ఎల్లారెడ్డి : ప్రభుత్వం ఈనెలనుంచి రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఏం చేయాలన్న విషయమై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బందిపడుతున్నారు.
జిల్లాలోని 578 రేషన్ దుకాణాలున్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి రేషన్ దుకాణాలకు 5,571 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటికే దాదాపుగా మొత్తం బియ్యాన్ని సరఫరా చేసింది. పంపిణీ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 55 శాతం లబ్ధిదారులు బియ్యం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సన్నబియ్యం పంపిణీ జోరుగా సాగుతున్నా.. తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను ఏం చేయాలన్న విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో రేషన్ డీలర్లు అయోమయంలో ఉన్నారు. జిల్లాలోని రేషన్ షాప్లలో గతనెలకు సంబంధించి సుమారు 500 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యం స్టాక్ వివరాలను రేషన్ డీలర్లు గతనెల 20వ తేదీలోగానే పౌర సరఫరాల శాఖ అధికారులకు అందించారు. ఎల్లారెడ్డి మండలంలోని 29 రేషన్ షాపుల్లో 337.22 క్వింటాళ్ల దొ డ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. ఈ కోటా ఖాళీ కాకముందే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కా ర్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ భారీగా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ దుకాణాలలో పాత స్టాకు ఖాళీ కాకముందే సన్న బియ్యం స్టాకు రావడంతో పాత స్టాకును ఎక్కడ పెట్టాలో తెలియక డీలర్లు ఇబ్బంది పడ్డారు. అంతేగాక దుకాణంలో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నందున సన్నబియ్యంలో దొడ్డు బియ్యా న్ని కలిపి ఇస్తున్నారా అని లబ్ధిదారులు అనుమానిస్తున్నారని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. రేషన్ దుకాణాలలో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వలను సాధ్యమైనంత తొందరగా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎల్లారెడ్డిలోని ఓ రేషన్ దుకాణంలో
నిల్వ ఉన్న దొడ్డు బియ్యం
రేషన్ షాపుల్లో భారీగా నిల్వలు
తరలింపు విషయంలో స్పష్టత కరువు
నిల్వ చేయడానికి ఇబ్బంది
పడుతున్న రేషన్ డీలర్లు
ఆదేశాలు రావాల్సి ఉంది
జిల్లాలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పా యింట్లలో దొడ్డు బియ్యం నిల్వలున్నాయి. వా టి విషయంలో ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున్ బాబు,
జిల్లా పౌర సరఫరాల అధికారి


