ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్
ఖలీల్వాడి: నగరంలోని ఆరో టౌన్ పరిధి లతీఫ్ కాలనీకి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుడు షేక్ ఆసిఫ్ అలీని పోలీసులు పట్టుకున్నారు. సీఐ సురేశ్కుమార్ శనివారం వివరాలు వెల్లడించారు. అర్సపల్లి బైపాస్ రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఆసిఫ్ అలీని పట్టుకోగా, అప్పటికే నిందితుడు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా, కొంత మంది యువకులకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి వారితో క్రికెట్ బెట్టింగ్ ఆడించేవాడినని ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆసిఫ్ అలీపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సీఐ వెంట ఎస్సై వెంకట్రావు, సిబ్బంది ఉన్నారు.
కార్లను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్
భిక్కనూరు: మద్యం మత్తులో ఇంటి ముందు నిలిపిన కార్లను శనివారం ఓ ఆటో డ్రైవర్ ఢీ కొట్టినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భిక్కనూరులో జరుగుతున్న పెద్దమ్మ ఉత్సవాలకు గ్రామానికి చెందిన పున్న లక్ష్మీనారాయణ బంధువులు వచ్చారు. వారికి చెందిన రెండు కార్లను ఇంటి ఎదుట నిలిపి ఉంచగా, మండల కేంద్రానికి చెందిన బాబు అనే ఆటో డ్రైవర్ మద్యం సేవించి అజాగ్రత్తగా ఆటో నడిపి కార్లను ఢీకొట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఒకరిపై ఇసుక మాఫియా దాడి
రెంజల్(బోధన్): మండలంలోని పేపర్మిల్ గ్రామంలో ఇసుక మా ఫియా ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాదింది. ఈ నెల 3న నిజామాబాద్ రూ రల్ పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెంజల్ మండలానికి చెందిన మూడు టిప్పర్లను పట్టుకున్నారు. టిప్పర్లు పట్టుబడేందుకు గ్రామానికి చెందిన వ్యక్తి కారణమని అనుమానించిన మాఫియా శనివారం అతన్ని పట్టుకొని దాడిచేశారని గ్రామస్తుల ద్వారా తెలిసింది. కొందరు పోలీసులు ఉప్పందించడంతో దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై చంద్రమోహన్ను వివరణగా కోరగా పరస్పరం దాడి చేసుకొని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బాలికకు చిత్రహింసలు
● తండ్రి, సవతి తల్లిపై కేసు నమోదు
ఖలీల్వాడి: రెండో భార్యతో కలిసి కన్న కూతురిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ కేసులో తండ్రితోపాటు సవతి తల్లిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నాగారం గోశాలకు చెందిన షేక్ హుస్సేన్ మొదటి భార్య అహ్మదీ బేగం నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఒక కుమార్తె(13) ఉంది. రిజ్వానా బేగంను హుస్సేన్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. రెండో వివాహం అయినప్పటి నుంచి బాలికను బడి మాన్పించి, ఇంటి పనులు చేయిస్తూ నరకం చూపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేపి ఇంటి పని చేయించేవారు. పాచిపోయిన అన్నం పెడుతూ కొట్టేవారు. బంధువుల ఇంటికి కూడా వెళ్లనిచ్చేవారు కాదు. ఈ నెల 8న హుస్సేన్, రిజ్వానా బేగంలు బాలికను భైంసాలోని వరసకు అత్తమ్మ అయిన వజీర్బీ ఇంటి ఎదుట వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వజీర్బీ ప్రస్తుతం ఆ బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. బాలిక మామ షేక్ హయాత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ వెల్లడించారు.


