
పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు కనువిందు చేస్తున్నాయి. హాబీగా చేపట్టిన బోన్సాయ్ మొక్కల పెంపకం సిరులు కురిపిస్తోంది. ఎడారికి అందాలు అద్దే అడీనియం మొక్కలకు మండలంలోని వెలివోలు గ్రామం చిరునామాగా మారింది. ఈ కుగ్రామం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు అడీనియం మొక్కలు సరఫరా అవుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణజిల్లా వెలివోలు గ్రామానికి చెందిన కుంభా సాంబ శివరావు ప్రైవేటు స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడగా పనిచేసేవారు. 2020లో తన హాబీ మేరకు తెలిసిన వారి దగ్గర నుంచి 12 రకాల అడీనియం మొక్కలను తెచ్చి తన ఇంటి పెరటిలో నాటారు. కరోనా సంక్షోభం కారణంగా ఓ పక్క స్కూల్స్ మూతపడటం, మరోపక్క చేసేందుకు ఎక్కడా పని దొరక్కపోవటంతో తన దృష్టిని ఎడారి మొక్కల పెంపకంపై కేంద్రీకరించారు. తన పెరటిలో ఉన్న 12 అడీనియం మొక్కల నుంచి విత్తనాలను సేకరించి, వాటి నుంచి మొక్కలను పునరుత్పత్తి చేయడం ప్రారంభించారు.
రెండు పద్ధతుల్లో మొక్కల పునరుత్పత్తి
తన పెరటిలో ఉన్న అడీనియం మొక్కలతోపాటు థాయ్ల్యాండ్, కేరళ, తమిళనాడు నుంచి మరికొన్ని రకాల మొక్కలను సాంబశివరావు దిగుమతి చేసుకున్నారు. వాటి ద్వారా అరుదైన అడీనియం రకాలను సృష్టించడం ప్రారంభించారు. తన ఇంటి పెరట్లో 12 మొక్కలతో ప్రారంభమైన నర్సరీ నేడు 75 సెంట్ల స్థలంలో సుమారు 10 వేల అడీనియం మొక్కలతో విరాజిల్లుతోంది.
ఇక్కడ మొక్కలను రెండు రకాలుగా పునరుత్పత్తి చేస్తున్నారు. అంటుకట్టు పద్ధతిలో ఇప్పటి వరకూ 100 రంగులకు పైగా పూలు పూసే మొక్కలను ఉత్పత్తి చేశారు. రెండో పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా మరో 200 రకాల మొక్కలను సృష్టించినట్లు సాంబశివరావు తెలిపారు.
5 వేల మొక్కల విక్రయం
సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్ల వయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్ఫామ్, రూట్ ట్రెయిన్ప్లాంట్, అనకొండ వంటివి ఉన్నాయి.
నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టా్రగామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు.
మక్కువే పెట్టుబడి
కరోనా తరువాత ఉద్యోగం లేక పనిదొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొక్కల పెంపకంపై ఉన్న నా మక్కువను అడీనియం వెలల మొక్కల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టా. 12 మొక్కలతో ప్రారంభించిన నర్సరీ 10 వేల మొక్కలకు విస్తరిం చింది. మారుమూల గ్రామమైన వెలివోలు నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు మొక్కలు సరఫరా చేస్తున్నా. ఇష్టమైన అలవాట్లను వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే తప్పక విజయం సాధిస్తామని నా నమ్మకం.
–కుంభా సాంబశివరావు, నర్సరీ యజమాని, వెలివోలు
(చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment