
కొరిటెపాడు(గుంటూరు): మార్కెట్ యార్డుకు గురువారం 93,186 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 98,908 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.25,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.24,200 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.13,000 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 63,179 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
మొక్కజొన్న
మద్దతు ధర రూ.1962
గుంటూరు వెస్ట్: 2022–23 రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నకు క్వింటాకు మద్దతు ధర రూ.1962 అందజేస్తున్నారని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా శుక్రవారం కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. మొక్కజొన్న విక్రయించాలనుకునే రైతులు సమీపంలోని ఆర్బీకేల్లో తమ పేర్లను నమోదు చేసుకోవడంతోపాటు శాంపిల్స్ తీసుకు వచ్చి పరిశీలించుకోవాలన్నారు. మద్దతు ధరను పొందగోరే రైతులు ఈ నెల 12లోపే తమ పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జేసీ కోరారు.
8న ఐటీఐలో
అప్రెంటిస్ మేళా
తెనాలి: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 8వ తేదీన ‘అప్రంటిస్–రోజ్గార్ మేళా’నిర్వహించనున్నారు. సుమారు 15 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనే అప్రంటిస్ మేళాలో జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజిలో వివిధ ట్రేడుల్లో శిక్షణ పొంది, సర్టిఫికెట్ కలిగిన విద్యార్థులు పాల్గొనవచ్చని ఐటీఐ ప్రిన్సిపాల్/ జిల్లా కన్వీనర్ రావి చిన్నవెంకటేశ్వర్లు గురు వారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల విద్యార్థులు తమ బయోడేటా, విద్యార్హత, ఆధార్కార్డు జిరాక్స్, పాస్పోర్టు సైజు ఫొటో తో ఆరోజు ఉయం 10 గంటలకు తెనాలి ఐటీ ఐ ప్రాంగణంలో హాజరుకావాలని కోరా రు. మరిన్ని వివరాలకు 9959828100, 9985614465 నంబర్లను సంప్రదించవచ్చని వివరించారు.
నేడు త్రికోటేశ్వరునికి
లక్ష మల్లెల అర్చన
నరసరావుపేట రూరల్: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి ఈనెల 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్ష మల్లెపూలతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ట్లు ఆలయ ఈవో వేమూరి గోపి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి కృపాకటాక్షములను పొందాలని తెలిపారు. అదే విధంగా పౌర్ణమి సందర్భంగా ఉదయం గిరిప్రదక్షణ వచ్చే భక్తులకు తాగునీరు, ప్రసాదాలను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 522.00 అడుగుల వద్ద ఉంది. ఇది 152.8470 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 1,350 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 1,350 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 807.10 అడుగుల వద్ద ఉంది. ఇది 32.6499 టీఎంసీలకు సమానం.

