మే 5 నుంచి ప్రత్యేక లోక్ అదాలత్
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 5 నుంచి 19వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ (ప్రీ లోక్ అదాలత్) నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయవాసేవాధికార సంస్థ చైర్పర్సన్ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యాంకులే, చిట్ఫండ్ సంస్థల ప్రతినిధులతో న్యాయమూర్తి నిర్మలా గీతాంబ గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా చెల్లని చెక్కులకు సంబంధించి క్రిమినల్, సివిల్ కేసులు రెండు దాఖలు చేస్తారని, ఏదైనా ఒకదానిలో రాజీపడితే రెండు కేసుల నుంచి కక్షిదారులకు విముక్తి లభిస్తుందన్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయి కోర్టుకు రాకుంటే కోర్టులు అరెస్ట్ వారంటూ జారీ చేస్తాయని, ఈ కారణంగా ముద్దాయి జైలుకు వెళ్లినప్పటికీ, అతడు డబ్బు చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేడని తెలిపారు. బ్యాంకులు, చిట్ఫండ్, తదితర కంపెనీలు దాఖలు చేసిన చెల్లని చెక్కుల కేసులకు సంబంధించి రుణ గ్రహీతతో రాజీపడే విషయాన్ని పరిశీలించాలని కోరారు. న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించి, మధ్యవర్తిత్వం ద్వారా కేసును ప్రత్యేక లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవాలని పేర్కొన్నారు. అలాగే, ఇలాంటి కేసుల పరిష్కారం కోసం జూన్ 9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్ కూడా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, వరంగల్ జిల్లా న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్బాబు, జూనియర్, సీనియర్ న్యాయవాదులు, బ్యాంకు, చిట్ఫండ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండలో...
హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్వర్యంలో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, చిట్ఫండ్స్, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు పాల్గొని మాట్లాడారు. మే 5 నుంచి మే 5 నుంచి 19వ తేదీ వరకు చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ (ప్రీ లోక్ అదాలత్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రాజీ కుదుర్చుకోగలిగే ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
రాజీమార్గంలో చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలా గీతాంబ


