హత్య కేసులో నిందితుల అరెస్ట్
సాక్షి,బళ్లారి: పాత కక్షలతో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన జరిగింది. తన అక్కను వేధిస్తున్నాడనే కారణంతో స్నేహితులతో కలిసి సోదరిని వేధిస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో ఇటీవల మహమ్మద్ జావేద్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి హత్య కేసు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు హత్య ఎందుకు చేశారో కనుగొన్నారు. తన సోదరిని వేధించడంతో పాటు పాతకక్షల కారణంగా మహమ్మద్ జావేద్ను మహమ్మద్ నిహాల్, రోషన్ఖాన్, మహమ్మద్ అబూ, మమహ్మద్ సమీర్ అనే నలుగురు దారుణంగా హత్య చేసినట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు హత్య చేసిన వారిని అరెస్ట్ చేసి కేసును లోతుగా విచారణ చేస్తున్నారు.
లిఫ్ట్లో చిక్కుకున్న వ్యక్తి క్షేమం
హుబ్లీ: హావేరి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి లిఫ్ట్లో కొద్ది సేపు చిక్కుకున్న ఘటన హావేరి జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. రోగితో కలిసి ఆస్పత్రికి వచ్చిన మంజునాథ్ లిఫ్ట్లో చికుక్కొని తీవ్రంగా గాభరా పడ్డాడు. అక్కడికి వచ్చిన అగ్నిమాపక దళ సిబ్బంది కార్యాచరణ చేసి మంజునాథ్ను కాపాడింది. 1వ, 2వ అంతస్తు మధ్యలో లిఫ్ట్ స్తంభించడంతో కొంత సమయంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. జిల్లా ఆస్పత్రి సాంకేతిక సిబ్బంది లిఫ్ట్ను సక్రమంగా నిర్వహణ చేయక పోవడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తిందని స్థానికులు ఆరోపించారు.
ఖజానా లూటీ ఘనత పాలకులదే
రాయచూరు రూరల్: ప్రభుత్వ ఆదాయాన్ని పంచ గ్యారెంటీలకు మళ్లించి ఖజానాను లూటీ చేసిన ఘతన పాలకులదేనని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ నాయక్ ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లును యూనిట్కు 36 పైసలు, పాల ధరను లీటరుకు రూ.9 చొప్పున, బస్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలు పెంచడం తగదన్నారు. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాలకులు దిగజార్చారన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. వీరభద్రేశ్వర ఎత్తిపోతల పథకం, నవలి వద్ద సమాంతర జలాశయం నిర్మాణాలు చేపట్టాలని ఒత్తిడి చేశారు.
బెళగావిలో విద్యార్థి ఆత్మహత్య
హుబ్లీ: హాస్టల్లో ఉరి వేసుకొని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి రామనగర్లోని చంద్రకాంత కాగవాడ బాయ్స్ హాస్టల్లో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ప్రజ్వల్ కుప్పనట్టి(20)గా గుర్తించారు. సోమవారం కళాశాలకు వెళ్లకుండా తన గదిలో ఉన్నాడు. ఆ సాయంత్రం స్నేహితుడు వచ్చి గది తలుపులు తట్టినా ప్రజ్వల్ తలుపులు తీయలేదు. దీంతో కిటికీ నుంచి తొంగి చూడగా ప్రజ్వల్ ఉరి వేసుకున్నట్లు కనిపించింది. రాయబాగ తాలూకా బావన సౌదత్తి గ్రామ నివాసి అయిన ప్రజ్వల్ బెళగావి ఇంజినీరింగ్ కళాశాలలో చదివేవాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటన స్థలాన్ని మాళమారుతీ పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని బెళగావి బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
విజయనగర జిల్లా
వాసులకు ర్యాంకుల పంట
హొసపేటె: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెలువడిన ద్వితీయ పీయూసీ ఫలితాల్లో విజయనగర జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆర్ట్స్ విభాగంలో రాష్ట్రంలో మొదటి, రెండో స్థానాలు సాధించారు. విజయనగర జిల్లాలోని కొట్టూరు తాలూకాకు చెందిన పీయూ విద్యార్థిని సంజనాబాయి ఆర్ట్స్ విభాగంలో 600 మార్కులకుగాను 597 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. విజయనగర జిల్లా ఇటగికి చెందిన హుబ్లీలోని పంచమసాలి పీయూ కళాశాల విద్యార్థిని నిర్మల ఆర్ట్స్ విభాగంలో 600 మార్కులకుగాను 596 మార్కులు సాధించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హత్య కేసులో నిందితుల అరెస్ట్


