
గిట్టుబాటు ధర కల్పనలోప్రభుత్వం విఫలం
● రైతు పరిస్థితి దయనీయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
కోటనందూరు: రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. కోటనందూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు, మంత్రులు గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతుల నుంచి 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో మే నెలాఖరు వరకూ ధాన్యం కొనుగోలు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం మార్చి నెలాఖరుకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆపేసిందని అన్నారు. మెట్ట ప్రాంతంలో ఇప్పటికీ 50 శాతం దిగుబడి కళ్లాల్లో కుప్పల పైనే ఉందని చెప్పారు. దళారులను అడ్డం పెట్టుకొని నేరుగా ప్రభుత్వ పెద్దలే దోచుకుంటూంటే రైతుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ఈ ప్రభుత్వంతో రైతులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
రైతులపై అక్రమ కేసులు
తొండంగి మండలంలో కనీస మద్దతు ధరపై ప్రశ్నించిన రైతులపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయించి, వారిని రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటాల్ ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2,200 ఉన్నప్పుడు రూ.2 వేలకు తగ్గకుండా కొనుగోలు చేశామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.1,500కు మాత్రమే కొనుగోలు చేస్తోందని, దీనివలన రైతులు దారుణంగా నష్టపోతున్నారని అన్నారు.
ఆక్వా రైతులను ముంచేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో ఆక్వా రైతుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉందని రాజా అన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా జగన్ ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి, ఆక్వా రైతులను ఆదుకోగా.. నేడు వారిని కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసిందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో క్రాప్ హాలిడే ప్రకటించడం తప్ప మరో గత్యంతరం లేదంటూ ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నిజమైన రైతుల స్టోరేజీ యూనిట్లన్నింటినీ మూయించి, చంద్రబాబు అనుయాయుల స్టోరేజీ యూనిట్లను తెరిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఆక్వా రైతులకు కనీస మద్దతు ధర కల్పించకుండా ట్రంపు, అమెరికా పరిస్థితులు అంటూ ప్రభుత్వ పెద్దలు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాాష్ట్ర ఉపాధ్యక్షుడు గొర్లి రామచంద్రరావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, వాణిజ్య విభాగం తుని నియోజకవర్గ అధ్యక్షుడు వెలగా వెంకట కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.