మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు
కాకినాడ సిటీ: రైతుల నుంచి మద్దతు ధరకే రబీ ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు. ‘రైతు కంట కన్నీరు’ శీర్షికన ‘సాక్షి’ మంగళవారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలో ఇప్పటికే 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల వద్ద మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొనుగోలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం ఆరబెట్టిన చోట గాని, కొనుగోలు కేంద్రంలో గాని సాంకేతిక సిబ్బంది పరిశీలించి, డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసి, వెహికల్ మూమెంట్ జీపీఎఫ్ ట్రాక్ చేసి మిల్లుకు పంపిస్తామని వివరించారు. అలా చేసిన రైతులకు మద్దతు ధర లభిస్తుందని, సరైన సమయంలో వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. పండించిన ధాన్యం నేరుగా మిల్లులకు అమ్మి, తిరిగి రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బందిని ఆన్లైన్ చేయాలంటూ అడుగుతున్నారని, అటువంటి వారికి డబ్బులు సక్రమంగా పడకపోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ధాన్యాన్ని దళారులు, రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ 2,570.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 207 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం సేకరణకు అవసరమయ్యే గోనె సంచులను, హమాలీలను, రవాణా వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 225 మంది సాంకేతిక నిపుణులను, 225 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను, 225 మంది హెల్పర్లతో పాటు వెహికల్ మూమెంట్ అధికారులను, కస్టోడియన్ అధికారులను నియమించామని వివరించారు. సాధారణ రకం ధాన్యం క్వింటాల్కు రూ.2,300, 75 కిలోలకు రూ.1,725, గ్రేడ్–ఎ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.2,320, 75 కిలోలకు రూ.1,740 చొప్పున మద్దతు ధర అందిస్తామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.
వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు
రూపొందించాలి
రాజానగరం: యూనివర్సిటీ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నూతన ఆలోచనలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మంగళవారం నిర్వహించిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన డీఆర్డీఓ అడ్వాన్స్డ్ సిస్టమ్ లేబొరేటరీ సైంటిస్టు కె.వీరబ్రహ్మం మాట్లాడుతూ, సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వివిధ సంస్థల నుంచి యూనివర్సిటీకి సీఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నూకాలమ్మ తల్లికి
రూ.5.78 లక్షల ఆదాయం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్యారావుపేటలో వెలసిన నూకాలమ్మ అమ్మవారి హుండీల ఆదాయాన్ని మంగళవారం దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. 33 రోజులకు గాను రూ.5.78 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు. కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారన్నారు.
25న జాబ్ ఫెస్ట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సహకారంతో స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 25న జాబ్ ఫెస్ట్–2025 నిర్వహించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. డిగ్రీ, పీజీ ఫైనలియర్ చదువుతున్న, పాసైన విద్యార్థులకు 40 కంపెనీలతో ఈ జాబ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జాబ్ ఫెస్ట్ ఏర్పాట్లపై సంబంధిత ప్రిన్సిపాళ్లు, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది తదితరులతో చర్చించారు. జాబ్ ఫెస్ట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ప్రతి కళాశాల నుంచి విద్యార్థులందరూ హాజరై, జాబ్ ఫెస్ట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు


