హోర్డింగ్స్ పేరుతో దోపిడీ
● కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న ఎల్ఈడీ స్క్రీన్స్ ● నగరంలో పలుచోట్ల అనధికారికంగా నిర్వహణ ● నగరంలో గ్యాంట్రీ హోర్డింగ్స్ 35కి అనుమతి ఇస్తే 40 నిర్మాణం ● వీటన్నింటికీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు ● నగరపాలక సంస్థ ఆదాయానికి గండి ● పట్టించుకోని పట్టణ ప్రణాళిక అధికారులు
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గుంటూరు నగరపాలక సంస్థలో దోపిడీ పర్వం రాజ్యమేలుతోంది. నగరంలో పలు ప్రధాన కూడళ్లలో గ్యాంట్రీ(క్రేన్) హోర్డింగ్స్కు 35కి మాత్రమే అనుమతి ఉంది. కూటమి నేతలు, అధికారుల అండదండలతో 40 ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, వీటికి ఈ మధ్య ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి మరి దోపిడీకి తెరతీశారు. వీటి ద్వారా కాంట్రాక్టర్లకు ఏటా కోట్లాది రూపాయిలు వస్తున్నా కార్పొరేషన్కు మాత్రం నామమాత్రంగా మొక్కుబడి చెక్కులు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అవి కూడా పాస్ అయ్యేయో..కాలేదో తెలియని పరిస్థితి.
భారీగా వసూలు
నగరంలో ఏర్పాటు చేసే ఒక్కో గ్యాంట్రీ బోర్డుకు కాంట్రాక్టర్లు నెలకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఇందులో రెండు పక్కలా అయితే రూ.1.80 లక్షలు, ఎల్ఈడీ బోర్డ్కి 1.20 లక్షలు తీసుకుంటున్నారు. వాస్తవానికి గానూ ప్రతి సంవత్సరం నగరపాలక సంస్థకు ఒక్కో బోర్డుకు రూ. 3.50లక్షలు చెల్లించాలని ఒప్పందం. అయితే, సదరు ఏజెన్సీ నిర్వాహకులు 20 బోర్డులకు మాత్రమే ట్యాక్స్ కడుతున్నట్లు తెలుస్తోంది. 40 బోర్డులకు ప్రతి సంవత్సరం రూ.1.40కోట్లు కట్టాల్సి ఉండగా, కేవలం 20 బోర్డులకు రూ.70 లక్షలే కడుతున్నట్లు సమాచారం. ఇందులోనూ కొంత భాగం చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని కార్యాలయ సిబ్బంది చెప్పుకుంటున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
స్టెబిలిటీ సర్టిఫికెట్ కూడా మాయే..
నగరంలో ఏర్పాటు చేసిన 40 బోర్డులకు ఎంఓయూలో 10 X 20 సైజు పెడుతున్నట్లు చూపారు. కాని వాస్తవంగా చూస్తే 30 X 17 సైజుల్లో ఏర్పాటు చేశారు. 10 X 20 సైజుకు మాత్రమే స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉంది. దీనికి తోడు ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడంతో బరువు మరింత పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, గాలి దుమారాలకు గ్యాంట్రీ హోర్డింగ్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా ఉందనే చెప్పుకోవచ్చు. వీటి లోపాలపై డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు పలుమార్లు కౌన్సిల్ వేదిక అధికారులను నిలదీసిన సందర్భరాలు చాలానే ఉన్నాయి. కాని అధికారులు మాత్రం కౌన్సిల్ రోజు వరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని మాట చెప్పడం, ఆ తరువాత దానిని పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది.
ఎల్ఈడీ స్క్రీన్స్ ఎంఓయూలో ఉంది
గ్యాంట్రీ బోర్డులతో పాటు ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఎంఓయూలో ఒప్పందం ఉంది. హోర్డింగ్స్ బకాయిలు వసూలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
– రాంబాబు, సిటీ ప్లానర్
కరెంట్ బిల్లులు కూడా నగరపాలక సంస్థ ఖాతాలోనే..
హోర్డింగ్స్/బోర్డులు/గ్యాంట్రీ హోర్డింగ్స్ నిర్వహణకు కరెంట్ నగరపాలక సంస్థ సరఫరా చేస్తుంది. దీనికి ఆయా ఆయా ఏజెన్సీలు నగరపాలక సంస్థకు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీలు కనీసం కరెంట్ బిల్లులు కూడా చెల్లించకపోవడంతో రూ. లక్షల్లో బకాయిలు ఉన్నాయని పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్వయంగా నగరపాలక సంస్థ సిటీప్లానర్ రూ.9 కోట్లు బకాయిలు ఉన్నాయని ఒప్పుకోవడం గమనార్హం.
హోర్డింగ్స్ పేరుతో దోపిడీ


