
వాషింగ్టన్: ఆధునిక యుగంలో మానవాళిని బెంబేలెత్తిస్తున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులు. వేడెక్కుతున్న భూగోళం, ఒకవైపు ముంచెత్తుతున్న వరదలు, మరోవైపు తీవ్రమైన కరువులు, పడిపోతున్న పంటల దిగుబడి.. ఇవన్నీ వాతావరణ మార్పుల సంభవిస్తున్న ప్రతికూల ప్రభావాలే. కాలుష్యానికి తోడు నానాటికీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి.
రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొర క్షీణిస్తుండడంతో ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడుతున్న తీవ్రమైన వేడికి భూమి అగ్నిగుండంగా మారిపోతోంది. అలాంటప్పుడు ఈ సమస్య పరిష్కారానికి సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన అమెరికా ప్రభుత్వానికి వచ్చింది. దీనిపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది.
ఈ మేరకు ‘వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ’ ఓ నివేదిక విడుదల చేసింది. వాతావరణ మార్పుల నుంచి భూమిని కాపాడుకోవాలన్నదే ఈ పరిశోధన ఉద్దేశం.
జియో ఇంజనీరింగ్ విధానంతో సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకోవడం ఎలా అన్నదానిపై పరిశోధన చేస్తున్నట్లు తెలియజేసింది. సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఆకాశంలోని మేఘాలను మరింత మందంగా మార్చడం ద్వారా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పద్ధతిని సిరస్ క్లౌడ్ థిన్నింగ్ అంటారు. జియో ఇంజనీరింగ్ అమలు చేయడం సులభమేనని వారి వాదన. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు అధికం. ఆ సమయంలో క్లౌడ్ థిన్నింగ్ చేయాలన్న యోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment