పాలమూరు రుణం తీర్చుకుంటా | - | Sakshi
Sakshi News home page

పాలమూరు రుణం తీర్చుకుంటా

Published Mon, Mar 3 2025 1:32 AM | Last Updated on Mon, Mar 3 2025 1:27 AM

పాలమూ

పాలమూరు రుణం తీర్చుకుంటా

వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభిృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాల ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు.

పాలమూరు వాసులు అమాయకులేం కాదు..

దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్‌ సుధాకర్‌, పండగ సాయన్న, మహేంద్రనాథ్‌ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు.

● ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు.

కార్పొరేషన్ల వ్యవస్థ

మళ్లీ బలోపేతం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను పదేళ్ల పాలనలో కేసీఆర్‌ నిర్వీర్యం చేశారని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. వ్యవసాయ పంపుసెట్లుకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రూ.14,870 కోట్లను రైతుల పక్షాన ప్రభుత్వం చెల్లించిందన్నారు. సన్న రకాలు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో రూ.1804 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి పైసా సంక్షేమ పథకాల కోసం, ప్రజాభివృద్ధి కోసం ఉపయోగిస్తామని వెల్లడించారు.

● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలోని జాబ్‌మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్‌ నిధులు విడుదల చేయాలని కోరారు.

కేసీఆర్‌ వల్లే కృష్ణా జలాల కేటాయింపుల్లో అన్యాయం

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో

ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు

మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే సహించను

వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి

నాలుగు దశాబ్దాలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు కక్షపూరిత డబ్బుతో కూడిన రాజకీయాలను ఏనాడు చేయలేదని.. ఐదేళ్ల క్రితం వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన వ్యక్తి వల్ల నియోజకవర్గ రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం అన్నారు. గతంలో వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వారి పేర్లను ప్రభుత్వ ఆస్పత్రులు, తాగునీటి ఎత్తిపోతల పథకాలకు పెడతామని... వేదికపైనే ఈ విషయం గురించి సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డి, శంకర్‌, వాకిటి శ్రీహరి, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాలమూరు రుణం తీర్చుకుంటా 1
1/3

పాలమూరు రుణం తీర్చుకుంటా

పాలమూరు రుణం తీర్చుకుంటా 2
2/3

పాలమూరు రుణం తీర్చుకుంటా

పాలమూరు రుణం తీర్చుకుంటా 3
3/3

పాలమూరు రుణం తీర్చుకుంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement