ఉప్పలగుప్తం: చేనేతను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలపై సీపీఎం నిర్వహించే ప్రజా చైతన్య యాత్ర సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని విలసవిల్లి, నంగవరం, భీమనపల్లి గ్రామాల్లో గురువారం సాగింది. ఈ సందర్భంగా చేనేత కార్మికులు, ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలతో సీపీఎం నాయకులు చర్చించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వచ్చి ప్రతీ ఇంటికి ఉపాధి కల్పిస్తానని కబుర్లు చెబుతున్నారు తప్ప రాష్ట్రంలో ప్రధాన పరిశ్రమ అయిన చేనేత పరిశ్రమను మరుగున పడవేశారన్నారు. సనాతన ధర్మం పాటించాలని చెప్పే పాలకులకు సనాతన వృత్తులను కాపాడుకోవడమే అసలైన సనాతన ధర్మం అని గుర్తుచేస్తున్నానన్నారు. ముడి సరకు ధరలను అధికంగా పెంచి పాలకులు నేతన్నల పొట్ట కొడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పెట్టుబడి భరోసా నేతన్న నేస్తం కింద ఏడాదికి చేనేత కార్మికులకు రూ.24 వేలు ఇచ్చేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నేత కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న కనీస చర్యలు లేవని అన్నారు. ప్రభుత్వం పీ–4 పేరుతో ప్రజలను మోసం చేసి కార్పొరేట్ రంగాలను అభివృద్ధి చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా నేత కార్మికులు తాము పడుతున్న కష్టాలను సీపీఎం బృందానికి వివరించారు. అనంతరం చేనేత కార్మికుల మగ్గాలను వారు నేత నేసే విధానాన్ని తెలుసుకున్నారు. భీమనపల్లి కేఎఫ్డబ్ల్యూ కాలనీలోను, నంగవరం లోను సీపీఎం బృందం పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంది. ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా గుర్తించామని, ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వివరించారు. బి.బలరామ్, ఆండ్ర మల్యాద్రి, జి.దుర్గాప్రసాద్, నూకల బలరామ్, టి.నాగవరలక్ష్మి, కె.కృష్ణవేణి, పీతల రామచంద్రరావు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు