ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలి

Published Thu, Feb 6 2025 1:13 AM | Last Updated on Thu, Feb 6 2025 1:13 AM

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలి

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయాలి

హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య

హన్మకొండ: నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఈనెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల్లోపు పిల్ల లు 2,36,488 మంది ఉన్నారని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో భోజనం అనంతరం వారికి మాత్రలు వేయాలని పేర్కొన్నారు. ఒకవేళ ఆ రోజు ఏదైనా కారణాలతో ఇవ్వలేకపోతే ఈ నెల 17న మాత్రలు ఇప్పించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ ఎ.అప్పయ్య, జెడ్పీ సీఈఓ విద్యాలత, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్‌ రమేశ్‌, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాంరెడ్డి, డీపీఓ లక్ష్మీరమాకాంత్‌, మెప్మా డీఎంసీ రజితారాణి పాల్గొన్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూములకు పరిహారం చెల్లింపు

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూములకు పరిహారం చెల్లించనున్నట్లు కలెక్టర్‌ పి.ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు, పరకాల, దామెర, శాయంపేట మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లింపు, క్షేత్రస్థాయి పరిస్థితులను తహసీల్దార్లు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలన్నారు. సమస్యలు తలెత్తకుండా, సంబంధిత రైతులతో తహసీల్దార్లు మాట్లాడి పరిహారం అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరకాల ఆర్డీఓ డాక్టర్‌ కె.నారాయణ, నేషనల్‌ హైవే అధికారులు, తహసీల్దార్లు జగన్‌మోహన్‌రెడ్డి, జ్యోతి, వరలక్ష్మీదేవి, విజయలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement