జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా ఉన్నాయి. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలిటీలు, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తంగా 54.56 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. ఒక్క నూజివీడు పట్టణంలో మాత్రమే 60 శాతానికి పైగా పన్ను ఆదాయం వచ్చింది.
లక్ష్యాన్ని చేరని వైనం
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో గృహాలు, ఖాళీ స్థలాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ద్వారా మార్చి 31 నాటికి నూరు శాతం పన్ను వసూలు చేస్తామని అధికారులు ప్రకటించినా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేదు. మార్చి 31 నాటికి జిల్లాలో మొత్తంగా రూ.83.64 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా రూ.45.64 కోట్లు మాత్రమే వసూలైంది. మార్చి 31న అర్ధరాత్రి నుంచి ఆస్తిపన్నుకు సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్ నిలిపివేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం వివరాలు అప్డేట్ అయిన తర్వాత వెబ్సైట్ మళ్లీ అందుబాటులోకి రానుంది.
నూజివీడు ఫస్ట్.. ఏలూరు లాస్ట్
ఈ ఏడాది మార్చి 6 నాటికి పన్ను వసూళ్లు వేగవంతం చేస్తున్నామని అధికారులు చెప్పినా కార్యరూ పం మాత్రం దాల్చలేదు. ఆ రోజున సగటున 43.38 శాతం పన్నులు వసూలు కాగా.. గడువు ము గిసే నాటికి 54.56 శాతం మాత్రమే వసూలయ్యా యి. నూజివీడు 62.09 శాతం ప్రథమ స్థానం, జంగారెడ్డిగూడెం 59.91 శాతంతో ద్వితీయ స్థానం, చింతలపూడి 55.98 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. ఏలూరు కార్పొరేషన్ మాత్రం 52.31 శాతంతో చివరి స్థానంలో ఉంది.
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వ్యూ
ఆస్తి పన్ను వసూళ్లు 55 శాతం లోపే..
రూ.83 కోట్లకు రూ.45 కోట్లే వసూలు
నూజివీడులో మాత్రమే 62 శాతం రాబడి
ఫలితమివ్వని అధికారుల చర్యలు
మున్సిపాలిటీ అసెస్మెంట్లు వసూలు కావాల్సిన వసూలైన మొత్తం శాతం
మొత్తం. (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)
ఏలూరు 71,378 60.44 31.62 52.31
(కార్పొరేషన్)
జంగారెడ్డిగూడెం 19,114 11.34 6.80 59.91
నూజివీడు 15,283 9.54 5.92 62.09
చింతలపూడి 7,350 2.32 1.30 55.98
(నగర పంచాయతీ)
పటిష్ట చర్యలు తీసుకున్నాం
పన్ను వసూళ్లపై ప్రచార మాధ్యమాల ద్వారా, సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించడం, ఫోన్ ద్వారా ఫాలో అప్ చేశాం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి నెలలో తీసుకున్న చర్యల కారణంగా 12 శాతం అదనంగా వసూళ్లు చేయగలిగాం. మార్చి 31న ఆన్లైన్ వెబ్సైట్ నిలిపివేశారు. మరలా అప్డేట్ అయిన వివరాలతో ఈనెల 5 నుంచి వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే బకాయిలు ఉన్న వారికి నోటీసులు అందించడం, మౌఖికంగా సమాచారం ఇచ్చి సన్నద్ధం చేశాం. 5వ తేదీ తర్వాత గతేడాది పన్నులతో పాటు ఈ ఏడాది పన్నులు కూడా చెల్లించేలా యజమానులను చైతన్య పరుస్తున్నాం.
– కేవీ రమణ, కమిషనర్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ
పన్ను వసూళ్లు డల్


