దేవరపల్లి: గౌరీపట్నం వద్ద ఉన్న నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర ఈ ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యక్షేత్రం ముఖమండపంలోని మరియతల్లి స్వరూపానికి బిషప్ జయరావు పొలిమెర పూలమాల వేసి, పలువురు ఫాదర్లతో కలిసి ప్రార్థన చేశారు. అఖండ దేవాలయం కింది భాగంలో ఏర్పాటు చేసిన బైబిల్ ప్రదర్శనను, భక్తుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రంలో రూ.14 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్ల సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన బైబిల్ ప్రదర్శనను భక్తులు తిలకించి, ఈ గ్రంథం విశిష్టతను తెలుసుకోవాలని అన్నారు. ఈ మహోత్సవాలు ఈ నెల 25 వరకూ జరుగుతాయన్నారు. పుణ్యక్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తయినందున సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా 250 మంది వలంటీర్లు, 200 మంది పోలీస్ సిబ్బందితో అన్ని భద్రతా చర్యలూ చేపట్టామని వివరించారు. సుమారు 125 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పుణ్యక్షేత్రంలో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని బిషప్ జయరావు తెలిపారు. పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ మాట్లాడుతూ ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం మంచినీరు, అన్నదానం, మజ్జిగ పంపిణీ వంటి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇబ్బందులు ఎదురైతే సమాచార కేంద్రం వద్ద సంప్రదించాలని సూచించారు. రాత్రి దివ్యబలి పూజ, పరిశుద్ధ జపమాల, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఫాదర్లు పి.బాల, డీవీ ప్రసాద్, అమృతన్, నిత్యాన్నదాన కాంట్రాక్టర్ కళ్ళే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ప్రారంభం