
శ్రీరామనవమికి పటిష్ట ఏర్పాట్లు
ఇల్లందకుంట: అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈ నెల 4 నుంచి 16వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా చూడాలని సీపీని కోరారు. కల్యాణ మండపం వద్దకు పట్టువస్త్రాలు తీసుకొచ్చే క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలవారిని ఒకేసారి ఆహ్వానించే విధంగా చూడాలన్నారు. జాతరకు రూ.10లక్షలు కేటాయించాలని కలెక్టర్ను కోరారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. గతం కన్నా వైభవంగా వేడుక జరగాలన్నారు. పార్కింగ్, కరెంట్, తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి రోజున కల్యాణానికి 50వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సుమారు 350మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. 40 సీసీ కెమెరాలతో నిఘా పెడతామని తెలిపారు. అదనపు కలెక్టర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో రమేశ్బాబు, సీఐ కిషోర్, ఎస్సైలు రాజ్కుమార్, తోట తిరుపతి, రైస్మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు పాల్గొన్నారు.
మాతృభాషతో పాటు ఇంగ్లిష్లో బోధన
కరీంనగర్రూరల్: వలస కార్మికుల పిల్లలకు ఒరియా మాతృభాషతోపాటు ఇంగ్లిష్లో బోధన చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్ జెడ్పీ పాఠశాలలో చదువుతున్న వందమంది ఇటుకబట్టీ కార్మికుల పిల్లలకు స్కూల్బ్యాగులు, డ్రాయింగ్బుక్స్, క్రేయాన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటుకబట్టీ కార్మికుల పిల్లల చదువును ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 500 మంది పిల్లలు చదువుతున్నట్లు తెలిపారు. పిల్లలకు యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. పిల్లలకు ఒరియాతోపాటు ఇంగ్లిష్ భాషను తప్పనిసరిగా నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బొమ్మకల్, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణానికి ఉచితంగా ఇటుకలను సరఫరా చేస్తామని బట్టీల యజమానులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, సెక్టోరియల్ అధికారి అశోక్రెడ్డి, ఎంఈవో కె. రవీందర్, ఎంపీవో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి