
భద్రకాళి అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం మల్లెపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు మల్లెపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనకు న్యాయవాది భాస్కరవజ్జుల పురుషోత్తం భవాని దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది పర్యవేక్షించారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్)లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ తీరును కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ఆ కాలేజీ పరీక్షల నియంత్రణాధికారి సుధీర్ అధ్యాపకుడు సాయిచరణ్ పరిశీలించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు కొనసాగాయి.
ఫాలో అప్ సేవలు ముఖ్యం
ఎంజీఎం: బీపీ, షుగర్ ఉన్న పేషెంట్లకు సరైన మందులు అందిస్తున్నట్లుగానే వారికి ఫాలో అప్ సేవలు కూడా ఎంతో ముఖ్యమని హనుమకొండ వైద్యారోగ్య శాఖ అధికారి అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన నగరంలోని గోపాల్పూర్ పీహెచ్సీతో పాటు పలు పీహెచ్సీలు, ఆయుష్మాన్ మందిర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్య కేంద్రంలోని వ్యాక్సిన్ స్టోరేజీ, ఐఎల్ఆర్ రికార్డులు పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. ప్రభు త్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి విజేందర్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సంపత్రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ ఉండని
ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈనెల 3న(గురువారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. ప్రగతినగర్, రెవెన్యూ, సాయి కాలనీ, నాగేంద్రనగర్, జూలైవాడ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, రాంపూర్ ఇండస్ట్రీయల్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, కాజీపేట జూబ్లీ మార్కెట్, రహమత్ నగర్, కాజీపేట మెయిన్ రోడ్, వెంకటాద్రి నగర్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, వడ్డేపల్లి, పరిమళ, సప్తగిరి, ఆర్టీసీ, పోలీసు, ఉషోదయ కాలనీ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్లోని వసంతపూర్, దూపకుంట ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ శెంకేశి మల్లికార్జున్ తెలిపారు.
రాములవారికి పల్లకీ సేవ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న రామనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మహా సుదర్శన హోమం నిర్వహించారు. బుధవారం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీరామున్ని పురుషోత్తముడిగా అలంకరించి హనుమత్ సమేత లక్ష్మణ శ్రీసీతారాములకు పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం యాగశాలలో సుదర్శన హోమం నిర్వహించారు.