కాషాయ‘కొండ’
● భక్తజన సంద్రమైన కొండగట్టు ● వైభవంగా ప్రారంభమైన అంజన్న చిన్నజయంతి వేడుకలు ● జై శ్రీరాం.. జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగిన ఆలయం ● భారీగా తరలివచ్చిన దీక్షాపరులు.. ● పర్యవేక్షించిన కలెక్టర్ సత్య ప్రసాద్, ఈవో, అధికారులు ● నేడూ కొనసాగనున్న దీక్షా విరమణ
జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు కాషాయమయమైంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో అంజన్న సన్నిధి మార్మోగింది. ఆలయంలో హనుమాన్ చిన్నజయంతి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. జయంతి సందర్భంగా సాయంత్రం నుంచి దీక్షాపరులు వేలాదిగా కొండకు తరలివచ్చారు. సుమారు 30 వేల మంది మాల విరమణ చేయగా.. అర్ధరాత్రి వరకు సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఇతర జిల్లాల నుంచి వేలాదిగా తరలించారు. అర్ధరాత్రి తరువాత లక్షన్నరకు పైగా భక్తుల రాకతో కొండ కిక్కిరిసిపోయింది. కోనేరులో స్నానమాచరించిన భక్తులు, క్యూలైన్ ద్వారా వెళ్లి ఇరుముడి సమర్పించి, మాల విరమణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మరో రెండు రోజుల పాట రద్దీ కొనసాగనుంది. జయంతి సందర్భంగా కలెక్టర్ కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్క్యాంప్లో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలని సిబ్బందికి సూచించారు. కోనేరును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ రఘుచందర్, పంచాయతీ అధికారి మదన్మోహన్ పాల్గొన్నారు.
కాషాయ‘కొండ’


