ఔను.. వారు విజేతలు! | - | Sakshi
Sakshi News home page

ఔను.. వారు విజేతలు!

Sep 19 2025 2:13 AM | Updated on Sep 19 2025 2:10 PM

 Naidu Bhavani teaching a lesson

పాఠం బోధిస్తున్న నాయుడు భవాని

రెండు రాష్ట్రాల్లోనూ టీచర్‌ ఉద్యోగాలకు ఎంపిక 

ఇప్పటికే తెలంగాణలో విధులు 

తాజాగా ఏపీలోనూ ఉపాధ్యాయ ఉద్యోగాలు

కష్టపడితే విజయం బానిసగా మారుతుందని నిరూపించారు కొందరు యువతీ, యువకులు. నాన్‌ లోకల్‌ కోటాలో తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ముగ్గురు ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఏపీలో నోటిఫికేషన్‌ రాగానే సిద్ధమై అక్కడ కూడా ఉద్యోగాలు సాధించడం విశేషం. – మధిర

నాయుడు భవాని

ఏపీలోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగాయలంక గ్రామం భవానీ స్వగ్రామం. ఆమె తండ్రి దుర్గాప్రసాద్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తల్లి వీరలక్ష్మి ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది. తెలంగాణ టెట్‌లో 150కి 135, డీఎస్సీలో వందకు 81 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ప్రస్తుతం మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఏపీ టెట్‌లో 150కి 143.58, సాధించగా డీఎస్సీలో వందకు 85.19 మార్కులతో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ తన తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని తెలిపారు. తన చిన్నతనంలో మూస పద్ధతిలో బోధనతో ఇబ్బంది పడగా, సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుంటూ సిద్ధమయ్యానని చెప్పారు. ఇదే సమయాన తాను బోధించే పాఠశాలలో విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు.

ఓపెన్‌ కేటగిరీలో పోటీ 

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించాలన్న కలను నిజం చేసుకునేందుకు తెలంగాణలో ఐదు శాతంగా ఉన్న ఓపెన్‌ కేటగిరీలో పలువురు ఏపీ వాసులు పోటీపడ్డారు. ఇందులో నాయుడు భవాని, రుద్రపంక్తి సంతోష్‌ కుమార్‌, మజ్జిగ త్రినేత్ర ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరు గత ఏడాది అక్టోబర్‌ 10న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకొని మధిర మండలంలో ఎస్‌జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ సంతృప్తి చెందక... సొంత రాష్ట్రమైన ఏపీలోనూ ఉద్యోగాలు సాధించాలనే తపనతో సిద్ధమై ఇటీవల పరీక్ష రాయగా ఉద్యోగాలు దక్కాయి. దీంతో వీరు ఏపీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో ఈనెల 19న వారు నియామక పత్రాలు అందుకోనున్నారు. కాగా, మధిర మండలంలో పనిచేసిన 11 నెలల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రుల, సహచర ఉపాధ్యాయుల మన్ననలు పొందారు.

రుద్రపంక్తి సంతోష్‌ కుమార్‌

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సంతోష్‌ తండ్రి మల్లేశ్వరరావు ఆ గ్రామ శివాలయంలో పూజారిగా పనిచేస్తుంటారు. తల్లి శైలజ గృహిణి. టీజీ టెట్‌లో 132, డీఎస్సీలో మూడో ర్యాంకు సాధించి మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఏపీ టెట్‌లో 139, అక్కడి డీఎస్సీలో 85.25 మార్కలు సాధించాడు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ ఆర్థిక సమస్యలను అధిగమించి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సిద్ధమయ్యానని వెల్లడించారు. హైస్కూల్‌ గణిత ఉపాధ్యాయుడు షేక్‌ షావలీ ప్రోత్సహించగా, డీఎస్సీకి అకాడమీ పుస్తకాలు చదువుతూ సొంతంగానే నోట్స్‌ సిద్ధం చేసుకున్నానని చెప్పారు. దీంతో నాన్‌ లోకల్‌ కోటాలో తెలంగాణలో, లోకల్‌ కోటాలో ఏపీలోనూ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. మధిర పాఠశాలలో కొద్దికాలమే పనిచేసినా విద్యార్థుల ఉన్నతికి బాధ్యతాయుతంగా వ్యవహరించానని, ఫలితంగా సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మన్ననలు అందాయని వెల్లడించారు.

మజ్జిగ త్రినేత్ర

చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరు గ్రామానికి చెందిన త్రినేత్ర తండ్రి మునెప్ప వ్యవసాయం చేస్తుండగా తల్లి సరోజమ్మ గృహిణి. టీజీ టెట్‌లో 123, డీఎస్సీ78.9 మార్కులతో ఉద్యోగం సాధించిన ఆయన రామచంద్రాపురం మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇక ఏపీ టెట్‌లో 141.79, డీఎస్సీ 90.79 మార్కులు సాధించింది. క్రమశిక్షణ, పట్టుదలతో చదవడం ద్వారా ఉద్యోగాలు సాధించానని వెల్లడించారు. తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూస్తూ వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని భావనతో చదవడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement