● గ్రంథాలయ పన్నుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం ● ప్రభుత్వ సంస్థల నుంచి రూ.10 కోట్ల మేర బకాయిలు ● ఫలితంగా అభివృద్ధికి నోచుకోని విజ్ఞాన బాండాగారాలు
ఖమ్మంగాంధీచౌక్: ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా.. ఆ పన్నుల్లో గ్రంథాలయాల వాటా జమ చేయడంలో ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో విజ్ఞాన బాండాగారాలుగా, నిరుద్యోగ యువతీ, యువకులకు అండగా నిలిచే గ్రంథాలయాల అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసే పన్నుల్లో 8 శాతం గ్రంథాలయాల వాటాగా జమ చేయాలి. ఈ నిధులను ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉన్నా అలా జరగడం లేదు. దీంతో ఏళ్లుగా రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి.
2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి..
గ్రంథాలయాలకు ప్రభుత్వ సంస్థల నుంచి దాదాపు రూ.10 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ సంస్థల నుంచి పెద్ద ఎత్తున పన్ను బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని గ్రామ పంచాయతీల ద్వారా వసూలైన పన్నుల నుంచి రావల్సిన బకాయి రూ.3 కోట్లు జిల్లా పంచాయతీ శాఖ చెల్లించాల్సి ఉంది. ఖమ్మం కార్పొరేషన్ నుంచి దాదాపు రూ.5 కోట్లు, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల నుంచి దాదాపు రూ.2 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల అధికార యంత్రాంగం గ్రంథాలయాల పన్ను వాటా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఆయా సంస్థల పాలకవర్గాలు మోకాలడ్డుతున్నాయి. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ నుంచి రూ.2 కోట్ల మేరకు గ్రంథాలయ సంస్థకు చెల్లించేందుకు ఓ ఉన్నతాధికారి ప్రయత్నించినా పాలకవర్గం తిరస్కరించినట్లు సమాచారం. వైరా మున్సిపాలిటీ మాత్రం బకాయిల్లో రూ.10 లక్షలు చెల్లించింది. ఇక సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల నుంచి కూడా బకాయిలు రావాల్సి ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థకు ప్రస్తుతం కమిటీ లేకపోవటంతో అదనపు కలెక్టర్ శ్రీజ పర్సన్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తూ బకాయిల వసూళ్లపై దృష్టి సారించారు. బకాయి ఉన్న ప్రభుత్వ సంస్థలను గ్రంథాలయానికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
నిధులు లేక..
గ్రంథాలయాలకు స్థానిక సంస్థల నుంచి పన్నుల రూపంలో నిధులు సమకూరుతాయి. ఆ నిధుల చెల్లింపు లేకపోవటంతో జిల్లాలో గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలో జిల్లా కేంద్ర గ్రంథాలయం, 22 శాఖా గ్రంథాలయాలు, రెండు గ్రామ గ్రంథాలయాలు నిర్వహణలో ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయం పాత భవనం శిథిలమై 2024 జనవరి 13న కూలిపోయింది. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థకు కార్యాలయ, పరిపాలన భవనమే లేకుండా పోయింది. తాత్కాలికంగా ఖమ్మం పాత మున్సిపాలిటీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక నేలకొండపల్లిలో నూతన భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇక ఎక్కడా కూడా గ్రంథాలయాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహణలో లేవు. పుస్తకాల సమస్య తీవ్రంగా ఉంది. పోటీ పరీక్షలకు సంబంధించి తాజా పుస్తకాలు లేవు. నిరుద్యోగులు, విద్యార్థులు వివిధ రకాల పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాల కోసం గ్రంథాలయాల అధికారులను అభ్యర్థిస్తున్నా వారు సైతం నిధుల కొరతతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంస్థలు బకాయిలు చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధికి, నిర్మాణాలకు, పాఠకులు కోరుకునే, నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం కలిగించే పుస్తకాలను అందుబాటులో ఉంచే అవకాశం ఉంటుంది. ఈ విషయమై అధికారులను ఆరా తీయగా.. పన్ను బకాయిలు రావాల్సి ఉందని, అవి జమఅయితే సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ఆ‘పన్ను’హస్తం లేక..