బాలుడి అదృశ్యం.. అరగంటలో గుర్తించిన పోలీసులు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి బస్టాండ్లో నాలుగేళ్ల బాలుడు తప్పిపోగా పోలీసులు అరగంటలో గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన వల్లపు నర్సవ్వ తన నాలుగేళ్ల మనువడు ఈశ్వర్ను వెంట తీసుకొని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చి తిరుగు ప్రయాణంలో కొత్త బస్టాండ్కు చేరుకుంది. జ్యూస్ కొనుక్కుని వస్తానని బస్టాండ్లో మనువడిని కూర్చోబెట్టి పక్కనే ఉన్న స్టాల్కు వెళ్లింది. 5 నిమిషాల తర్వాత వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన నర్సవ్వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ శిరీష, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి బాలుడి ఆచూకీ కోసం గాలించారు. అరగంట తర్వాత అశోక్నగర్ చౌరస్తా వద్ద బాలుడిని గుర్తించారు. పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి బాలుడిని తండ్రి అలకుంట ఎల్లయ్య, అమ్మమ్మ నర్సవ్వకు అప్పగించారు. పోలీసు సిబ్బందిని పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.
గోశాల నుంచి ఆవుల చోరీ
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ గోశాలలోని రెండు ఆవులను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి అపహరించారని గోశాల కమిటీ ప్రతినిధులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి పాల్పడిన వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ అధ్యక్షుడు సంజయ్ ఎస్సై విజయ్ కొండకు వినతిపత్రం అందజేశారు.
బాలుడి అదృశ్యం.. అరగంటలో గుర్తించిన పోలీసులు


