సత్తాలలో ఉపాధి సిత్రాలు
ద్వారకాతిరుమల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. పనిలోకి వెళ్లని వారి పేరున మస్తర్లు వేసి కొందరు సిబ్బంది సొమ్ములు స్వాహా చేస్తున్నారు. ద్వారకాతిరుమల మండలం సత్తాల పంచాయతీలో జరుగుతున్న పనులు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. గ్రా మంలో రెండు ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం 80 నుంచి 90 మంది కూలీలు పనిచేస్తున్నట్టు మస్తర్లు వేస్తున్నారు. వాస్తవానికి పనిలోకి వెళ్లని కొందరు కూలీలకు సైతం మస్తరు పడుతున్నాయి. కూటమి నేతల అండతోనే ఉపాధి హామీ సిబ్బంది ఈ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దొంగ మస్తర్లు వేస్తోందిలా..
రోజూ పనిచేసిన కూలీలను గ్రూప్ ఫొటో తీసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న మేట్ నరెడ్ల శ్యామలాదేవి ఫొటోలో ఉన్న వారికంటే ఎక్కువ మందికి మస్తర్లు వేస్తున్నారు. ఈనెల 8న ఇందేటి నాగమణి అనే కూలి ఒక్కరే ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి ఆమెతో పాటు, నరెడ్ల సుబ్బారావుకు కూడా మస్తర్ వేశారు. అలాగే 9న బాలుడు గొన్నూరి కార్తీక్ ఫొటో అప్లోడ్ చేసి వృద్ధుడు నరెడ్ల సుబ్బారావుకు మస్తర్ వేశారు. అదే రోజు ముగ్గురున్న ఒక ఫొటోను అప్లోడ్ చేసి ఆరుగురికి మస్తర్లు వేశారు. అలాగే బుధవారం ఇందేటి నాగమణి ఒక్కరే ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి, ఆమెతో పాటు నరెడ్ల సుబ్బారావుకు, అలాగే ముగ్గురున్న మరో ఫొటోను అప్లోడ్ చేసి ఆరుగురికి మస్తర్లు వేశారు.
పని అక్కడ.. మస్టర్లు ఇక్కడ : పేరమ్మ (మేరెమ్మ) దూబచర్లలో జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు. సుబ్బమ్మ ఇంటి వద్దే ఉంటోందని, మమత వ్యవసాయ పనులకు వెళుతోందని అయినా వారికి మస్తర్లు వేస్తున్నారని అంటున్నారు. ఇలా దొంగ మస్తర్లు వేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
విచారణ చేస్తాం
దీనిపై ఉపాధి హామీ ఏపీఓ బిరుదుగడ్డ నాగరాజును వివరణ కోరగా సత్తాల పంచాయతీలో ఉపాధి హామీ పనులకు సంబంధించిన మస్తర్లలో అవకతవకలు జరుగుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై విచారణ చేస్తామని చెప్పారు.
దొంగ మస్తర్ల దందా
బోగస్ హాజరుతో వేతన నిధులు స్వాహా!
కూటమి నేతల అండతో అక్రమాలు
ద్వారకాతిరుమల మండలం సత్తాల పంచాయతీ సండ్రకుంట గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు గొన్నూరి కార్తీక్ ఈనెల 9న ఉపాధి హామీ పనులకు వెళ్లినట్టు అతడి ఫొటోను సిబ్బంది ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అయితే పేరు మాత్రం 79 ఏళ్ల వయసున్న నరెడ్ల సుబ్బారావుగా చూపారు. బాలుడు కార్తీక్తో ఉపాధి పనులు చేయించి సుబ్బారావుకు మస్తర్ వేశారా, లేక పనిలోకి వెళ్లని సుబ్బారావుకు మస్తర్ వేసేందుకు కార్తీక్ ఫొటోను వాడుకున్నారా అన్న ప్రశ్నలకు ఉపాధి హామీ అధికారులే సమాధానం చెప్పాలి.
సత్తాలలో ఉపాధి సిత్రాలు


