విచారణ వేగంగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

విచారణ వేగంగా పూర్తి చేయాలి

Mar 29 2025 12:20 AM | Updated on Mar 29 2025 12:22 AM

ఆసిఫాబాద్‌: పోక్సోగ్రేవ్‌ కేసుల్లో విచారణ వేగంగా పూర్తిచేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌ పారదర్శకంగా చేపట్టాలన్నారు. కేసు నమోదు నుంచి చార్జ్‌షీట్‌ వరకు పరిశోధించి తుదినిర్ణయం తీసుకోవాలన్నారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను కలిసి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ నేరాలు, డయల్‌ 100 సేవల వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, పీడీఎస్‌ బియ్యం రవాణా, పశువుల రవాణా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. అనంతరం విధి నిర్వహణతో ప్రతిభ చూపిన ఆసిఫాబాద్‌ సీఐ రవీందర్‌, రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్‌, వాంకిడి ఎస్సై ప్రశాంత్‌తోపాటు పలువురు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్‌, డీఎస్పీలు కరుణాకర్‌, రామానుజం, రమేశ్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement