కేసీఆర్ సభను విజయవంతం చేయాలి
మొగుళ్లపల్లి: ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. బుధవారం మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్, కొరికిశాల, గణేష్పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, పిడిసిల్ల గ్రామాల్లో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులది అన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పని తీరుపై ప్రజల్లో అసహనం మొదలైందని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అమలు అయిన పథకాలనే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనుభవం లేని, అసమర్థపాలన, చేతగాని వ్యవహారం వలన ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్లే వారి బాధలు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో జీవితాలు అద్భుతంగా ఉన్నాయని, అప్పుడే అభివృద్ధి జరిగిందని.. ప్రజలు ఆలోచనలో పడ్డారని అన్నారు. ఈ నెల 27న జరగబోయే సభాతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. పోతుగల్లు గ్రామ ప్రజలు చెరువు సమస్య గురించి రమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత ఏఈకి ఫోన్ చేసి చెరువు మరమ్మతులు గురించి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయాలని కోరారు. రైతాంగానికి నీరువ్వకుండా చెక్డ్యామ్ కులగొట్టిన ఘనత ప్రస్తుత ఎమ్మెల్యేకే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆకినపల్లి మాజీ సర్పంచ్ దూడపాక భద్ర య్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడపాక సమ్మయ్య కాంగ్రెస్ పార్టీని వీడి రమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ రమేష్, నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాములు, రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి


