పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఇద్దరు మృత్యువాత

Published Wed, Oct 4 2023 1:10 AM | Last Updated on Wed, Oct 4 2023 1:10 AM

- - Sakshi

ఒకరికి తీవ్రగాయాలు

చిలకలూరిపేటటౌన్‌: పగలంతా ఉక్కపోతగా ఎండకాసింది.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. తమ వ్యక్తిగత పనులపై వాహనాలపై వెళ్తున్న సుమారు 20 మంది ఓ చెట్టు కిందకు చేరారు. ఆ చెట్టుపై హఠాత్తుగా పిడుగు పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన చిలకలూరిపేట మండలం కావూరు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన కూలి ఆలూరి ఆరోగ్యం(58) తన చెల్లెలు రాయపూడి రాణితో కలిసి బంగారం కొనుగోలుకు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌పై వచ్చి తిరిగి సొంతూరుకు పయనమయ్యాడు. నరసరావుపేట పట్టణం వెంగళ్‌రెడ్డి నగర్‌ వాసి షేక్‌ అమీర్‌(35) చిలకలూరిపేట పట్టణంలోని సుభాని నగర్‌లో తన మేసీ్త్ర ఇంట్లో ఓ ఫంక్షన్‌ నిమిత్తం వచ్చి తిరిగి బైక్‌పై బయలుదేరాడు. ఫైనాన్స్‌ తాలూకు బకాయిల వసూళ్ల నిమిత్తం పొన్నూరుకు చెందిన చిన్నబ్బాయ్‌ నరసరావుపేటకు వెళ్తున్నాడు. వీరంతా మార్గమధ్యలో వర్షం కురవడంతో కావూరు ప్రారంభంలోని కుప్పగంజి వాగు సమీపంలోని బటర్‌ఫ్లై వెంచర్స్‌ వద్ద చింతచెట్టు కిందకు చేరారు. వీరితోపాటు మరో 15 మందికిపైగా వాహనచోదకులు ఆ చెట్టు కిందే నిలుచుకున్నారు. ఇంతలో హఠాత్తుగా చింతచెట్టుపై పిడుగు పడింది. ఫలితంగా అమీర్‌, ఆరోగ్యం అక్కడికక్కడే మృతి చెందారు. వారి పక్కనే నిలుచున్న ఫైనాన్స్‌ కంపెనీ గుమాస్తా చిన్నబ్బాయ్‌ చేయి పూర్తిగా కాలిపోయింది. అతను షాక్‌కు గురయ్యాడు. అక్కడే నిలుచున్న వారంతా ఊహించని ఈ పరిణామానికి నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్‌ పోలీసులు మృతులను, గాయపడ్డ వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement