
ఈనెల 21 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఏర్పడడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎంతో నేర్పుగా ఉండి, ఆందోళనలను దూరం చేసుకుని స్వేచ్ఛగా పరీక్షలను రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక బద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలు కలుగుతుంది.
ఉపాధ్యాయులు ఇలా చేయాలి..
విద్యార్థులను జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరు తో ఒత్తిడి చేయరాదు. ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులతో ఆరా తీయాలి. పరీక్షల నేపథ్యంలో ఆందోళన చెందకుండా తరచూ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహించాలి.
విద్యార్థులతో చేయకూడనివి..
విద్యార్థులను ఇతరులతో పోల్చి వాళ్లలోని ఆత్మనున్యత భావాన్ని కలిగించరాదు. వారిని భోజనం చేయడానికి ఒంటరిగా వదలకుండా వారితో కలిసి కడుపునిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ వాళ్ల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. వారిపై అత్యాశలు పెట్టుకొని వారిని చదవాలంటూ తరచూ ఒత్తిడికి గురిచేయొద్దు. తల్లిదండ్రులు, టీచర్లు వారి ఆశలను పిల్లలపై రుద్ది ఇబ్బందులకు గురి చేయరాదు.
వైద్యులతో కౌన్సెలింగ్
పరీక్షలు అంటేనే భయానికి గురయ్యే విద్యార్థులకు ఒత్తిడి బారిన పడకుండా స్థానిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలని తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు సూచనలు చేయాలి.
పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర కలిగి ఉండడం, యోగా ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించాలి. టీవీ సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి.
పంచ సూత్రాలు పాటిద్దాం..
ధోరణి: విద్యార్థులు మానసిక స్థితి బాగుండాలి. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి ఆందోళన గురికారాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సందేహాలను నివృత్తి చేసుకొని బృంద చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
నమ్మకం: సబ్జెక్టుల వారీగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముందుగా తనపై తనకు నమ్మకం కలిగి ఏదైనా సాధించగలమనే దీమా పెంచుకోవాలి. లక్ష సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి.
ఏకాగ్రత: పాఠ్యాంశాలను చదివే క్రమంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి. చదివే సమయంలో ఆలోచనలు, చూపు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
క్రమశిక్షణ: పరీక్షల సమయంలో సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. చదువును వదిలి పక్కదారి పట్టే విధంగా కాకుండా క్రమశిక్షణగా మెలగాలి.
దృష్టి: విద్యార్థుల దృష్టి పూర్తిగా చదువుపై కేంద్రీకరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలతోనే గడపాలి. టీచర్లు, పేరెంట్స్ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి కఠిన అంశాలపై పట్టు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. సులువైన వాటిని చివరకు చదివే విధంగా సూచనలు చేయాలి.
అందమైన చేతి రాతతో..
పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించేందుకు అందమైన చేతి రాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ పదాలకు పదాలకు మధ్య సమదూరాన్ని పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలకు తావుగకుండా చూసుకోవాలి.
తేలికగా జీర్ణమయ్యే ఆహారం మేలు
సమయానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తినాలి. కాఫీ, టీ జోలికి పోరాదు. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
– డాక్టర్ గందె కార్తీక్, జనరల్ ఫిజీషియన్, నారాయణపేట
ప్రశాంతంగా చదవాలి
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికారాదు. మార్కులపై దృష్టి పెట్టి బెంగ పడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతతతోనే ఉత్తీర్ణత సాధిస్తాం. మెదడు చెరుకుగా పనిచేసే విధంగా ఉత్తేజితం కావాలి.
– యాద్గిర్ జనార్ధన్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణపేట.
ఇతర విషయాలపై దృష్టి పెట్టొద్దు
ప్రశాంతంగా ఉండి ఉత్సాహంతో పరీక్షలకు హాజరు కావాలి. గంటల తరబడి చదవాలనే నియమం లేదు. మానసికంగా సంసిద్ధులుగా ఉన్న సమయంలోనే పాఠ్యాంశాలు చదవాలి. ఇతర విషయాలపై దృష్టి పెట్టరాదు. ఇప్పటివరకు చదివిన అంశాలనే పునఃశ్చరణ చేసుకోవాలి. కొత్త వాటి జోలికి పోరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
– గోవిందరాజు, డీఈఓ
(చదవండి: తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్ అధికారిగా మార్చింది..ఆనంద్ మహీంద్రా మెచ్చిన స్టోరీ..)
Comments
Please login to add a commentAdd a comment