రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Mar 29 2025 1:12 AM | Updated on Mar 29 2025 1:10 AM

నవీపేట: నవీపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాల్దా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైనట్లు ఎస్సై వినయ్‌ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన కూలీలు మీర్జా సలీమ్‌బేగ్‌, మహమ్మద్‌ అస్లామ్‌, మహమ్మద్‌ అన్వర్‌లు పని ముగిశాక జన్నెపల్లి నుంచి నిజామాబాద్‌కు వెళ్లేందుకు ఆటోలో ఎక్కారు. పాల్దా శివారులో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఆటోను ఢీకొనడంతో ఆటోలోని ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

2.1 కిలోల గంజాయి పట్టివేత

ఖలీల్‌వాడి: నగరంలో ఎండు గంజాయిని తరలిస్తున్న ఒకరిని అరెస్ట్‌ చేసి, 2.1కిలోల(2100 గ్రాములు) గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ విలాస్‌ తెలిపారు. నగరంలోని మాలపల్లి ప్రాంతానికి చెందిన సోహెబ్‌ఖాన్‌ నిజామాబాద్‌ రూరల్‌ మండలం ఖానాపూర్‌ గ్రామంలోని జన్నేపల్లి రోడ్డులో రైల్వేగేట్‌ వద్ద ఎండు గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో వెంటనే సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్‌, బైక్‌తోపాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని అరెస్ట్‌ చేసి, ఎకై ్సజ్‌ ఎస్‌హెచ్‌వో అప్పగించినట్లు తెలిపారు. ఎకై ్సజ్‌ ఎస్సై సింధు, సిబ్బంది కిరణ్‌కుమార్‌, గోపి, నర్సయ్య చారి, నీలీరాజు, సాగర్రావు, సుధీర్‌, దశ పాల్గొన్నారు.

కరెంట్‌షాక్‌తో గుర్తుతెలియని యువకుడి మృతి

ఖలీల్‌వాడి: నగరంలోని గుర్తుతెలియని యువకుడు కరెంట్‌ షాక్‌తో మృతి చెందినట్లు ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి శుక్రవారం తెలిపారు. ఖలీల్‌వాడి ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో సదరు యువకుడు పని చేస్తుండగా కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు సింగ్‌ లేదా సర్దార్‌గా కనబడుతున్నాడన్నారు. నెహ్రు పార్క్‌ ఏరియా దగ్గర ఉన్న లేబర్‌ అడ్డా దగ్గర నుంచి పనికి వెళ్తూ ఉంటాడని తెలిపారు. ఎవరైనా యువకుడి వివరాలు తెలిస్తే ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సంప్రదించాలన్నారు.

డిచ్‌పల్లి సీఐ, జక్రాన్‌పల్లి ఎస్సైపై ఫిర్యాదు

ఖలీల్‌వాడి: హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసి సివిల్‌ తగాదాల్లో తలదూర్చిన డిచ్‌పల్లి సీఐ మల్లేష్‌, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి, కానిస్టేబుల్‌ మహేందర్‌లపై కేసు నమోదు చేయాలని జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన రావుట్ల ఆలియాస్‌ రాగుట్ల నచ్చన్న శుక్రవారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. అలాగే కేసు వాపసు తీసుకోవాలని నిజామాబాద్‌ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, డిచ్‌పల్లి సీఐ మల్లేష్‌, జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతిలతోపాటు భూమిని కబ్జా చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

ఏటీఎం చోరీకి యత్నించిన దుండగుల అరెస్టు

డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి శివారులోగల ఎస్‌బీఐ ఏటీఎంలో ఇటీవల చోరీకి యత్నించిన ఇద్దరు దుండగులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలింనట్లు డిచ్‌పల్లి సీఐ మల్లేష్‌, ఎస్సై ఎండీ షరీఫ్‌ తెలిపారు. డిచ్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. నడిపల్లికి చెందిన రుద్రబోయిన గణేష్‌, కామారెడ్డికి చెందిన నిమ్మబోయిన సురేష్‌ గురువారం అర్ధరాత్రి ఎస్‌బీఐ ఏటీఎంను పగులగొట్టి అందులోని డబ్బులు చోరీ చేయడానికి యత్నించారు. అదే సమయంలో పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి చేరుకోగా నిందితులు పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన డిచ్‌పల్లి సీఐ, ఎస్సైలు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టగా నిందితులు పట్టుబడ్డారు. విచారణ జరుపగా ఏటీఎం చోరీకి యత్నించినట్లు అంగీకరించారు. నిందితులు గణేష్‌, సురేష్‌లు పాత నేరస్తులు. జైలులోనే ఇద్దరికి స్నేహం కుదరడంతో బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతాలను పాల్పడుతున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, రూ.12వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కేసులకు సంబంధించి వీరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
1
1/1

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement