
మెప్మాకు గిన్నిస్ బుక్ రికార్డ్స్
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఓఎన్డీసీ ప్లాట్ఫారమ్ ద్వారా విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సాధించడం అభినందనీయమని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా మెప్మా అధికారులు గిన్నిస్ బుక్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్లతో బుధవారం కలెక్టర్ను కలిశారు. ఓఎన్డీసీ విక్రయాల్లో జిల్లా ఎస్హెచ్జీల భాగస్వామ్యం 6,500గా ఉందని మెప్మా అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఓఎన్డీసీ విక్రయాల్లో జిల్లా భాగస్వామ్యం పెద్ద మొత్తంలో పెరగాలని సూచించారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా లైవ్లీహుడ్స్ స్పెషలిస్ట్ సీహెచ్ నాని బాబు, జిల్లా ఐబీ గ్రంధి పార్వతి, జిల్లా ఈ మార్కెట్ స్పెషలిస్ట్ సీహెచ్ మోహన్ ఉన్నారు.
చెల్లని చెక్కు కేసులో జైలు, జరిమానా
నూజివీడు: చెల్లని చెక్కు ఇచ్చిన నేరానికి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు నూజివీడు మండలం సీతారామపురంనకు చెందిన కన్నెకంటి సాంబశివరావు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం సేరినరసన్నపాలెంకు చెందిన బల్లా సత్యన్నారాయణకు 2020 జులై 6న రూ.12,44,000 నగదును అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత సాంబశివరావు బాకీ తీర్చమని అడగగా 2021 జులై 5న రూ.10 లక్షలకు సత్యన్నారాయణ చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును సాంబశివరావు బ్యాంకులో వేయగా నగదు లేదని బ్యాంకు నుంచి చెక్కు తిరిగి వచ్చింది. దీంతో సాంబశివరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం సత్యన్నారాయణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.12 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: కుమారుడు, కుమార్తె మందలించారనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకీగూడెంకు చెందిన పిచ్చేటి కొండయ్య (42) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య ఏడాది క్రితం సౌదీఅరేబీయా వెళ్లడంతో వడాలి గ్రామంలోని అత్తవారింట పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. కొండయ్య కుమారుడు 9వ తరగతి, కుమార్తె 7వ తరగతి చదువుతున్నారు. కొండయ్య ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వెళుతుండడంతో కుమారుడు, కుమార్తె మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన కొండయ్య మూడు రోజుల కిందట ఎలుకల మందు తిని అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనిపై కొండయ్య సొదరుడు బాపూజీ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మెప్మాకు గిన్నిస్ బుక్ రికార్డ్స్