తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు

Published Sat, Feb 22 2025 1:53 AM | Last Updated on Sat, Feb 22 2025 1:49 AM

తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు

తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు

ఆసిఫాబాద్‌అర్బన్‌: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలోని జిల్లాలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సూపర్‌వైజర్లు, ఇతర శాఖల అధికారులతో తాగునీరు, పారిశుద్ధ్యం, ఆస్తి పన్ను వసూలు, తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయని తెలిపారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు, చేతిపంపులకు మరమ్మతులు చేయాలన్నారు. అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించాలన్నారు. వందశాతం పన్నులు వసూలు చేయాలన్నారు. బకాయిలు ఉన్న వాణిజ్య సముదాయాలపై దృష్టి సారించాలని, స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సూచించారు.

ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టాలి

జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖల అధికారులతో జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడతామని తెలిపారు. తహసీల్దార్లు, స్టేషన్‌ హైజ్‌ అధికారులు దందాలు అరికట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement