రాజధాని రైతులకు న్యాయం చేయండి
తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్కు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని, సీఆర్డీఏ అధికారులు ఆ ప్రచారాన్ని ఖండించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. శనివారం ఉండవల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉండవల్లి నుంచి ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నారని, ప్లాట్లు కేటాయించారు గానీ, 11 ఏళ్లవుతున్నా.. వాటిని అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వాలని రైతులను సీఆర్డీఏ అధికారు కోరుతున్నారని పేర్కొన్నారు. రైతులు భూములు ఇవ్వకుండానే ఇచ్చారంటూ కొన్ని పత్రికలు, యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరుగుతోందని, గతంలో ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసేటప్పుడు రైతుల అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రభుత్వం రైతులను గుప్పెట్లో పెట్టుకోవడానికి యత్నిస్తోందని విమర్శించారు. రాజధాని రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉండవల్లిలో జోన్–9 ఎత్తివేయాలని, బహుళ అంతస్తులు కట్టుకునేలా రైతులకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని, అప్పుడు రైతులు సానుకూలంగా స్పందించి స్పీడ్ యాక్సెస్ రోడ్కు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సంపర శ్రీనివాసరావు, రైతులు డాక్టర్ గాదె కన్నారావు నాయుడు, దంటు బాలాజీ రెడ్డి, పి.వీరాస్వామి, కోటేశ్వరరావు, ఆళ్ల వాసు, గాదె శివరామకృష్ణ, మున్నంగి అంజిరెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అమరావతిలో ‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర‘ ర్యాలీ
పాల్గొన్న సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు శనివారం ఉదయం నుంచి వెంకటపాలెం, మందడంలోని టిడ్కో గృహ సముదాయాలు, మల్కాపురం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు తదితర ప్రాంతాలను సందర్శించారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం స్థానిక రైతులు, అధికారులతో రాజధాని అభివృద్ధి పనుల పురోగతి, గ్రామస్తులు వెల్లడించిన పలు సమస్యలపై చర్చించారు. సీఆర్డీఏ చేపడుతున్న కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. స్వర్ణాంధ్ర–2047 సంకల్పంలో భాగంగా వెలగపూడిలో పారిశుధ్య కార్మికులు, గ్రామస్తులతో కలిసి నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. ర్యాలీ స్వచ్ఛ భారత్ మిషన్ సమన్వయంతో, రాజధాని ప్రాంతంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో నిర్వహించారు. ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణాంధ్ర‘ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఈ–వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం’ అనే థీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఎంపిక చేసినందున రాజధాని గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ, చెత్తను డంప్ చేస్తున్న విధానం, చెత్తను జిందాల్ సంస్థకు తరలిస్తున్న వాహనాల పనితీరు తదితర అంశాలను గురించి అధికారులతో కమిషనర్ చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతా కార్యక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అలాగే సిటీస్ ప్రాజెక్టు కింద అమరావతిలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ఈ– హెల్త్ కేంద్రాలు, పాఠశాలలను కమిషనర్ సందర్శించారు. ఈ భవనాలలో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా సిటీస్ ప్రాజెక్టు కింద నిర్మించిన భవనాలను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. సిటీస్ ప్రాజెక్టు కింద అమరావతిలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు, ఈ– హెల్త్ కేంద్రాలు, పాఠశాలల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా, అలాగే వీటిలో పనిచేసే సిబ్బంది నియామక అంశాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయా పనులు చేపట్టిన నిర్మాణ సంస్థల ప్రతినిధులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మూడేళ్ల గడువులోపు ఆయా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే మే 2న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సన్నాహాలనూ కమిషనర్ పరిశీలించి, అధికారులకు సూచనలు ఇచ్చారు.
రాజధాని రైతులకు న్యాయం చేయండి
రాజధాని రైతులకు న్యాయం చేయండి


