వరి్సటీ ప్రగతే పరమావధి
ఆనందంగా ఉంది
యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కావాలని అధ్యాపకులైన ప్రతి ఒక్కరికీ డ్రీమ్ ఉంటుంది, అది సాధారణ కమ్యూనిటీలోని వారికి సాకారం కావచ్చునేమో కానీ.. నాలాంటి ఒక గిరిజన మహిళకు కష్టమే. చదువు ఎందుకు అనే సమాజంలో పుట్టిన నేను ఒక యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ కావడమంటే అవధులు లేని ఆనందంగానే ఉంది.
ఆ అదృష్టం నాదే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1957లో ఆవిర్భవించాక ఇంతవరకూ ఏ యూనివర్సిటీకీ గిరిజన మహిళ వీసీ కాలేదు. ఆ అవకాశం నాకే దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.
ఒకే కుటుంబంగా పని చేయాలి
1987లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బోధనా వృత్తిలోకి అడుగుపెట్టాను. ఆంధ్రా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పని చేశా. 38 సంవత్సరాల సీనియారిటీతో ఉన్న తనను ‘నన్నయ’ వీసీగా నియమించినందుకు కృతజ్ఞతలు. పరిపాలన నాకు కొత్త కాదు. చిందరవందరగా ఉన్న వలకు మాట్లు వేసి, సరిచేసే ప్రయత్నంలో ఉన్నా. వర్గాలు, వైషమ్యాలు విడనాడి, వర్సిటీ ప్రగతికి అందరూ ఒకే కుటుంబంలా పని చేస్తేనే ఇక్కడ ఉంటారు.
పరిశోధనలకు ప్రోత్సాహం
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, సమాజానికి తోడ్పడేలా పరిశోధనలు జరగాలి. అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని పరిశోధకులకు ఇచ్చేందుకు ఇక్కడున్న వనరులు, సదుపాయాలపై ఆకళింపు చేసుకుని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
రాష్ట్రపతి నుంచి అవార్డు
ఆకలి వేసిన వారికి ఆహారం అందిస్తేనే దానికి విలువ ఉంటుంది. ఆ భావనతోనే అంతరించిపోయే పరిస్థితిలో ఉన్న 19 ఆదిమ జాతి భాషలకు లిపిని అందించే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో అనేక మంది పెద్దల నుంచి సరైన సహకారం లభించకపోగా, అవమానాలు ఎదురయ్యాయి. అయినా వెనుకడుగు వేయకుండా వారి సంస్కృతీ సంప్రదాయాలపై పరిశోధనలు చేసి 19 గిరిజన భాషలకు లిపి రూపొందించాను. ఈ కృషికి గుర్తింపుగా అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి 2022లో నారీశక్తి పురస్కారం అందుకున్నా.
నేనూ గోదావరి వాసినే..
సాహిత్య, సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరం, ముఖ్యంగా గోదావరి తీరాన ఉన్న నన్నయ వర్సిటీకి వీసీగా పని చేయడం సంతోషంగా ఉంది. నా అత్తింటి వారు రాజమహేంద్రవరం వారే. అల్లు ఎరకయ్య మా మామయ్య. అలా నేను కూడా గోదావరి వాసినే అయినందుకు గర్వపడుతున్నాను.
రాజానగరం: ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుని.. జీవితానికి ఓ గమ్యం నిర్దేశించుకుని.. ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా ఉన్నత విద్య అభ్యసించేందుకు వచ్చిన యువతకు జీవితంలో స్థిరపడేలా చేయడమే కాకుండా.. సమాజానికి ఉపయోగపడేలా వారిని తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలు. విద్యార్థులకు మార్గదర్శకత్వాన్ని అందించే బాధ్యత ఆ వర్సిటీల అధ్యాపకులదే. అంతకు మించి కీలక బాధ్యత ఆ వర్సిటీ ఉప కులపతి (వైస్ చాన్సలర్) పై ఉంటుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అటువంటి కీలక పదవిలో నియమితులయ్యారు ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ. గిరిజన తెగలో జన్మించిన ఆమె.. కష్టపడి, ఉన్నత చదువులు చదివి.. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి వైస్ చాన్సలర్ స్థాయికి ఎదిగారు. బోధనారంగంలో అపార అనుభవం కలిగిన ఆమె వీసీగా ప్రత్యేక విజన్తో పని చేసి, ‘నన్నయ’ వర్సిటీ ప్రగతిని ఇనుమడింపజేయాలని భావిస్తున్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment