భూపాలపల్లి రూరల్: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, విద్యార్థులు మాదక ద్రవ్యానికి దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి, నివారించాలని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. తద్వారా కుటుంబ సభ్యులు, బంధువులకు దూరమవుతారని తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి సంబంధిత సమాచారం తెలిస్తే 87126 58111 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ ని ఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్సీ హెచ్చరించారు.
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి రూరల్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఈ విద్యానిధికి www. telanganaepass. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 20వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సందేహాల నివృత్తికి ఫోన్ నంబర్ 99088 43340 ద్వారా సంప్రదించాలని కోరారు.
పెట్రోల్ బాటిల్తో
వ్యక్తి హల్చల్
మల్హర్: మండలంలోని తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. కొయ్యూరు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లెకుంట గ్రామానికి చెందిన నార శంకర్ కొంత కాలంగా భూమి పట్టా చేయాలంటూ కార్యాలయం చుట్టూ తిరుతున్నాడు. కాగా గురువా రం తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ బాటి ల్తో వచ్చి ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తన రికార్డులు రెవెన్యూ సిబ్బంది తారుమారు చేశారని ఆరోపణలు చేస్తూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ను ఆర్ఐ టేబుల్ మీద గట్టిగా కొట్టాడు. దీంతో బేబుల్ మీద ఉన్న రికార్డులతోపాటు ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కీర్తన మీద కొంత పెట్రోల్ డ్రాప్స్ పడ్డాయి. లైటర్తో వెలిగిస్తాని భయబ్రాంతులకు గురి చేయడంతో తాము వేరే రూములోకి వెళ్లినట్లు ఆర్ఐ రాజశేఖర్ వెల్లడించారు. అప్రమత్తమై పోలీసులకు సమాచార అందించామని, సదరు వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయనట్లు పేర్కొన్నారు. తమ విధులకు ఆటకం కలిగించి, హత్యాయత్నం చేశాడని శంకర్పై చర్యలు తీసుకోవాలని ఆర్ఐ రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ తెలిపారు.
బడ్జెట్ కేటాయింపులో బీసీలకు అన్యాయం
మొగుళ్లపల్లి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025–2026 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం 3.6శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీ లకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింపజేసిన ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతుందని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు.


