రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
ఏలూరు ఆర్అండ్బీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు(టూటౌన్) : కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు.. సుమారు రూ.300 కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో జిల్లాలో వందల మంది కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఏలూరు నగరంలోని ఆర్అండ్బీ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని ఆగమేఘాల మీద రోడ్లపై గుంతలు పూడ్చితే.. నెలలు గడిచినా పట్టించుకోవడం లేదంటూ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు.
700 మంది కాంట్రాక్టర్లకు బకాయిలు
జిల్లాలో కాంట్రాక్టర్లు బకాయిల కోసం నిరసన గళం విప్పారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, బీఏఐ, ఎస్ఏబీఐ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారు రూ.300 కోట్ల బకాయిలున్నాయని, మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో నామినేషన్ ప్రాతిపదికన, ఇతర పనులు నిర్వహించినా బిల్లులు మంజూరు కాలేదు. జిల్లాలో ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల్లోని రూ.130 నుంచి రూ.150 కోట్ల పైచిలుకు, సోషల్ వెల్ఫేర్లో రూ.30 కోట్లు, జనరల్ ఫండ్ కింద పనులకు మరో రూ.30 కోట్లు, పంచాయితీరాజ్లో రూ.10 కోట్లు, విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అన్న క్యాంటీన్లు అన్ని కలిపి మరో రూ.20 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ఏలూరు నగరంలో జనరల్ ఫండ్ కింద నిర్వహించిన పనులకు రూ.12 కోట్లు, ఇరిగేషన్ రూ.25 కోట్లు, పంచాయతీరాజ్ బకాయిలు, ఏలూరు డివిజన్లో రూ.8 కోట్లు, ఆర్అండ్బీ పనులకు సంబంధించి రూ.40 కోట్లు, సోషల్ వెల్ఫేర్కు సంబంధించి రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 200 మంది కాంట్రాక్టర్లు, ఉభయగోదావరి జిల్లాలో 700 మంది కాంట్రాక్టర్లకు బకా యిలు రావాల్సి ఉంది. ఇలా అయితే కాంట్రాక్టర్లు పూర్తిగా అప్పులుపాలై రోడ్డునపడే పరిస్థితులుంటాయని, నిరర్ధక ఆస్తులు (ఎంపీఏ) చెక్కు బౌన్సులతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ చైర్మన్ సతీష్ చౌదరి తెలిపారు. తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోయారు. నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించకపోతే భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పనికి టెండర్లు వేయబోమని స్పష్టం చేశారు.
పది నెలలుగా బిల్లుల కోసం తిప్పలు
ఏలూరు జిల్లాలో సుమారు రూ.300 కోట్ల బకాయిలు
20 ప్రభుత్వ శాఖల్లో నిలిచిన బిల్లులు
Comments
Please login to add a commentAdd a comment