ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి శ్రీవారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఆలయ గోపురాలకు రంగులు వేయించగా, ప్రాంగణంలో రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. అలాగే, ఆలయానికి లైట్లు అమర్చడంతో కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజైన ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీవారికి పంచామృతంతో అభిషేకం, పంచాంగ శ్రవణం, వేప పూవు ప్రసాదం నివేదన, సాయంత్రం 5–04 పుష్కరణి నుండి యాగశాలలోకి తీర్థపు బిందె తీసుకొస్తారు. ఇక 31న ధ్వజారోహణం, రుద్రహోమం, వచ్చే నెల 1న సౌభాగ్యలక్ష్మి వ్రతం, 2న అష్టోత్తర కలశాభిషేకం, 3న స్వామి, అమ్మవార్లను అలంకరించి, ఎదుర్కోలు ఉత్సవం, 4న వకుళా మాత స్టేడియంలో కల్యాణ మహోత్సవం, అదే రోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈమేరకు కల్యాణానికి ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ఇక 5న పుష్పయాగం, 6న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం, 7న మహా పూర్ణాహుతి, శ్రీవారి చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఏపీ, తెలంగాణ నుండి పెద్దసంఖ్యలో హాజరయ్యే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ కె.జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.
రేపటి నుండి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు