
రైతుల మధ్య సాగునీటి గొడవ
● ఏఈ, సీఐ చొరవతో ప్రశాంతం
స్టేషన్ఘన్పూర్: సాగునీటి విషయంలో స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల, పాలకుర్తి మండలం ఈరవెన్ను, అయ్యంగారిపల్లి గ్రామాల రైతుల మధ్య బుధవారం గొడవ జరిగింది. స్టేషన్ఘన్పూ ర్ రిజర్వాయర్ మెయిన్ కాల్వ నుంచి ఇప్పగూడెం సమీప ఎల్–2 కెనాల్ ద్వారా దిగువన ఉన్న సముద్రాల గ్రామానికి సాగునీరు వస్తోంది. నీరు రావడానికి గతంలో రైతులు కెనాల్లో రాళ్లు వేశారు. అదే కెనాల్ నుంచి పాలకుర్తి మండలం ఈరవెన్ను, అయ్యంగారిపల్లి గ్రామాలకు నీటిపారుదల శాఖ అధికారులు విడతల వారీగా సాగునీరు ఇస్తున్నారు. అయితే తమకు సరిపడా సాగునీరు రావడం లేదంటూ ఈరవెన్ను, అయ్యంగారిపల్లి రైతులు ఎల్–2 కెనాల్లోని రాళ్లను తొలగించేందుకు జేసీబీతో వచ్చారు. విషయం తెలుసుకున్న సముద్రాల రైతులు చేరుకుని కెనాల్లో రాళ్లను ముట్టుకుంటే సహించేది లేదని గొడవకు దిగారు. స్టేషన్ఘన్పూర్ సీఐ జి.వేణు అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి ఇరిగేష న్ ఏఈ యాసర్కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్నారు. కెనాల్లో ఉన్న రాళ్లు తీయొద్దని, విడతల వారీగా అన్ని గ్రామాలకు సాగునీరు అందిస్తామని నచ్చచెప్పడంతో రైతులు వెళ్లిపోయారు.