ప్రేమ పేరిట యువతి మోసం .. ఆస్ట్రేలియాకు పరార్‌.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరిట యువతి మోసం .. ఆస్ట్రేలియాకు పరార్‌..

Published Sun, May 19 2024 8:40 AM | Last Updated on Sun, May 19 2024 9:50 AM

-

యువకుడిని నమ్మించి, రూ.16 లక్షలు కాజేసిన వైనం

తర్వాత ఆస్ట్రేలియాకు పరార్‌..

కేసు నమోదు

తిమ్మాపూర్‌(మానకొండూర్‌): ప్రేమ పేరిట ఓ యువతి తిమ్మాపూర్‌కు చెందిన యువకుడిని మోసం చేసింది. రూ.16 లక్షలు తీసుకొని, పరారైంది. బాధితుడి తండ్రి, పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌ మండల కేంద్రానికి చెందిన మాదన నాగరాజు యోగా నిమిత్తం ఈశా ఫౌండేషన్‌కు వెళ్లాడు. అక్కడే విశాఖపట్టణానికి చెందిన కమలసంధ్య ప్రియాంకతో పరిచయం ఏర్పడింది. 

వీరిద్దరూ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల నాగరాజు ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. దీనికి అతని తండ్రి మల్లయ్య నిరాకరించాడు. దీంతో గ్రామంలోని ఓ ఇంట్లో కొన్ని రోజులు అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో నాగరాజు ఓ ఆస్పత్రిలో తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవడంతో రూ.16 లక్షలు వచ్చాయి. ప్రియాంక తెలివిగా ఆ మొత్తాన్ని తన బంధువుల ఖాతాలోకి పంపించుకుంది. తర్వాత ఆస్ట్రేలియాకు పరారైంది. మళ్లీ రూ.3 లక్షలు కావాలని అతన్ని కోరింది. అంతేకాకుండా, నీ తండ్రి పేరిట ఉన్న భూమిని నీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే వచ్చి, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. 

దీంతో డబ్బులు, భూ రిజిస్ట్రేషన్‌ కోసం అతను తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. భరించలేకపోయిన మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియురాలి మోసం, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. శనివారం తండ్రీకొడుకు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ప్రియాంకపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చేరాలు తెలిపారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement