఇదివరకు తెలిసిన విషయాలే. అధ్యయనాలలో, నివేదికలలో రాసినవే. పరిష్కరించాలని సిఫారసులు అందినవే. డీజీసీఏ 2019 నివేదికలోనే అహ్మ దాబాద్ విమానాశ్రయం భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలమయిందని వివరంగా రాసింది. అంతకు ముందే 2018లో ‘ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించిన ఒక విజ్ఞాపనలో రన్ వే భద్రత కోసం, 29.79 ఎకరాల అదనపు స్థలం కావాలని కోరింది. దానికి గుజరాత్ ప్రభుత్వ ఆమోదం కూడా దొరి కింది. కాని అక్కడ ఉన్న 350 కుటుంబాలను తరలించి, స్థలం ఖాళీ చేయించడంలో రాజకీయాలు అడ్డుపడి ఏడు సంవత్సరాలు గడిచినా ఆ పని జరగలేదు.ప్రస్తుత విమానాశ్రయం మీద ఒత్తిడి తగ్గించే పరి ష్కారంగా ధోలేరాలో పదివేల ఎకరాలలో రెండో విమా నాశ్రయాన్ని 2022లో ప్రకటించారు. అది 2025 కల్లా ప్రారంభమవుతుందన్నారు. దాని ప్రచార కార్యక్రమం నడిచినంతగా నిర్మాణ కార్యకలాపాలు సాగలేదు.విజయ్ రూపానీ ఐదు సంవత్సరాల పాటు 2016 నుంచి 2021 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రమా దాల హెచ్చరికలన్నీ ఉన్నాయి. వాటిని నివారించే అవకాశాలూ ఉన్నాయి. కాని నిర్లక్ష్యమే రాజ్యమేలింది. ప్రస్తుత విమాన ప్రమాదంలో రూపానీ విషాదకర మరణానికి ఆ నిర్లక్ష్యమూ కారణమే! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్

ప్రేక్షకులు ఆదరించేదే పెద్ద సినిమా – అక్కినేని నాగార్జున
‘‘కుబేర’ సినిమాలో నాది బిలియనీర్ పాత్ర అని అందరూ అనుకుంటున్నారు. కానీ, నాది మధ్య తరగతి వ్యక్తి ప్రాత. సీబీఐ ఆఫీసర్గా కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య నా పాత్ర ఉంటుంది. నా క్యారెక్టర్ని శేఖర్ కమ్ముల చాలా అద్భుతంగా రాశారు. నా పాత్రలో చాలా ఛాయలుంటాయి.. అదే విధంగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్కి మంచి చాన్స్ దక్కింది’’ అని అక్కినేని నాగార్జున తెలి పారు. అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పంచుకున్న విశేషాలు. → ‘కుబేర’ లాంటి మంచి కథలు రావాలంటే స్టార్ హీరోలు కలిసి పని చేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు కలిసి చేశాను. గతంలో నాన్నగారు(ఏఎన్ఆర్), ఎన్టీఆర్, కృష్ణ, శోభన్బాబు గార్లు... ఇలా చాలా మంది కలిసి మల్టీస్టారర్ సినిమాలు ఎన్నో చేశారు. పైగా శేఖర్ కమ్ములగారితో పని చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ‘ఆనంద్’ సినిమా నుంచి ఆయన ఏంటో, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఆయన కథల్లో సామాజిక సంబంధిత అంశాలు ఉంటాయి. అందుకే శేఖర్గారి సినిమాలు నాకు బాగా ఇష్టం. తన సినిమాల్లో సామాజిక అంశాలతో పాటు ఇతర వాణిజ్య అంశాలు కూడా ఉంటాయి. → ‘కుబేర’లో మంచి యునిక్ పాయింట్ ఉంది. ప్రస్తుత సమాజానికి ఆ పాయింట్ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. అవన్నీ కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాలో మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. బిలియనీర్, మధ్యతరగతి, బిలో పావర్టీ లైన్... ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. వైవిధ్యమైన ఈ కథలో రెగ్యులర్ స్క్రీన్ ప్లే ఉండదు... రొటీన్ క్యారెక్టర్స్ కనిపించవు. ఇందులో ఏ పాత్ర కూడా హీరో, హీరోయిన్ అనడానికి లేదు. తెరపై మేము కాకుండా ప్రేక్షకులకు అన్నీ పాత్రలే కనిపిస్తాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం కావాలి. → ఈ సినిమాలో నా ఇమేజ్కి తగ్గట్టు స్క్రిప్ట్లో శేఖర్గారు ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు.. మార్చితే కథ మారిపోతుంది. మా ఫ్యామిలీలో దాదాపుగా అందరూ శేఖర్గారితో పని చేశారు. ‘కుబేర’లో చేయడానికి ఆయన వర్కింగ్ స్టైల్ గురించి నాగ చైతన్యని అడిగాను. ఎందుకంటే రీసెంట్గా తను ‘లవ్ స్టోరీ’ మూవీ చేశాడు కాబట్టి. ‘శేఖర్గారి వర్కింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు’ అని చె ప్పాడు. ‘కుబేర’లో నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్... అన్నీ కూడా కొత్తగా శేఖర్గారి శైలిలో ఉంటాయి. తమిళ్ వెర్షన్లోనూ నేనే డబ్బింగ్ చె ప్పాను. → ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు.. అద్భుతంగా నటించాడు. సెట్స్లో మా బాండింగ్ చాలా బాగుండేది. షాట్ గ్యాప్లో సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఈ చిత్రంలో రష్మికా మందన్న అద్భుతంగా నటించింది. ఫైనల్ కాపీ చూశాక, ఫోన్ చేసి ‘కుబేర’లో నువ్వే స్టార్’ అని చె ప్పాను.. తను చాలా సంతోషపడింది. సునీల్ నారంగ్, రామ్మోహన్గార్లు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా చాలా ΄్యాషన్తో నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి చాలా ముఖ్యం. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తాయి. కెమెరామేన్ నికేత్ బొమ్మరెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. → ప్రస్తుతం చాలా మంది పాన్ ఇండియా సినిమా అంటూ నాలుగైదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్ వేసుకుంటున్నారు. నిజం చె ప్పాలంటే పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలూ దానికి సరిపోవు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్, బిగ్ ప్రొడక్షన్ హౌస్ కలిసి పెద్ద సినిమా చేసినప్పటికీ కథలో విషయం లేకుంటే ఉపయోగం లేదు. ఈ మధ్య అలాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. కానీ ‘కోర్ట్’ లాంటి చిన్న సినిమా సూపర్ హిట్ అయింది. నా దృష్టిలో ప్రేక్షకులు ఆదరించేదే పెద్ద సినిమా. అలాగే మంచి కథ ఉన్నదే పెద్ద సినిమా. → నా కెరీర్లో వందో సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్తో చేస్తున్నాను. ‘కింగ్ 100’ అని వర్కింగ్ టైటిల్ పెట్టాం. ఈ చిత్రాన్ని మా అన్నపూర్ణ స్టూడియోస్పై నిర్మిస్తాం. అయితే వందో సినిమా వంద కోట్ల బడ్జెట్తో రూ పొందనుందనే వార్తల్లో నిజం లేదు. అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంలో నేను నటించడం లేదు. నేను, నాగచైతన్య, అఖిల్ కలిసి పూర్తి స్థాయిలో ఓ సినిమా చేయాలని మా అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడప్పుడే అలాంటి సినిమా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మా ముగ్గురికి సరిపడే కథతో ఇప్పటివరకూ ఎవరూ నన్ను కలవలేదు. → నటుడిగా దాదాపు నలభై ఏళ్ల కెరీర్ నాది. ఎన్నో పాత్రలు చేశాను. అయితే ఫలానా పాత్ర చేయాలనే కల నాకు లేదు. నాకు నచ్చిన, వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ వెళుతుంటాను. రజనీకాంత్గారి ‘కూలీ’ సినిమాలో ప్రాపర్ విలన్గా కనిపిస్తాను. లోకేశ్ కనగరాజ్ చక్కగా తీశారు. అయితే ‘కూలీ’లోలా మళ్లీ విలన్ పాత్ర చేయను. క్యారెక్టర్ నచ్చితే కామెడీ కూడా చేస్తాను. ఏం చేసినా నాకు కొత్తగా అనిపించాలి. నేను నటించిన ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నాం. 4కే పనులు పూర్తయ్యాయి. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతోంది. ఒక రీల్ చూశాను.. క్వాలిటీ అద్భుతంగా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లలో సినిమాకి చర్చలు జరిగాయి. అదే విధంగా ‘బ్రహ్మాస్త్ర 2’ లోనూ నా పాత్ర ఉంటుందని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చె ప్పారు.

కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమాను, స్టాండప్ కామెడీని ఆపలేం
న్యూఢిల్లీ: కమల్ హాసన్ స్టారర్ ‘థగ్ లైఫ్’సినిమా విడుదలను అడ్డుకునే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ లేదా కవితా గోష్టి వంటి వాటిని ఆపలేమని స్పష్టం చేసింది. ‘మన దేశంలో మనోభావాలను దెబ్బతీసే ఘటనలకు ముగింపు కనిపించడం లేదు. స్టాండప్ కమెడియన్ ఏదో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయని, విధ్వంసం, నిరసనలకు దిగుతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఏంటి దీనర్థం? నిరసనలు చేపట్టారనే కారణంతో సినిమా, స్టాండప్ కామెడీ షో, కవితా గోష్టి వంటి వాటిని ఆపేయాలా?’అంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ల ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో విడుదల ఆగిన ‘థగ్ లైఫ్’ను కర్ణాటకలో ప్రదర్శించేందుకు ఆదేశాలివ్వాలంటూ మహేశ్ రెడ్డి వేసిన పిల్పై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన సమయంలో తగు భద్రత కల్పిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన హామీకి ధర్మాసనం అంగీకరించింది. ఏ వ్యక్తి గానీ, సమూహం గానీ సినిమా ప్రదర్శనకు అవరోధం కల్పించినా, నష్టపరిచినా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నామంది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలంటూ కమల్ హాసన్ను కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(కేఎఫ్సీసీ) కోరడంపై ధర్మాసనం..‘దీనికి మేం అస్సలు అంగీకరించం. ఒక అభిప్రాయం కారణంగా సినిమాను అడ్డుకుంటారా? స్టాండప్ కామెడీని, కవితా పఠాన్ని ఆపేస్తారా?’అని ప్రశ్నించింది. అయితే, తమకు కొన్ని సమూహాల నుంచి బెదిరింపులు వచ్చినందునే కమల్ను క్షమాపణ చెప్పాలని ఒక లేఖ ద్వారానే కోరామని, అంతే తప్ప కమల్ను బెదిరించలేదని కేఎఫ్సీసీ వివరించింది. బెదిరింపుల విషయాన్ని పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని కేఎఫ్సీసీని ధర్మాసనం ప్రశ్నించింది. సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ వచ్చిన బెదిరింపుల విషయం తెలపగా కేఎఫ్సీసీ స్పందించలేదని మహేశ్ రెడ్డి తర ఫు లాయర్ తెలిపారు. బెదిరించిన వారిపై చర్యలు తప్పక తీసుకుంటామని రాష్ట్ర ప్రభు త్వ లాయర్ హామీ ఇచ్చారు. కన్నడ సాహిత్య పరిషత్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ నూలి వాదనలు వినిపించారు. కమల్ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కమల్ క్షమాపణ చెబితేనే రాష్ట్రంలో ఆ సినిమా ప్రదర్శన వీలవుతుందని, లేకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘అంటే..థగ్ లైఫ్ అనధికార బ్యాన్ను, థియేటర్లను బుగ్గిపాలు చేసేందుకు మీరు మద్దతిస్తున్నారా?’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘క్షమాపణ చెప్పడం ఏమిటి? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరు. మనోభావాలు గాయపడితే పరువునష్టం కేసు వేయండి..!’అని ధర్మాసనం పేర్కొంది. హింసకు పాల్పడే వారిని తాము ప్రోత్సహించమంటూ కన్నడ సంస్థ తరఫు లాయర్ పేర్కొనగా ‘సినిమా విడుదలను కూడా మీరు అడ్డుకోరాదు’అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
సాహిత్యమే పిల్లలకు మంచి చె ప్పాలి
మా స్కూల్ మాకే ఉంచాలి
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడింతలు
డిజిటల్ అరెస్ట్ల నిరోధానికి పరిష్కారాలు చూడండి
ఇంధన పరివర్తనంలో భారత్కు 71వ ర్యాంక్
వెండి, ఇత్తడి కళాకృతులు.. పెయింటింగ్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమాను, స్టాండప్ కామెడీని ఆపలేం
విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభం
టార్గెట్ ‘ఫోర్డో’
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
నాకు పునర్జన్మనిచ్చింది వారే.. లైవ్ లో కన్నీరు పెట్టుకున్న కొమ్మినేని
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
సాహిత్యమే పిల్లలకు మంచి చె ప్పాలి
మా స్కూల్ మాకే ఉంచాలి
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడింతలు
డిజిటల్ అరెస్ట్ల నిరోధానికి పరిష్కారాలు చూడండి
ఇంధన పరివర్తనంలో భారత్కు 71వ ర్యాంక్
వెండి, ఇత్తడి కళాకృతులు.. పెయింటింగ్లు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. సినిమాను, స్టాండప్ కామెడీని ఆపలేం
విద్యార్థి వీసాల ప్రక్రియ ప్రారంభం
టార్గెట్ ‘ఫోర్డో’
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ!
ఈ రాశి వారికి పనులలో విజయం.. ఆస్తి లాభం
నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్
SBI క్రెడిట్ కార్డు కొత్త రూల్.. జూలై 15 నుంచి..
సినిమా

ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా! తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.దూరం పెరిగింది..సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ (Jr NTR)ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఇలా చెప్పారు. ' జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం' అని ఆమె చెప్పారు.(చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు)తారక్ మనసులో ఏముంది?ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు.' రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్లోకి తారక్ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పడు కూడా చర్చించలేదు' అన్నారు.తారక్తో ఇబ్బంది లేదుగతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ తన పిల్లలతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.చదవండి: వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్

అఖిల్ వెడ్డింగ్.. శోభితను అలా చూస్తుండిపోయిన నాగచైతన్య!
ఏడాది వ్యవధిలోనే అక్కినేని వారి ఇంట రెండు పెళ్లిళ్లు జరిగాయి. గతేడాది నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడారు. ఆ తర్వాత ఇటీవలే అఖిల్ అక్కినేని సైతం ఓ ఇంటివాడయ్యారు. గతేడాది తన ప్రియురాలు జైనాబ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్ 6న తన మెడలో మూడు ముళ్లు వేశారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్కు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో నాగచైతన్య- శోభిత పాల్గొని సందడి చేశారు. తమ్ముడి వెడ్డింగ్లో చైతూ- శోభిత స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు.తాజాగా వీరిద్దరి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పెళ్లి వేడుకలో శోభిత ధూలిపాళ్ల దోశ తింటూ ఉండగా.. పక్కనే నాగచైతన్య తన సతీమణి వైపే అలానే చూస్తూ ఉండిపోయారు. ఈ వెడ్డింగ్లో తన భార్యతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు చైతూ. ఈ వీడియోను ప్రముఖ కేటరింగ్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అఖిల్ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో అఖిల్- జైనాబ్ జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి.

బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే గూగుల్పే..
బిగ్బాస్ షోకు రెండుసార్లు వెళ్లొచ్చాడు గౌతమ్ కృష్ణ (Gautham Krishna). మొదటిసారి ఫినాలే వరకు చేరకుండానే ఎలిమినేట్ అయ్యాడు. రెండోసారి మాత్రం వైల్డ్ కార్డ్లా వెళ్లి వైల్డ్ ఫైర్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అతడు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్ తన బిగ్బాస్ సంపాదనను బయటపెట్టాడు. బిగ్బాస్ షోలో నేను పది వారాలున్నాను. అందుకుగానూ నేను రూ.30 లక్షలు సంపాదించాను. నా సంపాదనలో కొంత భాగం సమాజ సేవకు ఉపయోగించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకెప్పుడు వచ్చిందంటే.. 25 ఏళ్ల మురళీనాయక్ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు.స్టేజీపై ఆర్థిక సాయంమరి నేనేం చేశాను? అని ఆలోచించుకున్నాను. అందుకే సమవర్తి అనే ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా సంపాదనలో సగం ఈ ట్రస్టుకే ఇస్తాను. అలా బిగ్బాస్ ద్వారా సంపాదించినదాంట్లో సగం అంటే రూ.15 లక్షలు ఈ సంస్థ ఖాతాలో వేస్తున్నాను. మొదటగా మురళీ నాయక్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను చచ్చేలోపు లక్ష మందికి సాయం చేయాలన్నదే నా కోరిక. నేను నా మాట నిలబెట్టుకోకపోతే నన్ను ఏకిపారేయండి అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే మురళీ నాయక్ కుటుంబానికి స్టేజీపై లక్ష రూపాయలు గూగుల్ పే చేశాడు. సోలోబాయ్ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు

రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు
కొన్ని ప్రదేశాలు నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటాయి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకూ అలాంటి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని, వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది.హోటల్లో దెయ్యాలు?ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు, తాప్సీ (Taapsee Pannu), రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట! గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను. అవంటే నాకు చాలా భయం. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది. ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్ధాలు వినిపించాయి. దెయ్యంతో పోరాడలేనుభయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా (Raashii Khanna) కూడా.. అదే హోటల్లో బస చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేశారంది. ఆ గదిలో కచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే, తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.కీరవాణిదీ అదే అభిప్రాయంఅలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి కూడా చంద్రముఖి 2 సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కీరవాణి మాట్లాడుతూ.. అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది? అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) పేరే వస్తుంది. అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో ఏవో శబ్ధాలు వినిపించాయి అని చెప్పాడు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

‘అప్పటికప్పుడు ఆటను మార్చుకోవాలి’
లీడ్స్: ఇంగ్లండ్ గడ్డపై భారత్ మెరుగైన ఫలితం సాధించాలంటే బ్యాటర్లు ఒకే తరహా శైలికి కట్టుబడి ఉండరాదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ మైదానాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయని, దానికి అనుగుణంగా తమ బ్యాటింగ్ ను కూడా మార్చుకోవాలని అతను సూచించాడు. ‘నా ఆట ఇలాగే ఉంటుంది. నేను ఇలాగే ఆడతాను అనే వన్వే ట్రాఫిక్ ఇంగ్లండ్లో పనికి రాదు. ఇక్కడి పరిస్థితులను కొద్దిగా గౌరవించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా తమ ఆటను మార్చుకోవాలనే ఆలోచనలు మనసులో సాగుతూనే ఉండాలి. అప్పుటే ఆటపై పట్టు చిక్కి అంతా చక్కబడుతుంది. ఎప్పుడు దూకుడు పెంచాలో, ఎప్పుడు డిఫెన్స్ ఆడాలో తెలియాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని సచిన్ వివరించాడు. అయితే ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లలో ఆడిన అనుభవం జట్టులో అందరికీ ఉందని, వాటినుంచి నేర్చుకున్న విషయాలను మెరుగుపర్చుకుంటే ఇక్కడా మంచి ఫలితాలు వస్తాయని అతను అన్నాడు. భారత కెప్టెన్గా తొలి సిరీస్ ఆడనున్న శుబ్మన్ గిల్కు కూడా సచిన్ పలు సలహాలు ఇచ్చాడు. అతను బయటి విషయాలను పట్టించుకోరాదని, తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని దిగ్గజ బ్యాటర్ సూచించాడు. ‘కెప్టెన్గా గిల్కు కొంత సమయం ఇవ్వడంతో పాటు అందరూ అతనికి అండగా కూడా నిలవాలి. భారత కెప్టెన్ అంటే తీవ్రమైన ఒత్తిడి ఉండే బాధ్యత. ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అభిప్రాయాలు చెప్పే హక్కు బయటి నుంచి ఎవరికైనా ఉంటుంది. ఇవన్నీ గిల్ పట్టించుకోకూడదు. డ్రెస్సింగ్ రూమ్లో చర్చించిన వ్యూహాలను మైదానంలో అమలయ్యేలా చూడాలి’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’ ఆవిష్కరణ..భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్కు ‘అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ’గా పేరు పెట్టారు. ఈ ట్రోఫీని గురువారం ఆవిష్కరించారు. అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్లుగా సచిన్ (200), అండర్సన్ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ (15,921) పేరిట ఉండగా... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంతో (704 వికెట్లు) అండర్సన్ కెరీర్ ముగించాడు. వీరిద్దరి పేర్లను ట్రోఫీకి పెట్టి ఈసీబీ, బీసీసీఐ సముచితంగా గౌరవించాయి. మరోవైపు ఇప్పటి వరకు ట్రోఫీకి ‘పటౌడీ’ పేరు ఉండేది. ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టు కెపె్టన్కు ‘పటౌడీ మెడల్’ అందజేస్తారు. పేరు మార్పు విషయంలో తాను పటౌడీ కుటుంబంతో స్వయంగా మాట్లాడానని ... ఏదో రూపంలో వారి గౌరవం కొనసాగేలా తాను ప్రయత్నిస్తానని వారితో చెప్పినట్లు సచిన్ వెల్లడించాడు.

ఇంగ్లండ్- భారత్ టెస్టు సిరీస్.. డేంజర్లో సచిన్, కోహ్లి రికార్డులు
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రంగం సిద్దమైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనున్న ఈ సిరీస్.. శుక్రవారం(జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్-ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి.అయితే ఈ సిరీస్కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ ఇంగ్లండ్ గ్రేట్ బ్యాటర్.. భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డులపై కన్నేశాడు.మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ తన కెరీర్లో ఇంగ్లండ్పై 16 టెస్టు ఫిప్టీలు చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 13 హాఫ్ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో జూరూట్(11 హాఫ్ సెంచరీలు) ఉన్నాడు. ఈ క్రమంలో రూట్ మరో మూడు హాఫ్ సెంచరీలు చేస్తే.. సచిన్ అధిగమిస్తాడు. అదేవిధంగా ఆరు హాఫ్ సెంచరీలు చేస్తే సునీల్ గవాస్కర్ ఆల్టైమ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.చరిత్రకు అడుగు దూరంలో..భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి ఇప్పటివరకు ఇంగ్లండ్పై మూడు ఫార్మాట్లలో 4036 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్(3990) ఉన్నాడు. ఈ లిస్ట్లో మూడో స్ధానంలో జో రూట్(3858) ఉన్నాడు. ఇప్పుడు రూట్ 133 పరుగులు చేస్తే సచిన్ను, 179 పరుగులు సాధిస్తే విరాట్ను అధిగమించి అగ్రస్ధానానికి చేరుకుంటాడు.కాగా భారత్పై జో రూట్కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు రూట్ టీమిండియాపై రూట్ 28 సార్లు (13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు) ఏభైకి పైగా పరుగులు చేశాడు. రూట్ మరో ఐదు అర్ధ శతకాలు చేస్తే సచిన్, కోహ్లి(32)ను దాటేస్తాడు.చదవండి: Mohammed Siraj: బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్లో లగ్జరీ రెస్టారెంట్

బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్లో లగ్జరీ రెస్టారెంట్
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్లోని బంజారా హిల్స్(రోడ్ నంబర్ 3)లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్ను సిరాజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్లో అందించనున్నట్లు తెలిపాడు.ఈ ఫుడ్ బిజినెస్లో అతడి సోదరుడు భాగస్వామి ఉన్నట్లు సిరాజ్ మియా పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభ తేదీ ఎప్పుడో ఇంకా సిరాజ్ వెల్లడించలేదు. కాగా భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. బెంగళూరు, ముంబై, పుణే, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నద్దమవుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భారత బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.చదవండి: నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్

నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్
లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గిల్ సమాధనమిచ్చాడు. భారత కెప్టెన్గా తను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్పై పడకుండా చూసుకుంటాని అతడు చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చతో బ్యాటింగ్ చేశానో, ఇకపై కూడా అదే కొనసాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువగా ఆలోచించకుండా నా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్లో బెస్ట్ బ్యాటర్గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటికే గంభీర్ భాయ్, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు.భయపెడుతున్న గిల్ రికార్డు..శుబ్మన్ గిల్ తన కెరీర్లో 32 టెస్టులు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 514 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్లో అయితే అతడి ప్రదర్శన మరి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన శుబ్మన్.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’
బిజినెస్

బడా ఐపీవోలు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇష్యూ ద్వారా ఎన్బీఎఫ్సీ మొత్తం రూ. 12,500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ప్రస్తుతం హెచ్డీబీ ఫైనాన్షియల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా బిజినెస్ వృద్ధికి వీలుగా రుణాల విడుదల తదితర భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. అప్పర్ లేయర్లో ఉన్న ఎన్బీఎఫ్సీలు మూడేళ్లలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కావలసి ఉన్నట్లు 2022 అక్టోబర్లో ఆర్బీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కంపెనీ ఐపీవోకు వస్తోంది. కాగా.. గతేడాది ఇందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు ఆమోదముద్ర వేసింది. కల్పతరు @ రూ. 387–414 ఈ నెల 24–26 మధ్య రియల్టీ కంపెనీ ఐపీవోముంబై, హైదరాబాద్, నోయిడాలో ప్రాజెక్టులురియల్టీ రంగ కంపెనీ కల్పతరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 387–414 చొప్పున ప్రకటించింది. దీనిలో భాగంగా రూ. 1,590 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా విద్యుత్ ప్రసారం, పంపిణీ దిగ్గజం కల్పతరు గ్రూప్ కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది. ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ విలువ రూ. 8,500 కోట్లుగా నమోదయ్యే వీలుంది. ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజన్(ఎంఎంఆర్)తో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ పుణే(మహారాష్ట్ర), హైదరాబాద్(తెలంగాణ), నోయిడా(ఉత్తరప్రదేశ్)లోనూ ప్రాజెక్టులు చేపడుతోంది. లగ్జరీ, ప్రీమియం, మధ్యాదాయ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 36 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.ఎలెన్బరీ @ రూ. 380–400 ఈ నెల 24–26 మధ్య పబ్లిక్ ఇష్యూ రూ. 853 కోట్ల సమీకరణకు రెడీవిభిన్న తరహా గ్యాస్ల తయారీ కంపెనీ ఎలెన్బరీ ఇండ్రస్టియల్ గ్యాసెస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభంకానుంది. 26న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 380–400 చొప్పున ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు దాదాపు రూ. 453 కోట్ల విలువైన 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా కంపెనీ మొత్తం రూ. 853 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 37 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో రూ. 210 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 105 కోట్లు పశి్చమబెంగాల్లోని ఉలుబేరియా–2 ప్లాంటులో సెపరేషన్ యూనిట్ ఏర్పాటుకు, మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ విభిన్న ఇండస్ట్రియల్ గ్యాస్ల తయారీ, సరఫరాలను చేపడుతోంది. డ్రై ఐస్, సింథటిక్ ఎయిర్, ఫైర్ఫైటింగ్ గ్యాస్, మెడికల్ ఆక్సిజన్, ఎల్పీజీ, వెల్డింగ్ మిక్సర్స్సహా పలు స్పెషాలిటీ గ్యాస్లను అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 312 కోట్లను అధిగమించగా.. నికర లాభం 84 శాతం జంప్చేసి రూ. 83 కోట్లను తాకింది.

బ్యాంక్ బ్యాలెన్స్.. బ్యాడ్ న్యూస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీనికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లతో సహా ప్రధాన బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లోని బ్యాలెన్స్పై చెల్లించే వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో పొదుపు ఖాతాదారులు తక్కువ రాబడిని చూస్తారు. ఈ ఏడాది క్యుములేటివ్ రేటు కోత ఇప్పుడు 1 శాతంగా ఉంది. పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకే విధమైన తక్కువ రేట్ల విధానానికి మారడంతో డిపాజిటర్లపై ప్రభావం పడుతోంది.వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన పొదుపు ఖాతా వడ్డీ రేటును జూన్ 15 నుండి అన్ని బ్యాలెన్స్లకు సంవత్సరానికి 2.5 శాతానికి సవరించింది. గతంలో రూ.10 కోట్ల లోపు బ్యాలెన్స్లపై 2.7 శాతం, రూ.10 కోట్లు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3 శాతం వడ్డీని ఆఫర్ చేసేది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పొదుపు రేట్లను జూన్ 10 నుండి ఫ్లాట్ 2.75 శాతానికి సర్దుబాటు చేసింది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్లపై 2.75 శాతం, రూ.50 లక్షలు అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3.25 శాతం వడ్డీని ఆఫర్ చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్ఐసీఐసీఐ బ్యాంక్ కూడా తన వడ్డీ రేటును 2.75 శాతానికి సవరించింది. ఇది జూన్ 12 నుండి వర్తిస్తుంది. గతంలో ఇది రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్లపై 2.75 శాతం, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్లపై 3.25 శాతం వడ్డీని అందించేది.రాబడి పెంచుకోండి..యువత బ్యాంక్ బ్యాలెన్స్పైనే దృష్టి పెట్టకుండా దాన్ని రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల వైపు మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. పొదుపు ఖాతా మీ డబ్బును సురక్షితంగా ఉంచుతుంది. కానీ ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాని విలువను తినేస్తుంది. మరోవైపు, పెట్టుబడి మీ డబ్బును కాంపౌండింగ్ శక్తి ద్వారా కాలక్రమేణా పెంచుతుంది. ఎక్కువ వడ్డీనిచ్చే పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ లు లేదా స్టాక్స్ లోని ఫ్రాక్షనల్ షేర్లతో చిన్నగా ప్రారంభించవచ్చు. పెట్టుబడి పెట్టడానికి మీరు ధనవంతులు కానవసరం లేదు. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ ఆర్థిక పునాది బలంగా మారుతుంది.

టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకొచ్చిన అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీని ఐటీ ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) వ్యతిరేకిస్తోంది. కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తూ ఉద్యోగులను తగ్గించుకునేందుకే టీసీఎస్ ఈ కొత్త పాలసీని తీసుకొచ్చిందంటూ ఏఐటీఈయూ అభివర్ణించింది.టీసీఎస్ అప్డేటెడ్ టాలెంట్ డిప్లాయ్మెంట్ పాలసీలో ఇకపై ప్రతి ఉద్యోగి ఏడాదికి 225 బిల్ల్డ్ బిజినెస్ డేస్ పనిచేసి ఉండాలన్న నిబంధన తీసుకొచ్చింది. పని లేకుండా బెంచ్ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. జూన్ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చినట్లు ఉద్యోగులకు యాజమాన్యం తెలియజేసింది. ఆర్ఎంజీ నుంచి తగిన బిల్లబిలిటీ ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఉద్యోగులకే బదలాయించాలనే దురుద్దేశం కూడా ఈ విధానంలో ఉంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనుకున్నప్పుడల్లా కార్మిక వ్యతిరేక విధానమైన పనితీరు మెరుగుదల ప్రణాళిక (పీఐపీ) ద్వారా టీసీఎస్ యాజమాన్యం చేసే ప్రయత్నం ఇది" అని ఏఐటీఈయూ తెలిపింది.విడుదల తేదీకి ముందే కేటాయింపు కోసం రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ తో క్రియాశీలకంగా వ్యవహరించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం ఉద్యోగుల ప్రాథమిక బాధ్యత అని ఈ విధానం నొక్కి చెబుతోంది. ఫ్రెషర్స్ కూడా పని కేటాయింపు కోసం చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు డిప్లాయిమెంట్ పాలసీని పాటించకపోతే చర్యలు తప్పవని కంపెనీ హెచ్చరిస్తోంది. "ఈ విధానం నిబంధనలను పాటించడంలో ఉద్యోగి విఫలమైనట్లయితే, సంస్థ క్రమశిక్షణా చర్యల ఫ్రేమ్వర్క్ ప్రకారం సేవల నిలిపివేతతో సహా క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కు సంస్థకు ఉంది" అని ఉద్యోగులకు పంపిన పాలసీ డాక్యుమెంట్ పేర్కొంది.ఈ చర్యను వ్యతిరేకిస్తున్న యూనియన్ "ఉద్యోగులకు తగినంత బిల్లబిలిటీని నిర్ధారించడానికి టీసీఎస్ ఆర్ఎంజీ బాధ్యత వహిస్తుంది. కార్మికుల శ్రమను దోపిడీ చేసి లాభాలు, సంపదను కాపాడుకోవడంపై మాత్రమే దృష్టి పెడుతూ కార్మికుల హక్కులను కాలరాసే ఎంఎన్సీల విధానాలను ఏఐఐటీఈయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’ అని పేర్కొంది.

ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్..
దేశంలోనే అగ్రగామి టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. ఈ టెలికాం ఆపరేటర్కు 47 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. కొంత మంది యూజర్లకు నెలా నెలా రీచార్జ్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఒకే సారి దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తుంటారు. ఇటువంటి వినియోగదారుల కోసం ఇప్పుడు జియో పోర్ట్ ఫోలియోలో ఒక ప్లాన్ కూడా ఉంది. ఇది ఒక రీఛార్జ్ తో మీ జియో సిమమ్ను 365 రోజులు యాక్టివ్ గా ఉంచుతుంది.365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ఇదే.. రీఛార్జ్ ప్లాన్లు ఖరీదైనవిగా మారినప్పటి నుండి మొబైల్ వినియోగదారులలో లాంగ్ వాలిడిటీ ఉన్న ప్లాన్లకు డిమాండ్ వేగంగా పెరిగింది. ఇప్పుడు ఒక్క ప్లాన్ తీసుకోవడం ద్వారా ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ నుంచి విముక్తి పొందవచ్చు. జియో అందిస్తున్న 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధర రూ.3599. ఈ ప్లాన్తో ఏయే ప్రయోజనాల లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.3599 ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీని అందిస్తోంది. 365 రోజుల పాటు అన్ని నెట్వర్క్లకు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఉచిత కాలింగ్తోతో పాటు అన్ని నెట్వర్క్లకు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఇంటర్నెట్ వాడితే, తక్కువ డేటా లిమిట్ ఉన్న ప్లాన్ సరిపోకపోతే, జియో ఈ వార్షిక ప్లాన్ మీ టెన్షన్ కు ముగింపు పలకబోతోంది. ఈ రూ.3599 ప్లాన్లో మీకు 912 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఇందులో అర్హులైన కస్టమర్లకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది.👉 జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీఈ వార్షిక ప్లాన్లో రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో 90 రోజుల పాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా, 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్పేస్ కూడా ఈ ప్లాన్లో లభిస్తుంది. మీరు టీవీ ఛానల్స్ చూస్తున్నట్లయితే, జియో టీవీ ఉచిత సదుపాయం కూడా ఇందులో ఉంది.
ఫ్యామిలీ

భవసాగరం అంటే..
మనలోని ఏడుపొరలలోని భవసాగరం, నాభి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ధర్మ సంరక్షణలో మనం ఆనందాన్ని పొందుతాం. మనం ఎవరితోనైనా మంచిగా ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. ఈ ధర్మ బద్ధత అనేది మనలోని భవసాగరం పరిశుభ్రంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఉదయం 4 గంటలకే నిద్రలేచి పెద్దగా హారతిపాటలు పాడుతూ, గంధంచెక్క అరగదీస్తూ పెద్ద పెద్ద స్తోత్రాలు పాడుతూ స్నానమాచరించి ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం చేసినంత మాత్రాన అది సదాచార పరాయణత్వం కాక పోవచ్చు. పిల్లల్ని నిద్రపుచ్చి తల్లి బహుశా ఎప్పుడో ఆలస్యంగా పడుకుని ఉండవచ్చు. ఈ ధర్మం అనేది అంతర్గతమైనది. ఉదాహరణకు మీరు ఏదైనా ఎవరికైనా దానం చేయాలనుకున్నారనుకోండి. అది మీకు, పరమాత్మునికి మధ్య విషయం మాత్రమే. దానిని బాహ్యంగా ప్రకటించ వలసిన పని లేదు. ధర్మమంటే మిమ్మల్ని మీరు అంతర్ముఖంగా పరిశుభ్రపరచుకోవటం ముఖ్యం. అంతే కానీ వేరెవరినో కాదు. మీ హృదయాన్నుండి వచ్చే ఆ ధర్మానందాన్ని, ఆ రసాన్ని మీరే ఆస్వాదించాలి. మీ పవిత్రతను మీరే ఆస్వాదిస్తారు. ఆనందిస్తారు. ధర్మం అనేది మీ హృదయంలో ఎంతవరకు ఉన్నదనేది ముఖ్యం. అనాహత చక్రం ఇది చాల ముఖ్యమైన చక్రం. అదే హదయ(అనాహత) చక్రం ‘‘ ఉదార చరితానామ్ వసుధైక కుటుంబం’’ అంటే ఉదార స్వభావులైన వారు ప్రపంచమంతా వారి కుటుంబమే అని భావిస్తారు. ప్రతి ఒక్కరిపట్ల ప్రేమ ప్రవహిస్తూంటుంది. ప్రతి ఒక్కరి సమస్య తమ సమస్యగానే భావిస్తారు. ప్రతి ఒక్కరికీ తానొక తల్లిగా ఉండాలి అని భావించుకోవటం అనే గుణం మధ్య హృదయం నుండి వస్తుంది. ప్రప్రథమంగా హృదయ చక్రం విశిష్టత భద్రత. మీలోని భద్రతా భావాన్ని మీరు అనుభూతి చెందటం. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఆ భద్రతాభావాన్ని అనుభూతి చెందగలరు.మీ సంపూర్ణ భద్రత అనేది మీలోని ఆత్మ మాత్రమే. అంతేగాని వేరే ఏవీ ముఖ్యం కావు. మీరు అలాంటి భద్రతాభావం కలిగి ఉన్నవారైతే మీ పిల్లలు కూడా ఆ భద్రత అనేది తమలోనే ఉన్నదని గ్రహిస్తారు. అటువంటి పిల్లలు నిజమైన ధైర్యవంతులుగా ఉంటారు. చదవండి: Murugan పళని మురుగన్కి ప్రణామాలు!మీలోని మీ భద్రతాభావాన్ని మీరు ఆస్వాదించండి. భద్రతాభావం వలన కలిగే ఆనందమే మిమ్మల్ని అధ్యాత్మిక లోతులకు తీసుకుని వెళుతుంది. ఎవరిలో అయితే భగవంతుడు ఉంటాడో, ఎవరికైతే భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయో వారికి అంతకన్నా ఇంకేమి కావాలి? ఎందుకంటే భగవంతుడు సర్వ శక్తిమంతుడు. ఎవ్వరిశక్తీ ఆ భగవంతుని శక్తి కన్నా ఎక్కువకాదు. కాబట్టి మొదటగా మీ మీరు విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ విశ్వాసాన్ని మీ హృదయ చక్రంలో పదిల పరచుకోండి. ఆ విశ్వాసమే మీకు రక్షణ ఆనందాన్నిస్తుంది. ప్రపంచంలోని అభద్రతా భావాలన్నింటికీ విశ్వాసమే సమాధానం. మన హృదయంలో జగదంబ అయిన దుర్గామాతను స్థిరపరచుకోవాలి. – డా. పి. రాకేష్(మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనం ఆధారంగా) ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత

బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!
చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లల్నిఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్ వీడియో వైరల్ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనరాయ్. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. "Vandana Rai Karkala, a teacher & a social media sensation"She is a teacher in Karkala, Udupi district. Her teaching methods are integrated with music & nature, rooted in our culture. No wonder her videos have gone viral with millions of views.Youtube: https://t.co/zWQbi6y3Xa pic.twitter.com/Rc3zbBUppQ— Girish Alva (@girishalva) April 24, 2023(చదవండి: రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!)

మీ పిల్లలది మంచి స్కూలేనా? ఇవన్నీ చెక్ చేశారా?
స్కూల్ ఫీజ్ ఎంత కడుతున్నారో మీకు తెలుసుగాని ఆ కట్టిన డబ్బులోని ప్రతి పైసాకు సరి పడే విధంగా అక్కడ పాఠాలు చెబుతున్నారా? సౌకర్యాలు ఉన్నాయా? టీచర్లు యోగ్యులేనా? విద్యావిధానంలో వారి తాత్త్వికత ఏమిటి? స్టూడెంట్–టీచర్ మధ్య అనుబంధం ఉందా? ఆటలు ఉన్నాయా? విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం నేటి నుంచి అవగాహన కథనాలు... ‘మా పిల్లలు చాలా పెద్ద స్కూల్లో చదువుతున్నారు’ అని పేరెంట్స్ అనుకున్నంత మాత్రాన అది మంచి స్కూల్ అయిపోదు. ‘ఏదో చిన్న స్కూల్లో చదువుతున్నారులే’ అన్నంత మాత్రాన అది చెడ్డ స్కూల్ అయిపోదు. చాలా ఎక్కువ ఫీజు ఉన్నది చాలా మంచి స్కూల్ అనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. దగ్గరగా ఉందనో, ట్రాన్స్పోర్ట్ ఉందనో, అందరూ అక్కడే చదువుతున్నారనో... రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను ఎంచిన స్కూళ్లలో చేరుస్తుంటారు. చేర్చి, మళ్లీ స్కూల్ వైపే చూడకుండా క్లాసుల మీద క్లాసులు చదివిస్తుంటారు. మన పిల్లలకు వచ్చే మార్కులను బట్టే అది మంచి స్కూల్ అనుకునేవారు కూడా ఉంటారు. అంటే పిల్లలకు నూటికి 90కి పైన వస్తున్నంత కాలం ఆ స్కూల్ ఎలా ఉన్నా వారికి పర్వాలేదు. కాని ఇలాంటి అంచనాలన్నింటితో ఒక స్కూల్ని ఎంచడం విద్యార్థికి ఏదో ఒక మేర నష్టం చేయడమే అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: టెంట్ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి?ఒక స్కూల్ ఎప్పుడు మంచి స్కూల్ అవుతుంది అనే దానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. పేపర్లో ఆ స్కూల్ విద్యార్థుల మార్కుల కనిపించడం వల్ల మాత్రమే మంచి స్కూల్ అనుకోక నిజంగా పిల్లలు సరైన స్కూల్లో చేరాలంటే, కొనసాగాలంటే తల్లిదండ్రులు ఆ స్కూల్ను ఈ ప్రమాణాల రీత్యా పరిశీలించాల్సి ఉంటుంది.విద్యా తాత్త్వికత ఎలాంటిది?ప్రతి మంచి స్కూల్కు ఒక తాత్త్వికత ఉంటుంది. తమ బడిలో చదివిన పిల్లల వికాసం ఏ రీతిన సాగాలో ఆ స్కూల్ ఏర్పాటు సమయంలోనే నిర్వచనం చేసుకుని ఉంటారు. భారతీయతలోని భిన్న సమాజాల పిల్లల కలయికతతో తరగతి ఉండాలనీ, అన్ని భాషల సంప్రదాయాల పిల్లల మధ్య సమ భావనతో తరగతి ఉండాలని, ఏ ఒక్క సమూహపు అహం/ ప్రాధాన్యం పెరగని విధంగా చూడగలరని, విద్యార్థుల మధ్య పోటీతత్త్వం ఎగదోసి ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసే విధానం అవలంబించరని, బోధన ఇంగ్లిష్ మీడియం అయినా ప్రతి మాతృభాషనూ గౌరవించగలిగే స్కూల్ను మంచి స్కూల్గా ఎంచవచ్చు.బుర్రలా... మరబొమ్మలా?చదువు ఎలా నేర్పిస్తారో చూడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా, పిల్లలు పాఠాలు బట్టీయం వేసి, పరీక్షల్లో ముక్కస్య ముక్కహ రాసి, నూటికి నూరు తెచ్చుకొనేలా తోముతారా లేదా ప్రశ్న మార్చి ఇచ్చినా రాసేలాగా, బుర్ర పెట్టి ఆలోచించగలిగేలాగా, సొంతంగా నేర్చుకునే లాగా, సబ్జెక్ట్స్పై ఆసక్తి కలిగేలాగా చెబుతారా? ఈ రెండో విధానం కలిగినది మంచి స్కూల్.చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తోవినూత్నమైన టీచింగ్టీచింగ్ ఎలా ఉంటుందనేది చూడాలి? అదే మూస సంప్రదాయ పద్ధతిలోనేపాఠాలు చెబుతున్నారా? లేదంటే ఆధునికమైన ఉపకరణాలు, సాధనాల సహాయంతో చెబుతున్నారా చూడాలి. ఎప్పటికప్పుడు సిలబస్ను వర్తమాన పరిస్థితులను బట్టి మెరుగు పరుచుకుంటూ పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ అవసరమైతే ఎక్స్పర్ట్లను బయటి నుంచి పిలిపించి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారా లేదా చూడాలి. రెండో రకం స్కూలుకు ప్రాధాన్యం ఇవ్వాలి.టీచర్లు ఉన్నారా?ఒక స్కూల్ మనుగడ ఆ స్కూల్లో పని చేసే టీచర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్కూల్ యాజమాన్యం క్వాలిఫైడ్ టీచర్లను తీసుకుంటున్నారా? వారికి మర్యాదకరమైన జీతాలు ఇస్తున్నారా? టీచర్లు ఆ యాజమాన్యానికి లాయల్గా ఉన్నారా? ఐదేళ్ల పాటైనా ఒక్కో టీచర్ ఆ స్కూల్లో పని చేయగలుగుతున్నారా? ఈ సంవత్సరం ఉండి మరో సంవత్సరం మారి΄ోయే టీచర్లు ఉన్న స్కూల్లో పాఠాలు నడవవు. స్కూల్ మీద ప్రేమతో ఉంటూ పాఠాలు చెప్పే తపన కలిగిన టీచర్లు ఉన్న స్కూల్ను ఎంచుకోవాలి. అలాగే టీచర్లు మొరటుగా ఉంటూ స్టూడెంట్స్తో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటే గనక ఆ స్కూల్ జోలికి పోరాదు. స్ట్రిక్ట్గా ఉండటం వేరు స్టూడెంట్స్ను అవమానిస్తూ, భయభ్రాంతం చేయడం వేరు.క్రీడలు, కళలుక్రీడలకు, కళలకు స్థానం లేని స్కూల్కు ఆమడ దూరం ఉండాలి. ఆటస్థలం లేని స్కూల్ ప్రైమరీ లెవల్ నుంచి హైస్కూల్ లెవల్ వరకూ పనికి రాదు. ప్లేగ్రౌండ్ ఉన్నా ఆటలను ప్రోత్సహించక చివరి పీరియడ్ వరకూ పాఠాలతో ఊదరగొట్టే స్కూల్స్ను మంచివి అనుకోకూడదు. పిల్లల్లో ఎంతో సృజన ఉంటుంది. దానిని ప్రోత్సహిస్తే వారికి ధన, కనక, వాహనాలిచ్చినట్టే. విద్యార్థి ఎదుగుదల సమగ్రంగా జరగాలి. పాఠాలతోపాటు ఆట పాటలకు విలువిచ్చే బడికే ఓటు.సామాజిక బాధ్యత నేర్పుతున్నదా?మన పాటికి మనం చదువుకుని, పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, సుఖంగా బతికే ధోరణిని పెంచేలా వీరి తర్ఫీదు ఉంటుందా లేదంటే ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజం గురించి ఎరుక పరిచి, అందులో ఉన్న అంతరాల వల్ల బాధ పడేవారి కోసం, సమాజంలో ఉన్నతి కోసం ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత రేపు పెద్దయ్యాక ఉంటుంది అనే చెప్పేలా తర్ఫీదు ఉంటుందా చూడాలి. రెండో రకం తర్ఫీదు మంచిది.భద్రత, పరిశుభ్రతఅన్నింటి కంటే ముఖ్యం భద్రత. పిల్లలు ఉన్న చోట వేయి కళ్లతో ఉండాలి. స్కూల్లో ఆయాలు, సెక్యూరిటీ వాళ్లు సరైన ట్రయినింగ్ ఉన్న వాళ్లేనా? బస్ల డ్రైవర్లు లైసెన్స్లు ఉన్నవాళ్లేనా? కెమెరాల నిఘా ఉందా? ఔట్ పాస్ నియమాలు ఎలా ఉన్నాయి? టాయిలెట్ల దగ్గర రక్షణ ఉందా? ఇవి చూడాలి. అలాగే స్కూల్లో పరిశుభ్రతపాటిస్తున్నారా? గాలి వెలుతురు ఉండేలా చూస్తున్నారా? మంచి నీరు ఇస్తున్నారా? పిల్లల ఆరోగ్యం హటాత్తుగా పాడైతే వారు వెంటనే తల్లిదండ్రులకు తెలియ చేస్తున్నారా? ఫస్ట్ ఎయిడ్ ఇవ్వ గలుగుతున్నారా... ఇవన్నీ చూసుకుని, సంతృప్తికరంగా ఉంటే అది మంచి స్కూల్. ప్రతి పైసాకు ప్రతిఫలంస్కూళ్లు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తాయి. ఆ వసూలు చేసిన ఫీజుకు జవాబుదారీగా స్కూల్ను నిర్వహిస్తున్నారా? ప్రతి పైసాకు ప్రతిఫలం ఇస్తున్నంత బాగా విద్యార్థిని తీర్చిదిద్దుతున్నారా? పిల్లలు సంతోషంగా స్కూల్కు వెళ్లి సంతోషంగా తిరిగి ఇల్లు చేరుతున్నారా? ఇవన్నీ పరిశీలించుకుని ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్నది మంచి స్కూలో కాదో తేల్చుకోండి.

రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!
‘కాపాడుకో...కాపాడు’ నినాదంతో కోలిండియా వరల్డ్ క్లాస్ ఆల్–విమెన్ రెస్క్యూ అండ్ రికవరీ టీమ్లను ఏర్పాటు చేసింది.ఇప్పుడు అదే బాటలో సింగరేణి సంస్థ తొలిసారిగా ఆల్–విమెన్ రెస్క్యూ టీమ్లకు శ్రీకారం చుట్టింది. శిక్షణ మొదలైంది. సింగరేణి చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలవనుంది...రెండేళ్ల క్రితమే సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో సింగరేణి నిర్వహించిన ఎక్స్టర్నల్ పోస్టుల్లో మహిళా గ్రాడ్యుయేట్ ట్రెయినీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో చేరారు. సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,995కి పెరిగింది. రెస్క్యూ శిక్షణ కోసం మైనింగ్ గ్య్రాడ్యుయేట్ ట్రెయినీలతో ఒక్కో బ్యాచ్కు 14 మంది చొప్పున రెండు బ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.కోలిండియాలోని పలు సంస్థలో ఇప్పటికే మహిళా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది సింగరేణిలో జరిగిన ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కోల్ ఇండియాకు చెందిన రెండు మహిళా టీమ్లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు జట్లకు పదహారు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఫస్ట్ ఎయిడ్, రివైనింగ్, రక్షణ పద్దతులు, గనుల్లో గ్యాస్ ఏర్పడినప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గోడలు కట్టే విధానం, అత్యవసర సమయాల్లో స్పందించే పద్ధతి, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు రక్షించే విధానం...మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్లో చేరాను’ అంటోంది ఎన్.రక్షిత. ‘కోల్ ఇండియా స్థాయి రెస్క్యూ పోటీల్లో మా జట్టు సత్తా చూపుతాం’ అంది బి.కళ్యాణి. అందరి మాటల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సాహసానికి ఇంధనం ఆ ఉత్సాహమే కదా!– కాల్వ చంద్రశేఖర్రెడ్డి, సాక్షి, గోదావరిఖనిటఫ్ జాబ్ అంటే ఇష్టం...ఏదో ఒక ఉద్యోగం చేయడం అని కాకుండా టఫ్ జాబ్ చేయడం అంటే మొదటి నుంచి నాకు ఆసక్తి. ఇప్పుడు నా ఉత్సాహానికి తగిన పని దొరికింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో రెస్క్యూ శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ మాకు భవిష్యత్లో ఎంతగానో ఉపకరిస్తుంది. – ఎం.లిఖిత, భూపాల్పల్లిఆత్మస్థైర్యం పెంచేలా...మహిళ మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. రెస్క్యూ బ్రిగేడియర్ శిక్షణ మాలో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు తోటివారికి సహాయ పడేలా చేస్తోంది.– అల్లం నవ్యశ్రీ, ఎంజీటీ, జీడీకే–11 (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!)
ఫొటోలు
అంతర్జాతీయం

ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్ అవీవ్ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్ అవీవ్లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్తో ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్గా పగ్గాలుసుప్రీం లీడర్గా.. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి.

Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
అమెరికా అధ్యక్ష భవనం చరిత్రలోనే తొలిసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) హయాం ఓ అరుదైన ఘట్టానికి వేదికైంది. వైట్హౌజ్ ఆవరణలో రెండు భారీ జెండా స్తంభాలు ఏర్పాటు అయ్యాయి. పైగా అవి ప్రపంచంలోనే అత్యుత్తమ పోల్స్ అంటూ ట్రంప్ తనదైన శైలిలో ఓ ప్రకటన చేశారు కూడా.బుధవారం ఆ పోల్స్ను వైట్హౌజ్ భవనం బయట దక్షిణం వైపు, ఉత్తరం వైపు మరొకటి ఏర్పాటు చేయించారు(White House Huge Poles). ఆ మరుసటి రోజు అమెరికా జెండాను ఆవిష్కరించి.. సెల్యూట్ చేశారు. అయితే.. మొదటి టర్మ్(2013-2020) టైంలోనే ఇలా ఏర్పాటు ఎందుకు చేయించలేదని కొందరు మీడియా వాళ్లు అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ‘‘చాలా కాలం కిందటే ఇలా చేయాలని అనుకున్నా. తొలి టర్మ్లో అన్ని కళ్లు, వేళ్లు నా వైపే ఉండేవి. ఎక్కడ నేను దొరుకుతానా? అని విమర్శకులు వెంటాడేవాళ్లు. ఇప్పుడు నేనే అందరినీ వేటాడుతున్నా. చాలా తేడా ఉంది కదా. అందుకే ఇప్పుడు కుదిరింది’’ అని బదులిచ్చారు.అంతేకాదు.. రియల్టర్ అయిన ట్రంప్ ఆ పోల్స్ను ఎంపిక చేయడం మాత్రమే కాదు.. ఎక్కడ పాతాలో(ఏర్పాటు చేయాలో) కూడా స్వయంగా స్థలాన్ని సిబ్బందికి వెతికి చూపించారట. అయితే ఆ స్తంభాలను అక్కడ ఏర్పాటు చేసిన సిబ్బందిని అభినందించే క్రమంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. పోల్స్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఒక్కొక్కరిని పిలిచి ట్రంప్ కరచలనం చేశారు. ఆ సమయంలో వెనకాల.. ఓ క్రేన్ ఆపరేటర్(Crane Driver Trump Funny) కునుకు తీస్తూ కనిపించాడు. అయితే ట్రంప్ అది గమనించకుండా సిబ్బందితో ఫొటోలు దిగసాగారు. ఈ ఫొటో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. అసలు అతగాడు ట్రంప్ ముందు అంత దర్జాగా ఆ పని ఎలా చేయగలిగాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు జస్ట్ మిస్ అంటూ కామెంట్ పెన్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి.. అతను ఇప్పుడు అసలు ప్రాణాలతో ఉన్నాడా? అని ఆరాలు తీస్తున్నారు.NEW: Crane operator appears to take a quick nap during the installation of President Trump's flag pole at the White House.The president was seen taking pictures with workers while the man sat back in the crane.Trump says the two large flag poles were his gift because it was… pic.twitter.com/QYZONrjlKO— Collin Rugg (@CollinRugg) June 18, 2025ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికారంతో వైట్హౌజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చిరాగానే.. ఓవల్ ఆఫీస్లో ఫొటోలన్నీంటిని మార్పించేశారు. పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రముఖంగా ఆఫీస్లో ఏర్పాటు చేయించుకున్నారు. జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రోజ్ గార్డెన్ను ఏర్పాటు చేయించారు. అయితే ఆ గార్డెన్లో నిర్మాణ పనులు జరపాలని ట్రంప్ తాజాగా ఆదేశించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అక్కడి గడ్డిలో హైహీల్స్తో నడిచేందుకు మహిళలు ఇబ్బంది పడుతున్నారని!!.

ఇరాన్ దెబ్బ అదుర్స్.. ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ
టెహ్రాన్/టెవీ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్పూ ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు వైరల్గా మారాయి.మరోవైపు.. ఇజ్రాయెల్లోని హోలోన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్ రాజధాని టెలి అవీవ్లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. 🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV— Breaking911 (@Breaking911) June 19, 2025అంతకుముందు.. ఇరాన్ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.🚨The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.And you still ask why we don’t want them to have nuclear weapons…👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.

‘యుద్ధం ఆపింది ఆయనే’.. పాక్ సైన్యాధ్యక్షునికి ట్రంప్ కితాబు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇదే సమయంలో పాక్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ను తమ దేశానికి అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించడం మరిన్ని చర్చలకు దారితీసింది. మునీర్ను విందుకు పిలిచిన ట్రంప్.. ఆయనను అమెరికాకు ఆహ్వానించడం వెనుక గల కారణాన్ని కూడా వివరించారు.అసిమ్ మునీర్తో భేటీ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్- పాక్ మధ్య వివాదం మరింత ముదరకుండా నిరోధించడంలో మునీర్ పాత్రను ప్రశంసించారు. వైట్ హౌస్లో జరిగిన విందు కార్యక్రమంలో ‘నేను ఆయనను ఇక్కడకు ఆహ్వానించడానికి గల కారణం ఏమంటే.. ఆయన యుద్ధంలోకి దిగకుండా, దానిని ముగించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.పాకిస్తాన్ జాతీయ భద్రతా విధానాలపై ఆధిపత్యం కలిగిన అసీమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు మొదటిసారిగా ఆతిథ్యం ఇచ్చారు. పాకిస్తాన్ సీనియర్ పౌర అధికారుల సహాయం లేకుండా ఆయన ఈ విందులో పాల్గొనడం విశేషం. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా యుద్ధాన్ని ముగించినందుకు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రశంసించారు. ‘ఇద్దరు తెలివైన వ్యక్తులు యుద్ధంలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. లేదంటే ఇది అణు యుద్ధానికి దారితీసేదని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ మునీర్ను కలవడం తనకు గౌరవప్రదంగా ఉందని, ఇద్దరం ఇరాన్ గురించి చర్చించామన్నారు. పాకిస్తాన్కు ఇరాన్ గురించి బాగా తెలుసన్నారు. అలా అని వారు ఇజ్రాయెల్తో సత్సంబంధాలలో లేరని అర్థం కాదని అన్నారు. ఇదిలా ఉండగా ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులను పాకిస్తాన్ ఖండించింది, ఈ రకమైన దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని పాక్ పేర్కొంది.ఇది కూడా చదవండి: ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు
జాతీయం

Ahmedabad Plane Incident కో పైలట్కు కన్నీటి వీడ్కోలు..
ముంబై: గతవారం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన కో పైలట్ క్లైవ్ కుందర్కు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఈరోజు(గురువారం. జూన్ 19వ తేదీ) ఉదయం క్లైవ్ కుందర్ మృతదేహాన్ని ముంబైలోని అయన నివాసంలో ఉంచగా.. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే క్లైవ్ కుందర్ తల్లి బోరున విలపించారు. తన కుమారుడిని ఇలా చూస్తానని ఊహించలేదని కుందర్ తల్లి శోకతప్త హృదయంతో విలపించారు. కుందర్ బంధువులు, స్నేహితులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం సేవిరి క్రైస్తవ స్మశానవాటికకు తరలించారు. ముంబైలోని గొరెగావ్ వెస్ట్లో తల్లి, దండ్రులు, ఒక సోదరితో కలిసి జీవిస్తున్న కుందర్కు 1, 100 గంటల పాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో క్లైవ్ కుందర్ ఫస్ట్ ఆఫీసర్, కో-పైలట్గా ఉన్నారు. అయతే విమానం టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలో కూలిపోవడంతో మొత్తం విమానంలో ఉన్న పైలట్, కో పైలట్ తో సహా 241 మంది అసువులు బాసారు. ఆ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడగా, మిగతా వారంతా ప్రాణాలు కోల్పోయారు. అయితే డీఎన్ఏ టెస్టులు పూర్తి చేసిన తర్వాత మృతదేహాలను వారి వారి బంధువులు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే మృతదేహాల గుర్తింపులో జాప్యం చోటు చేసుకుంటోంది.

ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్: అమిత్ షా
ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు.

న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్లో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న స్టో రూమ్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని సదరు వ్యక్తి త్రిసభ్య కమిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్దమొత్తంలో స్టోరూంలో లభ్యమవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదికలో ప్రస్తావించింది.జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా కమిటీ విచారించింది. విచారణలో ఈ ఇద్దరూ స్టోరూంలో నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అగ్నిమాపక సిబ్బందిని కోరినట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్ను సభ్యులుగా ఉన్నారు.

యోగా జిల్లాగా మైసూరు?.. ఘనత ఇదే..
మైసూరు: కర్నాటకలోని మైసూరు అటు సాంస్కృతిక, ఇటు ఆధ్యాత్మిక జీవనానికి కేంద్రంగా విలసిల్లుతోంది. ఇప్పుడు ఈ పట్టణం మరో ఖ్యాతిని కూడా దక్కించుకోనుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మైసూర్ను దేశంలోని మొట్టమొదటి ‘యోగా జిల్లా’గా మార్చాలని కోరుతూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఒక ప్రతిపాదన పంపింది.2024లో ఆయుష్ అధికారుల బృందం నిర్వహించిన సర్వేలో మైసూర్ జిల్లాలోని 50 శాతం కుటుంబాలు క్రమం తప్పకుండా యోగాను అభ్యసిస్తున్నాయని వెల్లడయ్యింది. మైసూర్ శక్తివంతమైన వెల్నెస్ వ్యవస్థను కలిగి ఉంది. కర్ణాటకలోని 326 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో 22 ఒక్క మైసూర్లోనే ఉన్నాయి. వీటిలో శిక్షణ పొందిన యోగాచార్యులు ఉన్నారు. జిల్లాలో ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం, ప్రకృతి వైద్య కళాశాలలు, పంచకర్మ కేంద్రాలు, యోగా కేంద్రాలు కూడా ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభ్యాసకులకు మైసూర్ ఇష్టమైన ప్రాంతంగా మారింది. ఈ నగరంలో ప్రతియేటా 25 వేల మంది విదేశీయులు యోగాను నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా మైసూరులో 600 సర్టిఫైడ్ యోగా శిక్షణ సంస్థలున్నాయి. మైసూరును అధికారికంగా యోగా జిల్లాగా ప్రకటిస్తే, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. ఇది కూడా చదవండి: రాహుల్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్

ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం శివకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.

కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.